‘‘విద్యార్థులకు, నాకు మధ్యలో రావడానికి మీరెవరు?’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిహారిక రామారావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (హైదరాబాద్) విద్యార్థుల ఎన్రోల్మెంట్ వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న నిర్ణయాలు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నల్సార్ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొనడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని ముందుగా ఆదేశించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని సవరించింది. ఆ విద్యార్థులపై విచారణ జరపాలని మాత్రం వర్సిటీని కోరింది.
దీనిపై స్పందించిన నల్సార్ వర్సిటీ.. అలాంటి విచారణ చేపట్టడం రాజ్యాంగబద్ధమేనా అన్నది పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఆ తర్వాత బీసీఐ మరో ప్రకటన విడుదల చేస్తూ, ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతున్నామని, విద్యార్థులపై ఎలాంటి విచారణా అవసరం లేదని చెప్పింది.
ఈ వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఫొటో సోర్స్, Nalasar/FB/ GettyImages
అసలేం జరిగింది?
నల్సార్ స్నాతకోత్సవానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను ఆహ్వానించడాన్ని పునఃపరిశీలించాలని 2026 స్నాతకోత్సవ విద్యార్థులు కొందరు యూనివర్సిటీ పాలకవర్గానికి జులై 23న ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
ఈ నేపథ్యంలో నల్సార్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశిస్తూ బీసీఐ చైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
"2026 బ్యాచ్కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు న్యాయవాదులుగా నమోదు చేయవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీజేఐ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారం వెనుక ఉన్నవారిని గుర్తించి నివేదిక సమర్పించాలని బీసీఐ కోరింది. దీనిపై, ఆగస్టు 19న తుది నిర్ణయం తీసుకోనుంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే, మొదటి ప్రకటన వెలువడిన గంటలోపే మనన్ కుమార్ మరో ప్రకటన విడుదల చేశారు.
"వివరణాత్మక చర్చల అనంతరం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నల్సార్ వర్సిటీకి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. 2026లో నల్సార్ నుంచి పట్టభద్రులైన విద్యార్థులందరూ ఇప్పుడు తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదు చేసుకునేందుకు అర్హులు. అయితే, వాస్తవాలపై విచారణ కొనసాగుతుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. తప్పు చేయని ఏ విద్యార్థీ ఇబ్బంది పడకూడదు" అని ఆ ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, https://nalsar.ac.in/about/organisation/
నల్సార్ ఏమంది?
విద్యార్థులు న్యాయవాదులుగా నమోదు చేసుకోవడంపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ రెండో ప్రకటన విడుదల చేసిన అనంతరం, బార్ కౌన్సిల్ కోరిన విచారణ నివేదిక రాజ్యాంగబద్ధమైనదేనా అనే అంశంపై నల్సార్ ఒక ప్రకటన విడుదల చేసింది.
"2026 బ్యాచ్కు చెందిన మా గ్రాడ్యుయేటింగ్ బీఏ, ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థులందరినీ న్యాయవాదులుగా నమోదు చేయకుండా నిషేధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2026 ఆగస్టు 13న జారీ చేసిన లేఖను విశ్వవిద్యాలయం అందుకుంది. ఆ లేఖలో రాబోయే స్నాతకోత్సవానికి సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల్లో పాల్గొన్న వ్యక్తులపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని కూడా విశ్వవిద్యాలయాన్ని కోరారు. ఆ తర్వాత, 2026 ఆగస్టు 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మరో లేఖను అందుకున్నాం. 2026 బ్యాచ్కు చెందిన మా గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులను నమోదు చేయకుండా రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆ లేఖలో ఉపసంహరించారు " అని తెలిపింది.

ఫొటో సోర్స్, Nalsar
"అయినప్పటికీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండో లేఖలో, ఈ పరిణామాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులపై వైస్-చాన్సలర్ విచారణ నివేదిక సమర్పించాలన్న నిబంధనను మాత్రం అలాగే కొనసాగించారు. ఈ అభ్యర్థన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇలాంటి విచారణ నిర్వహించడం విశ్వవిద్యాలయానికి ఉన్న అధికారాలను రాజ్యాంగబద్ధంగా వినియోగించడమేనా అనే అంశాన్ని విశ్వవిద్యాలయం పరిశీలించాల్సి ఉంటుంది.
అలాగే, ఇలాంటి విచారణ నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనదేనా, విశ్వవిద్యాలయ పాలనా నిబంధనల ప్రకారం అనుమతించదగినదేనా అనే అంశాన్ని అంచనా వేయడంలో విశ్వవిద్యాలయానికి సహాయపడేందుకు ఈ అంశాన్ని విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుంచుతాం. విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అదే విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేస్తాం. పై వివరాలను కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసే ప్రక్రియ కొనసాగుతోంది" అని నల్సార్ ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
'విచారణ అవసరం లేదు'
కొన్ని గంటల వ్యవధిలోనే బీసీఐ చైర్మన్ నుంచి మరో ప్రకటన విడుదలైంది:
"సీనియర్ న్యాయవాదులు, గౌరవనీయులైన బార్ సభ్యులు, న్యాయ విద్యార్థులు, ప్రజా ప్రయోజనాల పట్ల బాధ్యత కలిగిన పౌరుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, స్పందనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2026 బ్యాచ్కు చెందిన నల్సార్ (హైదరాబాద్) విద్యార్థులకు ఎలాంటి అశాంతి లేదా నిరసనతో సంబంధం లేదని నిర్ధరించుకున్న అనంతరం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ప్రక్రియను పూర్తిగా ముగించాలని నిర్ణయించింది. నల్సార్ వర్సిటీ విద్యార్ధులపై ఇకపై ఎలాంటి చర్యా అవసరం లేదు. విద్యార్థులు తమ భవిష్యత్ కెరీర్లో అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని ఆ ప్రకటనలో తెలిపారు.
