నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా 800 మందికి పైగా ఆచూకీ లభించడం లేదని నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎన్‌డీఆర్ఆర్ఎంఏ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన ముగ్గురి ఆచూకీ తెలియలేదని ఆర్టీజీఎస్ తరపున ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన బాలసుబ్రమణ్యం, ఈషా ఫౌండేషన్ ద్వారా నేపాల్ వెళ్లిన తెలుగు పర్యటకులు శశి కుమార్, రాజ్యలక్ష్మినిమ్మగడ్డ ఆచూకీ తెలియడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అదే సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం మరో ఇద్దరు తెలుగు వారి వివరాలు కూడా తెలియాల్సి ఉందని ప్రకటించింది.

ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్ బాబు సమాచారం రావాల్సి ఉందని ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది.

కుప్పంకు చెందిన వీఎస్ బాలసుబ్రమణ్యం ఈ నెల 14న కైలాస మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లారు. ఆయన సోదరుడు కుప్పంలో న్యాయవాదిగా పనిచేస్తున్న శ్రీకాంత్, బాలసుబ్రమణ్యం గురించి బీబీసీతో మాట్లాడారు.

''బాలసుబ్రమణ్యం హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ తరపున ఈ యాత్రకు వెళ్లినఆయనకు భార్య, 17, 15 సంవత్సరాల అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. బాలసుబ్రమణ్యం ఈ నెల 28న తిరిగి రావాల్సి ఉంది. 25వతేదీన చివరిసారి ఆయనతో మాట్లాడాం. తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు'' అని శ్రీకాంత్ బీబీసీతో చెప్పారు.

బాలసుబ్రమణ్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకుగురవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు సాయం చేయాలని కోరారు.

"మా తమ్ముడు నిన్న ఇమిగ్రేషన్ చెకప్స్ కోసం గైరాన్‌లో ఉన్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినట్టు మాకు తెలిసింది. అతడు అక్కడచిక్కుకుపోయి ఉండచ్చు. తను ఏ సమస్యా లేకుండా తిరిగి వస్తాడనే మేం ఆశిస్తున్నాం'' అని బాలసుబ్రమణ్యం సోదరుడు ఒక వీడియో విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది నేపాల్‌కు వెళ్లారు, ఎక్కడున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది.

హెల్ప్‌లైన్‌ను కూడాఏర్పాటు చేసింది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

నేపాల్ పర్యటకుల్లో ఆదోనివాసులు

మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం క్షేమంగా ఉందని ఏపీ భవన్ అధికారులు చెప్పారు. అయితే ఆకస్మిక వరదల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారనితెలిపారు.

భాస్కరశాస్త్రితో బీబీసీ మాట్లాడింది.

''ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఆదోని నుంచి మా కుటుంబ సభ్యులం నలుగురం వచ్చాం. మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు'' అని ఆయన అన్నారు.

భాస్కరశాస్త్రి, ఆయన భార్య, కొడుకు, కోడలు సహా మొత్తం 156 మంది యాత్రికులు ఆగస్ట్ 18న ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీద్వారా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు.

వీరిలో ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబంతోపాటు మరో 12 మంది ఆనారోగ్యంతో తాము బస చేసిన హోటల్ గదుల్లోనే ఉండిపోయారు.

తండ్రి భాస్కర శాస్త్రితో మాట్లాడిన ఆయన కుమార్తె స్వాతి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ సాయం కోసంఎదురుచూస్తున్న తమ కుటుంబం గురించి ఆందోళనగా ఉందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయక చర్యలుచేపట్టాలని, తమ కుటుంబాన్ని సురక్షితంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

వీరంతా గ్రూప్ వీసా నిబంధనల కింద నేపాల్ పర్యటనకు వెళ్లడం వల్ల, 156 మంది కలిసే స్వదేశానికి తిరిగి రావాల్సిఉంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఈ నేపథ్యంలో బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాధితులతో ఆదోని భాజపా ఎమ్మెల్యే పార్థసారథి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

తిరుపతి నుంచి 28 మంది

తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కఠ్మాండులో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది.

మానస సరోవర యాత్రను నిర్వహించే వివిధ టూరిస్ట్ సంస్థలు, ఏజెన్సీలతో ఏపీ అధికారులు మాట్లాడుతున్నారు. వివిధమార్గాల ద్వారా అక్కడ వారు ఎలా ఉన్నారనే సమాచారం సేకరిస్తున్నారు.

ఈ సందర్భంగా తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కఠ్మాండులో ఉన్నట్టు గుర్తించారు. తిరుపతి యాత్రికులు నగరంలోని యెల్లకొండ దగ్గర ఒక హోట‌ల్‌లో బ‌స‌ చేశారని తెలుసుకున్నారు. తాము అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపిన వారు.. తమను సంప్రదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కానీ, ఎలాంటి సహయం అవసరమైన తక్షణం తమను సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు యాత్రికులకు సూచించారు.

అయితే దీనిపై తిరుపతి ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయ అధికారులతో బీబీసీ మాట్లాడింది. దానిపై తమకు ఎటువంటి సమాచారంలేదని వారు చెప్పారు.

న్యూదిల్లీలో ఉన్న ఏపీ భవన్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ద్వారా నేపాల్లోని భారత ఏంబసీ, చైనా, నేపాల్ ఏంబసీలు, గ్యాంగ్ఇమిగ్రేషన్ సెంటర్, ఇషా ఫౌండేషన్, విదేశాంగ శాఖ, ఆర్టీజీఎస్ కేంద్రాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోసారి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలియడంతో ఏపీ ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారికి ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. నేపాల్లో ఉన్న తెలుగువారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని, భారత ఎంబసీలతో టచ్‌లోఉండాలని సూచించింది.

ఆచూకీ తెలియని వారి కుటుంబాలు ఏపీ భవన్‌కు వారి ప్రయాణ వివరాలు, చివరిసారి వారితోమాట్లాడినప్పుడు వారు ఎక్కడ ఉన్నారో 011-23384016, 011-23387089, Whatsapp: 9059824101 నంబర్లకు వివరాలుఅందించాలని కోరింది.

తమ కుటుంబ సభ్యుల ఆచూకీ గురించి 1144 నంబరులో నేపాల్ టూరిజం పోలీసులను కూడా సంప్రదించవచ్చని తెలిపింది.

అటు నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్నకుటుంబ సభ్యులు దిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు.

హెల్ప్‌లైన్ నంబర్లు:

శ్రీమతి వందన

పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్

మొబైల్: 9871999044

శ్రీ సి.హెచ్. చక్రవర్తి

పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

మొబైల్: 9949351270

శ్రీ జి. రక్షిత్ నాయక్

లైజన్ ఆఫీసర్

మొబైల్: 9618597969

డీఆర్డీవో పూర్వ చైర్మన్ సతీశ్ రెడ్డి కూడా వరదల్ల వల్ల నేపాల్‌లో చిక్కుకుపోయారు. తాను మానస సరోవర యాత్రకు వెళ్లాననీ, ప్రస్తుతం క్షేమంగా ఉన్నాననీ ఆయన ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)