You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్ను పదే పదే వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
- రచయిత, పవన్ రాజ్ పౌడెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
నేపాల్, ముఖ్యంగా నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో భీకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటివి తరచుగా జరుగుతుంటాయి.
నేపాల్-చైనా సరిహద్దు వెంట ఉన్న హిమాలయ ప్రాంతపు భౌగోళిక స్వరూపమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హిమనీనద సరస్సుల్లో కలిగే మార్పులు కూడా ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరగడానికి కారణమంటున్నారు.
బుధవారం(ఆగస్టు 26) ఉదయం రసువా జిల్లాలోని భోటేకోశి/త్రిశూలీ నదిలో వచ్చిన భారీ వరదల కారణంగా నేపాల్లోని రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ సహా నేపాల్లోని పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. టిబెట్ ప్రాంతంలో అనేక హిమనీనద సరస్సులున్నాయి.
నేపాల్ వైపు వాలుగా ఉన్న ప్రదేశంలో అనేక నివాసాలు ఉండటం వల్ల, ఈ సరస్సులు ఉప్పొంగడం, హిమపాతాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది.
"గత అనుభవాలను సమగ్రంగా పరిశీలిస్తే, ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరగడం దాని కారణంగా ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని భావించవచ్చు" అని నేషనల్ డిజాస్టర్, రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎంఏ) ఎగ్జిక్యూటివ్ చీఫ్ ధర్మరాజ్ ఉప్రేతి అన్నారు.
గత ఏడాదిలాగే ఈ సారి కూడా త్రిశూలి వరదలకు మూలం నేపాల్ భూభాగంలో లేదని, టిబెట్ వైపు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ సంఘటనకు కచ్చితమైన కారణాన్ని అప్పుడే నిర్ధరించలేమని సీనియర్ వాతావరణ నిపుణురాలు, జల, వాతావరణ శాస్త్ర విభాగం ప్రతినిధి విభూతి పోఖ్రెల్ చెప్పారు.
కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఇదే జరిగిందని కచ్చితంగా చెప్పలేమని వివరించారు.
‘కచ్చితమైన కారణం అప్పుడే చెప్పలేం’
నేపాల్లోని త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, పుల్చోక్ క్యాంపస్లోని డిజాస్టర్ స్టడీస్కు చెందిన విపత్తు అధ్యయన కేంద్రం డైరెక్టర్ బసంత్ అధికారి ప్రస్తుతం చైనాలోని సిచువాన్లో ఉన్నారు. అక్కడి నుంచే వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
" ఇది హిమపాతం వల్ల జరిగి ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నీరు ఇంకా పూర్తిగా బయటికిపోకపోవడంతో ప్రమాదం ఇంకా కొనసాగుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. దీనిని నిర్ధరించుకోవడానికి శాటిలైట్ విశ్లేషణ కోసం వేచి చూడటం తప్ప మాకు మరో మార్గం లేదు" అన్నారు.
"గతంలో కూడా హిమనీనద సరస్సులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం వంటివి ఇలాంటి వరద సంఘటనలకు కారణాలుగా భావించారు" అని ఆయన అంటున్నారు.
ప్రతికూలంగా మారిన భౌగోళిక స్వరూపం
నేపాల్, చైనాల మధ్య ఉత్తర సరిహద్దుకు ఇరువైపులా ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ సరిహద్దుకు అవతలి వైపున టిబెట్ పీఠభూమి ఉంది. హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు, వాటి నుంచి ఏర్పడ్డ సరస్సులు, పరీవాహక ప్రాంతాలు కలిసి ఈ ప్రకృతి వైపరీత్యాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో, భారీ వర్షపాతం, హిమనీనదాల్లో మార్పులు, మంచుచరియలు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో నీటిని, రాళ్లను,మట్టిని దిగువ తీర ప్రాంతాలకు రవాణా చేరుస్తాయి.