"ఒక సలహా ఏమిటంటే, మన న్యాయ వ్యవస్థను చూసి మనం ఎంతో గర్వపడతాం. మీరు న్యాయవాదిగా నమోదు చేసుకున్న రోజు నుంచి, మీరు ఈ వ్యవస్థకు రక్షకులుగా మారుతారు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. అయితే హుందాగా, మర్యాదపూర్వకంగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. అత్యున్నత న్యాయస్థానమనేది మనందరి ఉమ్మడి గర్వకారణం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉంటుంది. అయితే రాజ్యాంగబద్ధ సంస్థలను బహిరంగంగా ఎగతాళి చేయడం తరచుగా ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజీనామా సమయం వచ్చిందా: సీజేపీ
మిశ్రా ప్రకటనలు వెలువడిన వెంటనే, రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందా? అంటూ కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, "భారతదేశ యువత ప్రయోజనాలను కాపాడటమే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్ష్యం. విద్యార్థుల హక్కులను పరిరక్షించాలన్న వారి లక్ష్యం, మా లక్ష్యం ఒక్కటేనని అభిజీత్ దీప్కే, దాస్ (సౌరవ్ దాస్)లకు నేను తెలియజేయాలనుకుంటున్నాను" అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై ఎక్స్ పోస్టులో స్పందిస్తూ, "ఇది పూర్తిగా ఖండించదగిన విషయం. ఇలా చేయడానికి బీసీఐకి లేదా దాని చైర్మన్కు ఉన్న అధికారం ఏమిటి? తమ విశ్వవిద్యాలయం కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తి పాల్గొనడాన్ని వ్యతిరేకించే హక్కు విద్యార్థులకు ఉంది. మీరు దానితో ఏకీభవించకపోవచ్చు. కానీ, అది మీకు ఇబ్బంది కలిగిస్తోందని చెప్పి వారి కెరీర్లను బెదిరించలేరు. విద్యా సంస్థల్లో స్వతంత్ర ఆలోచనలను అణచివేయడం, అధికారానికి అనుకూలంగా ఉండే విద్యా సంస్కృతిని సృష్టించడమే దీని వెనుక ఉన్న పెద్ద లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది యువతను బహిరంగంగా బెదిరించడమే. అధికారంలో ఉన్నవారి చెప్పుచేతల్లో నడవాలని వారికి చెప్పడమే దీని ఉద్దేశం" అని తెలిపారు.
ఆగస్టు 13న బీసీఐ చైర్మన్ జారీ చేసిన ఆదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ రెండింటిలో సభ్యుడైన అడ్వొకేట్ ఎన్. మనోజ్ కుమార్ బీసీఐకి లేఖ రాశారు. ఎలాంటి మినహాయింపుల్లేని ఈ ఏకపక్ష ఆదేశం నిరంకుశత్వానికి నిదర్శనమని, ఇది పట్టభద్రుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని ఆయన విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీగా కూడా వ్యవహరిస్తున్న మనన్ కుమార్ మిశ్రా గతంలో నీట్ నిరసనలకు వ్యతిరేకంగా మేధావులు మాట్లాడాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. 'యాంటీ సోషల్, 'దేశ వ్యతిరేక' శక్తులు అశాంతిని రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని మిశ్రా మేధావులను కోరారు.
అయితే, దీన్ని పలువురు న్యాయ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బార్ కౌన్సిల్ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
బార్ అండ్ బెంచ్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా ఉపసంహరించుకున్న ఈ సర్క్యులర్పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.
నల్సార్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడేందుకు బీసీఐకి ఎలాంటి హక్కు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. తాను కూడా ఒకప్పుడు విద్యార్థిగా ఉన్నానని, రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొన్నానని ఆయన గుర్తుచేశాకున్నట్లు బార్ అండ్ బెంచ్ కథనం పేర్కొంది.
"విద్యార్థులకు, నాకు మధ్య రావడానికి బీసీఐ ఎవరు? విద్యార్థులపై ఇలాంటి విచారణలకు ఆదేశించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదు" అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
"సహజంగానే, ఇది పూర్తిగా అనవసరమైన చర్య. ఇది విద్యార్థులకు, నాకు మధ్య జరిగిన విషయం. దీనిపై వారు సమస్యను లేవనెత్తాల్సిన అవసరం ఏముంది? ఇది పూర్తిగా అనవసరం" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
లైవ్ లా ప్రకారం, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ అడ్వొకేట్ కె. పరమేశ్వర్ శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని ప్రస్తావించారు. జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన కూడా ధర్మాసనంలో ఉన్నారు.
బీసీఐ ఇప్పటికే విద్యార్థులపై తీసుకున్న చర్యలను, వారి నిరసనలపై చేపట్టిన విచారణను ఉపసంహరించుకున్నట్లు కోర్టు నమోదు చేసింది. అయినప్పటికీ, ఈ అంశంపై దాఖలైన పిటిషన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
బీసీఐ, నల్సార్ లేదా దాని విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే ఇతర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది.
"నోటీసులు జారీ చేయండి. ఈలోగా ఏ విద్యార్థి లేదా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోవదు. బీసీఐ నోటీసును స్వీకరించింది. పెండింగ్లో ఉన్న సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ, రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయచ్చు. లేఖల్లో పేర్కొన్న ఘటనలకు సంబంధించి నల్సార్ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు" అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కోర్టు విచారణలో బీసీఐ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. 5 ఏళ్లు అధికారంలో ఉండాల్సిన కమిటీ 8 ఏళ్లుగా ఇంకా ఎందుకు పవర్లో ఉందంటూ కోర్టు ప్రశ్నించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



























