ఆర్టీజీఎస్: ఏమిటీ సీసీ టీవీ 360.. పిల్లలు కిడ్నాప్ అయినా, బైక్ చోరీ కేసులైనా ఎలా ఛేదిస్తున్నారు?

ఫొటో సోర్స్, Chirala Police
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
నేరాల దర్యాప్తులో కీలక ఆధారంగా మారుతున్నాయి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు. హత్యలు, దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు .. చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి.
నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్పై ఆధారపడుతున్నారు. అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడానికి ఈ ఫుటేజ్ ఉపయోగపడుతోంది.
ఈ సీసీ కెమెరాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి అనుసంధానించినట్లు ఆర్టీజీఎస్ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన మల్లిక గర్గ్ ఇటీవల బీబీసీతో చెప్పారు.
"ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలను ఏఐ ఆధారిత సీసీ కెమెరాలుగా మార్చింది. వాటిని సచివాలయంలోని ఆర్టీజీఎస్, పోలీసుశాఖకు అనుసంధానించడం ద్వారా ఈ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలు, మనుషుల కదలికలను నిరంతరం కనిపెడుతూ ఉంటాయి. దీని వల్ల నిందితుల కదలికలను పసిగట్టి ఆయా ప్రాంత పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు'' అని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు మల్లిక గర్గ్ చెప్పారు.
ఈ వ్యవస్ధ పని తీరు గురించి ఆమె బీబీసీకి వివరించారు.
(గమనిక: ఈ కథనం రాసేటప్పటికి ఆర్టీజీఎస్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న మల్లిక గర్గ్ అనంతరం హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు)


ఎలా పనిచేస్తుందంటే..
సర్వైలెన్స్ కెమెరా వ్యవస్థలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) అనేది చాలా కీలకం.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ 14,700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
ఆర్టీజీఎస్, పోలీస్ శాఖకు ఈ కెమెరాలను అనుసంధానం అనుసంధానం చేశారు.
ఈ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలు మనుషుల కదలికలను నిరంతరం కనిపెడుతూ ఉంటాయి.
ఒక వాహనం మూమెంట్ను ఈ కెమెరాలు రియల్ టైం లో కనిపెట్టేస్తాయి.
వెహికల్ నెంబర్ ఉంటే చాలు.. ఆ వాహనం కదలికలను రాష్ట్రవ్యాప్తంగా రియల్ టైంలో పసిగట్టవచ్చు.
వాహనం ఏ ప్రాంతానికి వచ్చినా ఆ ప్రాంతంలోని కెమెరాలు ఆ వెహికల్ నెంబర్ను గుర్తించి మీరు అడిగిన ఫలానా నెంబర్ బండి ప్రస్తుతం ఆ ప్రాంతానికి వచ్చింది అని రియల్ టైం లో అలెర్ట్ చేస్తాయి.
ఈ అలెర్ట్ రాగానే ఆ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ వాహనం ఎక్కడుందని మెసేజ్ వచ్చిందో ఆయా ప్రాంత పోలీసులను అప్రమత్తం చేస్తారు.
వారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వాహనాన్ని, ఆ వాహనంపై వెళుతున్నవారిని పట్టుకోగలుగుతారని మల్లిక గర్గ్ వివరించారు.
చోరీలు చేసి, నేరాలు చేసి పారిపోతున్న నిందితులను ''ఆర్టీజీఎస్ సీసీటీవీ 360" సహకారంతో పోలీసులు త్వరగా పట్టుకున్నారని ఆమె చెప్పారు.

ఏపీలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు
శాంతిభద్రతల పర్యవేక్షణలకు, బహుళ ప్రయోజనాలను ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 14,750 సీసీకెమెరాలు ఏర్పాటు చేసింది.
ఈ సీసీ కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ఆధారితంగా పనిచేసేలా ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అనే వ్యవస్థను రూపొందించారు.
అంటే అవన్నీ ఏఐ ఆధారిత సీసీ కెమెరాలే. వీటిని సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు.
"ఏఐ సాంకేతికత ద్వారా వాహనం కదలికలను ఒక రియల్ టైంలో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రియల్ టైం అలర్ట్ పంపేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది'' అని మల్లిక గర్గ్ వివరించారు.

