నేపాల్ వరదల గురించి ఇప్పటి వరకు ఏం తెలుసు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఒలీవియా ఐర్లాండ్, హెన్రీ మూరె, ఆమీ వాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
భారీగా మంచు, మట్టిపెళ్లలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్రనష్టం కలిగించాయి.
వందలాదిమంది చనిపోయారు. వేలాదిమంది ఆచూకీ లభించడం లేదు.
వరదల్లో 600 మందికిపైగా చనిపోయారని, 2,400మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అధారిటీ తెలిపింది.
టిబెట్లో ఏడుగురు చనిపోయారని, 554మంది ఆచూకీ తెలియడం లేదని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించడానికి ఇది కీలక సమయమని, మళ్లీ వరద ముంచెత్తవచ్చన్న భయాందోళన పెరుగుతోందని సహాయ సిబ్బంది చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
కొండచరియలు విరిగిపడడానికి కారణమేంటి?
నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయని, విధ్వంసకర వరదలకు అదే కారణమని ప్రాథమికంగా అంచనావేశారు.
కానీ, హిమానీనదం లేదా అందులోని ఓ భాగం ఒక్కసారిగా కూలిపోవడం కారణమని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) తర్వాత నిర్ధరించింది.
కూలిపోయిన హిమానీనదం లోయ అడుగుభాగాన్ని బలంగా తాకడంతో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని, తీరప్రాంతాల్లో మరింత విధ్వంసానికి ఇది కారణమైందని ఆ సంస్థ తెలిపింది.
త్రిశూలీ, భోటేకోశీ నదుల నుంచి పోటెత్తిన వరదనీరు, మట్టి, రాళ్ల శిథిలాలు వందకిలోమీటర్లు దిగువకు ప్రవహించాయని యూఎస్జీఎస్ తెలిపింది. ఉత్తర నేపాల్లో ప్రముఖ పర్వతారోహణ, ఆధ్యాత్మికత పరంగా ప్రసిద్ధి పొందిన పట్టణాలను ఈ వరద ముంచెత్తింది.
నువాకోట్లో ప్రజలు ప్రాణాలకోసం పరుగులు తీస్తుండగా బురద, రాళ్లతో నిండిన భారీ ప్రవాహంలో భవనాలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి.

త్రిశూలీనది వెంట ఉన్న లోయలోకి భారీగా నీరు, మట్టి వచ్చి నేపాలీ వైపున్న రసువాగఢీ బోర్డర్ చెక్పాయింట్ బహుళఅంతస్తుల భవనాన్ని చుట్టుముట్టడం ఓ వీడియోలో కనిపిస్తోంది.
సరిహద్దుకు అవతలివైపున్న గ్యిరాంగ్ పోర్ట్ను కూడా వరదలు ముంచెత్తాయి. టిబెట్ గ్రామాల్లో ప్రజలు మరణించారు.
సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ ఘటనలు ఎలాంటి వరుసక్రమంలో జరిగాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నేపాల్, టిబెట్ను వరదలు ముంచెత్తడానికి కొన్ని గంటలు లేదా రోజుల ముందే హిమానీనదం కూలిపోయిఉండొచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో భూశాస్త్రాల ప్రొఫెసర్ మైక్ సియర్లె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోసారి వరదలొచ్చే ప్రమాదముందా?
''ముందుగా కొండచరియలు విరిగిపడి ఉండొచ్చు. తర్వాత నీరు ఓ చోటకు చేరి నదికి అడ్డుగా మారుండొచ్చు. చివరకు ఒక్కసారిగా అది పేలిపోయిఉండొచ్చు అందువల్లే ఇంత పెద్దమొత్తంలో మట్టి, రాళ్లు నీటిప్రవాహంలో కొట్టుకువచ్చాయి'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
నదుల్లోకి కొట్టుకొచ్చిన మట్టి, రాళ్ల కారణంగా రాబోయే రోజుల్లో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్(ఐసీఐడీఎంవోడీ) హెచ్చరించింది.
