You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లైన్మేన్ జ్యోతి: ‘కరెంట్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్.. ఎక్కడ సమస్య వచ్చినా బాగుచేసి ఊరిలో వెలుగు నింపుతారు’
- రచయిత, ఆశయ్ యెడ్గే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఒక చిన్న గ్రామం ధామన్గావ్. ఈ గ్రామంలో చాలామందికి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ ఒక గుడి, ఒక కూడలి, ఒక హోటల్, ఒక విద్యుత్ సంస్థ (మహావితరణ్ - మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కార్యాలయం ఉన్నాయి.
ఏ పల్లెటూరిలోనైనా కనిపించే సాధారణ దృశ్యమే అయినా, బైక్పై తిరుగుతూ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేసే ఈ ఊరి అమ్మాయిని చూసి చాలామంది గర్వపడుతుంటారు. ఆమె పేరు జ్యోతి అహేర్.
గత నాలుగేళ్లుగా మహావితరణ్లో పనిచేస్తున్న జ్యోతి.. బుల్దానా జిల్లా ధామన్గావ్లో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంటారు.
మీడియా, సోషల్ మీడియా ఆమెను 'మహిళా లైన్మేన్'గా సంబోధిస్తుంటాయి. కానీ, గ్రామస్థులకు మాత్రం ఆమె తమ ఇంటి బిడ్డలాంటి వ్యక్తి.
నడుముకు ప్లయ్యర్, కరెంటు స్తంభాలు ఎక్కేందుకు బూట్లు, భుజానికి సేఫ్టీ బెల్ట్, చేతిలో పనిముట్లు.. జ్యోతి వేషధారణ గ్రామస్థులకు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది.
ఊరి కూడలిలో ఓ వృద్ధుడు ఆమెను చూసి, ఆపి "నిన్న చేశావు కదా?" అని అంటే, "అవును, నిన్ననే చేశాను. పన్నెండు, ఒంటి గంట ప్రాంతంలో" అని బదులిచ్చి, మరో సమస్యను పరిష్కరించడానికి జ్యోతి అహేర్ ముందుకు కదిలారు.
ఇదేమీ పెద్ద సంఘటన కాదు. కానీ, ధామన్గావ్లో జ్యోతికి ఉన్న గుర్తింపు ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ చిన్న సన్నివేశం చాలు. గ్రామంలో కరెంట్ పోయినా, సరఫరాలో ఏదైనా లోపం తలెత్తినా, కరెంటు లైన్ తెగిపోయినా.. ఊరివాళ్లు మొదట ఫోన్ చేసేది ఆమెకే.
'మగవారిదిగా భావించే పని'
విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని ఫీల్డ్ వర్క్ను దశాబ్దాలుగా మగవారి రంగంగానే భావిస్తూ వచ్చారు. కరెంటు స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు మార్చడం, తెగిపోయిన లైన్లు బాగుచేయడం, వర్షంలో, తుపానులో బయటకు వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం లాంటి పనులు చేసే మహిళలు ఎక్కువగా కనిపించేవారు కాదు.
మహావితరణ్ 2013లో లైన్స్టాఫ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ సమయంలో సుమారు 2,200 మంది మహిళలు 'విద్యుత్ సహాయక్'గా విధుల్లో చేరారు. 2013లో ప్రచురితమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, విడతలవారీగా జరిగే నియామకాల కోసం 2,206 మంది మహిళలు ఎంపికయ్యారు.
2024లో ప్రచురితమైన హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, మహావితరణ్లో దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉంటే, వారిలో దాదాపు 10 వేల మంది మహిళలు.
జ్యోతి ఆ మార్పులో ఒక భాగం. కానీ, జ్యోతితో మాట్లాడుతున్నప్పుడు తాను ఏదో విభిన్నమైన పని చేస్తున్నాననే భావన ఆమెలో ఏమాత్రం కనిపించదు.
'పనికి సమయమంటూ ఉండదు'
"కరెంటు పోగానే వెంటనే ఫోన్లు వస్తాయి. మాకు కచ్చితమైన డ్యూటీ సమయం ఉండదు. ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ వచ్చినా వెళ్లాల్సిందే. అర్ధరాత్రి అయినా సరే వెళ్లాల్సిందే" అని జ్యోతి అన్నారు.
