You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాలిబాన్ల ఐదేళ్ల పాలన తర్వాత తమ జీవితాలు ఎలా మారిపోయాయో చెప్పిన అఫ్గాన్ మహిళలు
- రచయిత, బీబీసీ అఫ్గాన్ సర్వీస్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి
అఫ్గానిస్తాన్లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకుని ఐదేళ్లు గడుస్తున్న తరుణంలో.. ఈ ప్రభుత్వ పాలనలో తమ జీవితాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని ఆ దేశ మహిళలు, అమ్మాయిలు బీబీసీకి చెప్పారు.
అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి చేతిలో అధికారాన్ని కోల్పోయిన రెండు దశాబ్దాల తర్వాత, 2021లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి, ఆ ఇస్లామిస్ట్ వర్గం దేశంలోని 2 కోట్ల 20 లక్షల మంది మహిళల హక్కులను హరిస్తూ వస్తోంది.
అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అఫ్గానిస్తాన్లో తమ కార్యకలాపాలను కొనసాగించగలిగిన అతికొద్ది మీడియా సంస్థలలో బీబీసీ ఒకటి.
కాబూల్ నడిబొడ్డు నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలతో మేం మాట్లాడాం.
పన్నెండేళ్లు పైబడిన బాలికలు స్కూళ్లకు వెళ్లకుండా తాలిబాన్లు నిషేధం విధించడం, పురుషులు తోడు లేకుండా చేసే ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, బాల్య వివాహాలకు చట్టపరమైన ఆమోదం కల్పించేలా చట్టాన్ని తీసుకురావడం వంటి పరిణామాలను వారు చూస్తూ వచ్చారు.
మహిళలు ఎదుర్కొంటున్న ఆంక్షల గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు, తాలిబాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘మహిళలపై అన్ని రంగాలలో పూర్తిగా ఆంక్షలు విధించలేదు" అని అన్నారు.
అయితే, ఈ ఆంక్షలు వారి జీవితంలో దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేశాయి. వారి బాధలను బయటకి చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా క్లిష్టతరం చేశాయి. తమపై ఏదైనా ప్రతీకార చర్యలు చేపడుతారేమోనని భయంతో చాలామంది మహిళలు తమ అసలు పేర్లను కూడా ఉపయోగించలేదు.
''ప్రజలు పేదరికం, రోజువారీ కష్టాలతో ఎంతలా కుంగిపోయారంటే.. చాలామంది తమ చదువును, కలలను, భవిష్యత్పై ఆశలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది'' అని కాబూల్కు చెందిన ఏలా అనే మహిళ చెప్పారు.
''నేడు, బతకడమే పెద్ద విషయంగా మారింది. మాలో చాలామందికి భవిష్యత్ గురించి ఆలోచించేందుకు సమయం కానీ, శక్తి కానీ లేకుండా పోయింది'' అని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో బాలికలను మాధ్యమిక, ఉన్నత విద్య నుంచి అధికారికంగా నిషేధించిన ఏకైక దేశం అఫ్గానిస్తాన్.
''ప్రభుత్వం కుదేలైన ఆగస్టు 15వ తేదీ నా జీవితంలో అత్యంత దారుణమైన, బాధాకరమైన రోజు'' అని షకీబా గుర్తు చేసుకున్నారు.
''ప్రతి ఏడాది ఈ తేదీ వచ్చినప్పుడు, పాత గాయం మళ్లీ తెరుచుకున్నట్లు గానూ, ఓటమికి సంబంధించిన ఒక కొత్త భావన నా హృదయాన్ని నింపేసినట్లుగానూ అనిపిస్తుంది''
"ఆ రోజు, ఏళ్ల తరబడి నాలో దాచుకున్న ఎన్నో కలలు ఒక్కసారిగా దూరమైపోయాయని నాకు అనిపించింది" అని షకీబా చెప్పారు.
