సుహాసిని రెడ్డి: ‘ముందు రోజు గృహప్రవేశం, మరుసటి రోజు నేపాల్ టూర్.. తర్వాత ఏమైందో తెలియడం లేదు’

‘చివరిసారిగా మంగళవారం సాయంత్రం మాట్లాడింది. టిబెట్ సరిహద్దుకు వెళ్తున్నాం.. బుధవారం ఉదయం వీసా వచ్చాక అక్కడి నుంచి బయల్దేరతాం అని చెప్పింది. ఆ తర్వాత నుంచి మా అమ్మాయి ఫోన్ పనిచేయడం లేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు కందిమళ్ల మహేందర్ రెడ్డి.

నేపాల్‌లో ఆకస్మిక వరదల తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గరలోని వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్ రెడ్డి, ప్రేమలతల కుమార్తె సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆమె నేపాల్-టిబెట్ సరిహద్దులోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లినట్టు చెప్పారని, ఆ తర్వాత సమాచారం తెలియడం లేదని వారు వివరించారు.

290 మంది ఆచూకీ తెలియడం లేదన్న భారత్

నేపాల్-టిబెట్ సరిహద్దులో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఇప్పటివరకు 547మంది చనిపోగా 900 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నేపాల్ పోలీసులు ప్రకటించారు.

వీరిలో భారత్‌కు చెందిన 290 మంది పర్యటకులు, సందర్శకుల ఆచూకీ తెలియాల్సి ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లిన కొందరు పర్యటకుల ఆచూకీ కూడా తెలియాల్సి ఉందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.

‘గృహ ప్రవేశం కోసం వచ్చారు’

నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత ఆచూకీ తెలియనివారిలో సుహాసిని రెడ్డి కూడా ఒకరు.

భర్త సంజీవ్ రెడ్డితో కలిసి సుమారు 15 ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. వీరికి ఇద్దరు పిల్లలు.. శ్రీహాన్ రెడ్డి 11వ తరగతి చదువుతుండగా, సమయ్ ఒకటో తరగతి చదువుతున్నారు.

కొత్త ఇంటి గృహ ప్రవేశం కోసం సమయ్‌తో కలిసి ఆగస్టు 19న సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చినట్టు ఆమె తండ్రి మహేందర్ రెడ్డి చెప్పారు.

''ఆగస్టు 23న మానసరోవర్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లి, అక్కడి నుంచి కాఠ్‌మాండూ వెళ్లింది. సోమవారం(ఆగస్టు 24) ఆమె స్నేహితురాలు నేరుగా కాఠ్‌మాండూకు రావడంతో ఇద్దరూ కలిసే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో మాతో మాట్లాడింది. తర్వాత ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు'' అని చెప్పారు మహేందర్ రెడ్డి.

సెప్టెంబరు 14న సమయ్ పుట్టినరోజు. అది కూడా ఇక్కడే జరుపుకొని సెప్టెంబరు చివరలో ఆస్ట్రేలియా తిరిగివెళ్లాలని అనుకున్నారని సుహాసిని రెడ్డి మామ కె.రమేశ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''మొదట్లో భర్తతో కలిసి సుహాసిని రెడ్డి న్యూజీలాండ్‌లో ఉండేవారు. తర్వాత ఆస్ట్రేలియాకు మారారు. త్వరలో తమకు పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) కూడా వస్తుందని మాతో చెప్పారు'' అని వివరించారు రమేశ్ రెడ్డి.

వీలైనంత త్వరగా సుహాసిని ఆచూకీ కనిపెట్టాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

31 మంది యాత్రికులు క్షేమం

హైదరాబాద్‌లో గాంధీ నగర్‌కు చెందిన ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్టు తరఫున 31 మంది యాత్రికులు నేపాల్ వెళ్లారు. వారంతా నేపాల్ వెళ్లి అక్కడి నుంచి మానసరోవర్ యాత్రకు వెళ్లగా.. తామంతా టిబెట్‌లో క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి కుటుంబీకులకు వారు సమాచారం అందించారు.

వీరిలో డీఆర్డీవో మాజీ ఛైర్మన్, జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు సతీశ్ రెడ్డి, ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ జీఎం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఏపీ, తెలంగాణ నుంచి ఎంతమంది వెళ్లారు?

ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లిన పర్యటకులు, సందర్శకులలో కొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.

ఏపీకి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్టు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

''మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించాల్సి ఉండటంతో కొందరు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు'' అని ప్రభుత్వం తెలిపింది.

చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు చెందిన ఏడుగురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని ఏపీ అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు ఇషా ఫౌండేషన్ తరపున మాససరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్నారని వివరించారు.

''కేంద్ర ప్రభుత్వంతో పాటు కాఠ్‌మాండూ, చైనాల్లోని ఎంబసీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆచూకీ తెలియని వారి వివరాలను నిరంతరం ట్రాక్‌ చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం'' అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే దిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయగా సుమారు 80 నుంచి 100 కాల్స్ వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

మొత్తం 23 మందికి సంబంధించిన వివరాలు గుర్తించగా, ఆరుగురు తెలంగాణ నుంచి వెళ్లారని, మరో 17 మంది తెలంగాణ మూలాలు కలిగిన ఎన్ఆర్ఐలుగా గుర్తించామని తెలంగాణ ప్రభుత్వాధికారులు చెప్పారు.

23 మందిలో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధరణ కాగా, మిగిలిన 22 మంది వివరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

పరిస్థితిని దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)