You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైజాగ్: రహదారి కోసం మట్టికుప్పలు తొలగిస్తుంటే 4 శవాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి, ఆ శవాలు ఎక్కడివి, ఎవరివి, పోలీసులు ఏం చెబుతున్నారు?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
(హెచ్చరిక: ఈ వార్తలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
విశాఖపట్నంలోని షీలానగర్ సమీపంలో రహదారి నిర్మాణం కోసం తెచ్చిన మట్టి కుప్పను తొలగిస్తుండగా మానవ మృతదేహాలు, పుర్రెలు బయటపడటం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది.
‘‘మట్టిని చదును చేస్తున్న కొందరు వర్కర్లు శరీర భాగాలను గమనించి తమకు సమాచారం అందించారని ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి’’ అని పోలీసులు బీబీసీకి చెప్పారు.
షీలానగర్ జాతీయ రహదారిపైన నిత్యం వందలాదిమంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
షీలానగర్-సబ్బవరాన్ని కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డును పోర్టు రోడ్డుకు అనుసంధానించే పనుల కోసం ఈ మట్టిని పోశారు.
మట్టిని తొలగిస్తున్న సమయంలో మొదట ఒక మృతదేహం బయటపడింది. ఆ తర్వాత మరిన్ని మృతదేహాలు, పుర్రెలు బయటపడటంతో కలకలం రేగింది.
ఈ శవాలు ఎక్కడివి?
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న గాజువాక సీఐ వాసు నాయుడు ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు.
‘‘మృతదేహాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వాసునాయుడు బీబీసీకి చెప్పారు.
"మృతదేహాలను ఇక్కడే ఖననం చేశారా? లేక మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నాం. అన్ని అంశాలను దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి" అని వాసు నాయుడు చెప్పారు.
ఘటనా స్థలంలో కనిపించిన కొన్ని వస్తువులపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అక్కడ వెదురు చాపలు, తెల్లటి వస్త్రాలు, పూల దండలు, దిండ్లు, దుప్పట్లను పోలీసులు గుర్తించారు.
‘‘ఇవి ఇటీవల ఖననం చేసిన మృతదేహాలా? లేక ఎక్కడో పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీసి ఇక్కడికి తరలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని’’ వాసు నాయుడు అన్నారు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
అయితే, ఈ మృతదేహాలు ఎవరివి, వారి మరణానికి కారణమేంటి, ఎంతకాలం కిందట చనిపోయారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో ఏదైనా వాహనం అక్కడికి వచ్చిందా? మృతదేహాలను ఎవరైనా తీసుకొచ్చారా? అనే వివరాలను సీసీటీవీ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
"ఈ ఘటనకు సంబంధించి ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాల గుర్తింపు, అవి అక్కడికి ఎలా వచ్చాయన్నది కీలకంగా మారింది" అని సీఐ వాసు నాయుడు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)