త్రిశూలీనది ఇరుకైన ప్రాంతాల్లో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఐసీఐడీఎంవోడీ తెలిపింది. ఇలా జరిగితే కొండచరియలు, మట్టి నది అడ్డుగా చేరి నీటిని నిలిపివేసే గోడలా మారే ప్రమాదముందని, అది జరిగితే మరోసారి వరద ముంచెత్తవచ్చని తెలిపింది.
కొండచరియలు విరిగిపడిన తర్వాత ఏర్పడ్డ ఓ సరస్సు కట్టలు తెగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మరోవైపు చైనా హెచ్చరించింది. అలా జరిగితే దిగువ ప్రాంతాల్లో మరోసారి వరదలు రావొచ్చని, శుక్రవారానికి(ఆగస్టు 28) సరస్సులో 25లక్షల క్యూబిక్కుల నీరు చేరిందని సీసీటీవీ ప్రసారసంస్థ తెలిపింది.
చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఏర్పడిన ఈ సరస్సు ఉప్పొంగడంతో శుక్రవారం సహాయక చర్యలను కొద్దిసేపు నిలిపివేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. తర్వాత నీటిమట్టం కొంత తగ్గింది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
అయితే సరస్సులోని నీరు కాలక్రమేణా సహజంగా బయటకు వెళ్లే అవకాశముందని నిపుణులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతులు, ఆచూకీ లభించని వారి సంఖ్య
మృతులు, కనిపించకుండాపోయినవారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
చనిపోయినవారి సంఖ్య శనివారానికి 616కు చేరుకుందని నేపాలీ పోలీసులు చెప్పారు. 2,426మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
వరదలు వచ్చినప్పటినుంచి కనిపించకుండా పోయిన 517మందికిపైగా విదేశీయుల జాబితాను నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది. 44మంది నేపాల్ సైనికులు, 28మంది పోలీసు అధికారులు కూడా కనిపించకుండాపోయినవారిలో ఉన్నారని విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు.
టిబెట్లో ఏడుగురు చనిపోయారని, 554మంది ఆచూకీ తెలియడం లేదని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
1950ల్లో చైనా ఆక్రమించుకున్న టిబెట్లోకి విదేశీ మీడియా వెళ్లడం దాదాపు అసాధ్యం. స్థానిక ప్రజలను సంప్రదించడం కూడా కష్టం.
నేపాల్, చైనా విడుదల చేసిన గణాంకాల్లో ఒకే వ్యక్తులను రెండుసార్లు లెక్కించి ఉంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఈ ప్రాంతంలో వర్షాలు, ఊహించలేని వాతావరణ పరిస్థితులు సహాయకచర్యలను మరింత కష్టంగా మారుస్తున్నాయని నేపాల్ ఆర్మీ ప్రతినిధి బ్రిడేగియర్ జనరల్ రాజారామ్ బాస్నెట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే దేశాలకు చెందినవారెంతమంది ఉన్నారు?
పర్వతాలు, పవిత్ర స్థలాలను సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యటకులు నేపాల్ వస్తుంటారు. ఆచూకీ తెలియనివారిలో ఈ దేశాలకు చెందినవారుఉన్నారు.
భారత్ – 320మంది భారతీయుల ఆచూకీ లభించడం లేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
చైనా -నేపాల్లో దాదాపు 100మంది చైనీయుల ఆచూకీ లభించడంలేదని చైనా విదేశాంగశాఖ తెలిపింది.
అమెరికా -90మంది అమెరికన్లు కనిపించడంలేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
యుక్రెయిన్ – 62మంది యుక్రేనియన్లు కనిపించడంలేదని నేపాల్ పోలీసులు చెప్పారు.
మలేసియా – 51మంది మలేసియా ప్రజలు ఫిష్టెయిల్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్నారని, వరదల తర్వాత వారు కనిపించకుండాపోయారని అధికారులు చెప్పారు.
