హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశంలోని అనేక రైల్వేస్టేషన్లలో తాగునీరు, ఇతర సౌకర్యాల గురించి కాగ్ ఏం చెప్పిందంటే...

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ చేసిన దేశంలోని 512 రైల్వే స్టేషన్లలో.. 89 శాతం స్టేషన్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయని తెలిసింది.

కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న అనేక పెద్ద స్టేషన్లు కూడా తాగునీరు, టాయిలెట్లు, కూర్చునే ఏర్పాట్లు, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు, దివ్యాంగులకు సౌకర్యాలు వంటి ప్రాథమిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉన్నాయని కాగ్ నివేదికలో వెల్లడైంది.

అనేక స్టేషన్లలో నీటి పరీక్షలు క్రమం తప్పకుండా జరగకపోవడంతో, కాగ్ నివేదిక తాగునీటి నాణ్యతపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసింది.

కాగ్ నివేదికపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఆర్‌బీ, సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు ఈ నివేదికను సమీక్షించి, సురక్షితమైన తాగునీటి కోసం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. దీనిని బోర్డు స్థాయి నుంచి నేరుగా పర్యవేక్షిస్తారని కూడా రైల్వే శాఖ తెలిపింది.

కాగ్ నివేదిక ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో నీటిలో క్లోరిన్ స్థాయిలు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది.

అనేక స్టేషన్ల నుంచి సేకరించిన నీటి శాంపుళ్లలో ఇ. కోలి, టోటల్ కోలిఫామ్ బ్యాక్టీరియా కూడా గుర్తించారు. ఇవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

కొన్ని ఇ. కోలి ఇన్ఫెక్షన్లు విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో, కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి కూడా వస్తుంది.

దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్‌లలోని 512 నాన్-సబర్బన్ రైల్వే స్టేషన్లను కాగ్ ఆడిట్ చేసింది.

దర్యాప్తులో ఈ స్టేషన్లలో 458 స్టేషన్లలో అంటే 89 శాతానికి పైగా స్టేషన్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు లోపించినట్లు తెలిసింది.

ఈ సౌకర్యాల విషయంలో ఎలాంటి లోపాలు లేని స్టేషన్లు కేవలం 54 మాత్రమే ఉన్నాయని కాగ్ నివేదికలో వెల్లడైంది.

అన్ని స్టేషన్లలో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని రైల్వే బోర్డు 2018 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే, ఏడేళ్లు గడిచినా ఈ లక్ష్యం నెరవేరలేదు.

‘పెద్ద స్టేషన్లలో కూడా దయనీయ పరిస్థితులు’

ఈ నివేదికలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే.. న్యూదిల్లీ, హౌరా, ముంబయి సెంట్రల్, సీఎస్ఎంటీ, అహ్మదాబాద్, చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ వంటి దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా నిత్యావసర సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నాయి.

అనేక ప్రధాన స్టేషన్లలో తాగునీటి కుళాయిలు, పారిశుధ్య సౌకర్యాలు, తగినన్ని ఫ్యాన్లు, కూలర్లు లేవని, ఇంకా అనేక స్టేషన్లలో ప్రజలకు సూచన బోర్డులు కూడా లేవని తేలింది.

ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు సందర్శించే, కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించే టాప్ 10 రైల్వే స్టేషన్లలో కూడా కనీస సౌకర్యాలు కొరవడ్డాయని తెలిసింది.

తాగునీరు కలుషితం

అనేక స్టేషన్లలో క్రమం తప్పకుండా తాగునీటి పరీక్షలు నిర్వహించకపోవడంతో, తాగునీటి నాణ్యతపై కూడా కాగ్ తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసింది.

ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరును అందించేందుకు రైల్వే తన వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి ఉందని కాగ్ సూచించింది.

సదరన్ రైల్వేలోని కోయంబత్తూరు, పాలక్కడ్ జంక్షన్, సౌత్ సెంట్రల్ రైల్వేలోని హైదరాబాద్ స్టేషన్, సెంట్రల్ రైల్వేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భీవండి రోడ్, కల్యాణ్, లోనావాలా, ఈస్ట్రన్ రైల్వేలోని మధుపూర్ స్టేషన్‌లలోని వాటర్ కూలర్ల నుంచి తీసుకున్న వాటర్ శాంపుల్‌లో ఇ. కోలి బ్యాక్టీరియాను గుర్తించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది.

2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 'సూపర్‌బగ్'గా వర్గీకరించిన బ్యాక్టీరియానే ఇ.కోలి. తినే ఆహారంలో, డ్రింక్స్‌లో దీనిని గుర్తించవచ్చు.

యాంటీబయాటిక్స్‌ను కూడా తట్టుకుని నిలబడే ప్రాణాంతక బ్యాక్టీరియాను సూపర్‌బగ్స్ అంటారు. గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా అయిన ఇ.కోలి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఆడిట్ సమయంలో, 512 స్టేషన్లలలో 138 స్టేషన్లలో తాగునీటి కుళాయిల కొరత ఉన్నట్లు గుర్తించారు.