ఇప్పటివరకు 350 కేసులకు పైగా..
ఆర్టీజీఎస్ 360 వ్యవస్థను ఈ ఏడాది మార్చిలో లాంఛనంగా ప్రారంభించామని ఇప్పటివరకు 350 కేసులకు పైగా కేవలం ఈ వ్యవస్థ ద్వారానే సులువుగా పరిష్కరించగలిగామని మల్లిక గర్గ్ తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడైనా వాహనాల్ని దొంగిలిస్తే, ఆ వెహికల్స్ నెంబర్లను సీసీకెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ గాలిస్తుంది. ఆ వాహనాల ఆచూకీ గురించి పోలీసులకు రియల్ టైమ్లో సమాచారం చేరవేస్తోంది.
చోరీకి గురైన మోటారు సైకిల్ ఏ ప్రాంతంలో తిరుగుతుందనే విషయం జనరల్ సర్వేలెన్స్ మ్యాట్రిక్స్, హై రెజల్యూషన్ ఇమేజెస్ ద్వారా ఆర్టీజీఎస్.. పోలీసులకు కచ్చితమైన లొకేషన్తో రియల్ టైమ్లో అలర్ట్ పంపుతుంది.
దీంతో ఈ కేసులను పరిష్కరించడం పోలీసులకు చాలా సులభంగా మారుతోందని ఆర్టీజీఎస్ అధికారులు బీబీసీతో చెప్పారు.

ఆ బాలికను ఎలా పట్టుకున్నారంటే..
ఈ ఏడాది ఏప్రిల్ 22న కర్నూలు జిల్లా నందవరం మండల పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఇంటి నుంచి పారిపోయింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పారిపోయిన ఆ బాలికను వెతికే ప్రయత్నంలో ఆర్టీజీఎస్లోని సీసీటీవీ 360 సాయం కోరారు.
వెంటనే ఆర్టీజీఎస్ అధికారులు ఆ బాలిక ఫొటోను ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 అప్లికేషన్లో అప్లోడ్ చేశారు.
టైమ్–సెన్సిటివ్ అలర్ట్లతో ఆ బాలిక కదలికలను రియల్ టైమ్లో విశ్లేషించారు.
ఆ బాలిక ఏప్రిల్ 25న తన గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి విజయవాడకు వచ్చినట్లు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 సిస్టమ్లో గుర్తించారు.
వాళ్లిద్దరూ విజయవాడ ఆర్టీసీ బస్టాండు పరిసరాల్లో తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.
ఈ విషయాన్ని ఆర్టీజీఎస్ వెంటనే పోలీసులకు రియల్ టైమ్లో అలర్ట్లు పంపింది.
వీటి ఆధారంగా విజయవాడ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి ఆ బాలికను పట్టుకుని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారని ఆర్టీజీఎస్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ భరత్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Lalapet Police
సీసీ కెమెరాల్లో బైక్ వివరాలు
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో 22 ఏళ్ల యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది.
ఆమె తల్లిదండ్రులు రొంపిచర్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆమె అదృశ్యం వెనుక అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హస్తమున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ యువతి ఆచూకీ కనుగొనేందుకు రొంపిచర్ల పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 విభాగం సహకారం కోరారు.
పోలీసులు ఆ యువతి ఫొటో, యువతి అదృశ్యం వెనుక పాత్ర ఉందని అనుమానం ఉన్న వ్యక్తి వాహనం నెంబరును ఆర్టీజీఎస్ అధికారులకు అందించారు.
వీటి ఆధారంగా ఆ యువతి ఫొటోను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థలో పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పీఓఐ) టెక్నాలజీ ద్వారా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీ సాయంతో ఆ యువతి, ఆ వాహనం కదలికలను రియల్ టైమ్లో పసిగట్టారు.
ఆ మోటారు బైక్ ఏప్రిల్ 25న తిరుపతి రేణిగుంట రోడ్డులో ఉన్నట్లు సీసీ కెమెరాలు గుర్తించాయి.
అలాగే ఏప్రిల్ 28న వీరు బైకుపై తిరుపతి నుంచి చిత్తూరువైపు వెళుతున్నట్లు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ ద్వారా పోలీసులకు రియల్ టైమ్ అలర్ట్ పంపారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ యువతిని, ఆ వాహనాన్ని చిత్తూరు బస్టాండు వద్ద అదే రోజు సాయంత్రం పట్టుకుని ఆ యువతిని రొంపిచర్ల మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు.
తహసీల్దార్ ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారని భరత్ తెలిపారు.

