మక్కా ఒప్పందం నిజంగా ఇండియాకు ముప్పు కానుందా?

ఫొటో సోర్స్, @SPA
పాకిస్తాన్ గత వారం సౌదీ అరేబియా, తుర్కియేలతో కలిసి ఒక కొత్త భద్రతా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాన్ని 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్' అని పిలుస్తున్నారు.
ఈ తాజా ఒప్పందం, మిడిల్ ఈస్ట్లో రూపుదిద్దుకుంటున్న కొత్త భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో దాని వ్యూహాత్మక ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరిన ఏడాదిలోపే ఈ మక్కా ఒప్పందం రూపుదిద్దుకుంది. భవిష్యత్తులో మరికొన్ని దేశాలు కూడా ఈ రక్షణ కూటమిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
మక్కా ఒప్పందం వల్ల మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాముఖ్యత, దాని ప్రభావం పెరుగుతాయని ఆగస్టు 12న 'ది వైర్' సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, సీనియర్ దౌత్యవేత్త శ్యామ్ సరన్ చెప్పారు.
ఈ ఒప్పందం భారత్ను వెనక్కి నెట్టిందా? అని అడిగిన ప్రశ్నకు శ్యామ్ సరన్ సమాధానం ఇచ్చారు.

''నేను అలా అనను, కానీ ఇది కచ్చితంగా పాకిస్తాన్కు కలిసివచ్చే అంశమే. భారత్పై సాధించిన పెద్ద దౌత్య విజయంగా దీన్ని చూపించుకోవడానికి పాకిస్తాన్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, భారత్కు వ్యతిరేకంగా జరిగే ఏ ఉమ్మడి సైనిక చర్యలోనైనా పాల్గొనే ఉద్దేశం తుర్కియే, సౌదీ అరేబియాలకు ఉందని నేను అనుకోను. ఈ ఒప్పందంలో చేరడానికి ఆ రెండు దేశాలకు సొంత కారణాలు, వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి" అని శ్యామ్ సరన్ వివరించారు.
పాకిస్తాన్కు ఎంతవరకు ప్రయోజనం?
పాకిస్తాన్కు తుర్కియే, సౌదీ అరేబియాలతో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొత్త విషయమేమీ కాదు.
ఇక్కడ కొత్త విషయం ఏంటంటే సౌదీ అరేబియా, తుర్కియేల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని శ్యామ్ సరన్ చెప్పారు.

''తుర్కియేతో పాకిస్తాన్ సంబంధాల కంటే, చైనాతో దాని సైనిక కూటమే భారత్కు అత్యంత ప్రమాదకరమైనదని నా ఉద్దేశం. దీనితో పాటు మనం ఆందోళన చెందాల్సిన మరో విషయం ఏంటంటే... అమెరికా మళ్లీ పాకిస్తాన్తో సన్నిహిత సైనిక సంబంధాలను ప్రారంభించడం. అమెరికా, చైనా రెండింటి మద్దతు మళ్లీ పాకిస్తాన్కు లభించడం అనేది మక్కా ఒప్పందం కంటే భారత్కు అత్యంత ఆందోళన కలిగించే అంశం'' అని శ్యామ్ సరన్ విశ్లేషించారు.
మక్కా ఒప్పందం వల్ల మధ్య ప్రాచ్యంలో ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ ప్రభావం పెరుగుతుందని ఆగస్టు 12న ఫారిన్ పాలసీ అనే మ్యాగజీన్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో థింక్ ట్యాంక్ 'అట్లాంటిక్ కౌన్సిల్' సౌత్ ఏషియా సీనియర్ ఫెలో మైకేల్ కుగెల్మన్ రాశారు.
''తమ దేశాన్ని ఒక బాధ్యతారాహిత్యమైన లేదా అస్థిరమైన భాగస్వామిగా కాకుండా, ప్రపంచస్థాయి శక్తిగా చూపించుకోవాలని పాకిస్తాన్ నాయకులు కోరుకుంటున్నారు. కాబట్టి ఇది వారికి చాలా ముఖ్యం. పైగా పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు మిడిల్ ఈస్ట్ అత్యంత కీలకమైనది. అక్కడ దానికి ప్రధాన మిత్రదేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే అధిక శాతం ఇంధనం అక్కడి నుంచే వస్తుంది. అలాగే లక్షల మంది పాకిస్తానీలు అక్కడ ఉపాధి పొందుతున్నారు" అని ఆ వ్యాసంలో కుగెల్మన్ పేర్కొన్నారు.
అయితే, భారత్ పరంగా చూస్తే, ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
''సౌదీ అరేబియా, తుర్కియేలతో పాక్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం పాకిస్తాన్కు తన సరిహద్దు భద్రతా విషయంలో ఉపయోగపడకపోవచ్చు. పాకిస్తాన్ భారత్తో గతంలోనూ, అలాగే నిరుడు జరిగిన ఘర్షణలతో సహా అనేక యుద్ధాలు చేసింది. ఇది కాకుండా, ఇప్పుడు అఫ్గానిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో కూడా తరచుగా సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ అసలు నిజం ఏమిటంటే, పాకిస్తాన్ మిత్రదేశాలు దాని కోసం నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం లేదు" అని కుగెల్మన్ రాశారు.
''ఒకవేళ పాకిస్తాన్పై భారత్ దాడి చేసినా.. భారత్కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా ఆయుధాలు చేపడుతుందని అనుకోవడం అసంభవం. ఎందుకంటే, భారత్ కూడా సౌదీకి అత్యంత సన్నిహిత భాగస్వామి. తాలిబాన్ విషయంలోనూ దీని సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
గత అక్టోబరులో అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగాయి. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరిన కొద్దికాలానికే ఈ ఘర్షణలు మొదలయ్యాయి. అయినప్పటికీ, సౌదీ అరేబియా ఆ ఒప్పందాన్ని అమలు చేస్తామని లేదా ఆ ఒప్పందం ప్రకారం ఈ ఘర్షణల్లో జోక్యం చేసుకుంటామని ఎప్పుడూ అనలేదు'' అని మైకేల్ కుగెల్మన్ వివరించారు.

