మెటా ఆ కేసు ఓడిపోతే ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్టులకు ‘లైకుల సంఖ్యను’ తొలగించాల్సి వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్యాలీ హేస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగించే పిల్లలను లక్ష్యంగా చేసుకుని, మెటా సంస్థ వారికి హాని కలిగించిందన్న ఆరోపణలపై ఆ సంస్థ వరుసగా కోర్టులో పరాజయాలను ఎదుర్కొంటోంది.
అయితే, మంగళవారం ప్రారంభమయ్యే ఒక జ్యూరీ విచారణ మెటా కార్యకలాపాలకు అతిపెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.
కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా 30 అమెరికా రాష్ట్రాలు 2023లో దాఖలు చేసిన కేసు వల్ల ఈ విచారణ జరగనుంది. పిల్లల గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా అనేక విధాలుగా ఉల్లంఘించిందని ఆ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో మెటా నుంచి 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 95.69 లక్షల కోట్లు)కు పైగా పరిహారం కోరడంతో పాటు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కీలక మార్పులు చేయాలని కూడా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇందులో పోస్టులకు వచ్చే "లైకుల" సంఖ్యను తొలగించడం, అంతులేని స్క్రోలింగ్కు చెక్ పెట్టడం వంటి చర్యలు ఉన్నాయి.
ఈ స్థాయి కేసులో మెటా చివరకు ఓడిపోతే, యువత సోషల్ మీడియాను ఉపయోగించే విధానంలో ప్రాథమిక మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.


ఫొటో సోర్స్, Reuters
మెటాపై కేసు వేసిన రాష్ట్రాలు పిల్లల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కూడా కోరుతున్నాయి.
మెటా ఈ మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు:
- టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ ప్రక్రియను అమలు చేయాలి
- "డోపమైన్ను ప్రభావితం చేసే రికమండేషన్ అల్గారిథమ్లను" మార్చాలి
- ఫొటోల్లో వ్యక్తుల రూపాన్ని మార్చే అనేక ఇమేజ్ ఫిల్టర్లను తొలగించాలి
- వీడియో కంటెంట్ ఆటోప్లేను నిలిపివేయాలి
- ఒక వ్యక్తి అనేక ఖాతాలను సృష్టించడాన్ని నిషేధించాలి
- ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లా కొన్ని గంటల్లో తొలగిపోయే పోస్టులను నిలిపివేయాలి
ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం మెటా ప్లాట్ఫారమ్లలో వినియోగదారుల అనుభవంలో కీలక భాగంగా ఉన్నాయి.
టీనేజర్లు, పిల్లలు సహా ఇతర వినియోగదారులు సాధ్యమైనంత తరచుగా, సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ప్లాట్ఫారమ్లలో ఉండేలా ఈ ఫీచర్లను రూపొందించారని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. యువతను తిరిగి తమ యాప్లను వాడేలా ప్రలోభపెట్టే నోటిఫికేషన్లు తరచూ రావడం వంటి చర్యల ద్వారా వారు ప్లాట్ఫామ్ల వినియోగాన్ని తగ్గించుకోవడం కూడా మెటా కష్టతరం చేసిందని ఆరోపిస్తున్నాయి.
పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, తమ ప్లాట్ఫామ్లకు వారిని అలవాటు చేయించి, వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికే మెటా యువతను వాడుకుందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో మెటా విలువ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లు.
మెటా ఈ ఆరోపణలను నిరంతరం ఖండిస్తోంది.
"ఈ ఆరోపణలతో మేం తీవ్రంగా విభేదిస్తున్నాం. యువతకు మద్దతు ఇవ్వడంలో మాకు దీర్ఘకాలంగా ఉన్న నిబద్ధతను కేసు ఆధారాలు రుజువు చేస్తాయని విశ్వసిస్తున్నాం" అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రాలు తమ వాదనలను కాలిఫోర్నియాలోని చీఫ్ ఫెడరల్ జడ్జి ఇవాన్ గొంజాలెజ్ రోజర్స్ ముందు వినిపించనున్నాయి. ఎలాన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మన్ మధ్య జరిగిన ప్రముఖ కేసులో ఆమె న్యాయమూర్తిగా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల న్యాయ ప్రస్థానంలో సూటిగా, విషయాన్ని లోతుగా విశ్లేషించే న్యాయమూర్తిగా ఆమె పేరొందారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల మెటాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులో న్యూ మెక్సికోలోని ఓ న్యాయమూర్తి ఆ సంస్థకు మొత్తం 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ప్రస్తుతం అదనంగా కేసు వేసిన రాష్ట్రాలు కోరుతున్న తరహా మార్పులను కూడా అమలు చేయాలని ఆదేశించారు.
