నేపాల్‌పై విరుచుకుపడిన వరదలకు కూలిన హిమనీనదమే కారణమా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

    • రచయిత, టెస్సా ఓంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

నేపాల్‌, టిబెట్ సరిహద్దులో సంభవించిన వరదలకు కారణం హిమనీనదం ఉధృతేనని ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు బీబీసీకి తెలిపారు.

అయితే మొదట భూకంపం వచ్చిందని వార్తలు వచ్చాయి. దాని వల్ల కొండచరియలు విరిగిపడి, తర్వాత వరద వచ్చిందని చాలామంది అనుకున్నారు.

ప్రస్తుతం అందిన ధృవీకృత సమాచారం మేరకు 332 మంది చనిపోయారు.

ఈ విపత్తు భూకంపం వల్ల కాదు అని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. ఇది గ్లేసియర్(హిమనీనదం) లేదా అందులో ‘కొంతభాగం విరిగిపడిపోవడం’ వల్ల జరిగింది.

లోయ అడుగుభాగాన్ని కూలిపోయిన హిమనీనదం బలంగా ఢీకొట్టడంతో 5.2 తీవ్రతతో భూకంపం తరహా ప్రకంపనలు ఏర్పడ్డాయని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్)తో పాటు ఈ విపత్తును పరిశీలించిన సైంటిస్టులు కూడా తెలిపారు.

నేపాల్‌లోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం దగ్గర ఉన్న ఒక హిమనీనదం కింది భాగం కూలిపోయినట్లు తమ బృందం గుర్తించిందని.. డండీ యూనివర్సిటీకి చెందిన హిమనీనదాల నిపుణుడు డాక్టర్ సైమన్ కుక్ బీబీసీతో చెప్పారు.

ఈ ప్రదేశం వరదలు వచ్చిన ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆ హిమనీనదం వాయువ్య దిశగా కూలిపోయి, నీటి ప్రవాహం వెంట పశ్చిమ దిశగా కదిలిందని డాక్టర్ సైమన్ కుక్ అంచనా వేశారు.

ఎత్తైన పర్వత ప్రాంతం నుంచి మంచు, రాళ్లు పెద్ద మొత్తంలో కొట్టుకొచ్చి ఉండొచ్చని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్(ఐసీఐఎంఓడీ) అనే ఇంటర్ గవర్నమెంటల్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్ విశ్లేషించింది.

పెద్ద మొత్తంలో మంచు, రాళ్ల ముక్కలు లెండే ఖోలా నదిలోకి చేరాయి. ఈ నది భోటే కోశి నదికి ఉపనది. దాంతో నీరు, మట్టి, పెద్ద రాళ్లు ఒక్కసారిగా వేగంగా దిగువకు ప్రవహించాయి.

దిగువ ప్రాంతాల్లోని నదుల్లో నీటి మట్టం కేవలం 30 నిమిషాల్లో 7 నుంచి 9 మీటర్ల వరకు పెరిగింది. నీటి స్థాయిని కొలిచే కొన్ని కేంద్రాలు దెబ్బతిన్నాయి.

ఆ ప్రాంతం చుట్టూ ఎత్తైన పర్వతాలున్నాయి. వరద వీడియోల్లో నీరు, రాళ్లు, మట్టి నదిలోంచి చాలా వేగంగా దిగువకు ప్రవహించడం కనిపించింది.

బుధవారం విరిగిపడిన హిమనీనదం ఎందుకు కూలిందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అయితే ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు, పెర్మాఫ్రాస్ట్(గడ్డకట్టిన నేల) కూడా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా హెచ్చరిస్తున్నారు.

హిందూ కుష్, హిమాలయ ప్రాంతంలోని హిమనీనదాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రెండింతల వేగంతో కరిగిపోతున్నాయని ఈ ఏడాది మొదట్లో ఐసీఐఎంఓడీ చేసిన ఒక అధ్యయనం పేర్కొంది.

దీనివల్ల వరదలవంటి ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి.

ఇటీవలి ఏళ్లలో భారత్, స్విట్జర్లాండ్, ఇటలీలో కూడా హిమనీనదాలు కూలిపోవడం వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగాయని డాక్టర్ కుక్ అన్నారు.

ఉత్తర భారతదేశంలోని చమోలీ లోయలో 2021లో ఒక పెద్ద హిమనీనదం ముక్క కూలిపోయింది. దాంతో మంచు, నీరు, రాళ్లు భారీగా దిగువకు ప్రవహించి సుమారు 200 మంది చనిపోయారు.

ఆ హిమనీనదం కూలినప్పుడు వచ్చిన ప్రకంపనల ప్రభావం 15 అణుబాంబుల పేలుడు శక్తితో సమానంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

నేపాల్‌లో కూడా గతేడాది ఇదే ప్రాంతంలో వరద వచ్చింది. టిబెట్‌లోని ఒక హిమనీనద సరస్సు కట్ట తెగిపోవడం వల్ల ఆ వరద సంభవించింది.

గడ్డకట్టిన భూభాగాలను ప్రభావితం చేసే ప్రమాదాలు పెరుగుతున్న విషయం ఇంతకుముందుకంటే ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఐసీఐఎంఓడీ నిపుణులు మహ్మద్ ఫరూక్ ఆజమ్ అన్నారు. చాలా వేగంగా వాతావరణ మార్పులు జరుగుతున్నందున, వాటిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదన్నారు.

ప్రతి ప్రకృతి విపత్తు.. వాతావరణ మార్పుల వల్లే జరిగిందని చెప్పడం కష్టమని, అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న తీరు చూస్తే వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయని అనిపిస్తోందని డాక్టర్ కుక్ చెబుతున్నారు.

భూమి వేడెక్కుతున్న కొద్దీ హిమనీనదాలు కుంచించుకుపోతాయి. మంచు ఎక్కువగా కరుగుతుంది. కొన్ని పర్వత ప్రాంతాలను కొంతమేర కలిపి ఉంచే శతాబ్దాల నాటి గడ్డకట్టిన నేల (పెర్మాఫ్రాస్ట్) వేడెక్కి, కరిగి, బలహీనపడుతోందని ఆయన అన్నారు.

దీంతో మరిన్ని కొండచరియలు విరిగిపడటం, మట్టి-రాళ్ల ప్రవాహాలు, హిమనీనదాల నీరు, సరస్సులు ఒక్కసారిగా పొంగిపోవడం, గ్లేసియర్లు విరిగిపడడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే వాతావరణం వేడెక్కడం చివరికి ఈ ఎత్తైన పర్వత ప్రాంతాలను అస్థిరంగా మారుస్తుందని డాక్టర్ కుక్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)