You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్లోని భారతీయుడి ఇంటి కథ
- రచయిత, ఆరిఫ్ సమీమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లండన్
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
భారత్, పాకిస్తాన్ విభజనకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సుమారు రెండు దశాబ్దాల కిందట నేను బీబీసీ వరల్డ్ సర్వీస్ కోసం ఒక డాక్యుమెంటరీని రూపొందించాను. దాని పేరు 'లెటర్స్ ఫ్రమ్ పార్టిషన్'.
దీన్ని రూపొందించి 19 ఏళ్లు గడిచాయి. ఆ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ, 1947 తరం వారిలో విభజన బాధ, వేదన తగ్గిందా?
ఇటీవల, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించిన 'మై వాపస్ ఆవూంగా' చిత్రం ఈ ఉపఖండం విభజన వల్ల కలిగిన బాధను, వియోగపు దుఃఖాన్ని, మాతృభూమిపై ప్రేమను కథాంశంగా మలచింది.
అయితే, 1947 నాటి రక్తసిక్తమైన విభజనను గుర్తుంచుకునే చివరి తరం ఇదేనా? అది నిజం కావచ్చు.
కానీ, నా అనుభవం భిన్నమైనది, నేను దానిని అలాగే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను.
ఈ కథను చెప్పడానికి, మనం కాస్త వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. కోట్ల మంది ప్రాణాలు బలిగొన్న విభజన కాలానికి వెళ్లాలి.
మనం లాహోర్కు వెళ్దాం. అక్కడ అమృత్సర్ నుంచి వలస వచ్చిన మా అమ్మ మేనమామ చౌధరి మహమ్మద్ లతీఫ్కు అంటే నా తల్లి తరఫున తాతయ్య వరసయ్యే వ్యక్తికి, నగరంలోని మధ్యతరగతి ప్రాంతమైన కృష్ణానగర్లో ఒక ఇల్లును కేటాయించారు. ఆ ఇంటి చిరునామా '32 పాండూ స్ట్రీట్'.
ఆయన అక్కడ నివసించడం మొదలుపెట్టి కొన్ని రోజులే అయింది. అంతలోనే ఆయన అడ్రస్కు ఒక ఉత్తరం వచ్చింది. పంపినవారు కవరు మీద చిరునామా రాశారు.
టూ ది ఆక్యుపెంట్
హౌస్ నెంబర్. 32 పాండూ స్ట్రీట్
కృష్ణ నగర్, లాహోర్
విభజన సమయంలో ఈ ఇంట్లో నివసించిన హర్ కిషన్ దాస్ బేదీ ఈ ఉత్తరాన్ని రాశారు. అప్పటికి కొన్నేళ్ల కిందటే బేదీ సాహిబ్ ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నారు.
ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుత యజమాని తమ వస్తువులను తిరిగి ఇస్తేనే తాము తిరిగి వెళ్లగలమని వారు తెలుసుకున్నారు.
ఈ ప్రయత్నంలో భాగంగా హర్ కిషన్ దాస్ బేదీ లాహోర్కు వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు చౌధరి లతీఫ్ ఇంట్లో లేకపోవడంతో, తన వస్తువులు వేటినీ తనతో తీసుకెళ్లలేకపోయారు హర్ కిషన్ దాస్.
ఆయన తిరిగొచ్చి ఈ తొలి ఉత్తరం రాశారు. అది ఇలా ఉంది.
'సమస్య తీరిపోయి లాహోర్లోనే ఉండిపోతామని అనుకున్నాను'
తస్లీమ్,
ఒక మనిషిగా నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. ఒక హిందువు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాడని మీరు భావించరని ఆశిస్తున్నాను. మనం మొదట మనుషులం. ఆ తర్వాతనే హిందూ, ముస్లింలం.
మీరు కూడా నా ఉత్తరానికి ఒక మనిషిగా స్పందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.
నేను సెప్టెంబర్ 17న కృష్ణానగర్లోని 32 పాండూ వీధిలో ఉన్న నా ఇంటిని చూడటానికి వెళ్లాను.
అక్కడికి వెళ్లాక, నా ఇంటిని వేరొకరికి ఇచ్చారని తెలిసింది. అందువల్ల నేను ఇంట్లోంచి నా సామాన్లేవీ తీసుకోలేకపోయాను.
