You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘భారత్లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్
భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, జమ్మూకశ్మీర్లో పర్యటించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఈ పర్యటన తర్వాత అమెరికా దౌత్యవేత్తకు పాకిస్తాన్ సమన్లు జారీ చేసింది.
శ్రీనగర్లో సమావేశం ముగిసిన తర్వాత, దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్ విలేఖరులతో మాట్లాడారు. ''ఇది (జమ్మూ-కశ్మీర్) భారత్కు చెందిన ఒక ముఖ్యమైన భాగం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్లో సెర్గియో గోర్ పర్యటన అనంతరం ఇస్లామాబాద్లోని అమెరికా 'చార్జ్ డి అఫైర్స్' (దౌత్యాధికారి అందుబాటులోని సమయంలో దౌత్య కార్యాలయం బాధ్యతలను చూసే అధికారి)ను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది.
ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
''ఇస్లామాబాద్లోని అమెరికా 'చార్జ్ డి అఫైర్స్'ను పిలిపించాం. భారత్లోని అమెరికా రాయబారి జమ్మూకశ్మీర్ పర్యటన సందర్భంగా అక్కడి పరిస్థితిపై వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేశారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.
జమ్మూ-కశ్మీర్ను 'భారత్లో భాగం' అని పేర్కొనడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనను పూర్తిగా వ్యతిరేకించింది. జమ్మూ-కశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీని తుది పరిష్కారం రావాల్సి ఉందని స్పష్టం చేశాం'' అని ఆ ప్రకటనలో పాకిస్తాన్ పేర్కొంది.
భారత్, పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ అంశానికి సంబంధించి ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటుంది. జమ్మూ-కశ్మీర్ను తన అంతర్భాగంగా భారత్ పరిగణిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతుంది.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
ఇటీవలి కాలంలో పాకిస్తాన్, అమెరికాల మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. ఇరాన్, అమెరికాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది.
'ఇక్కడికి మొదటిసారి వచ్చాను, ఇది భారత్లో ముఖ్యమైన భాగం'
ఈ ఏడాది జనవరిలో భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన భారత్లోని పలు రాష్ట్రాల్లో పర్యటించారు.
జమ్మూ-కశ్మీర్కు వెళ్లిన సెర్గియో గోర్ బుధవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో దిగిన ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు.
''జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలవడం, వారి ప్రాధాన్యతలను తెలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించే అవకాశాల సృష్టిపై మా చర్చలు జరిగాయి'' అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆయన విలేఖరులతో కూడా మాట్లాడారు.
''ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగం. నేను భారత్లో అమెరికా రాయబారిని అనే విషయం మీకు తెలుసు. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి'' అని ఆయన విలేఖరులతో అన్నారు.
''ఈ ప్రాంతం చాలా అందమైనది. ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని చూడటం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇందాకే మేం భేటీ అయ్యాం. ఆ సమావేశం చాలా బాగగా జరిగింది. ఇంకా మేం చర్చించాల్సిన అంశాలు, ఫాలో అప్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని వాషింగ్టన్, దిల్లీ దృష్టికి తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. ఈ భేటీ ఎంతో ఆప్యాయంగా సాగింది. ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం ఆసక్తిగా ఉన్నాం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
వివిధ దేశాలకు వెళ్లే తమ పౌరుల కోసం అమెరికా విదేశాంగ శాఖ, ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేస్తుంది.
భారత్ విషయంలో అమెరికా లెవల్-2 అడ్వైజరీని అమలు చేస్తోంది.
అయితే జమ్మూ-కశ్మీర్ సహా కొన్ని ప్రాంతాలకు మాత్రం లెవల్-4 అడ్వైజరీని జారీ చేసింది.
తీవ్రవాదం, అశాంతి పరిస్థితుల దృష్ట్యా జమ్మూ-కశ్మీర్లో పర్యటించవద్దని అమెరికా తమ పౌరులకు సూచించింది.
శ్రీనగర్లో విలేఖరులతో మాట్లాడుతూ ఈ అడ్వైజరీపై సెర్గియో గోర్ స్పందించారు.
''అమెరికా తమ పౌరుల కోసం ట్రావెల్ హెచ్చరికలను జారీ చేస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాం. నేను ఈరోజు ఇక్కడ పెద్ద ప్రకటనలేమీ చేయలేను. కానీ, ఈ అంశంపై మేం తప్పకుండా దృష్టి సారిస్తాం.
ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు, మరింత భద్రత కల్పించేందుకు ఇక్కడి కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు అద్భుతమైన చర్యలు తీసుకున్నాయని మేం భావిస్తున్నాం. అందుకే అమెరికా సూచించిన ఈ ట్రావెల్ హెచ్చరికలను తగ్గించవచ్చా లేదా అనేది పరిశీలిస్తాం. ఇది ఒక అందమైన ప్రాంతం. చాలామంది అమెరికన్లు ఇక్కడికి వచ్చి ఈ అందాలను చూసి ఆనందిస్తారని నేను భావిస్తున్నా'' అని సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు.
'అమెరికా, జమ్మూకశ్మీర్ అనుబంధం మరింత బలపడుతుంది'
సెర్గియో గోర్ ఈ ప్రకటన చేస్తున్న సమయంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన పక్కనే ఉన్నారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా విలేఖరులతో మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో అమెరికా, జమ్మూకశ్మీర్ల మధ్య చర్చలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
''ఈ సమావేశం చాలా బాగా జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలపై మాట్లాడే అవకాశం మాకు లభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ కోసం అమెరికా ఏమి చేయగలదనే అంశంపై ప్రత్యేకంగా చర్చించాం. కొన్ని పాత సమస్యలు ఉన్నాయి. వాటిని కాలక్రమేణా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
ఈ చర్చలు రాయబారి గోర్- వాషింగ్టన్ మధ్య, అలాగే నాకూ న్యూదిల్లీలోని భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతాయి. రాబోయే కాలంలో అమెరికా, జమ్మూకశ్మీర్ మధ్య అనుబంధం మరింత విస్తరిస్తుందని, బలపడుతుందని నేను నమ్ముతున్నా'' అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో సెర్గియో గోర్తో దిగిన ఫోటోలను పంచుకుంటూ ట్వీట్ చేశారు.
''ఈరోజు శ్రీనగర్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. పర్యాటకం, ఉద్యానవన రంగం, నవ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి వంటి రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై మంచి చర్చ జరిగింది. ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
మన సమస్యలతో వారికి పెద్దగా సంబంధం లేదని సెర్గియోగోర్తో సమావేశానికి ముందు విలేఖరులతో మాట్లాడుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
''మన సమస్యలను మరో దేశం ముందు ప్రస్తావించడం నా అలవాటు కాదు. మన సమస్యలను వాషింగ్టన్ పరిష్కరించాల్సిన అవసరం లేదు. మన సమస్యలను మన కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి. మన దేశ సమస్యల గురించి వేరే దేశ రాయబారికి ఫిర్యాదు చేయడం చాలా తప్పుడు విషయం అవుతుంది" అని అన్నారు.
'అంతర్భాగం' అనడానికి బదులుగా 'ముఖ్యమైన భాగం' అని ఎందుకు అన్నారంటే...
సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది.
సెర్గియో గోర్ 'అంతర్భాగం' అనే పదానికి బదులుగా 'ముఖ్యమైన భాగం' అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో జర్నలిస్ట్ రాహుల్ శివశంకర్ వివరించారు.
''దౌత్యవేత్తలు తమ పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. సెర్గియో గోర్, భారత్లో అమెరికా రాయబారి మాత్రమే కాదు. దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాలకు కూడా అమెరికా ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఆయన 'ముఖ్యమైన భాగం' అనే పదాన్ని ఉపయోగించారంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి'' అని ట్వీట్లో శివశంకర్ పేర్కొన్నారు.
సెర్గియో గోర్ పర్యటనకు ముందు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా ఒక ట్వీట్ చేశారు.
''కశ్మీర్ సందర్శనకు వ్యతిరేకంగా అమెరికా జారీ చేసిన అత్యున్నత స్థాయి ట్రావెల్ అడ్వైజరీని సమీక్షించి, వెనక్కి తీసుకోవడం సెర్గియో గోర్ చేయగలిగిన కనీస పని'' అని ట్వీట్లో ఆమె పేర్కొన్నారు.
''పర్యాటకంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవించే కశ్మీర్కు, ఈ ట్రావెల్ అడ్వైజరీ కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. ప్రపంచానికి కశ్మీర్కు మధ్య అడ్డుగోడగా మారింది. దీన్ని తొలగిస్తే భద్రతపై బలమైన నమ్మకం ఏర్పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు మళ్లీ వస్తారు. పర్యాటకంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది'' అని ఆమె ట్వీట్ చేశారు.
