You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాలె టెస్ట్లో విజయంతో మెరుగుపడిన భారత్ టెస్టు విజయాల శాతం
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలకంలోని గాలె వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో గెలిచింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ది శుభ్మన్ గిల్ సేన 206 పరుగులకే కట్టడి చేసింది.
దీంతో రెండు టెస్ట్ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (167, 44 పరుగులు).. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తం 10 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ‘‘మానవ్ సుతార్ బౌలింగ్ అమోఘం. ఇప్పటికి ఆడింది రెండు టెస్ట్ మ్యాచ్లే అయినా ఈ ప్రతిభావంతుడు ఇండియాకు దీర్ఘకాలం ఆడతాడనిపిస్తోంది’’ అని కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసించాడు.
భారత్కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్ . ఈ గెలుపుతో భారత్ తన టెస్ట్ విజయాల శాతాన్ని మెరుగుపరుచుకుంది.
తొలి నుంచి భారత్ ఆధిపత్యం..
భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. భారత్ భారీ స్కోరు సాధించడంలో దేవదత్ పడిక్కల్ వెన్నుముకగా నిలిచాడు. పడిక్కల్ చేసిన 167 పరుగుల భారీ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51), రిషభ్ పంత్ (39), యశస్వీ జైస్వాల్ (32) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్లో లంక బౌలర్లు ప్రభాత్ జయసూర్య (4), కేశర నువాంత (3), అసిత ఫెర్నాండో (2) వికెట్లు తీశారు.
ఇక శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేసింది. సోనల్ దినుష (100), నిరోషన్ డిక్వెల్లా (80) రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్లో 178 పరుగులు వెనుకపడింది. శ్రీలంకను కట్టడి చేయడంలో భారత బౌలర్లు మానవ్ సుతార్ (4 వికెట్లు), రవీంద్ర జడేజా (3 వికెట్లతో) విజయం సాధించారు.
రెండో ఇన్నింగ్స్ బౌలర్లదే..
తొలి ఇన్నింగ్స్లో లభించిన 178 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆశించిన రీతిలో స్కోరు చేయలేకపోయింది. పరుగులు చేయడానికి భారత బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.
పంత్ (66 పరుగులు), పడిక్కల్ (44), కేఎల్ రాహుల్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాటపట్టారు.
శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో (4 వికెట్లు), ప్రభాత్ జయసూర్య (3), లాహిరు కుమార (2) కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ను 193 పరుగులకే పరిమితం చేశారు.
ఇక మొత్తంగా 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (6 వికెట్లు) చెమటలు పట్టించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్కు తోడు, ఫీల్డింగ్తో లంకను 206 పరుగులకే పరిమితం చేసింది భారత్.
తొలుత సోనల్ దినుష (84 పరుగులు) పోరాటానికి తోడు కెప్టెన్ ధనంజయ (59) రాణించినా వారి భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా విడగొట్టడంతో భారత్ పని సులువైంది. మిగిలిన బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు.
దీంతో 165 పరుగుల తేడాతో భారత్ తన 600వ టెస్టులో విజయాన్ని నమోదు చేసింది.
ఈ సిరీస్లో చివరిదైన రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23న ప్రారంభం కానుంది.
పెరిగిన విజయాల శాతం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలిచేందుకు భారత్కు ఈ విజయం ఎంతో అవసరం. శ్రీలంకపై గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారకపోయినా విజయాల శాతాన్ని మాత్రం 53.33కి పెంచుకుంది. ప్రస్తుతం భారత్ 64 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
2025-27 డబ్ల్యూటీసీ రేసులో 84 పాయింట్లు, 77.78 విజయాల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (36 పాయింట్లు, 75.00 శాతం), న్యూజిలాండ్ (52 పాయింట్లు, 72.22 శాతం), బంగ్లాదేశ్ (40 పాయింట్లు, 66.67 శాతం) ఉన్నాయి.
ఇటీవలే ఆస్ట్రేలియాపై 9 వికెట్లతో సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)