పిల్లల దుస్తులున్న ఒక చిన్న బాక్సును నాతో పాటు తీసుకువెళ్లాలనుకున్నాను. కానీ అక్కడున్న సైనికుడు అవి కూడా నాతో తీసుకెళ్లనివ్వలేదు. సరేలే, అది వదిలేయండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.
నేను సనాతన ధర్మ హైస్కూల్లో ఇంగ్లిష్, మ్యాథ్స్ టీచర్గా ఉండేవాడిని. నా విద్యార్థులలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉండేవారు, వారి మధ్య ఎలాంటి భేదాన్నీ నేను చూడలేదు. మీరు చౌధరి సిరాజ్ దిన్ను అడగవచ్చు. దీనానాథ్, నేను ఆయన ఇంటిని అన్ని విధాలా కాపాడాం.
ఆయన కృష్ణానగర్లో ఉండలేదు. కానీ, మేం ఆయన ఇంటికి ఎలాంటి డ్యామేజ్ కానివ్వలేదు.
స్కూల్ క్లోజైంది. లాహోర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. నేను నా పిల్లలతో కలిసి సెలవులకు వెళ్లాను. నా సామానంతా ఇంట్లోనే ఉంది.
ఈ గందరగోళ పరిస్థితి అంతా ముగుస్తుందని అనుకున్నాను. పాకిస్తాన్ ఉన్నా లేకపోయినా మేం లాహోర్లోనే ఉంటామని అనుకున్నాను.
కానీ, పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. సమయానికి నేను లాహోర్ రాలేకపోయాను. నా సామానంతా పోయింది.
నేను నా ఇంటికి వెళ్లినప్పుడు నా పుస్తకాలు, ఫర్నీచర్, కొన్ని నా వస్తువులు అక్కడ ఉన్నాయి. కానీ, వాటిని నాతో తీసుకెళ్లలేకపోయాను. ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
నా ఇనుప పెట్టెలో బ్యాంకు పాస్బుక్, పోస్టాఫీసు పాస్బుక్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, కొన్ని రాయల్టీ పత్రాలు, పుస్తక ఒప్పందాలు వంటి చాలా ముఖ్యమైన పత్రాలు కొన్ని ఉన్నాయి.
నా పెట్టెలో కనుక ఈ వస్తువులు దొరికితే, దయచేసి రిజిస్టర్ పోస్టులో వాటిని నాకు పంపించండి. ఇనుప పెట్టె తాళాలు ఒక గాజు క్యాబిన్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న నేను వచ్చినప్పుడు ఆ ఇనుప పెట్టె తెరిచి ఉండటాన్ని చూశాను.
పోస్టాఫీస్ పాస్బుక్, రాయల్టీ పత్రాలు, పుస్తక ఒప్పందాలను నా అడ్రస్కు పోస్ట్లో పంపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
దయచేసి దాంతో పాటు ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా పంపండి. ఆ పెట్టెలో నా ఇంటి రిజిస్ట్రీ, మరో రెండు రిజిస్ట్రీలు ఉన్నాయి. ఇవి నాకు చాలా ముఖ్యమైన పత్రాలు.
దయచేసి ఇవన్నీ మీరు నాకు పంపుతారని ఆశిస్తున్నా. ఈ పత్రాలు నాకు ఎంత విలువైనవో మీరే అర్థం చేసుకోవచ్చు.
నాకు ఇల్లు లేదు, డబ్బు లేదు, ఉద్యోగం కూడా పోయింది, నేనేమీ చేసుకోలేకపోతున్నాను. నా మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలో నాకు తెలియడం లేదు.
మీ ఈ సాయం నా ఇబ్బందులను కొంత మేరకు తగ్గించగలదు. మీకు ఇవి కేవలం పేపర్లు కావచ్చు. కానీ, ఇవే నాకు జీవితం. ఈ మానవ సంబంధం, సోదరభావం పేరిట, నేను మీ సాయాన్ని కోరుతున్నా.
నా లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు వాటిని ఒక సంచిలో పెట్టి భద్రపర్చవచ్చు.
పరిస్థితి చక్కబడగానే నేను వచ్చి వాటిని తీసుకువెళ్తాను. మీకు అవసరం లేని వస్తువులను కూడా ఒక సంచిలో పెట్టండి. మీరు పాత్రలు, ఫర్నిచర్ వాడుకోవచ్చు.