'భారత్లో ముఖ్యమైన భాగం' అని సెర్గియో గోర్ అనడం ఒక స్వాగతించదగ్గ రాజకీయ ప్రకటన అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ స్పందించారు.
''ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ ఈ మాటల ప్రాధాన్యతను గమనించి ఉంటారు. పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూద్దాం'' అని ఆయన ట్వీట్ చేశారు.
‘సెర్గియో గోర్ బాస్కు పాక్ అంటే ఇష్టం ఉండటమే ఇక్కడ సమస్య’
కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్తాన్ల మధ్య ఎప్పుడూ తీవ్ర ఉద్రిక్తత ఉంటుంది. ఇటీవల అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు బలపడుతున్న వేళ, సెర్గియో గోర్ పర్యటన పాకిస్తాన్కు ఒక ఎదురుదెబ్బ అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాసియా వ్యవహారాల విశ్లేషకుడు మైకేల్ కుగెల్మన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
''కచ్చితంగా అమెరికా-భారత్ సంబంధాలకు కొత్త ఊపు అవసరం. కశ్మీర్లో గోర్ చేసిన వ్యాఖ్యలు అమెరికా అధికారిక విధానాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తాయా లేదా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, న్యూదిల్లీ మాత్రం దీన్ని స్వాగతిస్తుంది.
ఇరు దేశాల సంబంధాలకు బలం అవసరమైన సమయంలో ఈ పర్యటన మంచి ఊపునిచ్చింది. మరోవైపు అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు బలపడుతున్న ప్రస్తుత తరుణంలో, కశ్మీర్లో అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలను ఇస్లామాబాద్ లేదా రావల్పిండి ఏమాత్రం జీర్ణించుకోలేవు.
ఇది అమెరికా-పాకిస్తాన్ సంబంధాలకు ఒక ఊహించని ఎదురుదెబ్బ. అయితే దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఏం చెబుతుందో చూడాలి. వేగంగా ఒక నిర్ణయానికి రావడం సరికాదు. కానీ, గత కొన్ని గంటలుగా జరిగిన పరిణామాలు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతో అవసరమైన బలాన్ని అందించాయి'' అని కుగేల్మాన్ చెప్పారు.
ఇండో-పసిఫిక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు డెరెక్ జె. గ్రాస్మన్, ఒమర్ అబ్దుల్లా పోస్ట్ను రీపోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని జోడించారు.
''జమ్మూ-కశ్మీర్లో అమెరికా రాయబారి గోర్ పర్యటించడం భారత్కు పెద్ద ప్రోత్సాహం. కానీ, ఆయన బాస్ మాత్రం పాకిస్తాన్ను ఇష్టపడే అవకాశం ఉండటమే ఇక్కడ సమస్య'' అని గ్రాస్మన్ పేర్కొన్నారు.
అమెరికా రాయబారి సెర్గియో గోర్, శ్రీనగర్ పర్యటన కశ్మీర్ చరిత్ర, అక్కడి వాస్తవాలకు దూరంగా ఉందని పాకిస్తాన్ నాయకుడు నబీల్ గబోల్ ఎక్స్ వేదికగా రాశారు.
''ఇలాంటి సున్నితమైన ప్రాంతంలో పర్యటనకు వెళ్లే ముందు ఆయనకు సరైన బ్రీఫింగ్ అందించలేదని ఆయన చేసిన ప్రకటనలను చూస్తే అర్థమవుతోంది. భారత్లో జమ్మూకశ్మీర్ భాగం కాదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు 47, 51, 80, 91, 98, 122, 123, 126 కింద ఇది ఇంకా అజెండాలోనే ఉంది. కాబట్టి రాయబారి ఐరాస రికార్డులను పరిశీలించాలి. చరిత్ర తెలియకపోవడం అనేది దౌత్యానికి ప్రత్యామ్నాయం కాదు'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఆస్ట్రియన్-బల్గేరియన్ భౌగోళిక రాజకీయ వ్యూహకర్త వెలినా చాకరోవా కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.
''ఇరాన్ కాల్పుల విరమణలో మధ్యవర్తిత్వం, సౌదీ అరేబియా, తుర్కియేలతో రక్షణ ఒప్పందాల వల్ల పాకిస్తాన్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రపంచ అగ్రరాజ్యాల నిర్ణయమే అంతిమం. ఈ విషయంలో కొత్త కూటములు, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు భారత్ వైపే అమెరికా నిలబడింది'' అని ఆమె ట్వీట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)