You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లద్దాఖ్: ఈ అమ్మాయిలు ఖగోళ రాయబారులు... చిక్కటి చీకటిలో వెలుగుల నింగిని, నక్షత్రాల వెలుగులను చూపుతారు
- రచయిత, అమృత దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
సమయం రాత్రి 10 గంటలు...
గడ్డకట్టేంత చలి, హోరెత్తే గాలి...
గ్రామస్తులు, గ్రామానికి వచ్చిన అతిథులందరూ రాత్రి భోజనాలు ముగించుకున్నారు. ఇక ఊళ్లో అందరూ నిద్రకు సిద్ధం కావాల్సిన సమయంలో గ్రామంలో సందడి మొదలైంది.
ఈ చిన్ని గ్రామంలో ప్రతిరోజూ రాత్రి వేళ ఇళ్ల ముందు ఓ ఆట మొదలవుతుంది. అది చుక్కల ఆట. ఆ చుక్కల ప్రపంచాన్ని చూపించడానికి ఇక్కడి ‘‘ఖగోళ రాయబారులు’’ టెలిస్కోపులతో సిద్ధంగా ఉంటారు.
ఇది లద్దాఖ్లోని 'హాన్లే' గ్రామం.లేహ్ నుంచి 253 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, ఖగోళ పర్యటకానికి, ఆకాశ వీక్షణకు ప్రసిద్ధి చెందుతోంది. ఈ ప్రదేశాన్ని భారత్ తొలి డార్క్ స్కై రిజర్వ్గా ప్రకటించింది.
మేం హాన్లే గ్రామాన్ని, అక్కడి నుంచి కనిపించే అద్భుతమైన ఆకాశాన్ని చూడటానికి లేహ్ నుంచి ప్రయాణించాం.
ఇక్కడే మాకు పల్జెస్ అంగ్మో, త్స్రింగ్ దుల్కర్, త్స్రింగ్ యాంగ్డోల్, పద్మ పరిచయమయ్యారు.
ఈ లద్దాఖీ యువతులు హాన్లే, పరిసర గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరందరూ గ్రాడ్యుయేట్లు. కాస్త చిరునవ్వుతో, కొంత సిగ్గుపడుతూ కనిపించారు.
ఈ నలుగురు 'ఖగోళ రాయబారులు'.
హాన్లే డార్క్ స్కై రిజర్వు
డార్క్ స్కై రిజర్వు అంటే.. చీకటిని సంరక్షించే ప్రదేశం. వన్యప్రాణులు, పక్షుల కోసం ఒక ప్రాంతాన్ని ఎలా రిజర్వ్ చేస్తారో , అలాగే ఇక్కడ కూడా ఖగోళ పరిశోధనకు అవసరమైన సహజ చీకటిని పరిరక్షించేందుకు ఒక నిర్దిష్ట ప్రాంతంలో కృత్రిమ వెలుతురును నియంత్రిస్తూ చీకటిని యథాతథంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.
హాన్లే గ్రామం చాంగ్థాంగ్ అటవీ సంరక్షణ కేంద్రం పరిధిలోకి వస్తుంది. హాన్లే చుట్టూ ఉన్న 22 కిలోమీటర్ల పరిధిలోని ఆరుగ్రామాలు ఈ డార్క్ స్కై రిజర్వ్లో భాగంగా ఉన్నాయి. అయితే ఇదంతా ఇక్కడే ఎందుకు చేస్తున్నారు?
దీనికి కారణం హాన్లే ఉన్న భౌగోళిక ప్రదేశం. ఆ ప్రాంత లక్షణాలే. ఈ గ్రామం సముద్ర మట్టానికి 14 వేల 764 అడుగుల ఎత్తులో ఉంది.
లద్ధాఖ్ ప్రాంతం హిమాలయా పర్వత శ్రేణులకు, కారకోరమ్ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. భారత్లో దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణించే రుతుపవనాలను హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుకుంటాయి. దీని ఫలితంగా లద్దాఖ్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది.
హాన్లే, దాని చుట్టుపక్కల ప్రాంతం ఒక ‘శీతల ఎడారి'. దీనివల్ల ఇక్కడి గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఏడాదిలో దాదాపు 260 రాత్రులు ఇక్కడ ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుంది.
ఈ కారణంగా, ఇక్కడ ఆకాశంలో వేలాది నక్షత్రాలు మెరుస్తూ మన కంటికి కనిపిస్తాయి. ఆకాశ పరిశీలనకు, ఖగోళ పరిశోధనకు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలలో హాన్లే కూడా ఒకటి.
అందుకే ఇక్కడ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ స్థాపించారు. ఇందులో హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఉంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా లద్దాఖ్లోని ఈ మారుమూల ప్రాంతం నుంచి కీలకమైన ఖగోళ అధ్యయనాలు జరుగుతున్నాయి.