111 స్టేషన్లలోని యూరినల్స్, 59 స్టేషన్లలోని టాయిలెట్లు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

21 స్టేషన్లలో కనీసం వెయిటింగ్ రూమ్ కూడా లేదు.

అనేక చోట్ల ప్రయాణికులకు అవసరమైనంత తాగునీరు అందుబాటులో లేదని కాగ్ నివేదిక పేర్కొంది. అయితే అన్ని స్టేషన్లలో నీటి ఏర్పాట్లు చేశామని రైల్వే శాఖ గతంలోనే ప్రకటించింది.

‘ఎండలోనూ, వర్షంలోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’

ప్లాట్‌ఫామ్ షెల్టర్‌ల కొరత కూడా ఒక తీవ్రమైన సమస్యగా కాగ్ నివేదికలో వెలుగులోకి వచ్చింది.

ప్లాట్‌ఫాం షెల్టర్లు 65 స్టేషన్లలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని కాగ్ నివేదికలో వెల్లడైంది.

ప్లాట్‌ఫామ్ మీద జనరల్ కోచ్‌లు ఆగేచోట ప్రయాణికులను ఎండ, వానల నుంచి రక్షించడానికి అవసరమైనన్ని షెడ్లు కూడా లేని రైల్వే స్టేషన్లు 379 ఉన్నాయని గుర్తించింది కాగ్.

ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్, ప్లాట్‌ఫామ్ షెల్టర్ మధ్య కప్పుతో కూడిన నడకదారి లేని 247 స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

దివ్యాంగులైన ప్రయాణికులకు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

512 స్టేషన్లలో 227 స్టేషన్లలో ర్యాంపులు లేవు. 297 స్టేషన్లలో దివ్యాంగులైన ప్రయాణికుల కోసం సరైన మంచినీటి ట్యాపులు లేవు. 134 స్టేషన్లలో దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు లేవు.

ఇంతే కాకుండా, 490 స్టేషన్లలో దివ్యాంగ ప్రయాణికులకు అవసరమైన ప్రత్యేక సీటింగ్ వ్యవస్థ కూడా లేదు.

అనేక ప్రధాన స్టేషన్లలో బ్రెయిలీ సంకేతాలు, సహాయ కేంద్రాలు వంటి సౌకర్యాలు కూడా లోపించినట్లు కాగ్ నివేదికలో గుర్తించారు.

ఈ నివేదిక రైలు ప్రయాణికుల భద్రతపై కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

దర్యాప్తులో వెల్లడైన విషయమేమిటంటే.. 512 స్టేషన్లలో 441 స్టేషన్లలో ఎయిమ్స్ సిఫార్సుల ప్రకారం ఎమర్జెన్సీ మెడికల్ రూమ్స్ గానీ, మెడికల్ బాక్సులు గానీ అందుబాటులో లేవు.

ఏదైనా తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

‘క్లీనింగ్‌కు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితి అలానే ఉంది’

రైల్వే శాఖ పరిశుభ్రత కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, స్టేషన్ల పరిస్థితి సంతృప్తికరంగా లేదని కాగ్ నివేదికలో తేలింది.

77 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, 128 స్టేషన్లలో వాటర్ బూత్‌లు మురికిగా, 165 స్టేషన్లలో టాయిలెట్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు గుర్తించారు.

301 స్టేషన్లలో వీధి కుక్కల సంచారం ఉన్నట్లు గుర్తించారు. 243 స్టేషన్లలో పాన్, గుట్కా మరకలు కనిపించగా, 21 స్టేషన్లలో బహిరంగ మలవిసర్జన కూడా ఒక సమస్యగా మారింది.

రైల్వేలకు నిధుల కొరత లేనప్పటికీ, పథకాల అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

2019-20 నుంచి 2023-24 వరకు ప్రయాణీకుల సౌకర్యాల కోసం కేటాయించిన బడ్జెట్‌లో 36 శాతం నుంచి 44 శాతం వరకు ఖర్చు చేయకుండా మిగిలిపోయింది.

ఐదేళ్లలో సుమారు రూ. 5,956 కోట్ల మొత్తాన్ని ఖర్చుపెట్టలేదు.

395 ప్రయాణీకుల సౌకర్యాల ప్రాజెక్టుల రివ్యూలో, 59 శాతం పనులు ఆలస్యమయ్యాయని, కొన్ని ప్రాజెక్టులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆలస్యమయ్యాయని తేలింది.

కాగ్ సిఫార్సులు

నిర్ణీత కాలపరిమితిలోగా అన్ని స్టేషన్లలో రైల్వే కనీస అవసరమైన సౌకర్యాలను కల్పించాలని నివేదిక సిఫార్సు చేసింది.

అలాగే, దివ్యాంగుల కోసం కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని కోరింది.

శానిటేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచాలని, తాగునీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలని, అలాగే పర్యవేక్షణ, జవాబుదారీ యంత్రాంగాలను బలోపేతం చేయాలని కాగ్ సిఫార్సు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)