న్యాయమూర్తి బ్రయాన్ బీడ్షెయిడ్ ఇచ్చిన ఆదేశాల్లో 18 ఏళ్లలోపు వినియోగదారులకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో లైకుల సంఖ్యను తొలగించడం, టీనేజర్లు ఈ ప్లాట్ఫామ్ల ద్వారా నగ్న చిత్రాలను పంపడం లేదా స్వీకరించడాన్ని నిషేధించడం, యాప్ల నుంచి వచ్చే పుష్ నోటిఫికేషన్లను రోజులోని కొన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటివి ఉన్నాయి.
మెటాను "పబ్లిక్ న్యూసెన్స్"గా కూడా న్యాయమూర్తి ప్రకటించారు. ప్రజలు పీల్చే గాలిని కలుషితం చేసి, మొత్తం జనాభాపై హానికర ప్రభావాలు చూపించే కర్మాగారంతో మెటాను ఆయన పోల్చారు. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని మెటా తెలిపింది.
న్యాయమూర్తి బీడ్షెయిడ్ న్యూ మెక్సికోలో మాత్రమే మార్పులు చేయాలని మెటాను ఆదేశించారు. అయితే మెటాపై 30 రాష్ట్రాలు దాఖలు చేసిన ప్రత్యేక కేసులో అవి విజయం సాధిస్తే, అమెరికా అంతటా తన ప్లాట్ఫామ్లలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం దాదాపు ఖాయం.
ఈ కేసులో భాగమైన రాష్ట్రాల్లో దేశ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది నివసిస్తున్నారు.
మెటా ఈ మార్పులను అమలు చేస్తే, దాని ప్లాట్ఫామ్ల వినియోగ అనుభవంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంటుంది.
ఉదాహరణకు, మెటా తొలినాళ్ల నుంచే లైకుల సంఖ్యను యూజర్లకు చూపించడం దాని ప్లాట్ఫామ్లో భాగంగా ఉంది. నేడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నింటిలో లైక్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో కనిపించే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో ప్రజలు స్పందించే ప్రధాన మార్గం లైక్లే.
అయితే ముఖ్యంగా యువతలో ప్రతికూల భావాలను పెంచే సాధనంగా లైక్లను క్రమంగా ఎక్కువగా చూడటం మొదలైంది.
ఈ ఏడాది ప్రారంభంలో మెటాపై తాను దాఖలు చేసిన కేసులో విజయం సాధించిన కేలీ అనే యువతి, కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో డజన్ల కొద్దీ ఖాతాలను ఎలా సృష్టించిందో వివరించారు.
ఇతర వినియోగదారులతో తన పోస్టులకు మరింత స్పందన రావాలని, తద్వారా తనకు గుర్తింపు, ఆత్మగౌరవ భావన కలగాలని ఆశిస్తూ, తన సొంత పోస్టులకు లైక్లు పెంచుకోవడానికి ఆ ఖాతాలను ఉపయోగించేది. ఆ సమయంలో కేలీ వయసు కేవలం తొమ్మిదేళ్లు. తనకు నిరాశగా అనిపించేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో ఆమెకు డిప్రెషన్ ఉన్నట్లు నిర్ధరణ అయింది.
గత కొన్నేళ్లుగా జరిగిన పరిశోధనలు, లైక్ల సంఖ్య వంటి ఎంగేజ్మెంట్ సూచికలు టీనేజర్లలో తిరస్కరణ భావన, డిప్రెషన్కు దారితీయగలవని చూపించాయి.
మెటాపై రాష్ట్రాలు దాఖలు చేసిన వాజ్యంలో సంస్థ 2 మిలియన్లకు పైగా పత్రాలను సమర్పించినట్లు తెలిపింది. ఈ కేసులో న్యాయవాదులు మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనలను ప్రస్తావించారు. లైక్ల సంఖ్య "సామాజిక పోలిక"కు దారితీస్తుందని ఆ పరిశోధనల్లో తేలింది. అంటే ఇతరుల చిత్రాలను చూసి, వాటితో తమ విలువను పోల్చుకునే మానసిక ప్రక్రియ.
ఇన్స్టాగ్రామ్ కారణంగా ఏర్పడిన ఈ సామాజిక పోలిక "పెరిగిన ఒంటరితనం, మరింత ప్రతికూల భావన, ప్రతికూల మానసిక స్థితి లేదా భావోద్వేగాలకు" సంబంధం కలిగి ఉందని మెటా అంతర్గత పరిశోధనలో వెల్లడైంది.
సోషల్ మీడియా సంస్థను తొలిసారిగా "పబ్లిక్ న్యూసెన్స్ "గా ప్రకటించిన న్యాయమూర్తి బీడ్షెయిడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా, దశాబ్దానికి పైగా మెటా ప్లాట్ఫామ్లు పనిచేసిన విధానం న్యూ మెక్సికోతో పాటు ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న "యువత మానసిక ఆరోగ్య సంక్షోభం"లో భాగంగా ఉంది.
ఇప్పుడు మరో 30 రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు కూడా న్యాయమూర్తి గొంజాలెజ్ రోజర్స్ ఇదే నిర్ణయానికి రావాలని కోరనున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)































