‘చావు పుట్టుకలు ఈ అడవిలోనే’.. ‘లేదు లేదు, ఈ అడవిని వదిలేస్తాం’.. పెద్ద పులి కోసం నల్లమలను ఖాళీ చేస్తున్నారా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

''పులులు మా జతగాళ్లు, పాములు మా జతగాళ్లు, చెట్లు మా జతగాళ్లు.. మేం ఎక్కడికీ వెళ్లం'' అంటూ ఒకింత ఆవేదనతో నిండిన గొంతుతో తడబడుతూ చెప్పారు మెండ్ల బయమ్మ.

''గొంగళి బట్టలు కట్టుకుని అడవిలోకి వెళ్లి దుంపలు తెచ్చుకుంటాం. మేం చచ్చాక మా పెద్దల పక్కనే పడుకుంటాం'' అని చెప్పారామె.

ఆమెది నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామం. ఇప్పుడీ గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రణాళికలో ఉంది అటవీ శాఖ.

నల్లమల నుంచి చెంచుగూడేలు, చెంచు పెంటల తరలింపు చుట్టూ కొన్నాళ్లుగా వివాదం ఉంది.

కొన్ని రోజులుగా అటవీ శాఖ పునరావాస చర్యలను ముమ్మరం చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది.

అడవి నుంచి వెళ్లిపోతామని, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కొందరు చెబుతుంటే.. అడవి తమ పుట్టిల్లు అని.. చచ్చేదాకా అక్కడే ఉంటామని మరికొందరు చెబుతున్నారు.

అయితే, ఇది పూర్తిగా స్వచ్ఛందమని, తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.

బీబీసీ ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.

అసలు వివాదం ఏమిటి?

నల్లమలలో జనావాసాలు ఉన్న గూడేలు, పెంటలను తరలించాలని 2002లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది.

పులుల సంరక్షణ చర్యల్లో భాగంగా జనావాసాల తరలింపు కార్యక్రమాలను 1973లో తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ, ఏళ్ల తరబడిగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

''ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ రాష్ట్ర అటవీశాఖకు కేంద్రం లేఖలు రాస్తూనే ఉంది. రెండేళ్ల నుంచి దీనిపై కదలిక బాగా ఎక్కువైంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) తోపాటు 'కంపా' స్కీమ్ కింద నిధులు విడుదల కావడం, పునరావాసానికి వేరొక చోట భూములు కేటాయించడంతో వేగవంతమైంది'' అని నాగర్ కర్నూల్ అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) రేవంత్ చంద్ర బీబీసీతో చెప్పారు.

తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాలను తరలించాలని అటవీ శాఖ నిర్ణయించింది.

రెండు దశల్లో ఈ తరలింపు కార్యక్రమాలు చేపట్టింది. ఫేజ్ -1లో వటవర్లపల్లి మినహా మిగిలిన నాలుగు గ్రామాలు ఉన్నాయి.

''ఇది బలవంతపు తరలింపు కాదు, స్వచ్ఛంద పునరావాసం'' అని చెప్పారు రేవంత్ చంద్ర.

వెళ్తామని కొందరు.. వెళ్లమని మరికొందరు..

కొందరు అడవిని వదిలి వెళ్లేందుకు సానుకూలంగా ఉండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

గ్రామాల్లో కేవలం చెంచులు, లంబాడీలే కాకుండా ముస్లింలు, బీసీలు, ఎస్సీలు.. ఇలా వేర్వేరు కులాలు, మతాలకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

వీరంతా 50-60 ఏళ్ల కిందటే ఆయా ఊళ్లకు వలస వచ్చి ఉంటున్నట్లు చెప్పారు.

వటవర్లపల్లి గ్రామం హైదరాబాద్-శ్రీశైలం హైవేను ఆనుకుని, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రవేశ ద్వారం నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. దోమలపెంటకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇక్కడ రోడ్డు పక్కన పెద్ద ఎత్తున హోటళ్లు, తినుబండారాలు విక్రయించే దుకాణాలు, స్టేలు కనిపిస్తుంటాయి.

సహజంగా అడవులలో కనిపించే చెంచు గూడేల మాదిరి ఈ గ్రామం కనిపించదు. హైవేను ఆనుకుని ఉండటంతో వాణిజ్య కేంద్రంగా మారింది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రారంభం నుంచి సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. కానీ, వటవర్లపల్లి సమీపంలోకి వచ్చేసరికి సెల్ సిగ్నల్ కూడా వస్తుంది. ఇక్కడ సెల్ ఫోన్ టవర్లు కూడా ఉన్నాయి.

సుమారు రెండు వేల మంది జనాభా ఇక్కడ ఉంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

సిమెంటు రోడ్లు, పక్కా ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా వివిధ వసతులు వటవర్లపల్లిలో కనిపిస్తాయి.

అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్లపల్లి.

ఈ గ్రామానికి చేరుకునేందుకు కంకర దారి మాత్రమే ఉంది. అక్కడికి మరో మూడు కిలోమీటర్ల దూరంలో కుడిచింతలబైలు ఉంటుంది. ఇక్కడికి తారు రోడ్డు సౌకర్యం లేదు. ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు వస్తుంటుందని గ్రామస్థులు చెప్పారు.

''మేం చెంచులమే. పత్తి పంట ఆరు నెలలు ఉంటుంది. ఆ తర్వాత ముష్టి గింజలు, ఇప్ప పువ్వులు, తేనె, దుంపలు అడవి నుంచి ఏరుకుని తెచ్చుకుని బతుకుతాం'' అని సార్లపల్లికి చెందిన అంజమ్మ చెప్పారు.

తాము గ్రామం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె చెబుతున్నారు. పొలంలో పనులు చేసుకుంటూ ఆమె మాకు కనిపించారు.

''పిల్లలు చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాలి. ఊళ్లో ఐదో తరగతి వరకే ఉంటుంది. ఎప్పుడైనా ఊరికి రావాలంటే వటవర్లపల్లిలో బస్సు దిగి నడుచుకుంటూ రావాలి. చీకటి పడితే ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందోనని భయంతో వస్తుంటాం'' అని అంజమ్మ చెప్పారు.

ఇదే గ్రామానికి చెందిన పద్మ కూడా ఊరి నుంచి వెళ్లిపోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతూ ఆమె మాకు కనిపించారు.

''ఇక్కడ ఎంత వ్యవసాయం చేసినా వర్షాలతోనే. పంట వేసినా సరే అడవి పందులు, దుప్పులు వచ్చి పాడు చేస్తుంటాయి. రాత్రిళ్లు కూడా కళ్లార్పకుండా మంచెపై ఉంటూ కాపలా కాయాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వెళితే మా బతుకులు బాగుపడతాయనే ఆశ'' అని చెప్పారు పద్మ.

తమ పిల్లలకు చదువులు సరిగా లేవని, పిల్లలకు ఎవరూ సంబంధాలు కూడా కలుపుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పునరావాసం - రెండు ఆప్షన్లు

ఆయా గ్రామాల ప్రజలు తరలివెళ్లేందుకు రెండు ఆప్షన్లు ఇచ్చింది అటవీ శాఖ.

మొదటి ఆప్షన్.. పునరావాసం కింద ముందుకు వచ్చే కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన వారికి ఒక్కొక్కరికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఇవ్వడం.

రెండో ఆప్షన్ – ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల పొలం, 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించడం.

''ఇందులో 160 మంది ఆప్షన్-1 ఎంచుకున్నారు. వీరికి చెక్కుల పంపిణీ పూర్తి అయ్యింది. 257 మంది ఆప్షన్-2ను ఎంచుకున్నారు'' అని డీఎఫ్ఓ రేవంత్ చంద్ర చెప్పారు.

పునరావాసం కింద నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలోని బాచారం గ్రామం వద్ద ఇంటి స్థలాలు కేటాయించామని వివరించారు.

వటవర్లపల్లికి చెందిన 836 మంది పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు ఎన్టీసీఏకు పంపించామని ఆయన చెప్పారు. అనుమతులు రాగానే ఆ గ్రామాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

''గ్రామస్థులు ముందుకు వచ్చి గ్రామ సభ పెట్టుకున్నారు. గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారి జాబితా సిద్ధం చేసుకుని తీర్మానం చేసుకున్నారు. వాళ్లు అటవీ శాఖను సంప్రదించారు. తర్వాత దశల్లో ఏయే గ్రామాలు, ఎంతమంది 18 ఏళ్లు పైబడినవారు ఉన్నారనేది గుర్తించాం. ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం, పునరావాస మాన్యువల్ రూపొందించి తరలింపు చర్యలు చేపట్టాం'' అని రేవంత్ చంద్ర వివరించారు.

2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఫేజ్-1 పునరావాసం పూర్తి చేయగలమని అటవీ శాఖ అంచనా వేస్తోంది.

''మిగిలిన వాళ్లు వెళ్తే, మేమూ సిద్ధమే''

కొందరు ఊరి నుంచి వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు నేరుగా చెప్పడం లేదు. ఊళ్లో అందరూ వెళ్లిపోతే, తాము కూడా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని బీబీసీ వద్ద అభిప్రాయం వ్యక్తపరిచారు.

ఉప్పల భారతమ్మ వటవర్లపల్లిలో రోడ్డు పక్కన షాపు నిర్వహిస్తున్నారు.