ధామన్గావ్ సెక్షన్లో పనిచేస్తున్న జ్యోతితో ఒక రోజు పాటు సాగినప్పుడు ఆమె అన్న మాటల్లోని అర్థం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
మొదటి కంప్లయింట్ ఊరిబయట ఉన్న ఒక పొలం నుంచి వచ్చింది. మేం బైక్ మీద అక్కడి దాకా వెళ్లాం. ఆ తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడిచి ఒక ఇనుప స్తంభం దగ్గరకు చేరుకున్నాం. ఆ స్తంభంపై ఒక పాత డీపీ ఉంది.
స్తంభం ఎక్కడానికి ముందే జ్యోతి మొదట కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆ లైన్ విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆమె సూచించారు. విద్యుత్ నిలిపివేశారని నిర్ధరించుకున్న తర్వాతే ఆమె సేఫ్టీ బెల్ట్ కట్టుకుని, గ్లౌజులు వేసుకుని స్తంభం ఎక్కడం మొదలుపెట్టారు.
స్తంభం ఎక్కడం అనేది ఈ పనిలో ఒక భాగం మాత్రమే. పని పూర్తయిన తర్వాత ఆమె కిందకు దిగారు. సురక్షితమైన దూరానికి వెళ్లాక మళ్లీ కార్యాలయానికి ఫోన్ చేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించమని చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాంతంలో మళ్లీ కరెంటు వచ్చింది.
ఆ లైన్లో కరెంటు నిలిచిందని నిర్ధరించుకోవడం దగ్గరి నుంచి పని పూర్తయ్యాక తిరిగి విద్యుత్ సరఫరా ప్రారంభించే వరకు అడుగడుగునా ఆమె అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.
'మొదటిసారి స్తంభం ఎక్కుతున్నప్పుడు...'
నేడు ఇనుప స్తంభాన్ని అలవోకగా ఎక్కేస్తున్న జ్యోతి, అప్రెంటిస్షిప్ సమయంలో మాత్రం చాలా భయపడ్డారు. శిక్షణ జరుగుతున్నప్పుడు ప్రాక్టీస్ కోసం ఒక స్తంభాన్ని ఎక్కాలని ఆమెకు చెప్పారు.
"మేడమ్, నేనెలా ఎక్కగలను? అని అడిగా, దానికి శిక్షకురాలు 'ఎక్కు... పడిపోతే ఆస్పత్రికి నేనే తీసుకెళ్తాలే' అన్నారు" అని గుర్తుచేసుకున్నారు జ్యోతి.
జ్యోతి ఎలాగోలా ఆ స్తంభం ఎక్కేశారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు.
"ఇప్పుడు నేను ఇనుప స్తంభాన్ని చాలా సులభంగా ఎక్కేస్తాను" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
జ్యోతి నడుముకు ఎప్పుడూ ఒక ప్లయ్యర్ వేలాడుతూనే ఉంటుంది.
"ఇది నాకు ప్రాణంతో సమానం. దీన్ని వదిలేసి నేను ఎక్కడికీ వెళ్లలేను" అన్నారామె.
సేఫ్టీ బెల్ట్, గ్లౌజులు, బూట్లు, ఎర్తింగ్ రాడ్, ప్లయ్యర్.. ఇలా ప్రతి వస్తువు ఆమెకు ఎంతో ముఖ్యం.
జ్యోతి తనను తాను ఎప్పుడూ ఒక 'సాహసి'గా చెప్పుకోరు. కానీ, జ్యోతి పని చూస్తే, ఆ సాహసం ఆమె రోజువారీ విధుల్లో ఒక భాగమని అర్థమవుతుంది. తనకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన గురించి జ్యోతి పంచుకున్నారు.
ఒకరోజు సాయంత్రం ఊరంతా కరెంటు పోయింది. డీపీ ఫ్యూజ్ కొట్టేసింది. జ్యోతికి వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆమెకు తోడుగా ఇతర సిబ్బంది లేరు.
"అప్పుడు ధైర్యం చేశాను. ఊరిలోని కొందరు మిత్రులు సాయానికి వచ్చారు. ఫ్యూజ్ వేసే ప్రయత్నంలో ఉండగానే డీపీలో ఒక్కసారిగా పెద్ద స్పార్క్ వచ్చింది. అక్కడున్న వారంతా భయపడిపోయారు. నా ఒళ్లు జలదరించింది" అని జ్యోతి అన్నారు.
ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఆమె విధుల్లో సర్వసాధారణం. మొదట్లో భయపడిన జ్యోతి.. ఇప్పుడు పనిలో బాగా ఆరితేరిపోయారు.
