తుర్కియేతో యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ నెగ్గగలదా? ఎవరి బలం ఏ స్థాయిలో ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఇజ్రాయెల్ 1948 మే 14న ఏర్పడింది. తుర్కియే ఒక సంవత్సరం లోపే అంటే 1949 మార్చి 28న దానిని గుర్తించింది. ఇజ్రాయెల్ను సార్వభౌమ దేశంగా గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియే.
కానీ, సుమారు 8 దశాబ్దాల తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య గతఏడాది 12 రోజుల యుద్ధం మధ్య ప్రాచ్యంలో అధికార సమతుల్యతను బాగా ప్రభావితం చేసింది.
ఇజ్రాయెల్ మరింత దూకుడుగా వ్యవహరించే దేశంగా ఆవిర్భవించగా, ఇరాన్ అనేక స్థాయిలలో తీవ్రమైన నష్టాలను చవిచూసింది.
ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ సంఘర్షణను నివారించాలని చూస్తున్నట్లు అమెరికా కనిపిస్తున్నప్పటికీ, ఇరాన్ బలహీనపడితే దాని స్థానాన్ని తుర్కియే భర్తీ చేయవచ్చనే చర్చ ఇజ్రాయెల్లో జరుగుతోంది.

ఏప్రిల్ 18న సిరియాలోని అబు అల్-దుహుర్ సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష హెచ్చరికల పరంపర కొనసాగింది.
తుర్కియే, ఇజ్రాయెల్ దేశాలు ఘర్షణకు మరింత దగ్గరవుతున్నాయా? అనే సంక్లిష్టమైన ప్రశ్నను సిరియాలో తెరపైకి తెచ్చింది.
సిరియాలో తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య వైరాన్ని ఒక నిర్మాణాత్మకమైనదిగా చూస్తారు. ఎందుకంటే, ఈ రెండు దేశాలు కూడా పూర్తిగా భిన్నమైన ఫలితాలను ఆశిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సిరియాలో ఘర్షణ ఎందుకు?
'' సరిహద్దులను నియంత్రించగల శక్తి ఉన్న, సాయుధ సమూహాలను తన నిర్మాణంలోకి ఏకీకృతం చేసే సామర్ధ్యం ఉన్న, ఇస్లామిక్ స్టేట్, పీకేకే నుంచి ముప్పును అణచివేయగల సమర్ధమైన, శరణార్థుల రాకపోకలను సులభతరం చేయగలగిన సిరియాను తుర్కియే కోరుకుంటుంది. సుమారు 900 కిలోమీటర్లలో సరిహద్దు విస్తరించి ఉండటంతో.. సిరియా పునరేకీకరణ కోసం తుర్కియేనే అత్యధిక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది'' అని మెర్సిన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బుగ్రాసారి మిడిల్ ఈస్ట్ మానిటర్లో లో రాశారు.
''మరోవైపు పరిమిత, బలహీనమైన సైనిక సామర్థ్యాలున్న సిరియాను ఇజ్రాయెల్ తన దేశ భద్రతకు మెరుగైన ఆప్షన్గా చూస్తోంది'' అని ప్రొఫెసర్ బుగ్రా చెప్పారు.
బషర్ అల్-అస్సద్ కాలంలో సిరియాలో ఇరాన్ ఆధిపత్యం చెలాయించింది. కానీ, అల్-షారా వచ్చినప్పటి నుంచి తుర్కియే ప్రాబల్యం పెరిగింది. ఫలితంగా, సిరియాలో ఇజ్రాయెల్ విరోధం కేవలం ఇరాన్తోనే కాదు, తుర్కియేతో కూడా.
ఒకవేళ ఇరాన్ బలహీనపడితే, అది సృష్టించిన ఈ ఖాళీని మరొకరు భర్తీ చేస్తారని ఇజ్రాయెల్ రేడియో 103 ఎఫ్ఎంలో ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ చెప్పారు.