హోషియార్పూర్ లేదా జలంధర్లో ఏదైనా పని చేయించుకోవాలన్నా లేదా ఏదైనా ఆర్డర్ కావాలన్నా, నాకు ఉత్తరం రాయండి. నేను ఆ పనిని మీ కోసం సంతోషంగా చేసిపెడతాను.
పరిస్థితి మెరుగుపడాలని.. హిందువులు, ముస్లింలు భారత్లోనూ, పాకిస్తాన్లోనూ శాంతితో, సామరస్యంతో జీవించగలగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
మీ శ్రేయోభిలాషి
హర్కిషన్ దాస్ బేదీ, బీఏ, బీటీ.
పంజాబ్ బుక్స్టోర్, మై హీరా గేట్, జలంధర్ నగరం
జలంధర్ బుక్ డిపో, మై హీరా గేట్, జలంధర్
ఈ ఉత్తరానికి స్పందిస్తూ.. చౌధరి లతీఫ్ తిరిగి ఆయనకు ఉత్తరం రాశారు.
ఈ లేఖను వెతుకుతూ నేను భారత్లోని అమృత్సర్, జలంధర్, దిల్లీ వెళ్లాను. కానీ,నేను చౌధరి లతీఫ్ నుంచి వచ్చిన ఏ ఉత్తరాన్ని కనుగొనలేకపోయాను. ఆయన వారసుల్లో ఎవరినీ నేను కనుగొనలేకపోయాను.
నావద్ద ఒకే ఒక ఆధారం ఉండేది.. జలంధర్ బుక్ డిపో, మై హీరా గేట్, జలంధర్.
నాకు వేరే ఏమీ తెలియదు.
అదృష్టవశాత్తు, ఆ షాపు దొరికింది. హర్ కిషన్ దాస్ బేదీ మరణించారని కూడా తెలిసింది. కానీ, చౌధరి లతీఫ్ ఉత్తరాల జాడ మాత్రం దొరకలేదు.
దీనికి కారణం మీకు తర్వాత తెలుస్తుంది. కానీ, చౌధరి లతీఫ్ లేఖలకు కచ్చితంగా సమాధానాలు వచ్చాయి.
హర్కిషన్ దాస్ బేదీ రాసిన మరో లేఖను చదవండి..
జలంధర్ సిటీ
9-1-1948
శ్రీ మహమ్మద్ లతీఫ్,
శుభాకాంక్షలు,
మీ ఆహ్వానం నాకు అందింది. రెండు నుంచి మూడుసార్లు మీ లేఖను చదివాను. దీన్ని చదివిన తర్వాత.. ఒక నిజమైన స్నేహితుని నుంచి ఈ లెటర్ వచ్చిందని నాకు అర్థమైంది.
మీ ఉత్తరాన్ని నా పలువురు స్నేహితులకు చదివి వినిపించాను. మీ ఉత్తరంలో వ్యక్తం చేసిన భావాలు హిందూ, ముస్లింలందరూ పంచుకుని ఉంటే ఈ రక్తపాతం జరిగి ఉండేది కాదు.
భారత్, పాకిస్తాన్లలో నివసిస్తున్న మనం, మన దేశాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చి ఉండేవాళ్లం. కానీ దేవుడు అలా ఉద్దేశించలేదు.
హిందువులు, ముస్లింలు తమ స్వదేశీయులకు చేసిన దారుణాలను తలచుకుంటే నా ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.
ఈ సంఘటనలు జరగకముందే నేను కళ్లు మూసుంటే బాగుండేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు భవిష్యత్ తరాలకు వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు.
అయితే, జరిగిన దానికి గౌరవనీయుమైన హిందువులు, ముస్లింలు బాధ్యులం కాదు.
హిందువుల, ముస్లింల కళ్లు కప్పేసిన ఒక ఉన్మాదం కారణం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఇదంతా మతం, విశ్వాసం పేరుతో జరిగింది.
ఏ మతమూ ఇంతటి రక్తపాతాన్ని అనుమతించదు. బహుశా ప్రకృతి మనల్ని పరీక్షించి ఉండవచ్చు. కానీ, మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే ప్రపంచానికి మన ముఖాలు చూపించలేం.
