You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జెన్ జీ అమ్మాయిలకు నెలసరి విషయాలు వారి తల్లుల కంటే ఎక్కువగా ఎలా తెలుస్తున్నాయి?
- రచయిత, జాస్మిన్ కెటిబువా-ఫోలీ
- హోదా, వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
''సైకిల్ సింకింగ్'', ''గోయింగ్ ల్యూటియల్'' వంటి పదాలు చాలామంది యువతులు ప్రతిరోజూ వాడే పదజాలంలో భాగమయ్యాయి.
పీరియడ్స్, హార్మోన్స్ నుంచి పీఎంఓఎస్ (పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్), ఫర్టిలిటీ వరకు అంతకుముందు తరాలు కంటే ఇప్పుడు తమ శరీరాల గురించి చాలా బాగా అర్థం చేసుకుంటున్నామని చెప్పే వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే, ఈ అవగాహనను క్యాంపెయినర్లు స్వాగతిస్తున్నారు. ఆరోగ్య ఆందోళన, తప్పుడు సమాచారం విషయంలో మాత్రం ఇంకా ప్రశ్నలు అలానే మిగిలి ఉన్నాయి.
రుతుస్రావ ఆరోగ్యానికి సంబంధించి మారుతున్న ప్రజల వైఖరులు, చర్చల గురించి మేం పలువురు మహిళలు, తల్లిదండ్రులు, నిపుణులతో మాట్లాడాం.
బ్రిస్టల్లోని ఫిష్పాండ్స్కు చెందిన ఇఖ్రా వాసీం తన 11 ఏళ్ల వయసు నుంచే అత్యంత బాధాకరమైన మొటిమలకు చెందిన పీఎంఓఎస్ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు పీఎంఓఎస్తో బాధపడుతున్నారు.
మహిళలకు సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణాలలో పీఎంఓఎస్ ఒకటి. పీరియడ్స్ అపసవ్యత, శరీరంపై ఎక్కువగా రోమాలు పెరగడం, బరువు పెరగడం వంటివి దీని ఇతర లక్షణాలు.
వైద్యులతో మాట్లాడటంతో, సోషల్ మీడియాలోని సమాచారంతో పీఎంఓఎస్ గురించి తెలుసుకున్న ఇఖ్రా ఇప్పుడు తన తల్లికి దానికి సంబంధించిన లక్షణాల గురించి వివరిస్తున్నట్లు తెలిపారు.
ఎందుకంటే ఆమె తల్లి కూడా పీఎంఓఎస్తో బాధపడుతున్నారు.
''అమ్మకి పీఎంఓఎస్ వల్ల ఎక్కువ రక్తస్రావంతో బాధపడేది. ఆమెకు గర్భనిరోధక మాత్రల గురించి ఏమీ తెలియదు'' అని ఇఖ్రా తెలిపారు.
''నేను ఆమెకు ఈ టాబ్లెట్ల గురించి చెప్పినప్పుడు, నేను శృంగారం గురించి మాట్లాడుతున్నానేమో అనుకుంది. కానీ, ఈ మెడిసిన్ గురించి మరింత వివరించాను. ఈ విషయం మా ఇద్దరి మధ్యనున్న అవగాహనా తీరును తెలియజేసింది''
''మా అమ్మ తరంలోని మహిళలకు దీనిపై అవగాహన ఉంది. కానీ, ఇది మహిళలు, కుటుంబాలు, డాక్టర్ల మధ్యనే ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైనా వారి పీరియడ్స్, పీఎంఓఎస్ గురించి మాట్లాడితే, లక్షలాది మంది మహిళలు అది తమకు సంబంధించిన సమస్యగా పోల్చుకుంటున్నారు'' అని చెప్పారు.
''మేం అనుభవిస్తున్న బాధ అంతా సహజమైనదేనా? కాదా? అని ప్రశ్నించేందుకు మా తరం మరింత ఆసక్తిగా ఉంది''
''కానీ, సోషల్ మీడియా నిజమైన వైద్య నిపుణుల స్థానాన్ని భర్తీ చేస్తుందని నేను అనుకోవడం లేదు'' అని ఇఖ్రా వాసీం అన్నారు.
కరోలిన్ హెర్మాన్ తన కూతురు సాయంతో 'ఆల్ యువర్ పీరియడ్ బాక్స్'ను స్థాపించారు. విల్ట్షైర్లో నడుస్తున్న ఈ కార్యక్రమం, ఫుడ్ బ్యాంక్లకు నెలసరికి సంబంధించిన ఉత్పుత్తులు ఉన్న పెట్టెలను విరాళంగా అందిస్తోంది.