గత సంవత్సరం కూడా రసువా ప్రాంతంలో వరదల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
"నేపాల్-చైనా (ముఖ్యంగా టిబెట్) సరిహద్దు ప్రాంతాల్లో హిమనీనద సరస్సులు విస్ఫోటనం చెందడం మంచు చరియలు ప్రధాన వాతావరణ, భౌగోళిక ప్రమాదాలుగా ఉన్నాయి" అని త్రిభువన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదీప్ ఠుక్రీ అన్నారు.
''నేపాల్ వైపున ఉన్న వాలుగా ఉండే భూభాగంలో నివాసాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. టిబెట్లో హిమపాతాలు జరిగినా లేదా హిమనీనద సరస్సులు పొంగిపొర్లినా నేపాల్ వైపున ఉన్న దిగువ తీర ప్రాంతాల్లో అప్పుడప్పుడు భారీ నష్టం జరుగుతుంటుంది'' అని ఆయన చెప్పారు.
ఇలాంటి ఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి.
ఎత్తయిన హిమాలయ ప్రాంతాల్లో హిమనీనదాలు కదలడం హిమసంపాతాలు సంభవించడం సాధారణమైన, సహజమైన విషయాలు.
"ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో హిమనదాల నీటితో అనేక సరస్సులు ఏర్పడ్డాయి. ఆ సరస్సులోకి నీటి ప్రవాహం నిరంతరం ఉంటుంది. కాబట్టి సరస్సు ఆనకట్ట తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ నీరు చేరితే ఒక్కసారిగా పగిలిపోయేలాంటి పరిస్థితి తలెత్తవచ్చు" అని ఠుక్రీ అన్నారు.
"అదేవిధంగా సరస్సులో హిమపాతం సంభవిస్తే, సరస్సులోని నీరు పొంగిపొర్లవచ్చు. దీనిని హిమనీనద సరస్సులో విస్ఫోటనం అని కూడా పిలవవచ్చు" అని ఆయన చెప్పారు.
కొన్నిసార్లు భూకంప ప్రకంపనలు కూడా సరస్సు పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. అలాగే కొన్నిసార్లు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షం కూడా సరస్సుపై ఒత్తిడిని పెంచుతుంది. వీటిలో ఏ కారణం వల్ల సరస్సుకు గండిపడినా ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం ఏర్పడుతుంది'' అని ఆయన వివరించారు.
"బుధవారం నాటి ఘటన నేపథ్యంలో లేందేఖోలా వద్ద సంభవించిన హిమపాతం కారణంగా నీళ్లు నిలిచిపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ వరదకు ముందు ఖోలా నది మూసుకుపోయినట్టు గానీ లేదా నీటిమట్టం తగ్గినట్టు గానీ అనిపించలేదు" అని నేపాల్లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, పుల్చోక్ క్యాంపస్లోని డిజాస్టర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ బసంత్ అధికారి తెలిపారు.
గతంలోనూ వరదల విధ్వంసం
హిమాలయ ప్రాంతంలో హిమనీనద సరస్సులు పొంగిపొర్లడం, చిన్నాపెద్దస్థాయిలో హిమసంపాతాలు వంటి చిన్న, పెద్ద వాతావరణ సంఘటనలు సంభవించడం అసాధారణం కాదని త్రిభువన్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఠుక్రీ చెబుతున్నారు.
బుధవారం వచ్చిన వరద చాలా అరుదైనదని ఆయన భావిస్తున్నారు.
"ఈ ఘటనకు సంబంధించి మేము చూసిన వీడియోలను బట్టి ఇది చాలా పెద్ద ప్రమాదమని తెలుస్తోంది. నది నీటిమట్టం సాధారణ స్థాయితో పోలిస్తే 15 నుంచి 20 మీటర్లు పెరిగినట్టు కనిపిస్తోంది" అని చెప్పారు.
రసువాలో ఉన్న బీబీసీ ప్రతినిధి శక్తిమాయా తమాంగ్ ఆ ప్రాంతంలోని కొంతమంది వృద్ధులతో దీనిపై మాట్లాడారు.
గతంలో తాము ఇలాంటి వరదలను ఎన్నడూ చూడలేదని వాళ్లు చెప్పినట్టు తమాంగ్ తెలిపారు.