ఏమైనా, భారత్, పాకిస్తాన్ మధ్య శాంతిభద్రతలు నెలకొనాలని, మునుపటిలాగే మళ్ళీ స్వేచ్ఛగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించగలగాలని నేను ప్రార్థిస్తున్నాను.
జరిగినదంతా అధికార రాజకీయాల ఫలితమే..
మీ అభిప్రాయాలను, ఆలోచనలను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. బహుశా భవిష్యత్తులో మనం నిజమైన స్నేహితుల్లా ఒకరికొకరు అండగా నిలబడగలం.
మీ సానుభూతికి, కరుణకు చాలా కృతజ్ఞుడను. ఒక మంచి వ్యక్తి అయిన మీరు, సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారని ఆశించాను.
మీలాంటి గొప్ప వ్యక్తి ఈ పరిస్థితుల్లో చిక్కుకుని, ఈస్ట్ పంజాబ్లో ఉద్యోగం ఉన్నా, పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నా.
కానీ, మన సోదరులు ఈస్ట్ పంజాబ్లో ముస్లింలు, వెస్ట్ పంజాబ్లో హిందూ-సిక్కులు జీవించడం అసాధ్యమయ్యే పరిస్థితిని సృష్టించారు.
అదృష్టవశాత్తు, మీరు, మీ కుటుంబం లాహోర్కు క్షేమంగా చేరుకున్నారు. కానీ, ఆస్తి నష్టం కచ్చితంగా విచారకరం.
ఆస్తుల విషయమై రెండు దేశాలు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాయని, బహుశా మనం ఆస్తులను బదిలీ చేసుకోవచ్చని ఆశిస్తున్నాం. దీనివల్ల మన సమస్యలు కొన్ని తగ్గుతాయి.
ప్రస్తుతానికి, విధిని నిందించడం తప్ప మరో మార్గం లేదు.
నేను ఇప్పుడు జలంధర్లో ఒక స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాను. నా పిల్లలు హోషియార్పూర్లోని ఒక గ్రామంలో ఉన్నారు.
నాకు సొంత ఇల్లు లేదు, ఉద్యోగం కూడా లేదు, నేను చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నాను.
ప్రైవేట్ స్కూళ్లో పనిచేసే వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. నా పిల్లలను ఎలా పోషించుకోవాలోనని నాకు చాలా ఆందోళనగా ఉంది.
ఈ పుస్తకాలు నా జీవితాంతం ఒక నిధి లాంటివి. అవి సెప్టెంబర్లోగా ఈ ఇంటికి రాగానే నేను వాటిని చూశాను.
మీరు ఈ పుస్తకాలను కాపాడుతారని నాకు నమ్మకం ఉంది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే నేను వాటిని తిరిగి తీసుకుంటాను. నా ఇంట్లోనే ఉండి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుత పరిస్థితులలో నేను ఇంకా దేని గురించి రాయగలను?
నాకు సొంత ఇల్లు లేనందున చాలా ఆందోళనగా, నిస్సహాయంగా ఉంది.
మీరు నాకు సాధ్యమైన ప్రతి విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారని నాకు నమ్మకం ఉంది.
మీ శ్రేయోభిలాషి
హర్ కిషన్ దాస్ బేడి, బీఏ, బీటీ.
పంజాబ్ బుక్స్టోర్, మై హీరా గేట్
జలంధర్ సిటీ
''ఆయనకు నా నంబర్ ఇచ్చాను, ఫోన్ వెంటనే రింగ్ అయింది''
ఇప్పుడు ఈ ఉత్తరాన్ని జాగ్రత్తగా చదవండి. 1947 విభజన సమయంలో లాహోర్ విడిచి జలంధర్కు రావాల్సివచ్చిన ఒక హిందువు దీనిని రాశారని కూడా గుర్తుంచుకోండి.
దేశ విభజన వల్ల రగిలిన ద్వేషాగ్ని లక్షలాది ప్రజలను చుట్టుముట్టిన సమయం అది.
నా కథ చౌధరి మహమ్మద్ లతీఫ్, హర్ కిషన్ దాస్ బేదీల కథలతో ముడిపడి ఉంది.
చౌధరి లతీఫ్ మరణం తర్వాత.. ఆయన గది శుభ్రం చేస్తుండగా.. కుటుంబంలో ఎవరికీ తెలియని కొన్ని ఉత్తరాలు దొరికాయి.