కానీ లద్ధాఖ్కు వచ్చే పర్యటకు సంఖ్య పెరగడం, వాహనాల రాకపోకలు ఎక్కువ కావడంతో ఈ అబ్జర్వేటరీలోని పరిశోధనలపై ప్రభావం పడే ప్రమాదం కూడా పెరిగింది.
ఒకవేళ వీధిదీపాలు, వాహనాల కాంతి, ఇళ్లు, హోటళ్ల నుంచి వెలువడే కాంతి పెరిగితే ఆకాశ పరిశీలనను అంత సమర్థవంతంగా నిర్వహించడం కష్టమయ్యేది. అందుకే ఈ ప్రాంతాన్ని డార్క్ స్కై రిజర్వ్గా ప్రకటించారు.
సాధారణంగా మనం పల్లెల్లో,నగరాల్లో నింగి వైపు చూస్తే కొన్ని నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ హాన్లేలో మాత్రం పాలపుంతను కంటితో స్పష్టంగా చూడొచ్చు.
ఆకాశం నుంచి రాలే ఉల్కలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలను కూడా మన కంటితో చూడవచ్చు.
హాన్లేలో ‘ఖగోళ రాయబారులు’
హాన్లేలో ఒక అబ్జర్వేటరీ ఉన్నప్పటికీ, అది కేవలం పరిశోధకుల మాత్రమే ఉపయోగించగలరు. కానీ, ఆకాశాన్ని పరిశీలించడానికి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
అందువల్ల, ఖగోళ పర్యటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, ఆకాశంలో సహజ చీకటిని కాపాడే ప్రయత్నంలో స్థానికులను కూడా భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ‘ఖగోళ రాయబారులు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లద్దాఖ్ పరిపాలన యంత్రాంగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంయుక్తంగా 2022లో హన్లే, దానిపరిసర గ్రామాలకు చెందిన 24 మంది యువతీ యువకులకు ఖగోళ శాస్త్రాన్ని పరిచయం చేశాయి. వారికి 15 రోజుల శిక్షణ ఇచ్చారు.
ఖగోళ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్రమండలాలను గుర్తింంచడం నేర్పించారు. వారికి ఒక టెలిస్కోప్ కూడా ఇచ్చి, దానిని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. తమ మొబైల్ ఫోన్లతో పాలపుంత ఫోటోలు తీయడం కూడా వారికి నేర్పించారు.
ఈ శిక్షణ ద్వారా 24 మంది ఖగోళ రాయబారులు తయారయ్యారు. వీరిలో 18 మంది అమ్మాయిలే. పల్జెస్ అంగ్మో, త్స్రింగ్ దుల్కర్, త్స్రింగ్ యాంగ్డోల్, పద్మ ఒకే బ్యాచ్కు చెందినవారు.
ప్యాంగాంగ్కు చెందిన అంగ్మో పెళ్లి చేసుకుని, ఈ గ్రామానికి వచ్చారు. మిగిలిన ముగ్గురు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగారు.
''ఇక్కడ ఆకాశం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. 2022కి ముందు, మేం ఎప్పుడూ ఆకాశం వైపు చూడలేదు. కానీ, 2022 నుంచి దానిపై మాకు ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మేం ప్రతిరోజూ ఆకాశం వైపు చూస్తూనే ఉంటాం" అని దుల్కర్ చెప్పారు.
"శిక్షణ పూర్తయ్యాక టెలిస్కోప్ మా చేతికి వచ్చింది. మొదట దానిని ఉపయోగించడానికి చాలా భయపడ్డాం. ఏదైనా తప్పు జరిగి అది పాడైపోతే ఏం చేయాలనే భయం ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాం. ఇప్పుడు అవాటైపోయింది. టెలిస్కోప్ను సరిగ్గా అమర్చగలం. కొంతవరకు దాని గురించి అర్ధం చేసుకున్నాం. కానీ దానికి ఏవైనా మరమ్మతులు అవసరమైతే అబ్జర్వేటరీకి తీసుకువెళ్తాం" అంటూ ఆ నలుగురూ ఒకరి మాటలను మరొకరు పూర్తి చేస్తూ చెప్పారు.
హాన్లేలో ఆకాశ పరిశీలన
హాన్లేకు వచ్చే పర్యటకులకు ఈ ఖగోళ రాయబారులే ఆకాశాన్ని చూపుతారు. తమ టెలిస్కోప్ల ద్వారా అంతరిక్షంలోని ఈ అద్భుత దృశ్యాలను వారికి పరిచయం చేస్తారు.
రాత్రి 9 గంటల నుంచే గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆ రాత్రి ఆకాశంలోని పరిస్థితులను బట్టి టెలిస్కోప్లను ఏర్పాటు చేస్తారు.
