సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏమేం మారబోతున్నాయో 9 ఫోటోల్లో..

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ (రీడెవలప్మెంట్) పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయినట్టు దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది.
ఈ పనులను 2023 ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ అనగానే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకువస్తుంది. ఈ భవనాన్ని 2025 ఫిబ్రవరిలో కూల్చివేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో జీ+3 అంతస్తుల్లో భవనాలను నిర్మిస్తున్నారు. ప్లాట్ఫాం 1 వైపు ఒక భవనం, ప్లాట్ఫాం 10 వైపు మరో భవనం రానున్నాయి. ప్లాట్ఫాం 10 వైపు నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, ప్లాట్ఫాం1 వైపు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.


ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
అమృత్ భారత్ పథకంలో భాగంగా ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులను సుమారు 715 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బీబీసీకి తెలిపారు. ఇప్పటికే నగరంలో చర్లపల్లి, మల్కాజిగిరి, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, SCRailway
స్టేషన్లో ప్రయాణికులు.. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
స్టేషన్లో గతంలో ఉన్న పది ప్లాట్ఫాంలు యథావిధిగా ఉంటాయని, వీటి సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదని శ్రీధర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
స్టేషన్లోకి వచ్చిన ప్రయాణికులు ప్లాట్ఫాంలకు చేరుకునేందుకు వీలుగా రెండు అంతస్తుల్లో ఎయిర్ కాంకోర్స్ నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో 3-4 వేల మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు వీలుగా వెయిటింగ్ హాల్స్, లాంజ్లు ఉంటాయి. రెండో అంతస్తులో ఫుడ్ కోర్టులు, కెఫెటేరియా, రెస్టారెంట్లు రానున్నాయని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
ఎయిర్పోర్టు తరహాలో అరైవల్, డిపార్చర్ బ్లాకులు వేర్వేరుగా ఉంటాయి. ఇవి ప్లాట్ఫాం 1, 10 వైపు వేర్వేరుగా ఉంటాయి. స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు డిపార్చర్స్ (నిష్క్రమణలు) ద్వారం నుంచి, స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు అరైవల్ (ఆగమనాలు) ద్వారం నుంచి రావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
పార్కింగ్ కోసం స్టేషన్కు రెండువైపులా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్లాట్ఫాం 10 వైపు అండర్ గ్రౌండ్లోనూ, ప్లాట్ఫాం 1 వైపు ఆరు అంతస్తుల్లో 600-700 కార్లు నిలిపేలా మల్టీలెవల్ పార్కింగ్ భవనం ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ఫాం 10 వైపు పార్కింగ్ ప్రాంతం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
బుకింగ్ కౌంటర్లు, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, సోలార్ విద్యుత్ వ్యవస్థ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బిల్డింగ్, ఈవీ చార్జింగ్ పాయింట్లు నిర్మిస్తున్నారు.

ఫొటో సోర్స్, Naveen kanderi/BBC
రేతిఫైల్ బస్టాండ్ నుంచి మెట్రో రైల్ దిగి నేరుగా స్టేషన్లోకి చేరుకోవచ్చు. ఇందుకు సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్లు అందుబాటులోకి రానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
సికింద్రాబాద్ స్టేషన్ తొలిసారిగా 1874లో అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న ఐకానిక్ భవనాన్ని 1948లో నిర్మించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 200 రైళ్లు, లక్షన్నర మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
మూడేళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యం, ఇబ్బందుల విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో పనులు చేస్తున్నామని వారు తెలిపారు. కానీ, ఆధునిక సౌకర్యాలు రాబోతున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా సహకరించాలని కోరారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




