ఈ ఉత్తరాలు హర్ కిషన్ దాస్ బేదీ రాసినవి.
ఈ గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్న ఆ వ్యక్తులు ఎవరో అని నేను ఆశ్చర్యపోయాను.
కొన్ని ఏళ్ల క్రితం ఒక యువకుడు లింక్డ్ఇన్లో నాకు సందేశం పంపి, నాతో మాట్లాడాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఈ విషయంలో నా నమ్మకం మరింత బలపడింది.
నేను ఆయనకు నా నంబర్ ఇచ్చాను. వెంటనే ఫోన్ మోగింది.
ఆ తర్వాత.. ఆయన నాకు కొన్ని వాక్యాలలో చెప్పింది నాకు జీవితంలో నా పాత్రికేయపు సారాంశంలా అనిపించింది. ఈ అబ్బాయి హర్ కిషన్ దాస్ బేదీ మనవడు.
''ఒక రోజు మా అమ్మ ఇంట్లోని పిల్లలకు మ్యాథ్స్ బోధిస్తూ.. మీ తాత గొప్ప గణిత మేధావి అని చెప్పారు. గణితంపై ఆయన చాలా పుస్తకాలు రాశారని తెలిపారు. ఆ అబ్బాయి, 'నేను కూడా చూడాలనుకుంటున్నా' అని చెప్పి, ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించారు. కానీ, ఆయన హర్ కిషన్ దాస్ బేదీ పేరు టైప్ చేయగానే, ఆరిఫ్ షమీమ్ పేరు వచ్చింది" అని ఆ యువకుడు నాతో చెప్పారు.
తమ తాత గురించి రాసినందుకు తమ మొత్తం కుటుంబం మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నట్లు ఆ యువకుడు చెప్పారు.
హర్ కిషన్ దాస్ బేదీ భారత్లో విద్య, బోధన రంగాల్లో పాలు పంచుకున్నారు.
ఆయన రాసిన మరో లేఖను చదవండి..
పంజాబ్ బుక్ స్టోర్, జలంధర్ సిటీ
జనవరి 22, 1948
నా.. షఫీక్, మొహ్సిన్ మొహమ్మద్ లతీఫ్ సాహెబ్
నేను బాగున్నాను. నేను చాలా బాగున్నా. మీరు పంపిన రిజిస్ట్రీ నాకు అందింది.
దీనిలో నా ఇంటి రిజిస్ట్రీ ఉంది. అలాగే, రెండు ప్లాట్ల రిజిస్ట్రీలు, ఇన్సూరెన్స్ పాలసీలు, పోస్టాఫీసు, బ్యాంకు పాస్బుక్లు ఉన్నాయి. మీలాంటి దయగల వ్యక్తికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
మీపై నాకో ఫిర్యాదు కూడా ఉంది. పోస్టాఫీసు ఫామ్తో పాటు ఒక రూపాయి నోటును కూడా పంపారు.
ఇది నన్ను చాలా బాధించింది. మీకోసం నా జేబులో నుంచి తీసి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేని నిస్సహాయుని అనుకుంటున్నారా?
మీరు నాకోసం చాలా చేశారు. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను.
నాకు ఒకట్రెండు రోజులుగా ఒంట్లో బాగోలేదు. నాలుగైదు రోజులుగా ఏమీ తినలేదు. నేను కోలుకోగానే అమృత్సర్ వచ్చి మీ పని చేస్తాను.
నిజంగా ఒక పరిపూర్ణమైన వ్యక్తి అయిన ఒక ఉపాధ్యాయుడికి నా ఇల్లు కేటాయించారని రాయడానికి నేను గర్వపడుతున్నా.
నేను మిమ్మల్ని పొగడటం లేదు. దానికి నా హృదయమే సాక్షి.
భవిష్యత్లో మన బంధం ఎంత గాఢంగా మారుతుందో దేవుడికే తెలుసు.
లివింగ్ రూమ్ ఫైర్ ప్లేస్ కింద ఒక హార్మోనియం ఉంది. దానిపైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిలో అమెరికా, ఇంగ్లండ్ మధ్య జరిగిన నా ఉత్తర ప్రత్యుత్తరాలు రికార్డు ఉన్న ఒక ఫైల్ ఉంది.