''చాలా గొప్ప విజయం'' అయిన తన మాధ్యమిక విద్యను షకీబా ఆన్లైన్లో పూర్తి చేయగలిగినప్పటికీ, పైలట్ కావాలన్న తన జీవితకాల లక్ష్యం మాత్రం అసాధ్యంగా అనిపిస్తోందని షకీబా చెప్పారు.
''నేను ఆకాశం వైపు చూసినప్పుడల్లా.. విమానం నడుపుతూ పైనుంచి ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఊహించుకునేదాన్ని. స్వేచ్ఛగా ఎగరాలని, హద్దులు లేని ప్రపంచాన్ని అనుభవించాలని కోరుకున్నాను" అని తెలిపారు.
అఫ్గానిస్తాన్లో బాలికల విద్య గురించి, ముఖ్యంగా దేశంలో సుమారు 26 లక్షల మంది బాలికలు ఆరో తరగతికి మించి స్కూల్కు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్న ఒక యూనిసెఫ్ నివేదికను ప్రస్తావిస్తూ.. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీని బీబీసీ ప్రశ్నించింది.
"మహిళలకు ప్రతిదీ నిషేధించామని చెప్పడం సరికాదు" అని అమీర్ ఖాన్ ముత్తాఖీ సమాధానమిచ్చారు.
"ప్రస్తుతం 30 లక్షల మంది బాలికలు స్కూళ్లకు, మదరసాలకు (ఇస్లామిక్ బోధనలపై దృష్టి పెట్టే మతపరమైన కేంద్రాలు) వెళ్తున్నారు" అని ఆయన తెలిపారు.
దేశంలో మతపరమైన స్కూళ్లు వైద్యులను ఎలా తయారు చేయగలవని ప్రశ్నించినప్పుడు, "మహిళలపై అన్ని రంగాలలో పూర్తిగా ఆంక్షలు లేవు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారి కార్యకలాపాల్లోని కొంత భాగానికి మాత్రమే పరిమితులు ఉన్నాయి" అని అన్నారు.
అనేక పని ప్రదేశాలు, విద్యారంగాల నుంచి మహిళలను నిషేధించిన తర్వాత.. అఫ్గానిస్తాన్లో కేవలం 7 శాతం మంది మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
తాలిబాన్ల ఆదేశాల కారణంగా న్యూస్ యాంకర్ జుహల్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
"నా ఉద్యోగంపై నాకు చాలా అభిమానం ఉండేది, ఎంతో ఇష్టంతో దాన్ని చేసేదాన్ని. కెమెరా ముందు కూర్చుని వార్తలు చదివిన ప్రతిసారీ నాకు గర్వంగా, సంతోషంగా అనిపించేది. అది నా గుర్తింపులో, నా జీవితంలో ఒక భాగం'' అని అన్నారు.
"ఒకప్పుడు అలారం మోతతో లేచి, ఉద్యోగానికి సిద్ధమయ్యే రోజులు పోయి... ఇప్పుడు ఉదయం లేవగానే రోజంతా ఇంట్లోనే గడపాలని తెలిసే రోజులు వచ్చాయి" అని జుహల్ అన్నారు.
2020, 2021లో వ్యాపారాల్లో 30 వేల మంది మహిళలు ఉండేవారని, ఈ సంఖ్య అప్పటి నుంచి 1,20,000 మహిళా పారిశ్రామికవేత్తలకు పెరిగిందని విదేశాంగ మంత్రి చెప్పారు.
''[మహిళలు] ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. అన్ని రకాల కార్యకలాపాలలో మహిళలపై పూర్తిగా నిషేధం లేదు" అని ముత్తాఖీ తెలిపారు.
