'ఆమెకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేకపోయింది’- త్విషా శర్మ కేసులో సీబీఐ చార్జ్‌షీట్

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

(ఈ వార్తలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేసేలా ఉండొచ్చు.)

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన త్విషా శర్మ మృతి కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త, మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్‌ పై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

"సమర్థ్ సింగ్, గిరిబాల సింగ్ నిరంతర మానసిక వేధింపుల కారణంగా త్విషకు తన ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే దారి లేకపోయింది" అని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

వీరిద్దరిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 (భర్త లేదా బంధువుల క్రూరత్వం), సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 3(5) (ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ఉద్దేశంతో నేరానికి పాల్పడటం) కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

అయితే, మొదట్లో సమర్థ్ సింగ్, గిరిబాల సింగ్‌పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80(2) కింద వరకట్న మరణం కేసును సీబీఐ నమోదు చేసింది.

"తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ అనుమతి కూడా కోరింది. దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలను బట్టి మరికొందరి పాత్రను కూడా విచారించవచ్చు. అవసరమైతే అనుబంధ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేయవచ్చు" అని త్విష ఫ్యామిలీ లాయర్ అంకుర్ పాండే బీబీసీతో చెప్పారు.

మొదటి, రెండో పోస్ట్‌మార్టం రిపోర్టులు రికార్డులో ఉంటాయని కూడా అంకుర్ పాండే తెలిపారు.

"ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్లను సీబీఐ నమోదుచేసింది. అంటే దర్యాప్తులో ఈ మరణాన్ని ఆత్మహత్యగా పరిగణించారు" అన్నారు.

(ఆత్మహత్య తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఒత్తిడికి గురవుతుంటే భారత ప్రభుత్వ 'జీవన్ ఆస్థా' హెల్ప్‌లైన్ 18002333330ను సంప్రదించవచ్చు. స్నేహితులు, బంధువులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం కూడా ముఖ్యం.)

"మొదట్లో చేసిన వరకట్న వేధింపులు, హత్య ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మాదకద్రవ్యాలు తీసుకున్న తర్వాత అబార్షన్ చేసుకున్నట్లు త్విష తెలిపిందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైద్య నిపుణులు చెప్పారు" అని గిరిబాల సింగ్ తరఫు న్యాయవాది ఇనోష్ జార్జ్ కార్లో బీబీసీతో అన్నారు.

"అలాంటి పరిస్థితుల్లో తన భార్యను ప్రశ్నించే హక్కు భర్తకు లేదా? ఆమె ఎందుకు అబార్షన్ చేసుకుందని అడిగే హక్కు లేదా? మేం మొదటి నుంచీ ఇదే చెబుతున్నాం. కానీ, మీడియా మా వాదనను ఎప్పుడూ వినలేదు" అని కార్లో తెలిపారు.

మే 2026లో అరెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో గిరిబాల సింగ్ మాట్లాడుతూ, త్విషకు కొన్ని మానసిక, వైద్యపరమైన సమస్యలు ఉన్నాయని వాదించారు. కాగా, ఈ కేసుపై సమర్థ్ సింగ్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

అయితే వరకట్న వేధింపుల కోణంలో తదుపరి దర్యాప్తును కొనసాగించాలని సీబీఐ కోరినట్లు అంకుర్ పాండే తెలిపారు.

సీబీఐ చార్జ్‌షీట్‌లో ఇంకేముంది?

సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం, 2025 ఫిబ్రవరిలో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా త్విషా శర్మ, సమర్థ్ సింగ్ కలుసుకున్నారు. 2025 మార్చిలో తాను సమర్థ్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు త్విష తన కుటుంబానికి చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2025 డిసెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి ఖర్చంతా త్విష కుటుంబమే భరించింది.

పెళ్లి తర్వాత సమర్థ్ సింగ్ పలుమార్లు త్విషను మానసికంగా వేధించాడని సీబీఐ పేర్కొంది. త్విషను సమర్థ్ పదే పదే అవమానకరమైన పదాలతో దూషించినట్లు కూడా చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు.

"త్విషను మానసికంగా వేధించేలా గిరిబాల సింగ్ ఎప్పటికప్పుడు తన కొడుకును ప్రోత్సహించేవారు" అని సీబీఐ తెలిపింది.

