న్యూయార్క్‌లో ఆరెస్సెస్ మీటింగ్‌ను వ్యతిరేకించిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ప్రజల భద్రత చూసుకోవాలని మేయర్‌కు హిందూ సంస్థ సూచన

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో శనివారం (ఆగస్టు 29న) ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొనబోయే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇటీవల ప్రకటించారు.

అయినా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం తనకు ఉండకపోవచ్చని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విదేశాలలో ప్రత్యేక ప్రచార, ప్రజాసంబంధాల కార్యక్రమాల్లో భాగంగా ఈ ఈవెంట్ జరగనుంది.

'యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్' పేరిట అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ దీనిని నిర్వహిస్తోంది. దాదాపు 5 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరవుతారని అంచనా.

ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్-లిబరల్ గ్రూపులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జోహ్రాన్ మమ్దానీ మీడియాతో మాట్లాడారు. "నేను ఈ ర్యాలీకి మద్దతివ్వడం లేదు. అయితే ఒక ప్రైవేటు ఈవెంట్‌ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందా? లేదా? అనేది తెలియదు" అని అన్నారు.

మేయర్ కు హిందూ అమెరికన్ ఫౌండేషన్ సలహా

మరోవైపు న్యూయార్క్‌లో ఆరెస్సెస్ నిర్వహించనున్న 'యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్'కు ముందు హిందూ అమెరికన్ ఫౌండేషన్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది.

ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారితో సహా న్యూయార్క్ వాసులందరినీ రక్షించడం మేయర్ మమ్దానీ "ప్రమాణబద్ధమైన విధి" అని పేర్కొంది

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్‌లో కోరింది.

మమ్దానీ, ఆర్‌ఎస్‌ఎస్ వాదనలు ఏమిటి?

"మన నగర (న్యూయార్క్) చరిత్రలోనే నేను మొదటి ఇండియన్-అమెరికన్ మేయర్. మా అమ్మ తరపు కుటుంబం ఇంకా భారత్‌లోనే ఉంది. భారత్ గురించి చిన్నప్పటి నుంచి మా కుటుంబం నాకు నేర్పింది, నేను పెరుగుతున్న కొద్దీ తెలుసుకుంది ఏంటంటే.. అది బహుళత్వ సమాజం, లౌకిక గణతంత్రం. ప్రతిఒక్కరికీ అక్కడ సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయితే వేర్పాటువాద ఆలోచనల ఆధారంగా నడుస్తున్న ఒక ఉద్యమం బలపడటం ఆందోళనకరం" అని మమ్దానీ అన్నారు.

మమ్దానీ ప్రకటన పట్ల భారత్ నుంచి తీవ్రమైన స్పందనలు వస్తున్నాయి.

మమ్దానీ పేరును ప్రస్తావించకుండా ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ ఆంబేకర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

"న్యూయార్క్‌లో జరిగే 'యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్' అనేది వివిధ సంస్కృతులు, మతాలకు చెందిన ప్రజలతో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సంభాషించే ఒక సర్వమత వేడుకకు ఉదాహరణ" అని అన్నారు.

"పరస్పర గౌరవ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, అందరినీ ఆదరించే భారతీయ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ వివిధ వర్గాల ప్రజలతో సంభాషించే ఆర్‌ఎస్‌ఎస్ సంప్రదాయానికి ఇది కొనసాగింపు. పరస్పర అవగాహనను, ఉమ్మడి లక్ష్యాలను ప్రోత్సహించడం దీని ఉద్దేశం" అని పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, ఆలోచనా విధానాన్ని మరింత మెరుగ్గా తెలుసుకోవాలనుకునే వారందరూ ఈ ఓపెన్ డైలాగ్ కార్యక్రమాలకు హాజరుకావాలని సునీల్ ఆహ్వానించారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మోహన్ భాగవత్ మూడు దేశాలలో పర్యటించనున్నారు.

అమెరికాలోనే తొలి ఈవెంట్. కాగా, అది వివాదాస్పదంగా మారింది.

హిందూ అమెరికన్ సంస్థలు 200లకు పైగా ఈ యూనివర్సల్ వన్‌నెస్ కార్యక్రమానికి మద్దతునిస్తున్నాయని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ తెలిపింది. అయితే, మానవ హక్కులు సహ ఇతర మతపరమైన 61 సంస్థల సమాఖ్య ఈ ఈవెంట్‌ని రద్దు చేయాలని పిలుపునిస్తోంది.

"మోహన్ భాగవత్ భారత్‌కు చెందిన ప్రమాదకర హిందూ అతివాద నేత" అని సియాటెల్ నగర కౌన్సిల్ మాజీ మెంబర్, ప్రముఖ సోషలిస్ట్ నేత క్షమా సావంత్ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని మమ్దానీని కోరారు.

దీనికి బదులుగా, అనేక వేడుకల్లో భారత జాతీయగీతాన్ని ఆలాపించే ఆఫ్రికన్-అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ స్పందించారు.