తాలిబాన్లు బహిరంగంగా శారీరక శిక్షలు అమలు చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించారు. 2021 నుంచి వందలాది మందికి కొరడా దెబ్బలు పడ్డాయని అధికారిక రికార్డులు చెబుతుండగా, అయితే వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
తనను 50 సార్లు కొరడాతో కొట్టారని, దీనివల్ల తన శరీరంపై తీవ్రమైన గాయాలు అయ్యాయని, తన కుటుంబం మొత్తం తీవ్ర మానసిక వేదనకు గురైందని షైమా బీబీసీతో చెప్పారు.
''వారు ఒక కాగితం తెచ్చి, 'అవును, నేను మతభ్రష్టురాలైన మహిళను. నేను అవిశ్వాసులకు సహకరిస్తున్నాను. సంబంధం లేని పురుషులతో మాట్లాడాను' అని ఒప్పుకునేలా నన్ను బలవంతం చేశారు''
"నా తల నేలవైపుకు వంగిపోయేంత తీవ్రంగా వారు నన్ను కొట్టారు"
''సుమారు 200 మంది స్థానిక ప్రజలు గుమికూడారు. వారిలో పురుషులు, అబ్బాయిలు, పిల్లలు ఉన్నారు. అందరూ మగవారే. నేను పశ్చాత్తాపపడుతున్నానని గట్టిగా చెప్పాల్సి వచ్చింది'' అని షైమా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తన పెద్ద కూతురు ఇప్పుడు ప్రతిరోజూ రాత్రి భయంతో నిద్రలేచి, "అమ్మా, వాళ్ళు నిన్ను కొడుతున్నారు", "అమ్మా, వాళ్ళు నిన్ను చంపేస్తున్నారు" అని అంటుందని షైమా చెప్పారు.
"అదే నాకు అత్యంత బాధ కలిగిస్తుంది" అని ఆమె అన్నారు.
ఒక వ్యక్తితో స్నేహం చేసినందుకు మనీజా బహిరంగంగా 39 సార్లు కొరడా దెబ్బలు తిని, ఆ తర్వాత జైలు పాలయ్యారు.
''మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మమ్మల్ని అరెస్టు చేశారు. తాలిబాన్ నిఘా విభాగానికి ఈ విషయం ఎలా తెలిసిందో, లేదా ఎవరైనా మా గురించి ఫిర్యాదు చేశారో నాకు తెలియదు''
''జైలులో నేను ఎప్పుడూ మా అమ్మకు కూడా చెప్పుకోని విషయాలను అనుభవించాను. నాకు బతకాలని ఏమాత్రం కోరిక ఉండేది కాదు. జైలు నుండి బయటకు రాగానే నేను చేసే మొదటి పని నా ప్రాణాలను తీసుకోవడమేనని అంటూ ఉండేదాన్ని''
''నేను నా కుటుంబానికి, స్నేహితులకు అవమానంగా మారాను. నేను ఇక పెళ్లి గురించి ఆలోచించలేకపోయాను'' అని బాధపడ్డారు.
ఈ కథనంలో పేర్కొన్న సమస్యల వల్ల మీరు గానీ, మీకు తెలిసిన వారు గానీ ప్రభావితమైతే, సహాయం చేయగల సంస్థల జాబితాను బీబీసీ యాక్షన్ లైన్ రూపొందించింది.
అఫ్గానిస్తాన్లో ప్రపంచంలోనే అత్యధిక మాతృ మరణాల రేట్లు ఉన్నాయి. పురుష వైద్యులు చికిత్స చేయడాన్ని పరిమితం చేసిన నిబంధనల కారణంగా చాలా మంది మహిళలు, బాలికలు వైద్య సేవలను పొందలేకపోతున్నారు.
ఒక మారుమూల జిల్లా నుంచి క్లినిక్కి వచ్చిన ఆరుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల మహిళ తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడాన్ని చూశానని ప్రసూతి వైద్య నిపుణురాలు మార్జియా గుర్తుచేసుకున్నారు.