చార్జ్‌షీట్ ప్రకారం, సమర్థ్ మానసిక వేధింపుల గురించి గిరిబాల సింగ్‌కు త్విష ఫిర్యాదు చేసిన ప్రతిసారీ, ఆమె తన కొడుకు పక్షానే మాట్లాడేవారు. నిందితులిద్దరూ త్విషపై మానసిక ఒత్తిడి తెచ్చారు.

త్విష తండ్రికి 2026 మార్చిలో గుండెపోటు వచ్చింది. తండ్రి చికిత్స, శస్త్రచికిత్స సమయంలో త్విష ఆయన వద్దే ఉన్నారు. ఆ సమయంలో భోపాల్‌కు తిరిగి రావాలని నిందితులిద్దరూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 2026 మార్చి 24న భోపాల్‌కు తిరిగి వచ్చారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఏం జరిగింది?

సీబీఐ దర్యాప్తు ప్రకారం, 2026 ఏప్రిల్ 16న అత్తింట్లో త్విష ప్రెగ్నెన్సీ కిట్‌తో పరీక్షించుకోగా ఆమె గర్భవతి అని తేలింది. మరుసటి రోజు ఆమె సమర్థ్ సింగ్‌తో కలిసి భోపాల్‌లోని హజేలా ఆసుపత్రికి వెళ్లగా, గర్భ నిర్ధరణ జరిగింది.

చార్జ్‌షీట్ ప్రకారం, గర్భాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి త్విష కొంత సమయం అడిగారు. ఈ గర్భధారణ ప్రణాళిక ప్రకారం జరగలేదని, సమర్థ్ సింగ్ మానసిక వేధింపులు, అవమానకర ప్రవర్తన కారణంగా దీనిపై ఆలోచించుకోవడానికి సమయం కావాలని త్విష కుటుంబీకులకు చెప్పారు.

త్విష గర్భం దాల్చిన విషయాన్ని సమర్థ్ సింగ్ తన తల్లికి చెప్పారు. ఏప్రిల్ 17న ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, త్విషను సమర్థ్ తీవ్ర పదజాలంతో దూషించారు. మానసిక వేధింపులు, అవమానకర ప్రవర్తన కారణంగా త్విష ఆరోగ్యం కూడా క్షీణించడంతో అదేరోజు ఆమె అత్తింటి నుంచి వెళ్లిపోయారు.

ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు రాజస్థాన్‌లోని నసీరాబాద్‌లో ఉన్నారు. సమర్థ్‌తో గొడవపడి ఇల్లు వదిలేసి వచ్చిన విషయాన్ని త్విష ఫోన్ చేసి తన తల్లికి చెప్పారు.

త్విష 20 లక్షల పెట్టుబడిపై గొడవ

చార్జ్‌షీట్‌లో త్విష డీమ్యాట్ ఖాతా ప్రస్తావన కూడా ఉంది.

చార్జ్‌షీట్‌ ప్రకారం, త్విష షేర్ మార్కెట్‌లో సుమారు రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడి గురించి తెలిసిన తర్వాత ఆ మొత్తాన్ని సమర్థ్ సింగ్‌తో ఉన్న జాయింట్ అకౌంట్‌కు బదిలీ చేయాలని నిందితులు ఇద్దరూ ఒత్తిడి తెచ్చారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగ్ముగాలియా బ్రాంచ్‌లో 2026 ఏప్రిల్ 7న ఈ జాయింట్ అకౌంట్ తెరిచారు. ఆ డబ్బును చైనా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు బదిలీ చేయాలని నిందితులు భావించారు.

అయితే, ఆ డబ్బు తన తండ్రిదని చెబుతూ బదిలీ చేసేందుకు త్విష నిరాకరించారు. ఆ తర్వాత కూడా ఆమె మానసిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

త్విష ఉద్యోగం పోయిన తర్వాత సమర్థ్ సింగ్ ఆమెను ఎగతాళి చేసేవారని, ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యాలపై విమర్శలు చేసేవారని కూడా అందులో పేర్కొన్నారు.

మరణానికి ముందు ఘటనలపై సీబీఐ ఏమంది?

చార్జ్‌షీట్‌లో 2026 మే 12న, అంటే త్విష మరణించిన రోజు రాత్రి, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో చేసిన సంభాషణల ప్రస్తావన కూడా ఉంది.