ఆస్ట్రేలియా – 41 మంది ఆస్ట్రేలియన్ల ఆచూకీ తెలియడం లేదని ఆ దేశ సహాయ ఇమ్మిగ్రేషన్ మంత్రి తెలిపారు.
యూకే-33మంది బ్రిటిష్ జాతీయులు కనిపించడం లేదని నేపాల్ పోలీసులు చెప్పారు.
కెనడా – 30మంది కెనడియన్లు కనిపించడం లేదని ఆ దేశ విదేశాంగశాఖ తెలిపింది.
దక్షిణకొరియా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, నెదర్లాండ్స్, న్యూజీలాండ్కు చెందిన మరికొంతమంది ప్రయాణికుల ఆచూకీ కూడా లభించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయి?
సహాయకచర్యలు కొనసాగుతున్నాయని, మరింత వేగవంతం చేసేందుకు అదనపు బలగాలను మోహరిస్తున్నామని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా కార్యాలయం తెలిపింది.
రసువా నుంచి చిత్వాన్ వరకున్న నదీతీరాల్లో అలాగే ప్రభావిత ప్రాంతాల్లో అవకాశమున్న అన్నిచోట్లా 1,200మంది సభ్యులతో కూడిన బలమైన బృందాన్ని మోహరించినట్టు తెలిపింది.
సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువా తెలిపింది.
సహాయ కార్యక్రమాలకు చేయూతనివ్వాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి కమల్ కిశోర్ ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం చేసేందుకు ఐదులక్షల డాలర్లు అందిస్తామని అమెరికా ప్రకటించింది. యూకే 50లక్షల పౌండ్ల సాయం అందిస్తామని తెలిపింది.
దాదాపు 50టన్నుల సహాయకసామాగ్రిని తీసుకుని సైనిక కార్గో విమానాలు నేపాల్ వెళ్లాయని భారత వైమానికదళం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వరదలకు వాతావరణ మార్పులు కారణమనుకోవచ్చా?
హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానీనదాలు పలుచబడి కొండచరియలు విరిగి పడే ప్రమాదం పెరగొచ్చని భూగర్భశాస్త్రవేత్త డేనియల్ షుగర్ చెప్పారు. ఆకస్మికవరదలకు హిమానీనదం కారణమయ్యుండొచ్చని ముందుగా చెప్పిన నిపుణుల్లో ఆయన ఒకరు.
అయితే ఆకస్మిక వరదలకు వాతావరణమార్పులు కారణమని భావించడం ఈ దశలో తొందరపాటని కెనడాలోని కాల్గరీ యూనివర్శిటీకి చెందిన షుగర్ బీబీసీతో చెప్పారు.
వాతావరణ మార్పులు ప్రభావం చూపిఉండొచ్చని దుండే యూనివర్శిటీకి చెందిన సైమన్ కుక్ చెప్పారు.
హిమానీనదం కూలిపోయిన ప్రాంతాన్ని తమ బృందం గుర్తించిందని ఆయన చెప్పారు. నేపాల్లోని లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం దగ్గరలో ఉన్న హిమానీనదం దిగువభాగం కూలిపోయిందని, ఇది వరదలు వచ్చిన ప్రాంతానికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన బీబీసీతో చెప్పారు.
వాయువ్వ దిశలో హిమానీనదం కూలిపోయి, పశ్చిమదిశగా ప్రవహించిఉండొచ్చని కుక్ అంచనావేశారు.
కొన్నిపర్వత ప్రాంతాల వాలులను పర్మాఫ్రాస్ట్(ఏళ్ల తరబడి గడ్డకట్టిన నేల)కొంతవరకు బలంగా పట్టిఉంచుతుంది. పర్మాఫ్రాస్ట్ వేడెక్కి, కరిగి బలహీనపడుతోంది. దీనివల్ల మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశముంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