హోమ్-స్టేలో బస చేస్తున్న అతిథులు వెచ్చని దుస్తులు, జాకెట్లు, ఇయర్మఫ్లు ధరించి తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి, మిరుమిట్లు గొలిపే ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. టెలిస్కోప్ల చుట్టూ జనం గుమిగూడుతారు. బుధ, శుక్ర, శని, చంద్రునిపై ఉన్న బిలాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
ప్రతి రాత్రి 11 గంటలకు గ్రామాల్లోని దీపాలన్నీ ఆర్పేస్తారు. దాంతో దట్టమైన చీకటి అలుముకుంటుంది. అప్పటిదాకా మెరుస్తున్న ఆకాశం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఆ చీకటిలో పాలపుంత బ్యాక్గ్రౌండ్లో తమ ఫోటో తీసుకోవాలనే తపన మొదలవుతుంది. అప్పుడు ఈ ఖగోళరాయబారులు ముందుకువచ్చి మొబైల్ ఫోన్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలో ప్రజలకు చెబుతారు.
"టెలిస్కోప్ ద్వారా పాలపుంతను చూసి, దానితో ఫోటో తీసుకున్నప్పుడు ప్రజలు చాలా ఆనందపడతారు. మేం ఫోటో తీస్తే, ఫోటో దిగడానికి జనం బారులు తీరుతారు. వారి మొబైల్ ఫోన్లలో ఎలాంటి సెట్టింగ్స్ వాడాలో కూడా మేమే చెబుతాం. మేం కూడా స్వయంగా పాలపుంత ఫోటోలు, చంద్రుడి ఫోటోలు తీసుకుంటాం. వాటిని మా స్టేటస్లో పెడతాం, ఒకరికొకరు పంపుకుంటాం" అని పద్మ చెప్పారు.
టెలిస్కోప్తో జీవితం మారిపోయింది
హాన్లే గ్రామం చాలా చిన్నది. చుట్టూ పర్వతాలు ఉంటాయి. గ్రామం దాటి ముందుకు వెళితే ఓ కొండపై హాన్లే మఠం కనిపిస్తుంది. లద్దాఖ్లోని అనేక గ్రామాల్లాగే, ఇక్కడ కూడా ఒక సైనిక స్థావరం ఉంది.
గ్రామంలో రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. కరెంట్ వచ్చేది మళ్లీ ఉదయమే. హాన్లేలోని అబ్జర్వేటరీ వద్ద హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ను ఉపయోగించి చేసే పరిశీలనలకు ఈ చీకటి చాలా అవసరం. అయితే, దీని కారణంగా, గ్రామంలో రాత్రి చలిని తట్టుకోవడానికి గదులలో హీటర్లను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు.
ఇక్కడి ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, కరోనా తర్వాత పర్యటక రంగానికి ఊపు వచ్చింది. హాన్లే నుంచి కనిపించే పాలపుంత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య పెరిగింది.
అంతేకాకుండా, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ఉమ్లింగ్-లా కనుమకు వెళ్లే మార్గం కూడా హాన్లే మీదుగానే వెళుతుంది. అందువల్ల, ఇక్కడికి వచ్చే బైకర్ల సంఖ్య కూడా పెరిగింది.
ఖగోళ పర్యటకాన్ని ప్రోత్సహించే 'ఆస్ట్రోటూరిజం' అనే కార్యక్రమం ఇక్కడ వేళ్లూనుకుంటోంది. ఇక్కడ ఇంకా రెస్టారెంట్లు లేవు. కొన్ని మినహాయింపులు తప్ప ఉండేందుకు హోటళ్లు కూడా లేవు. అయితే, హోమ్స్టేల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య పెరుగుతుండంతో, స్థానిక యంత్రాంగం రోడ్లు నిర్మిస్తోంది.
హాన్లే, దాని చుట్టుపక్కల గ్రామాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. చాలామంది తమ ఇళ్లకు పక్కనే గదులు కడుతూ హోమ్స్టేలను ప్రారంభిస్తున్నారు. అంగ్మో, దుల్కర్, యాంగ్డోల్, పద్మ కుటుంబాలు కూడా హోమ్స్టేలను అందిస్తున్నాయి.
దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి పర్యటకులు వారి వద్ద బస చేయడానికి వస్తుంటారు.
"రోజంతా అతిథులను చూసుకోవడం, వారికి భోజనం పెట్టడం, గదులు శుభ్రం చేయడం, ఇంటి పనులు చేసుకోవడంతో గడిచిపోతుంది. ఆ తర్వాత, రాత్రి 9 గంటల నుంచి మేం ఆకాశాన్ని వీక్షించడానికి సిద్ధమవుతాం. టెలిస్కోప్ను అమర్చుతాం" అని పద్మ చెప్పారు
పగటిపూట వంటగదిలో వంట చేసిన ఈ చేతులే రాత్రివేళ వేగంగా టెలిస్కోపులను ఏర్పాటు చేస్తాయి. ఆ పరికరాలను చేతులతో పట్టుకుని పర్యటకులకు నక్షత్రరాశులను చూపిస్తాయి.
