You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్లో మరో వరద హెచ్చరిక: టిబెట్ వైపున ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
టిబెట్వైపు నిర్మించిన ఆనకట్ట మరోసారి తెగిపోయిందని నేపాల్ పోలీసులకు సమాచారం అందింది.
భద్రతా సిబ్బంది, సహాయక బృందాల సభ్యులు, సహాయక చర్యలలో నిమగ్నంకాగా, సాధారణ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, రసువాలోని భోటేకోశి నది తీవ్రంగా పొంగిపొర్లిన అదే ప్రాంతంలో ఈ రోజు బురద ప్రవాహాలు స్వల్పంగా పెరిగినట్లు తమకు సమాచారం అందిందని నేపాల్ జాతీయ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. అక్కడ మరో వరద ముప్పు పొంచి ఉంది.
"ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ఏవైనా ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి" అని అధికారులు కోరారు.
ఉత్తర నేపాల్లో కొత్తగా వరద హెచ్చరిక జారీ చేయగా, సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
"మేం త్రిశూలి నది ఎగువ ప్రాంతానికి చేరుకున్నాము. అక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు ఒకచోట చేరారు. ముప్పు తొలగిపోయే వరకు వేచి చూస్తున్నారు.’’అని బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్ అజాదే మోషిరి అక్కడి పరిస్థితులను వివరిస్తూ చెప్పారు.
‘‘మేం బస చేసిన హోటల్ మేనేజర్ కూడా మాతోనే ఉన్నారు. సైన్యం అక్కడికి చేరుకుని వారిని హోటల్ ఖాళీ చేయమని కోరింది" అని అజాదే చెప్పారు.
మరోవైపు త్రిశూలిలోని సైనిక శిబిరం వద్ద వరసగా హెలికాప్టర్లు దిగుతూ, ప్రాణాలతో బయటపడిన వారిని తీసుకువస్తున్నాయి. వారిలో కొందరు గాయపడ్డారు.
దేశంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 475కి పెరిగిందని నేపాల్ పోలీసులు ప్రకటించారు. అదే సమయంలో, 31 దేశాలకు చెందిన 540 మంది విదేశీయులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.
గల్లంతైన ఈ విదేశీయులలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. నేపాల్ అధికారులు చెప్పినదాని ప్రకారం, సుమారు 178మంది భారత పౌరులు అదృశ్యమయ్యారు.
నేపాల్లో విపత్తు కారణంగా ప్రభావితమైన భారతీయుల గురించి భారత విదేశాంగ శాఖ కూడా సమాచారం ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణ
ఇప్పటికీ 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. త్రిశూలి-1 ప్రాజెక్టుకు సంబంధించిన 63 మంది కార్మికులను ఇప్పటివరకు రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
అంతకుముందు, కైలాస్ మానసరోవర్ యాత్ర సందర్భంగా నేపాల్లో వరదల్లో చిక్కుకున్న 21 మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చినట్లు రణధీర్ జైస్వాల్ చెప్పారు.
నేపాల్, దాని సరిహద్దు ప్రాంతాల్లో వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని దిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు.
న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్లైన్, కోఆర్డినేషన్ సెంటర్, హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం హెల్ప్లైన్తో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
హెల్ప్లైన్ ప్రారంభించినప్పటి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి సమాచారం, సహాయం కోరుతూ సుమారు 80 నుంచి 100 కాల్స్ అందాయని పేర్కొంది.
సహాయం కోరుతూ అందిన కాల్స్ను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టాల్సిన వాటిగా 20 కేసులను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులు మొత్తం 23 మందికి సంబంధించినవనీ, వీరిలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు కాగా, 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్ఆర్ఐలనీ వెల్లడించారు.
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తాజాగా నిర్థరణ అయిందనీ, ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడారనీ అధికారులు వెల్లడించారు.
మిగిలిన 22 మంది పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నామని అధికారులు చెప్పారు.
ఏపీకి చెందిన ఆ ఏడుగురి జాడ ఏమైంది?
నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.
ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.
మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీకి చెందిన కొందరు యాత్రికులు నేపాల్ వరదల్లో చిక్కుకున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
వీరికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్టు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించాల్సి ఉండటంతో ప్రస్తుతం కొందరు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్లో సురక్షితంగా ఉన్నారని వారితో తాము మాట్లాడామని వివరించారు.
అలాగే తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు కాఠ్మాండూలో సురక్షితంగా ఉన్నారని వారిని సంప్రదించినట్టు అధికారులు చెప్పారు.
ఇక చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు చెందిన ఏడుగురు గల్లంతు అయ్యారని తెలిపారు.
ఆచూకీ లభ్యంకాని ఏడుగురిలో ముగ్గురు ఈశా ఫౌండేషన్ తరపున మాసన సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం వారి ఫోన్లు అందుబాటులో లేవని అధికారులు సీఎంకు వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)