గత సంవత్సరం రసువాలో కూడా ఒక భారీ వరద వచ్చింది. ప్రాణ, ఆస్తి నష్టం విస్తృతంగా జరిగింది. ఆ సమయంలో జరిపిన అధ్యయనాల్లో లేందే ఖోలా ఎగువ పరీవాహక ప్రాంతంలో హిమనద సరస్సు అకస్మాత్తుగా పొంగిపర్లడం వల్లే వరద వచ్చినట్టు తేలింది.
ఆకస్మిక వరద చుట్టుపక్కల ఉన్న రాళ్లు, బురద, ఇసుకను వెంటతీసుకెళ్తూ దిగువకు ప్రవహించి తీవ్ర విధ్వంసం సృష్టించింది.
దీనివల్ల భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలోని రోడ్లు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, జనావాస ప్రాంతాలతో సహా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
2024లో సోలుఖుంబు జిల్లాలోని ఖుంబు పసాంగ్లాము గ్రామీణ మునిసిపాలిటీలోని థామేలో సంభవించిన ఆకస్మిక వరద వల్ల పదులసంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి.
2016లో కోదారి ప్రాంతంలో వచ్చిన వరదను కూడా చాలా పెద్ద ఘటనగా భావిస్తారు. టిబెట్లో హిమనీనదం విస్ఫోటనం చెందడం వల్ల కోదారి, తాతోపానిలోని భవనాలు, అరనికో హైవే, అప్పర్ భోటేకోషి జలవిద్యుత్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వరదలు రాకుండా నివారించే అవకాశముందా?
ఇలాంటి కాలానుగుణ ఘటనలను ఆపలేమని, అయితే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని త్రిభువన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఠుక్రీ అంటున్నారు.
''ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. హిమనద సరస్సులు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ఈ వ్యవస్థ ద్వారా సరస్సులోని నీటి మట్టం, సహజ అడ్డుకట్టపై రియల్ టైమ్ సమాచారం అందుతుంది. ఇలాంటి ఘటనల గురించి ముందే సమాచారం తెలిస్తే ప్రాణనష్టం తగ్గించవచ్చు'' అని ఆయన అన్నారు.
'ముందస్తు హెచ్చరిక వ్యవస్థ' ఉపయోగకరంగా ఉండవచ్చని, అయితే రెండుదేశాలకు సంబంధించిన ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వ స్థాయిలో చైనాతో సమన్వయం పెంచుకోవడం అవసరమని పుల్చోక్ క్యాంపస్కు చెందిన బసంత్ అధికారి చెబుతున్నారు.
''ఒకవేళ ఈ వరద నేపాల్లో మొదలై ఉంటే మనం ఇక్కడి నుంచే దానిని పర్యవేక్షించి ఉండేవాళ్లం. కానీ ప్రస్తుత వరద టిబెట్ వైపు నుంచి వస్తున్నదిగా భావిస్తున్నందున ఇలాంటి పరిస్థితుల్లోసరిహద్దులు దాటి పనిచేసే సమాచార వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ బలంగా ఉన్నట్టు కనిపించడం లేదు'' అని ఆయన చెప్పారు.
ఇలాంటి ఘటనలు జరిగే చోట మానవ నివాసాలు ఉండవు. ప్రజల ద్వారా సమాచారం తెలుసుకోవడం కష్టం కాబట్టి శాటిలైట్ స్టేషన్లను ఏర్పాటుచేసి వాటి ద్వారా పర్యవేక్షించాలి. లేకపోతే సరిహద్దుకు దిగువన మన నివాస ప్రాంతాలు ఉండడం వల్ల ఎక్కువగా నష్టపోయేది మనమే'' అని ఆయన అన్నారు.
నేపాల్లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ప్రారంభమైనప్పటికీ, హిమాలయ ప్రాంతాల్లో వాటి వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
"అంతేకాకుండా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం ద్వారా నదీతీరాల్లో ఉన్న నివాస ప్రాంతాలను తరలించవచ్చు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను నివసించనివ్వకపోవడమే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం" అని త్రిభువన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఠుక్రీ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)