బస్ స్టేషన్లో బాలిక
గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు బాలికలు ఇంట్లోని పెద్దవాళ్లపై అలిగి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు.
స్కూల్కు వెళ్ళిన ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఆ బాలికల ఫోటోలను 360 సిసి టీవీ యాప్లో అప్లోడ్ అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.
ఆ బాలికలు కష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడి బస్ స్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే చిలకలపూడి పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా తమ అదుపులో ఉంచగా గుంటూరు లాలపోట పోలీసులు వెళ్లి గుంటూరు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించామని లాలాపేట సీఐ శివప్రసాద్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బైక్ కొట్టేసిన వాళ్లను పట్టించిన కెమెరాలు
ఏలూరు జిల్లా పోలవరం పోలీసు స్టేషన్ పరిధిలో మార్చి నెల చివరి వారంలో మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీంతో పోలీసులు ఈ మోటారు సైకిలు ఆచూకీ కనుగొనడానికి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్ సహకారం కోరారు.
చోరీకి గురైన వాహనం వివరాలను అందుకున్న ఆర్టీజీఎస్ అధికారులు ఆ వాహనం డిజిటల్ ట్రాకింగ్ చేపట్టారు.
దాదాపు మూడు వారాల తర్వాత ఈ వాహనం తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీసు స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్లు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 నుంచి ఏలూరు కమాండ్ కంట్రోలు రూముకు రియల్ అలర్టులు వచ్చాయి.
జనరల్ సర్వైలెన్స్ మ్యాట్రిక్స్ ద్వారా హై రెజల్యూషన్ ఇమేజెస్ ద్వారా చోరీకి గురైన మోటారు సైకిల్ ఖచ్చితంగా ఏ ప్రాంతంలో తిరుగాడుతుందో అనే విషయాన్ని ఆర్టీజీఎస్ పోలీసులకు ఖచ్చితమైన సమాచారాన్ని రియల్ టైములో అలర్టులు పంపింది.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు చోరీకి గురైన మోటారు సైకిల్ ను, చోరీ చేసిన నిందితుడ్ని పట్టుకున్నారని ఆర్టీజీఎస్ అధికారులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్య, దోపిడీ కేసులో నిందితుడు దొరికాడిలా..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడ్ని పట్టుకోవడంలో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ కీలకంగా పని చేసి త్వరితగతిన నిందితుడ్ని అరెస్టు చేయడంలో సహకారం అందించింది.
ఏప్రిల్ 15న తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్లో హత్య, దోపిడీ కేసు నమోదైంది.
ఈ కేసులో నిందితుడ్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆర్టీజీఎస్కు చెందిన మ్యాట్రిక్స్ సర్వేలెన్స్ కెమెరాలున్నాయి.
వీటిలో నిందితుడి అనుమానాస్పద కదలికలు రికార్డు అయ్యాయి.
దీంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ వీడియోలో గోల్డెన్ లీడ్గా మారాయి.
ఈ నేరాలకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు సులభంగా గుర్తించగలిగారు.
ఈ సీసీటీవీల పుటేజీలను డిజిటల్ ఎవిడెన్సులుగా తీసుకుని కేసు దర్యాప్తు చేశారు.
ఈ నేరాలకు పాల్పడ్డ నిందితుడ్ని త్వరితగతిన అరెస్టు చేశారు.
ఈ సంఘటనలో నిందుతుడు చోరీ చేసిన బంగారు నగలను కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారని ఆర్టీజీఎస్ అధికారులు బీబీసీకి తెలిపారు.

పసిబిడ్డను దొంగిలించిన దొంగ
బాపట్ల జిల్లా చీరాలలో పగటిపూట చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే కత్తి ఈశ్వరమ్మ రాత్రి జూలై 1న పేవ్మెంట్పై నిద్రిస్తుండగా ఆమె ఆరు నెలల పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు.
అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అది రికార్డయింది.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా నిందితుడు పరారైన బైక్ నెంబర్ను సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు.
ఆ నెంబర్ ఆధారంగా 360 సీసీటీవీ యాప్ ద్వారా నిందితుడు ఎక్కడ ఉన్నాడనేది కనిపెట్టి 24 గంటల్లోగా అతనిని పట్టుకొని పసిబిడ్డను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించామని చీరాల సీఐ సూర్యనారాయణ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల మధ్య సమన్వయం
ఇలా మిస్సింగ్ కేసుల్లో వారి ఆచూకీ కనిపెట్టడంతో పాటు చోరీ కేసులు, హత్యకేసులు, పరారీ కేసుల్లో నిందితులను పసిగట్టేందుకు ఈ సీసీటీవీ 360 వ్యవస్థ బాగా ఉపయోగపడుతోంది.
ఆర్టీజీఎస్లోని సీసీటీవీల సాంకేతిక వ్యవస్థ పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించడానికి దోహదపడుతోంది.
కేసు దర్యాప్తులో పోలీసుల మధ్య జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేస్తూ, నేరస్థులు రాష్ట్రంలో ఎక్కడ సంచరిస్తున్నా వారి కదలికలను ఆర్టీజీఎస్ సీసీకెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయి.
ఆయా కేసుల్లో ఆ నిందితులకు సంబంధించిన సమాచారాన్ని కేసు నమోదైన పోలీసు స్టేషన్ పోలీసులకు చేరవేస్తున్నాయి.
దీంతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి నిందితులను ఇట్టే పట్టుకుంటుని కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
అయితే ప్రస్తుతానికి నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవస్థ మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని, ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే, ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని మిస్సింగ్ కేసులు పరిష్కారం కావడంలేదని కొందరు బాధితులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