"మధ్యప్రాచ్యంలో సామ్రాజ్యవాద ఆకాంక్షలతో సహజ పోటీదారుగా తుర్కియే ఉంది. తుర్కియే ఒక సామ్రాజ్యవాద వారసత్వం కలిగిన శక్తివంతమైన దేశం. ఇది ఆసియా, యూరప్ మధ్య ఉంది. అమెరికాను మినహాయిస్తే, నాటోలో అతిపెద్ద సైన్యం దీనికే ఉంది. దీని డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా బలమైంది. ఇక్కడి ప్రజలకు కష్టపడేతత్వం ఉంటుంది. ఆచరణాత్మకంగా యూరప్లో ఇది ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి. తుర్కియే ఒక కీలకమైన శక్తిగా అవతరించింది. ఇప్పటికే అనేక రంగాలలో దాని ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది" అని యోవ్ గలాంట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భౌగోళిక రాజకీయాలతో భావజాల పోరాటం
''తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ భావజాల పరమైనది, భౌగోళిక రాజకీయమైనది. ఎర్డోవాన్ ప్రభుత్వం సున్నీ ఇస్లామిక్ పాపులిజాన్ని తుర్కియే జాతీయవాదంతో మిళితం చేసింది" అని థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ సీనియర్ ఫెలో అస్లి ఐదింటాస్బాస్ గత జులైలో బ్రిటీష్ వార్తాపత్రిక ఫైనాన్సియల్ టైమ్స్కి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
''అదే సమయంలో, ఇజ్రాయెల్లోని మితవాద కూటమి దేశ భవిష్యత్తు గురించి అంతే కఠినమైన వైఖరిని అనుసరిస్తుంది. లెబనాన్, గాజా, సిరియాలో సైనిక ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఈ రెండు విరుద్ధ భావజాలాల మధ్య రాజీకి ఆస్కారం చాలా తక్కువ'' అని రాశారు.
''సిరియా అత్యంత తక్షణ యుద్ధభూమిగా మారింది. 2024 చివరిలో అస్సద్ ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి, రెండు దేశాలు కూడా యుద్ధానంతర పరిస్థితిని వారి స్వప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో తుర్కియే దాని ప్రభావాన్ని పెంచుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తన మిత్రపక్షాలకు మద్దతు ఇస్తోంది. అంకారాకు అనుకూలంగా ఉండే స్థిరమైన, కేంద్రీకృత ప్రభుత్వాన్ని సమర్థిస్తోంది. తుర్కియే ఇప్పటికే ఉత్తర సిరియాలోని చాలా భాగాలను తన నియంత్రణలో ఉంచుకుంది. దేశవ్యాప్తంగా తన ఆర్థిక, సైనిక ప్రభావాలను విస్తరించాలని భావిస్తోంది" అని అస్లి తెలిపారు.
''అదే సమయంలో వైమానిక దాడులతో ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఇది కుర్దిష్, డ్రూజ్ స్వతంత్రకు మద్దతు ఇస్తోంది. సిరియా కొత్త పాలకులకు జిహాదీలతో సంబంధాలు ఉన్నందున వారిని అనుమానంతో చూస్తోంది. దశాబ్దాలుగా, అమెరికా పాలసీ రూపకర్తలు తుర్కియే, ఇజ్రాయెల్లను ముఖ్యమైన మిత్రదేశాలుగా, ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభాలుగా పరిగణించారు'' అని చెప్పారు.
''ఇప్పుడు ఈ రెండు నేరుగా ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఇరాన్ బలహీనపడితే, మధ్యప్రాచ్యంలో తదుపరి ప్రధాన సవాలు వారి అత్యంత సన్నిహిత భాగస్వాముల మధ్య తలెత్తే వైరం నుంచే రాగలదని అమెరికా, దాని మిత్రదేశాలు గుర్తించాలి'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తుర్కియేను ఇజ్రాయెల్ ఓడించగలదా?
ఇరాన్తో వ్యవహరించినట్లుగా తుర్కియేతో ఇజ్రాయెల్ తలపడగలదా? తుర్కియేను ఇజ్రాయెల్ సైనికంగా ఎదుర్కోగలదా?