రుతుస్రావ ఆరోగ్యం గురించి ప్రజలకు మరింత తెలియజేసేందుకు ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని ఆమె తెలిపారు.
''దేశంలో ఈ విషయంపై కొత్త, పాత తరాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది'' అని తెలిపారు.
''నాతరానికి పీరియడ్స్ గురించి ఏమీ నేర్పించలేదు. మా తల్లిదండ్రుల కాలంలో దాని గురించి పూర్తిగా మౌనం వహించేవారు. ఈ విషయంపై అలుముకున్న నిశ్శబ్దం అనే వలయాన్ని చేధించుకుంటూ ముందుకు రావాల్సి వచ్చింది'' అని చెప్పారు.
హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్ట్రోక్కు గురైన తర్వాత, ఆ విషయంపై సమాచారాన్ని స్వయంగా తెలుసుకోవాల్సి వచ్చిందని కరోలిన్ హెర్మాన్ చెప్పారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం పెరుగుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, ఈ సమాచారం విషయంలో "జాగ్రత్త" వహించాలని అని అన్నారు.
''ఈ సమాచారం ఎంత వరకు నిజమైంది, ఎంతవరకు నిష్పక్షపాతమైంది? దీనిలో కొంత భాగం ఎలాంటి వైద్య ఆధారం లేకుండా కేవలం ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్లో చిక్కుకుపోతోందా?'' అన్నది చూడాలన్నారు.
''అయితే, ఒక సమాజంగా మనం రుతుస్రావం గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి యువత నేర్చుకుంటున్న విషయాలకు అనుగుణంగా మనం కూడా మారాలి" అని ఆమె సూచించారు.
రుతుస్రావ ఆరోగ్యం గురించి ఆన్లైన్లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నప్పటికీ.. ఇప్పటికీ అనేక అడ్డంకులు ఉన్నాయని ఆమె వివరించారు.
''మెటా, ఇతర ప్లాట్ఫామ్లు వైద్యపరంగా సరైన పదాలను అసభ్యకరమైనవిగా పేర్కొంటూ నిషేధిస్తున్నాయి''
''ఈ విషయాలు స్కూళ్లల్లో లైంగిక విద్య కోర్సులలో బోధిస్తారు. మనం యోని, వల్వా, క్లిటోరిస్ వంటి సరైన శరీర భాగాల పేర్లను మాత్రమే ఉపయోగించాలి'' అని చెప్పారు.
'చిన్న పిల్లలే ఈ విషయంపై చాలా బహిరంగంగా చర్చిస్తున్నారు'
చాలామంది మహిళలు సైకిల్ సింకింగ్, రుతుస్రావంలోని వివిధ దశల గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు చెప్పారు.
''ఏదైనా విషయం నిషేధిత అంశంగా మారకుండా నిరోధించేందుకు చిన్న వయసు నుంచే పిల్లలతో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా ముఖ్యం'' అని కాట్స్వోల్డ్స్కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి, వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బెథ్ లారెన్ అన్నారు.
''చిన్న పిల్లలు ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడతారు. మనం దాన్ని భయపెట్టే అంశంగా చేయకపోతే, అది నిజంగా భయపడాల్సిన విషయం కాదు'' అని తెలిపారు.
''నాకు ఇద్దరు అబ్బాయిలు. వారికి రుతుస్రావం గురించి సమాచారం అందించి, అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఒకవేళ నాకు అమ్మాయి పుట్టి ఉంటే ఎంత బాగా వివరించేదాన్నో, నా పిల్లలకు కూడా అంతే బాగా వివరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను'' అని బెథ్ లారెన్ చెప్పారు.
రుతుస్రావంలోని వివిధ దశల గురించి తాను తల్లి అయ్యేంత వరకు తెలియదని లారెన్ తెలిపారు.
''అమ్మ చాలా ఓపెన్గా ఉండేది. కానీ, మేం దాని గురించి ఎప్పుడూ వివరంగా, లోతుగా చర్చించుకోలేదు. ఆమెకు దాని గురించి ఇప్పటికీ పెద్దగా తెలుసనిఅనుకోను. 30 ఏళ్ల వయసులో నాకు అర్థమైన విషయాలు చాలా వరకు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నవే. అయితే, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్నంతటినీ నేను జాగ్రత్తగా, నా స్వీయ బాధ్యతతో చూస్తాను" అని బెథ్ లారెన్ అన్నారు.