''నేను ఈ ఊరికి వచ్చి 60 ఏళ్లు అవుతోంది. ఒకప్పుడు శ్రీశైలం వెళ్లేందుకు రోడ్డు కూడా లేదు. కంకర రోడ్డే ఉండేది. ఒక్కొక్క కడవ నీరు తెచ్చుకుని ఆకులు, అలములు తిని బతికాం. ఇప్పుడు కరెంటు వచ్చింది. రోడ్డు ఉంది. బస్సు ఇంటి దగ్గరకు వస్తుంది. ఇన్ని సౌకర్యాలు ఉండగా, ఇక్కడి నుంచి వెళ్లిపోమంటే ఎలా?'' అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

''నా కొడుకులు మాత్రం పిల్లలను బాగా చదివించుకోవాలంటే, అడవి విడిచి వెళ్లిపోవడమే మంచిదని అంటున్నారు'' అని ఆమె చెప్పారు.

ఇప్పటికే ఇళ్లకు మార్కింగులు వేశారని, అందరూ వెళ్తే తాము కూడా వెళ్లక తప్పదని భారతమ్మ చెబుతున్నారు.

మరోవైపు, యువత అభిప్రాయం భిన్నంగా కనిపిస్తోంది.

''నేను ఏడో తరగతి వరకే చదువుకున్నాను. ప్రస్తుత జనరేషన్‌కు అవకాశాలు లేవు. అడవి దాటితేనే మా భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నాం'' అని కుడిచింతలబైలుకు చెందిన సాయికుమార్ బీబీసీతో చెప్పారు.

‘కడుపులో పిండాన్ని బయట వేస్తే ఎలా..?’

''మాకు బయట ప్రపంచం తెలియదు. అడవి జంతువులతోనే మా జీవితం కలిసి సాగుతుంది. కడుపులో ఉన్న పిండాన్ని బయట వేస్తే ఎలా ఉంటుందో.. మమ్మల్ని అడవి నుంచి బయటకు పంపిస్తే అలాగే ఉంటుంది'' అని వటవర్లపల్లికి చెందిన ఎం.శివ బీబీసీతో చెప్పారు.

''మేం తినే బువ్వ అక్కడ దొరుకుతుందా సారూ, ఇప్పటికీ మా పుట్టుక అడవిలోనే, మా చావు అడవిలోనే. ఇక్కడి నుంచి రాం సారూ'' అని మెండ్ల బయమ్మ బీబీసీతో చెప్పారు.

పులులు, పాములు, కోతులు.. ఇలా అన్నింటితో కలిసే పెరిగామని, ఎప్పటికీ వాటితోనే ఉంటామని చెబుతున్నారామె.

తాము ఊరిని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేమని వారు చెబుతున్నారు.

ఊళ్లో ఉండకుండా ఎక్కడో అచ్చంపేటలోనో.. హైదరాబాద్‌లోనో ఉండేవారే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వటవర్లపల్లికి చెందిన మాజీ సర్పంచి సరియా నాయక్ అంటున్నారు.

అలాగే వేరొక ఊరి నుంచి ఇల్లరికం వచ్చిన వ్యక్తులు ఊళ్లో నుంచి వెళ్లడానికి సిద్ధపడుతున్నారనే విమర్శలు కూడా కొందరి నుంచి వ్యక్తమయ్యాయి.

''మేం ఏమీ పాకిస్థాన్ నుంచి రాలేదు కదా. అయినా, నేను 35-40 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చాం. ఇల్లరికం వచ్చినప్పట్నుంచి మా ఊరు ఇదే అనుకుని ఉంటున్నాం. ఊరి బాగు కోసం మేం కూడా ఎంతో శ్రమపడ్డాం. కానీ ఇప్పుడు కొత్తగా కేటాయించే ప్రాంతం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంది. అక్కడకు వెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది'' అని సార్లపల్లి సర్పంచ్ సిర్రా రాములు బీబీసీతో అన్నారు.

''కొంతమంది వెళ్లడానికి ఇష్టంగా ఉండకపోవచ్చు. పుట్టిన ఊరు కాబట్టి ఆవేశం ఉండొచ్చు. కొత్త ఊరుకు వెళ్లాలంటే బాధ అనిపిస్తుంది. బాధ ఉన్నా సరే పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి'' అని చెప్పారు.

అటవీ శాఖ నుంచి తమపై ఒత్తిడి లేదని రాములు చెప్పారు.

తాత, ముత్తాతల కాలం నుంచి అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్నామని, పులులను సాకుగా చూపి పంపించడం ఎంతవరకు న్యాయమని వటవర్లపల్లి మాజీ సర్పంచ్ చత్రునాయక్ ప్రశ్నించారు.

కొంతమంది మాత్రమే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, అటవీ శాఖ మాత్రం చాలా మంది అని ప్రచారం చేస్తోందని అంటున్నారు.