"తుర్కియేతో పోరాడటం ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్కు పూర్తిగా భిన్నమైన విషయం. ఇరాన్తో పోరాడటంలో అమెరికా మద్దతును ఇజ్రాయెల్ పొందింది. కానీ, తుర్కియే ఒక నేటో దేశం. ఒక నేటో దేశంపై దాడి జరిగితే, అది నేటో సభ్య దేశాలన్నింటిపై దాడిగా పరిగణిస్తారు. ఇదే అతిపెద్ద సంక్లిష్టత’’ అని దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర అన్నారు.
''ఇజ్రాయెల్, తుర్కియే సైన్యాలను పోల్చిచూస్తే గత పదేళ్లల్లో సైనిక సామర్థ్యాల పరంగా తుర్కియే చాలా స్వయం సమృద్ధిని సాధించింది. అది స్వయంగా డ్రోన్లను తయారు చేస్తోంది. వాటిని ఎగుమతి చేస్తోంది కూడా. ప్రస్తుతం విమాన తయారీని ప్రారంభించింది. 1978-1980 ప్రాంతంలో అమెరికా ఆంక్షలు విధించినప్పుడు దాని సైనిక ఆధునీకరణ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇతర దేశాలపై ఆధారపడటానికి ఎలా ముగింపు పలకాలనే దానిపైనే అది దృష్టి సారించింది. గత 30-40 సంవత్సరాలలో అది గణనీయమైన పురోగతిని సాధించింది" అని ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర తెలిపారు.
''తుర్కియేతో పోరాడటానికి ఇజ్రాయెల్కు వనరులు లేవని నేను నమ్ముతున్నాను. వైమానిక సామర్థ్యంలో తుర్కియేపై ఇజ్రాయెల్కు స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉంది. కానీ, అమెరికా నుంచి తుర్కియేకి ఎఫ్-35 విమానాలు లభిస్తే, ఆ ఆధిక్యతను కోల్పోతుంది. తుర్కియే నౌకాదళం కూడా చాలా శక్తివంతమైనది. అందువల్ల, నేడు ఇజ్రాయెల్ కంటే తుర్కియేనే అత్యంత శక్తివంతమైనది" అని అశ్విని మహాపాత్ర చెప్పారు.
''యూరప్, అమెరికాలోని సాధారణ ప్రజల అభిప్రాయంలో, తుర్కియేను ప్రస్తుతం ప్రపంచ ముప్పుగా చూడటం లేదు. తుర్కియేపై అమెరికా వైఖరి, ఇరాన్పై వైఖరిలా ఉండదు. ఒకవేళ అమెరికా కోరుకున్నా కూడా, అది అంత సులభం కాదు'' అని అన్నారు.
తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ కూడా తుర్కియే సరిహద్దు సమీపంలోని సిరియా విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. అమెరికా హామీలు ఇచ్చినప్పటికీ, అక్కడ సైన్యాన్ని మోహరించడం లేదని తుర్కియే ధృవీకరించినప్పటికీ ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ వ్యూహం గురించి ప్రశ్నలు
ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం ఉత్తర సిరియాలో వైమానిక దాడులు జరిపి, తుర్కియేతో కొత్త యుద్ధాన్ని ప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించుకున్నారని వామపక్ష ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ ఆగస్టు 23న తన సంపాదకీయంలో రాసింది.
టెల్ అవీవ్లో ఏర్పాటు చేసిన భారీ బిల్బోర్డుపై, ప్రధాని నెతన్యాహు ఎన్నికల ప్రచారంలో తుర్కియేను కేంద్రంగా పెట్టినట్లు తెలిసింది. దానిలో ఇరాన్, హిబ్జొల్లా, న్యూయార్క్ మేయర్లతో పాటు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ను ఇజ్రాయెల్ శత్రువులుగా చిత్రీకరించింది. ఆ హోర్డింగ్పై, "వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవనివ్వకండి" అని రాసి ఉంది.
