మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం రాజకీయ, సామాజిక చర్చగా మారుతోంది. జోగి రమేష్‌తో పాటు కుటుంబ సభ్యులపై ఆయన కోడలు మేఘన వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఆగస్ట్ 25వ తేదీ మంగళవారం మీడియా సమావేశంలో ఆమె పలు ఆరోపణలు చేశారు.

పెళ్లికి ముందు తన భర్త రాజీవ్‌కు ఉన్న కొన్ని సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేసి, తమను మోసం చేశారని మేఘన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. అయితే ఇది తమ కుటుంబ విషయమని, దీన్ని రాజకీయంగా వాడుకుంటూ కొందరు టీడీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అంతకుముందు మీడియాతో జోగి రమేష్ అన్నారు.

జోగి రమేష్ ఆరోపణలను మైలవరం టీడీపీకి చెందిన శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌ ఖండించారు.

మరోవైపు తమకు న్యాయం జరిగితే ఇప్పటికే చాలా కోల్పోయిన తన కూతురుకి మళ్ళీ కొత్త జీవితం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని మేఘన తండ్రి కృష్ణ గౌడ్‌ బీబీసీతో అన్నారు.

అసలు ఈ వివాదం ఏంటి.. ఎలా మొదలైంది?

టీడీపీ, వైసీపీ నాయకులు ఏమంటున్నారు.. పోలీసులు ఏం చెబుతున్నారు?

నెలకిందట ఫిర్యాదు

మాజీ మంత్రి జోగి రమేష్‌ కోడలు మేఘన జూలై 24వ తేదీన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో తన భర్త రాజీవ్, అత్త, మామలు శకుంతల, జోగి రమేష్‌ సహా 11మందిపై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆ 11 మందిపై క్రైం నంబర్‌ 326/2026 కింద సెక్షన్లు 85, 318(2), 109తో పాటు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 3(5) రెడ్ విత్ నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం బీబీసీకి వెల్లడించారు.

ఎఫ్ఐఆర్‌లో ఏ–1గా జోగి రాజీవ్, ఏ–2గా మాజీ మంత్రి రమేష్, ఏ–3గా రమేష్‌ భార్య శకుంతలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉన్నాయి.

వీరిపై వరకట్న వేధింపుల కేసు, ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు సీఐ సుబ్రమణ్యం వివరించారు.

మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలోని వివరాల ప్రకారం వివాహం జరిగిన కొద్దిరోజుల నుంచే బాధితురాలికి వేధింపులు మొదలయ్యాయి.

'నిశ్చితార్థం అవ్వగానే ఒకటిన్నర కిలోల బంగారం, 10 కేజీల వెండి, ఆడపడుచు కట్నం కింద 9 లక్షలు, వరుడి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి సుమారు రూ.20 లక్షలు ఇచ్చాం. అలాగే సూర్యాపేటలో వివాహ ఏర్పాట్లు సంబంధిత ఖర్చుల కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశాం. 2025 మే 5వ తేదీన సూర్యాపేటలో నిశ్చితార్ధం జరిగింది. 28వ తేదీన సూర్యాపేటలో హిందూ సంప్రదాయం ప్రకారం జోగి రాజీవ్‌తో వివాహం జరిగింది'

'వివాహం తర్వాత నా భర్త ప్రవర్తన మారిపోయింది, నాకు దూరంగా ఉన్నారు. ఇదే విషయం అత్తమామలకు చెబితే అదనపు కట్నం, ఫార్చ్యునర్‌ కారు ఇస్తే అతని మనసు మారి దగ్గరవుతాడని చెప్పారు. తర్వాత నా భర్త వైవాహిక జీవితానికి శారీరకంగా అనర్హుడు అని తెలిసింది'

ఈ విషయమై జోగి రమేష్‌ తో పాటు ఆయన కుమారుడు రాజీవ్‌‌, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ పలుమార్లు యత్నించింది. రమేష్ మొబైల్‌ నెంబర్‌ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా మెసేజ్‌ పెట్టినా ఆయన స్పందించలేదు. ఆయన స్పందించగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.

మేఘన ఆరోపణలు, ఈ వివాదంపై ఆగస్టు 24న జోగి రమేష్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, విడాకుల కోసం దరఖాస్తు చేశారని, ఈలోగా కొంతమంది రాజకీయం చేసి ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.

తన కోడలు టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసి బయటకు వస్తున్న దృశ్యాలు ఉన్నాయని ఆయన అన్నారు.