చార్జ్‌షీట్‌ ప్రకారం, రాత్రి సుమారు 7:51 గంటలకు త్విష తన వదిన రాశీ అబ్రోల్‌కు ఫోన్ చేసి, తాను తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పెట్టుబడి డబ్బును బదిలీ చేయాలని సమర్థ్ సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కూడా ఆమె తెలిపారు. రాత్రి సుమారు 9:20 గంటలకు త్విష మళ్లీ రాశీ అబ్రోల్‌తో మాట్లాడారు.

త్విష ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు. నడుము నొప్పిగా ఉండటంతో, బెడ్‌రూమ్‌లో పడుకునేలా అనుమతించాలని ఆమె సమర్థ్ సింగ్‌ను కోరారు. ఆ తర్వాత సమర్థ్ సింగ్ దూకుడుగా, హింసాత్మకంగా ప్రవర్తించారు.

రాత్రి సుమారు 9:36 గంటలకు త్విష రాశీ అబ్రోల్‌కు ఒక మెసేజ్ పంపారు. ఆ మెసేజ్‌ను చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. అందులో "రేపు తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లమని అతనికి (సమర్థ్ సింగ్) చెప్పండి. కానీ, ఇప్పుడు నన్ను ప్రశాంతంగా చావనివ్వండి" అని ఉంది.

సీబీఐ ప్రకారం, సీసీటీవీ ఫుటేజీలో రాత్రి సుమారు 9:40 గంటలకు త్విష గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒంటరిగా టెర్రస్ వైపు వెళ్లడం కనిపిస్తుంది.

చార్జ్‌షీట్ ప్రకారం, రాత్రి సుమారు 9:41 గంటలకు త్విష తన తండ్రికి వాట్సాప్ కాల్ చేశారు. ఆమె ఏడుస్తూ.. సమర్థ్ సింగ్ అత్యంత దూకుడుగా, హింసాత్మకంగా మారాడని తండ్రితో చెప్పారు. తనకు భయంగా ఉందని పేర్కొంటూ, వెంటనే రావాలని కుటుంబ సభ్యులను కోరారు.

రాత్రి సుమారు 10:05 గంటలకు త్విష తన తల్లికి ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆమె ఏడవడం తల్లి గమనించారు. సమర్థ్ సింగ్ హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడని తల్లికి కూడా ఆమె చెప్పారు.

మరణంపై సీబీఐ నిర్ధరణ

నిందితులు ఇద్దరూ నిరంతరం చేసిన మానసిక వేధింపుల కారణంగా త్విషకు ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే దారి లేకపోయిందని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

సీబీఐ ప్రకారం, 2026 మే 12న త్విష ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్విష డైరీ, ఘటన జరిగిన రోజు నాటి సీసీటీవీ ఫుటేజీ, ఇతర సంబంధిత ఆధారాలతో ఫోరెన్సిక్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్, ప్రవర్తనా విశ్లేషణ కూడా సీబీఐ నిర్వహించింది.

త్విష మానసిక వేధింపులు ఎదుర్కోవడం, నిరాశ, నిరంతర మానసిక క్షోభ, అత్తింట్లో మద్దతు కరువవడం లాంటి అంశాలు ఇందులో వెలుగుచూశాయి. డేటాను వెలికితీసేందుకు త్విష ఐఫోన్‌ను న్యూదిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సీబీఐ పంపింది.

చార్జ్‌షీట్ ప్రకారం, నిందితులకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు, ఇతర నిందితుల పాత్ర, లేదా కొత్త సాక్షులకు సంబంధించిన సమాచారం ఈ ఫోన్ ద్వారా లభించే అవకాశం ఉంది. దీని రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. నిందితుల ఇంట్లోని డీవీఆర్ నుంచి సేకరించిన డేటాను కూడా ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. రికార్డుల్లో ఏమైనా మార్పులు జరిగాయా అని తెలుసుకునేందుకు ఈ దర్యాప్తు చేస్తున్నారు. దీని రిపోర్టు కూడా రావాల్సి ఉంది.

దర్యాప్తులో గిరిబాల సింగ్, సమర్థ్ సింగ్‌లపై బీఎన్ఎస్ సెక్షన్ 85, 108, 3(5) కింద శిక్షార్హమైన నేరాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా రుజువైందని చార్జ్‌షీట్ ముగింపులో సీబీఐ పేర్కొంది. అలాగే, వరకట్న డిమాండ్ తదితర అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి కోరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)