వేలంలో రూ. 382 కోట్లకు అమ్ముడైన ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు

    • రచయిత, ఆస్మండ్ చియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఫెరారీ సంస్థకు చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఒక వేలంలో 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 382 కోట్లు) పలికింది. దీంతో వేలంలో విక్రయమైన కొత్త కార్లలో ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది.

బ్రిటీష్ ఐఫోన్ డిజైనర్ సర్ జానీ ఇవ్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ 'ఫెరారీ లూస్' కారు, కాలిఫోర్నియాలోని ఆర్‌ఎం సోథెబీస్ నిర్వహించిన వేలంలో దాని సాధారణ ధర కంటే 35 రెట్లకు పైగా అమ్ముడైంది.

మే నెలలో ఈ కారును విడుదల చేసినప్పుడు విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్యాటరీతో నడవడం, ఐదు సీట్లు ఉండటంతో సంస్థ సంప్రదాయ డిజైన్ల నుంచి ఇది పక్కకు మళ్లిందని, బ్రాండ్ గుర్తింపును కోల్పోయిందని కొందరు విమర్శకులు వ్యాఖ్యానించారు.

ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఫెరారీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తామని సోథెబీస్ (కార్ల వేలం సంస్థ) తెలిపింది.

ప్రత్యేకమైన ఫినిషింగ్‌తో ఉన్న ఈ లూస్ కారును కొనుగోలు చేసిన వ్యక్తి పేరును సోథెబీస్ వెల్లడించలేదు. ఈ విషయంపై స్పందించాలని బీబీసీ ఆ వేలం సంస్థను, ఫెరారీని కోరింది.

పడిపోయిన ఫెరారీ షేర్లు

ఇటీవలి కాలంలో ఒక కొత్త కారుకు జరిగిన అతిపెద్ద లాంచ్‌లలో ఈ లూస్ ఆవిష్కరణ ఒకటి.

ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, చైనా కార్ల తయారీ సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్నవేళ ఫెరారీ (ప్రాన్సింగ్ హార్స్) వేసిన తొలి అడుగు ఇది.

ఈ లగ్జరీ బ్రాండ్ కొత్త వాహనాన్ని వీక్షించడానికి ఇటాలియన్ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా, పోప్ లియోలను ఆహ్వానించారు.

ఈ కారుపై వ్యక్తమైన విమర్శల నేపథ్యంలో, లూస్ విడుదలైన మరుసటి రోజే ఫెరారీ షేర్ల ధర పడిపోయింది.

ఈ కారును విమర్శించిన వారిలో ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని, ఫెరారీ మాజీ చైర్మన్ లూకా కార్డెరో డి మోంటెజెమోలో కూడా ఉన్నారు. ఈ కారు వల్ల "ఒక దిగ్గజ బ్రాండ్ నాశనమయ్యే ప్రమాదం ఉంద"ని ఆయన అన్నారు.

కొత్త ఆవిష్కరణ ప్రక్రియలో విమర్శకులు ఎప్పుడు ఉంటారని, భవిష్యత్తులో ప్రజలు లూస్‌ను తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నట్లు ఫెరారీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ ఫ్లావియో మన్జోని మే నెలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రత్యేక చక్రాలు, కస్టమైజ్డ్ బ్రేక్స్

లూస్ కార్ల అమ్మకాల లక్ష్యాన్ని కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, చైనా నుంచి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా ఈ ఏడాది అమ్మకాల లక్ష్యాన్ని ఆ కారు చేరుకుంది.

లూస్ మోడల్‌లో తయారైన తొలి కారును సొంతం చేసుకునేందుకు ఈ వేలం ఒక "సువర్ణావకాశం" అని సోథెబీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కారుకు ప్రత్యేకమైన చక్రాలు, కస్టమైజ్డ్ బ్రేక్‌లతో పాటు వైట్ ఫినిషింగ్ ఉన్నాయి.

కార్ల వేలంలో ఫెరారీ కార్లు తరచుగా అత్యధిక ధరలకు అమ్ముడవుతుంటాయి.

2025లో ఫెరారీ విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన డేటోనా ఎస్‌పీ3 సూపర్‌కారు వేలంలో 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 248 కోట్లు) పలికింది. అప్పట్లో కొత్త కారుకు వేలంలో లభించిన అత్యధిక ధరగా అది రికార్డు సృష్టించింది.

ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధర పలికిన రికార్డు 1955 నాటి మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే పేరిట ఉంది. 2022లో ఈ కారు 142 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.1,357 కోట్లు)కు అమ్ముడైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)