''మేము బిడ్డను కాపాడగలిగాం. కానీ, ఇప్పుడు నేను ఆ బిడ్డ భవిష్యత్తు గురించి, అలాగే ఆమె మిగతా ఆరుగురు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ అమ్మ లేకుండా వాళ్ళ పరిస్థితేంటి? ఆ కుటుంబం మొత్తం పరిస్థితి ఏమవుతుంది?''
''మాకందరికీ చాలా బాధేసింది. మాకు ఒక రోగిని కోల్పోవడం మా ఉద్యోగంలో అత్యంత బాధాకరమైన అంశం. మేం శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోయాం'' అని చెప్పారు.
మరియం ఆడపిల్లకు జన్మనివ్వబోతున్నారు. తన కూతురి భవిష్యత్ గురించి ఆమె ఆందోళన చెందుతున్నారు.
''ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆమె పరిస్థితేంటి? నేను చదువుకున్నట్లు కనీసం స్కూల్ చదువు కూడా పూర్తి చేసే అవకాశం ఆమెకు దొరకదు. ఇక యూనివర్సిటీకి వెళ్లడం సంగతి చెప్పనక్కర్లేదు''
''ఒకవేళ ఆమెకు పెళ్లి జరిగి, గర్భవతి అయి, ప్రసవ సమయంలో మహిళా వైద్యురాలి అవసరం ఏర్పడితే, అక్కడ ఎవరూ లేకపోతే పరిస్థితి ఏమిటి? ఇది ప్రాణాపాయం కలిగించే విషయం'' అని భయపడుతున్నారు.
'మా పక్షాన మాట్లాడండి'
మేం మాట్లాడిన అఫ్గాన్ మహిళల్లో కొందరు తమకు భవిష్యత్తుపై ఇంకా ఆశ ఉందని చెప్పారు.
మహిళలకు గొంతుక ఇవ్వాలని, వారి హక్కులను కాపాడాలని కోరుకున్నందుకే తాను లా, పొలిటికల్ సైన్స్ చదవాలని నిర్ణయించుకున్నానని 24 ఏళ్ల నూరి చెప్పారు.
తాలిబాన్ అధికారంలోకి రావడంతో ఆమె తన డిగ్రీని పూర్తి చేయలేకపోయారు. కానీ, మహిళలకు సాయం చేసే మార్గాన్ని కనుగొన్నారు.
''నేను ఆశను కోల్పోలేదు. పని చేయడం మొదలుపెట్టి, ఆర్థికంగా స్వతంత్రురాలిని కావాలని నిర్ణయించుకున్నాను. జామ్ తయారుచేసే ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించి, అక్కడ పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాను'' అని తెలిపారు.
''నేను సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించగలను. వారు నాలాగే స్వతంత్రంగా, బలంగా, విజయవంతమైన మహిళలుగా ఎదిగి, మెరుగైన భవిష్యత్తును పొందాలని నేను కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ప్రస్తుతం అక్కడ 10 మంది మహిళలు పనిచేస్తున్నారు.
13 ఏళ్ల అస్మా డాక్టర్ కావాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక రోజు తాను తప్పకుండా డాక్టర్ అవుతానని బలంగా నమ్ముతున్నారు.
"ఒక రోజు మొత్తం మారిపోతుంది. కానీ, మనం ఓపికతో ముందుకు సాగాలి. ఆశ కోల్పోకూడదు" అని ఆమె బీబీసీతో అన్నారు.
"అఫ్గాన్ మహిళల పక్షాన మాట్లాడండి. విద్య, పని చేసే వారి హక్కుకు మద్దతు ఇవ్వండి" అని డెంటిస్ట్ అసిస్టెంట్గా పనిచేసే ఏలా అనే మహిళ కోరారు.
‘‘వారి పరిస్థితిపై ప్రపంచ దృష్టిని నిలపండి. మాకు కావాల్సింది సంఘీభావం. మౌనం కాదు’’ అని అన్నారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)