అక్కడ భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని లైసెన్సులు, ఒక పెన్సిల్, ఒక విదేశీ టూత్పేస్ట్కు సంబంధించిన రెండు బిల్లులు కూడా ఉన్నాయి.
ఆ ఫైల్ను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పుస్తకాలను ఒక సంచిలో పెట్టారని అనుకుంటున్నా. నా చిన్న గదిలో 20 రీమ్ల పేపర్, ఒక రీమ్ లోకల్ పేపర్ ఉంది. అవి ఇంకా అక్కడే ఉన్నాయా? లేదా ప్రభుత్వం వాటిని తీసుకెళ్లిందో తెలుపుతూ మీరు ఉత్తరం రాయాలి.
ఒక చిన్న గదిలోని టేబుల్పై 'హైస్కూల్ జామెట్రీ' పేరుతో పుస్తకం ఉంది.
ఆ పుస్తకాన్ని నేను సగం ఎడిట్ చేశాను. వీలైతే, దయచేసి దాన్ని విడిగా పంపండి లేదా మీవద్ద ఉంచుకోండి.
తర్వాత దాన్ని ఆర్డర్ చేస్తాను. ఈ పుస్తకాన్ని నేను రాశాను. సగం రివైజ్ చేశాను. ఇంకో సగం చేయాల్సి ఉంది. ఆ తర్వాత దీన్ని తిరిగి ముద్రిస్తాను...
మీ శ్రేయోభిలాషి
హర్ కిషన్ దాస్ బేదీ
నాలుగేళ్ల క్రితం, నేను ఒక స్నేహితురాలి కూతురి పెళ్లికి హాజరయ్యేందుకు కెనడా వెళ్లాను.
అప్పుడు నేను ఫేస్బుక్లో నా స్టేటస్ను అప్డేట్ చేయగానే, వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది.
ఆరిఫ్ గారు, మీరు కెనడాలో ఉన్నారా? నేను హర్ కిషన్ దాస్ బేదీ మనవరాలిని, సోనియా బేదీని అని మెసేజ్లో ఉంది.
నేను ఆమెతో.. "అవును, నేను ఇక్కడే ఉన్నాను" అని చెప్పాను.
మా నాన్నగారైన బేదీ సాహిబ్ కొడుకు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని ఆమె చెప్పారు.
ఒక కాఫీ షాపులో కలుద్దామని మాట ఇచ్చాను.
మా మధ్య చాలాసేపు సమావేశం జరిగింది. ఆ సమయంలో బేదీ సాహిబ్ కుమారుడు నన్ను చాలాసార్లు కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు.
చివరికి, కాఫీ బిల్లు ఎవరు కట్టాలనే విషయంపై కూడా మేం వాదించుకున్నాం.
చౌధరి లతీఫ్ స్వయంగా తన రిజిస్ట్రేషన్ ఖర్చులను భరిస్తున్నారని హర్ కిషన్ దాస్ బేదీ ఫిర్యాదు చేసినట్లే.
ఇటీవల, బేదీ సాహిబ్ రెండవ కుమారుడు కూడా భారత్ నుంచి ఫోన్ చేశారు. కష్టమైనప్పటికీ, తన తండ్రికి చౌధరి లతీఫ్ రాసిన లేఖలను కనుగొనడానికి ప్రయత్నిస్తానని ఆయన వాగ్దానం చేశారు.
ఈ విధి ఆట గురించి నేను ఆలోచించినప్పుడల్లా, మనమందరం ఒకటేనన్న నా నమ్మకం మరింత బలపడుతుంది.
మనం ఒకే ప్రాంతానికి చెందినవాళ్లం, వేల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాం, మన మధ్య ఏ విభజన కూడా విడదీయలేనంత బంధం ఏర్పడింది.
దేశ విభజన కూడా కృష్ణానగర్, అక్కడ నివసించే చౌధరి లతీఫ్లతో హర్ కిషన్ దాస్ బేదీకి ఉన్న బంధాలను తెంచలేకపోయింది. అలాగే వారి కుటుంబాలు ఒకరినొకరు కలుసుకోకుండా కూడా ఆపలేకపోయింది.
విభజన ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు దానిని అంగీకరించి కలిసి జీవించాల్సిన అవసరం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)