"మోదీ, బీజేపీ పట్ల విరోధం వల్లే మమ్దానీ సహా ఈ సోషలిస్ట్ పిచ్చోళ్లంతా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్లంతా పెట్టుదారులుగామారి, డబ్బు సంపాదించుకుంటే మంచిది" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వీరిని పట్టించుకోదని ఆమె అన్నారు.

"మోహన్ భాగవత్ హిందువుల ప్రతినిధి కాదు"

"మోహన్ భాగవత్ హిందువుల ప్రతినిధి కాదు. మైనారిటీల పట్ల హింస, భయం, వేర్పాటువాదానికి ఆజ్యం పోసే హిందూ అతివాద జాతీయ ఉద్యమానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు" అని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ డిప్యూటీ ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ శ్రావ్య తాడేపల్లి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

"మతపరమైన జాతీయవాదాన్ని ఐక్యతగా చూపించే ఆర్‌ఎస్‌ఎస్‌కి న్యూయార్క్ వేదిక కాకూడదు. నిజమైన భారతీయ బహుళత్వ దృక్పథాన్ని చాటేలా సిటీ హాల్ వద్ద ప్రదర్శన చేపడతాం. భారత్‌లో ఎవరు ఉండాలి, ఎవరు అధికారం చేపట్టాలి అనే విషయం ఒక మతం నిర్ణయించకూడదు" అని శ్రావ్య అన్నారు.

అయితే, మమ్దానీ.. అసత్య, నిరాధార ప్రకటన చేశారని బీజేపీ ఎంపీ భోలా సింగ్ అన్నారు. సామాజిక సేవ, దేశ నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉందని పేర్కొన్నారు.

మేయర్ వ్యాఖ్యలు విభజనపూర్వకంగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పై అమెరికాలో ఎందుకీ వివాదం?

ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల అమెరికాలో చాలా కాలంగా అసమ్మతి ఉంది. ప్రస్తుత వివాదం అందుకు నిదర్శనం.

మైనారిటీల పట్ల వ్యతిరేక భావనను ఆర్‌ఎస్‌ఎస్ పెంచిపోషిస్తోందని అమెరికాలోని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

ఆ సంస్థపై లక్షిత నిషేధం విధించాలని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇటీవల అమెరికా ప్రభుత్వానికి సూచించింది.

అయినప్పటికీ, తాము భారత పర్యటనలో ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు అమెరికా వచ్చినప్పుడైనా.. అమెరికా రాయబారులు, రాజకీయ నేతలు వారిని కలుస్తూ ఉంటారు.

అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలనే న్యాయపరమైన ప్రయత్నాన్ని 2015లో ఒబామా ప్రభుత్వం అడ్డుకుంది.

ఓ సిక్కు వేర్పాటువాద సంస్థ వేసిన పిటిషన్ పట్ల స్పందిస్తూ "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ని మేము ఉగ్రవాద సంస్థగా పరిగణించడం లేదు" అని ఒబామా పాలకయంత్రాంగం కోర్టుకు తెలిపింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని న్యూయార్క్‌లోని సౌత్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) దావా వేసింది.

నియంతృత్వ భావజాలాన్ని నమ్మడం సహా దానినే ఆచరిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌‌పై ఆ సంస్థ ఆరోపణలు చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ ప్రతినిధులు రామ్ మాధవ్, జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హోసబలె అమెరికాలో పర్యటించారు.

థింక్ ట్యాంక్స్, విద్య, పాలసీ నిపుణులతో సమావేశమయ్యారు.

హిందూ జాతీయవాదం, భారతీయ ప్రవాసులపై నిపుణులైన ఎడ్వర్డ్ ఆండర్సన్ న్యూయార్క్ ఈవెంట్‌పై మిడిల్ ఈస్ట్ ఐ అనే మీడియాతో మాట్లాడుతూ "న్యూయార్క్‌లో ఒక భారీ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ముఖ్య వక్తగా ఉండటం ఆశ్చర్యం కలిగించినప్పటికీ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రవాసుల మద్దతు కూడా గట్టుకునేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది" అని అన్నారు.

"ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌నే ఎంచుకోవడానికి మరో ఉద్దేశం ఉంది. ఇది వారి బలాన్ని, విజయాన్ని తెలియజేస్తుంది. ఇది వారి ఆత్మగౌరవ వాదనకు ముడిపడి ఉంది. మరీ ముఖ్యంగా ప్రచారానికి వాడుకోగల ఫొటోలను, ఇతర సరంజమాను భారత్‌కు తిరిగి పంపగలదు" అని ఆండర్సన్ పేర్కొన్నారు.

2014 సెప్టెంబర్‌లో, ప్రధానమంత్రి అయిన కొన్ని నెలల్లోనే మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో 18 వేల మందిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

"మీ కలల భారతదేశాన్ని నిర్మిస్తాను" అని నరేంద్రమోదీ అప్పుడు ఆ కార్యక్రమానికి హాజరైన వారితో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)