'యూనిఫాం వేసుకోవాలనే కల'
జ్యోతికి ఈ ఉద్యోగం కేవలం ఉపాధికి సంబంధించినదే కాదు. చిన్నతనంలో మిగతా పిల్లల్లాగే ఆమెకు కూడా యూనిఫాం వేసుకోవాలనే కల ఉండేది.
"పోలీసు అవ్వాలనుకున్నాను, లేదా ఆర్మీకి వెళ్లాలనుకున్నాను" అని అన్నారామె.
అయితే, ఆ ఉద్యోగాలకు జ్యోతి ఎత్తు సరిపోలేదు. ఆ కల అసంపూర్ణంగానే మిగిలిపోయింది. కానీ, యూనిఫాం ధరించాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.
మహావితరణ్ నియామకాల జాబితాలో తన పేరు వచ్చిన ఆ రోజు ఆమెకు ఇప్పటికీ గుర్తుంది. "చాలా సంతోషం వేసింది" అని జ్యోతి అన్నారు.
ఆ రోజు జ్యోతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఐదారు కిలోల మిఠాయిలు పంచారు.
జ్యోతి తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నారు. నలుగురు పిల్లలను చదివించారాయన. చదువులో తాను ఫర్వాలేదనిపించినా, ఆటల్లో మాత్రం ముందుండేదాన్ని అని జ్యోతి చెప్పారు. తన కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి ఆమెనే.
జ్యోతి పనిచేస్తున్న ఆఫీసులోనే జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుమిత్ ఖబుతరే, ఆమె గురించి గర్వంగా మాట్లాడారు.
సుమిత్ ఖబుతరే అభిప్రాయం ప్రకారం, ఫీల్డ్ వర్క్ అనేది మహిళలకు శారీరకంగా, మానసికంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. కానీ, జ్యోతి దానిని స్వీకరించారు.
"ఆమె పనితీరు మహిళల పట్ల మాకున్న దృక్పథాన్ని మార్చుకునేలా చేసింది" అని సుమిత్ చెప్పారు.
ధామన్గావ్లో జ్యోతితో కలిసి తిరుగుతున్నప్పుడు ఈ మాటలు నిజమే అనిపిస్తాయి. ఊరిలోని మహిళలు ఆమె వైపు గర్వంగా చూస్తుంటారు. ఇక చాలామందికి ఆమె ఎంతగా పరిచయమయ్యారంటే.. ఆమె కరెంటు స్తంభం ఎక్కడం కూడా ఒక రోజువారీ దృశ్యంగా మారిపోయింది.
నేను జ్యోతితో "మిమ్మల్ని లైన్మేన్ అనడం ఇష్టమా, లైన్ఉమన్ అనడం ఇష్టమా?" అంటే.. ఆమె కాసేపు ఆగి.. "జనాలైతే నన్ను పేరుతోనే పిలుస్తారు... జ్యోతి అంటారు" అని బదులిచ్చారు.
ఆ తర్వాత, "లైన్మేన్ అన్నా.. లైన్ఉమన్ అన్నా.. చేసే పని ఒక్కటే కదా.." అన్నారామె.
రోజంతా ఆమెతో గడిపిన తర్వాత నాకు బాగా గుర్తుండిపోయిన దృశ్యం.. పొలంలో నడుచుకుంటూ వెళ్తున్న జ్యోతి. ఒక చేతిలో ఎర్తింగ్ రాడ్, నడుముకు ప్లయ్యర్, భుజాలపై బాధ్యత మోస్తూ వెళ్తున్న ఆమె రూపం.
సన్నటి శరీరంతో ఉండే ఈ యువతి.. నడిచేటప్పుడు మాత్రం ఒక అనుభవజ్ఞురాలైన ఉద్యోగికి ఉండే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంటారు. చేసిన పనికి గుర్తింపు దక్కకపోయినా ఆమె పెద్దగా బాధపడరు.
"ప్రజల సమస్యలు తీరుతున్నాయి. మాకు అదే పెద్ద సంతృప్తి. మేం చేయడం వల్లే వాళ్ల పని పూర్తయింది.. అంతే చాలు" అని జ్యోతి అన్నారు.
బహుశా అందుకే ధామన్గావ్లో కరెంటు పోతే ప్రజలు మహావితరణ్కు కాకుండా, నేరుగా జ్యోతికే ఫోన్ చేస్తుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)