''సిరియా, దాని ప్రాంతంలో పెరుగుతున్న తుర్కియే ప్రాబల్యంపై ఇజ్రాయెల్ ఆందోళనకరంగా ఉంది. కానీ, కానీ అలాంటి దాడి తుర్కియేను వెనక్కి తగ్గేలా చేయగలదా? అన్ని దౌత్య మార్గాలు ముగిసిపోయాయా? మొసాద్ చీఫ్, సిరియా విదేశాంగ మంత్రి మధ్య ఒక్కసారి మాత్రమే జరిగే సంభాషణ సుస్థిరమైన దౌత్య ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాగలదా? తుర్కియే ఒక నేటో సభ్య దేశం, అమెరికాకు సన్నిహిత మిత్రదేశం. ఇది ఒకప్పుడు ఇజ్రాయెల్కు కూడా మిత్రదేశంగా ఉండేది. ఇప్పటికీ టెల్ అవీవ్లో తన రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. తుర్కియేతో యుద్ధం ఎలా ఉంటుంది, దాని ఖర్చులు ఏమిటని ఎవరైనా ఆలోచించారా?'' అని హారెట్జ్ తన సంపాదకీయంలో రాసింది.
''మధ్యప్రాచ్యంలో ఉద్భవించే సరికొత్త, భిన్నమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సరికొత్త విధానాన్ని రూపొందించాలి. ఉత్తర సిరియాలో ఇజ్రాయెల్ తీసుకున్న కచ్చితమైన చర్యతో నెతన్యాహు కీర్తి పొందుతున్నప్పటికీ, ఆయన కళ్లెదుటే కొత్త కూటములు ఏర్పడుతున్నాయి. కానీ, వాటిలో ఇజ్రాయెల్ లేదు. బాంబులు వేయడం ద్వారా మాత్రమే భద్రతను అందించలేరు, ప్రతి ముప్పును తొలగించలేరు. దౌత్యానికి బాంబులు వేయడం ప్రత్యామ్నాయం కాదు. జాగ్రత్తగా విధానాన్ని రూపొందించాలి. నెతన్యాహు ఆధ్వర్యంలో ఈ రెండింటి ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా రాయబారి టామ్ బరాక్ హెచ్చరికలను పాటించి, తుర్కియేతో ఘర్షణలో చిక్కుకోకుండా ఉండాలి'' అని తన సంపాదకీయంలో సూచించింది.
దీర్ఘకాలిక మనుగడ కోసం ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి వ్యూహం లేదని నార్వే రాజకీయ శాస్త్రవేత్త గ్లెన్ ఎరిక్ ఆండ్రే డైసన్తో జరిగిన సంభాషణలో, సౌదీ అరేబియాకు మాజీ అమెరికా రాయబారి అయిన చార్లెస్ ఫ్రీమాన్ అన్నారు.
''ప్రతీసారి ఎదుటవారిపై తుపాకీ గురిపెట్టి ఉంచగలనని ఆయన నమ్ముతారు. కానీ, ఇది మనుగడ సాధించే వ్యూహం ఎట్టిపరిస్థితిలో కాదు'' అని ఫ్రీమాన్ చెప్పారు. ''ఒక దేశంగా దీని దీర్ఘకాలిక మనుగడపై ఇజ్రాయెల్లోనే తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి'' అని తెలిపారు.
చార్లెస్ ఫ్రీమాన్ ఇలా అన్నారు, "ఇజ్రాయెల్ చాలా కాలంగా సిరియాను నియంత్రించడం, దాని సరిహద్దులను విస్తరించుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఇజ్రాయెల్ దీనిని తన భద్రతకు అత్యవసరమైనదిగా భావిస్తుండగా, ఇజ్రాయెల్కు స్థిరమైన సరిహద్దులు లేవని, అది కావాలనుకున్న చోట తన సరిహద్దులను విస్తరించుకోగలదని విమర్శకులు అంటున్నారు. తుర్కియేలోనూ ఇజ్రాయెల్పై ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది. ఒక సర్వే ప్రకారం, సుమారు 97 శాతం తుర్కియే పౌరులు ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ నాయకుడు నఫ్తాలి బెన్నెట్, ఇరాన్ కంటే తుర్కియేనే పెద్ద ముప్పు అని అభివర్ణించారు" అని చార్లెస్ ఫ్రీమాన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)






