తమ ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయని, అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించాలని చత్రునాయక్ కోరుతున్నారు.

అయితే తమకున్న సమాచారం మేరకు చాలామంది ప్రజలు అడవి దాటేందుకు సుముఖంగా ఉన్నారని డీఎఫ్ఓ రేవంత్ చంద్ర బీబీసీతో చెప్పారు.

''నేను కూర్చుని ప్రతి దస్త్రాన్ని పరిశీలించాను. ప్రతిదీ గ్రామ సభ నుంచే వచ్చింది. గ్రామ సభలో ఒప్పుకొని అటవీ శాఖకు జాబితా పంపించారంటే, గ్రామస్థులే అంగీకరించి మాకు ఇస్తున్నారు అని.

ఇది పూర్తిగా పారదర్శకం. డీఎఫ్ఓ, కలెక్టర్, ఎన్టీసీఏ స్థాయిలో అన్ని దస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది జాబ్ చేసేందుకు బయటకు వెళ్లి ఉండొచ్చు. వాళ్ల ఆధార్, ఓటర్ ఐడీ.. వారి మూలాలు అన్నీ, ఆ నాలుగైదు గ్రామాల్లోనే ఉన్నాయి.

గ్రామ సభ ఆమోదంతోనే జరుగుతోంది కాబట్టి బయట వాళ్లకు ఇస్తున్నామనేది సరికాదు'' అని వివరించారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 43 పులులు

నల్లమల అభయారణ్యం సుమారు 6,338 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఎన్నో వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, చెట్లకు నిలయం ఈ అభయారణ్యం.

ఇందులో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. రెండూ ఉన్నాయి.

2014లో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ను ఏపీకి కేటాయించగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణకు వచ్చింది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2611.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.

పులుల సంరక్షణ కోసం 1973లోనే 'ప్రాజెక్ట్ టైగర్'ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో పులుల సంఖ్య తగ్గిపోతోందని ఎన్టీసీఏ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.

2022 గణాంకాల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 22 పులులుంటే, 2026 గణాంకాల ప్రకారం 43 పులులు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. కెమెరా ట్రాప్‌లు, పాదముద్రలు.. ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా పులుల సంఖ్యను అటవీ శాఖ నిర్ధరించింది.

''2026 నాటికి మొదట 42 పులులు ఉన్నట్లు గుర్తించాం. తర్వాత మరొక పులిని కూడా గుర్తించాం. దీంతో మొత్తం సంఖ్య 43కి పెరిగింది'' అని అటవీ శాఖాధికారి రేవంత్ చంద్ర బీబీసీతో చెప్పారు.

పరిస్థితులు మారుతున్నాయా?

నల్లమలలో కూడా పరిస్థితులు మారుతున్నాయనేది అధికారులు చెబుతున్నమాట.

ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నారు రైతులు. వీరిలో కొందరు, అంటే చెంచులు, లంబాడీలకు పోడు పట్టా భూములు ఉండగా, ఇతర కులాలకు చెందిన వారికి పట్టా భూములు లేవు. వీరంతా అనుభవదారులుగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.

పత్తి, జొన్న, ఆముదం వంటి పంటలు పండిస్తామని వటవర్లపల్లికి చెందిన మల్లికార్జున బీబీసీతో చెప్పారు.

''పంటలు బాగా పండుతాయి. కానీ, వర్షాకాలంలోనే పండించాలి. ఇక్కడ బోర్లు లేవు. పంటకాలం పూర్తయ్యాక కూలి పనులు చేసుకుని పొట్ట పోషించుకుంటాం'' అని మల్లికార్జున చెప్పారు.

2005 నుంచి 2025 మధ్య వాతావరణ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని రేవంత్ చంద్ర వివరించారు.

''నీటి లభ్యత తగ్గడం, ముందస్తు వర్షాలు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం.. ఇలా ప్రతిదీ ఇక్కడి రైతులు, ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని వివరించారు.

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా అడవిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఈ తరలింపు అనేది నిరంతర ప్రక్రియ అని వివరించారు.

''ఇదేమీ బలవంతంగా చేస్తున్న తరలింపు కాదు. 10-15 ఏళ్ల తర్వాత లేదా 20 ఏళ్ల తర్వాత కూడా జరగొచ్చు. పునరావాసానికి భూమి అందుబాటులో ఉండి, గ్రామ సభ ద్వారా ప్రజలు తమ సమ్మతి తెలియజేశాకే తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. ఎవరినీ బలవంత పెట్టడం లేదు'' అని రేవంత్ చంద్ర చెబుతున్నారు.

మొత్తంగా గూడేల తరలింపుతో 1501.88 హెక్టార్లు అందుబాటులోకి వస్తే, పునరావాసానికి 498 హెక్టార్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)