ఫొటో సోర్స్, @SPA
‘ముస్లిం నేటో’గా అవతరిస్తుందా?
ఇస్లాం పరంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరంలో మూడు ప్రధాన ముస్లిం దేశాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాంతో ఈ కూటమి భవిష్యత్తులో ఇతర ముస్లిం దేశాలను కూడా తనతో కలుపుకుని ముందుకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ కూటమి 'ముస్లిం నేటో' రూపాన్ని సంతరించుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈజిప్ట్, ఖతర్, అజర్బైజాన్, జోర్డాన్, సిరియా దేశాలు భవిష్యత్తులో ఈ కూటమి విస్తరణలో చేరే అవకాశమున్న సహజమైన భాగస్వాములని 'మిడిల్ ఈస్ట్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ అఫైర్స్' సీనియర్ నాన్-రెసిడెంట్ ఫెలో అలీ బాకిర్ అన్నారు.
నేటోలో రెండో అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశం తుర్కియే. ప్రపంచంలోనే ఏకైక ముస్లిం అణుశక్తి దేశం పాకిస్తాన్. ఇక సౌదీ అరేబియా అనేది అపారమైన చమురు, ఆర్థిక బలం, పాశ్చాత్య ఆయుధాలు ఉన్న దేశం. ఈ మూడు శక్తులు ఒకే వేదికపైకి రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకవేళ ఏదైనా దాడి జరిగినప్పుడు ఈ కొత్త కూటమి ఎలాంటి ఉమ్మడి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదని 'అట్లాంటిక్ కౌన్సిల్' నాన్-రెసిడెంట్ సీనియర్ ఫెలో డానీ సిట్రినోవిచ్ అన్నారు.
'ఇటీవల హూతీలు చేసిన దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియాలు కలిసి ఎలాంటి ఉమ్మడి ప్రతిదాడి చర్యలు చేపట్టకపోవడమే దీనికి ఉదాహరణ' అని ఆయన గుర్తుచేశారు.
సౌదీ అరేబియా - ఇరాన్ మధ్య లేదా, భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఈ ఒప్పందం కింద సైనికంగా జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత తుర్కియేకు ఉంటుందా అని ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, తుర్కియే ఉపాధ్యక్షుడు జెవ్డెట్ యిల్మాజ్ స్పందించారు.
''ఐక్యత లేదా మద్దతును తెలపడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఇలాంటి ఒప్పందాలు ఉన్నంత మాత్రాన ఇతర దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాల్లో తక్షణమే లేదా ఆటోమేటిక్గా యుద్ధంలోకి దూకాల్సిన అవసరం లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.
అంటే మిత్రదేశాలు వేరే దేశాలతో జరిపే ప్రత్యక్ష యుద్ధాల్లో మిగతా భాగస్వామ్య దేశాలు వెంటనే పాల్గొనకుండా దూరంగా ఉండే అవకాశమే ఎక్కువని ఆయన సంకేతమిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి శత్రువు లేకపోతే ఏమవుతుంది?
నేటి మల్టీ పోలార్ ప్రపంచంలో (బహుళ ధ్రువ ప్రపంచం) నేటో లాంటి రక్షణ ఒప్పందాలు పెద్దగా పనిచేయవని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ 'తక్షశిల ఇన్స్టిట్యూషన్' డైరెక్టర్ నితిన్ పాయ్ అభిప్రాయపడ్డారు.
''రెండు ధ్రువాలుగా విడిపోయిన నాటి ప్రపంచంలో నేటో లాంటి పరస్పర రక్షణ ఒప్పందాలకు ఒక అర్థం ఉండేది. కానీ, నేటి బహుళ ధ్రువ ప్రపంచంలో వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం చాలా కష్టం. మీ మిత్రదేశానికి శత్రువైన దేశం మీకు శత్రువు కానప్పుడు, మీరు వారి కోసం యుద్ధానికి ఎలా వెళ్తారు?'' అని నితిన్ పాయ్ ప్రశ్నించారు.
అందుకే సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియేల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అమలులో చాలా సంక్లిష్టంగా మారుతుందని నితిన్ పాయ్ అన్నారు.

అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సైనిక కూటమిలోని దేశాలకు ఒక ఉమ్మడి శత్రువు లేనప్పుడు రక్షణ రంగంలో పరస్పర సహకారం మాత్రమే సాధ్యమవుతుందని, ఉమ్మడి రక్షణ కూటమి సాధ్యం కాదని అన్నారు.
''సాధారణంగా ఉమ్మడి రక్షణ అనేది అందరికీ ఉన్న ఒకే ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉమ్మడి శత్రువు లేనప్పుడు రక్షణ రంగంలో పరస్పర సహకారం మాత్రమే పెరుగుతుంది. పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలకు వేర్వేరు శత్రువులు ఉన్నారు. అందువల్ల ఈ ఒప్పందం తర్వాత ఆయుధాల తయారీ, వనరుల వినియోగంలో సహకారం పెరగవచ్చు. కానీ ఇది 'ముస్లిం నేటో'గా మాత్రం మారదు.
సౌదీ-తుర్కియే-పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కేవలం ప్రచారానికే పరిమితం. ఆచరణలో అంతగా ఉపయోగపడదు. పరస్పర రక్షణ ఒప్పందానికి 'ఉమ్మడి శత్రువు' ఉండటమే ప్రాథమిక సూత్రం. కానీ ఇక్కడ అలాంటి శత్రువే లేరు'' అని హక్కానీ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు దేశాల బలాలు, బలహీనతలు
ఈ కూటమిలోని మూడు దేశాలకు వేర్వేరు బలాలు, బలహీనతలు ఉన్నాయని మక్కా ఒప్పందంపై రాసిన కథనంలో 'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జోనీ పేర్కొన్నారు.
''ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తి దేశం పాకిస్తాన్. కానీ, దాని ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీ అరేబియా వద్ద అపారమైన ఆర్థిక బలం ఉంది. కానీ, దానికి ఇరాన్, హూతీల నుంచి తీవ్ర భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి.
తుర్కియే సైనిక పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆధునిక డ్రోన్లను తయారు చేసే సామర్థ్యం దానికి ఉంది. కానీ, తన పొరుగున ఉన్న ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అది ఆందోళన చెందుతోంది. ఈ మూడు దేశాల ఉమ్మడి భద్రతా ఒప్పందం ఉన్నంత మాత్రాన.. పాకిస్తాన్ వెళ్లి ఇరాన్ లేదా హూతీలపై యుద్ధం చేస్తుందని కానీ, లేదా భవిష్యత్తులో భారత్ - పాకిస్తాన్ యుద్ధం వస్తే తుర్కియే నేరుగా రంగంలోకి దిగుతుందని కానీ అనుకోకూడదు" అని ఆ కథనంలో స్టాన్లీ జోనీ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



