'టీడీపీ నేతలతో పాటు వైసీపీ నాయకులనీ కలిశాం'

జోగి రమేష్‌ ప్రెస్‌మీట్‌ పెట్టిన మరుసటి రోజే అంటే ఆగస్టు 25న మేఘన విజయవాడలో మీడియా సమావేశంలో రమేష్‌ ఆరోపణలను ఖండించారు.

తాను న్యాయం కోసం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసిన మాట వాస్తవమేనని, ఇందులో రాజకీయం లేదన్నారు.

అదేవిధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సహా కొంతమంది వైసీపీ ముఖ్యనాయకులను కూడా కలిశామని, వారు జోగి రమేష్‌తో చర్చలు జరిపి న్యాయం చేయాలని సూచించినా ఆయన స్పందించలేదని ఆరోపించారు. జోగి రమేష్‌కి రాజకీయ అండ ఉంది కాబట్టే తాను న్యాయం కోసంరాజకీయ నేతలను కలిశానే తప్ప, రాజకీయ పార్టీలకు, తమకు సంబంధం లేదని మేఘన అన్నారు.

ఈ విషయమై మేఘన బీబీసీతో మాట్లాడుతూ, తాను రాజకీయాలు కోరుకోవడం లేదని రాజకీయాలకు తమ కుటుంబానికి అస్సలు సంబంధం లేదని, కేవలం బాధిత మహిళగా న్యాయం కోరుతున్నానని అన్నారు.

పరిష్కరించాలని చూశా: వసంత కృష్ణ ప్రసాద్

జోగి రమేష్‌ విపక్షానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తాను ఎక్కడా ఈ విషయంలో రాజకీయం చేయదలుచుకోలేదని, అందుకే ఈ విషయంపై ఎక్కడా తాను బహిరంగంగా మాట్లాడలేదని మైలవరం టీడీపీ శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌ బీబీసీతో అన్నారు.

ఎవరింట్లోనైనా సమస్యలు వస్తాయని, ఆ మాదిరిగానే ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని తాను చూశానని చెప్పారు.

మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఈ విషయమై బీబీసీతో మాట్లాడారు. తాను కూడా సామరస్యంగానే ఈ సమస్య పరిష్కారమవ్వాలనుకున్నానని, అంతకుమించి దానిపై తాను మాట్లాడలేనని ఆయన వ్యాఖ్యానించారు.

'పోలీసుల జాప్యం' - మేఘన తండ్రి కృష్ణ గౌడ్‌

తన కుమార్తె మేఘన ఫిర్యాదు ఇవ్వగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారని, కానీ నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేశారన్న అభిప్రాయం తమకు ఉందని మేఘన తండ్రి అనంత కృష్ణ గౌడ్‌ బీబీసీతో అన్నారు.

తాము ఇరు పార్టీల నేతల వద్దకు వెళ్లామని, టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ వద్దకు వెళితే ఆయన న్యాయంగానే మాట్లాడారని, అదేవిధంగా వైసీపీ ముఖ్యనేతలతోపాటు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా న్యాయంగానే మాట్లాడారని చెప్పారు.

'పరువు పోయినా ఫర్వాలేదు గానీ పరిహారం ఇచ్చి న్యాయం చేయకూడదనేది జోగి రమేష్‌ అభిప్రాయంలా కనిపిస్తోందని కృష్ణ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

తొందరగా న్యాయం జరిగితే ఇప్పటికే చాలా కోల్పోయిన తమ అమ్మాయికి మళ్ళీ కొత్త జీవితం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.

'చట్టపరంగానే విచారణ'- సీఐ

పోలీసులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సీఐ సుహ్రమణ్యం బీబీసీతో మాట్లాడారు.

మేఘన నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేశామని, శాఖాపరమైన విచారణ ఇంకా జరుగుతోందనని చెప్పారు.

కేసు నమోదు చేసి నెలరోజులైనప్పటికీ ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉందని అన్నారు.

ఈ లోపు నిందితులకు ఫ్యామిలీ కోర్టు నుంచి బెయిల్‌ రావడంతో ఆగస్టు 25వ తేదీ మంగళవారం సాయంత్రం నిందితులు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయారని చెప్పారు.

ఆ తర్వాత వారికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు అయిందని చెప్పారు. తాము చట్టబద్ధంగానే ఈ కేసును పరిశీలిస్తున్నామని ఎక్కడా జాప్యం చేయలేదని సీఐ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)