సరికొత్త వృత్తి మార్గం
ఈ నలుగురూ గ్రాడ్యుయేట్లే. వారికి టెలిస్కోప్ దొరికింది. దాంతో వారు సరికొత్త వృత్తి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆకాశాన్ని వీక్షించినందుకు గాను, అతిథులు వారికి డబ్బు చెల్లిస్తారు. దీనితో పాటు, ఈ హోమ్స్టే ఆ కుటుంబానికి ఒక ఆదాయ వనరును కూడా అందిస్తోంది.
"ఈ పని చేయడానికి ముందు మాకు అస్సలు నమ్మకం లేదు. కానీ, ఇప్పుడు నమ్మకం కొంచెం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. స్థానికులు కూడా వస్తారు. పాఠశాల పిల్లలు వస్తారు. మేం వారికి ఉచితంగా చూపిస్తాం. వారి నుంచి ఎలాంటి చార్జీలు తీసుకోం. మేం టెలిస్కోప్ నుంచి ఏదైనా చూపించినప్పుడు, అందరూ 'వావ్' అని ఆశ్చర్యపోతారు" అని చౌఘిజాని అన్నారు.
తాను ఇకపై తన తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకోనని గర్వంగా చెబుతున్నారు. "గతంలో, మాకు ఏది కావాలన్నా మా కుటుంబం నుంచి తీసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మేం మా డబ్బును పొదుపు చేసుకుని మాకు కావలసినవి కొనుక్కుంటున్నాం" అని చౌఘిజాని తెలిపారు.
ఈ అమ్మాయిలు తమ సంపాదనను పొదుపు చేసి మంచి మొబైల్ ఫోన్లు కొనుక్కున్నారు. వారిలో ఒక అమ్మాయి ఐఫోన్ కూడా కొనుక్కున్నారు.
ఈ నలుగురు కలిసి పనిచేస్తారు. తమ ఇంటి ఆవరణ నుంచి ఇలాంటి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హాన్లే గ్రామం నుంచి అత్యంత అందమైన ఆకాశం కనిపిస్తుందని, అందుకే తాము మరెక్కడికీ వెళ్లమని కూడా వారు అంటారు. కానీ వారి కుటుంబం సంగతేంటి?
"మేం మా ఇంట్లో వారికి కూడా టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూపిస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా చూడటానికి ఇష్టపడుతున్నారు. నిజానికి, ప్రతిరోజూ మా అతిథులకు ఆకాశాన్ని చూపించాలని వాళ్ళు పట్టుబడతారు. ఒకవేళ మేం సెలవు తీసుకున్నా కూడా, 'ఈరోజు టెలిస్కోప్ ఎందుకు వాడలేదు?' అని మమ్మల్ని అడుగుతారు" అని యాంగ్డోల్ చెప్పారు.
మేం హాన్లేలో ఉన్నప్పుడు, ఒకరోజు రాత్రి పద్మ వాళ్ల ఇంటికి వెళ్లాం. హోమ్ స్టేలో అన్ని గదులు నిండిపోయాయి. రాత్రి భోజనం కోసం పద్మ రోటీలు చేస్తున్నారు. మేం టీ తాగి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాం. ఈ లద్దాఖీ అమ్మాయి స్నేహితురాలు నామ్క, వారు మాట్లాడిన మాటలను మాకు అనువాదం చేసి చెప్పారు.
తమ కుమార్తె స్వయంగా జీవనోపాధి పొంది, సంపాదిస్తున్నందుకు ఈ లద్దాఖీ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఈ ఆస్ట్రో అంబాసిడర్లకు ఇప్పుడు అంతరిక్షంపై పూర్తి అవగాహన ఉంది. వారు ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల స్థానాలను గుర్తించడానికి పలు యాప్లను ఉపయోగిస్తారు. కానీ, మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని ఈ అమ్మాయిలు గ్రహించారు.
నిపుణుల నుంచి మెరుగైన శిక్షణ పొందితే, తాను మరింత మెరుగైన పని చేయగలనని ఆమె చెబుతున్నారు. అలాగే, తన వద్ద మెరుగైన టెలిస్కోప్, ఐపీస్ ఉంటే, సందర్శకులకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించగలమని చెప్పారు.
నాలుగేళ్ల క్రితం వారు ఈ పనిని ప్రారంభించినప్పుడు, వారికి అంతా కొత్త. కానీ ఇప్పుడు, ఇకపై తాము చేయాలనుకున్నది ఇదేనని ఆ నలుగురూ గట్టిగా చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)