సైకిల్ సింకింగ్ నుంచి శరీరాన్ని అర్థం చేసుకోవడం వరకు..
రుతుస్రావం గురించి మాట్లాడటంలో ఉన్న అపవాదు ఇప్పుడు గతంలో కంటే చాలా తక్కువగా ఉందని, 30, 40 ఏళ్ల వయసులో ఉన్న చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కొత్త విషయాల గురించి తమ పిల్లలతో స్వయంగా మాట్లాడుతున్నారని పీరియడ్ పవర్, పెరిమెనోపాజ్ పవర్ వంటి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలు రాసిన మేసీ హిల్ చెప్పారు.
''ప్రజలు ఇప్పుడు దీని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం నెలసరి సమయంలో ఏం చేయాలో అనే దాని గురించి మాత్రమే కాదు. మీ శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, దానికి ఎలా మద్దతు ఇవ్వాలనే విషయం గురించి కూడా'' అని ఆమె అన్నారు.
''సెక్స్ ఎడ్యుకేషన్ మెరుగైంది. కానీ, అది ఇంకా సరిపోవడం లేదు. 9 ఏళ్ల వయసులో రుతుస్రావం, ఫర్టిలిటీ వంటి విషయాల గురించి మాట్లాడటం సరైంది కాదని కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి 9 ఏళ్ల వయసులోనే రుతుస్రావం మొదలవుతుందని వారు గ్రహించడం లేదు'' అని చెప్పారు.
రుతుస్రావం విషయంలో మహిళలు అనుభవించే బాధను కేవలం ఒక భయంగా కొట్టేయకూడదని హిల్ పునరుద్ఘాటిస్తున్నారు.
''ఈ సమాచారం ఆరోగ్య భయానికి కారణమవుతుందనే వాదన, మన శరీరాల గురించిన విషయాలను మనం తట్టుకోలేమన్నట్లుగా ఈ అనుభవాలను కొట్టిపారేయడానికి మరో మార్గంగా మారుతుందేమోనని నాకు భయంగా ఉంది'' అని హిల్ అన్నారు.
''మహిళల బాధలను ఇలా నిర్లక్ష్యం చేయడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. 'హిస్టీరియా' అనే పదం గర్భాశయాన్ని సూచించే గ్రీకు పదం నుండి వచ్చింది. శతాబ్దాలుగా, మహిళల నొప్పి, భావోద్వేగాలను వ్యాధులుగా పరిగణించి, వాటికి గర్భాశయాన్ని నిందించారు. గర్భాశయానికి శస్త్రచికిత్స చేయడమే దీనికి పరిష్కారంగా భావించారు'' అని తెలిపారు.
ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలకు ఎనిమిదేళ్ల వయసులోనే పీరియడ్స్ మొదలవుతున్నాయని బ్రిస్టల్ యూనివర్సిటీలోని పీహెచ్డీ పరిశోధకురాలు పాపీ టేలర్ అన్నారు.
ఆమె పరిశోధన 2000 నుంచి 2020 మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ను పొందిన 18 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతుల అనుభవాలను పరిశీలించింది.
"ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి రుతుస్రావం ప్రారంభమైన తర్వాతే స్కూల్లో రుతుస్రావం గురించి అవగాహన కల్పించారని మా అధ్యయనంలో తేలింది" అని ఆమె అన్నారు.
''మరో విషయం ఏమిటంటే.. అందరినీ కలుపుకోవడం. మన నెలసరిని దాచుకునే అలవాటును మనం మానుకోవడం చాలా ముఖ్యం. మన శరీరాలలోనూ, మన స్నేహితుల శరీరాలలోనూ జరుగుతున్న శారీరక మార్పుల గురించి మనమందరం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఒకరికొకరు సరిగ్గా మద్దతు ఇచ్చుకోగలుగుతాం" అని పాపీ టేలర్ అన్నారు.
మెనోపాజ్కు సంబంధించిన కార్యక్రమాల ద్వారా పరిస్థితులు ఎలా మారాయి, సమాజంలోని ప్రజల వైఖరుల్లో సాంస్కృతిక మార్పును ఎలా తీసుకువచ్చాయో టేలర్ వివరించారు.
దీనివల్ల మహిళలకు సంబంధించిన అనేక ఇతర సమస్యలు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై మరింత పరిశోధన జరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)