నేపాల్: అంతర్జాతీయ సాయం అక్కర్లేదని ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే నిర్ణయం ఎందుకు మార్చుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలో మృతుల సంఖ్య 600 దాటిందని పోలీసులు తెలిపారు.
అలాగే టిబెట్లో కనీసం ఏడుగురు మరణించగా 554 మంది గల్లంతయ్యారు.
సుమారు 2వేలమంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ డిజాస్టర్ రిలీఫ్ ఏజెన్సీ తెలిపింది. వారిలో 517 మంది విదేశీ పౌరులు ఉన్నారు.
వరద బాధితులకు సాయం, గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేందుకు విదేశాల నుంచి వస్తున్న సాయాన్ని మొదట తిరస్కరించిన నేపాల్ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంది.
గల్లంతైన తమ పౌరుల గురించి కొన్ని దేశాల నుంచి ఒత్తిడి రావడంతోనే నేపాల్ ఈ నిర్ణయం తీసుకుందని కాఠ్మాండూ పోస్ట్ తెలిపింది.

"సాయం చేయాలనే ప్రతిపాదనలు రావడం సహజం. మా భద్రతా దళాలే ప్రస్తుతం గాలింపు, సహాయ చర్యలను చేపట్టాయి. ప్రస్తుతానికి మాకు ఎలాంటి విదేశీ సాయం అవసరం లేదు" నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాలీ రెస్క్యూ టీమ్లు ఈ ఆపరేషన్ను ఒంటరిగానే చేయగలవని ఇతర దేశాల బృందాలను అనుమతించబోమని నేపాల్ ప్రభుత్వం బుధవారంనాడు ప్రకటించింది.
అయితే ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్కు భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాల సాయం
అయితే సొరంగాల్లో రెస్క్యూ ఆపరేషన్, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ విచారణల కోసం విదేశీ నిపుణుల నుంచి పరిమిత సాయం తీసుకోవాలని యంత్రాంగం నిర్ణయించింది.
భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు, సాంకేతిక సిబ్బందిని పంపాలని ఇంటర్-మినిస్టీరియల్ కోఆర్డినేషన్ కమిటీ కోరిందని ప్రభుత్వ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ తెలిపింది.
నేపాల్కు అంతర్జాతీయ సంస్థల ద్వారా 1 మిలియన్ డాలర్ల (రూ. 8.4 కోట్లు) మానవతా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది. వరదల్లో తమ దేశానికి చెందిన 9 మంది గల్లంతయ్యారని మరో 10 మంది జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్నారని కొరియా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
టిబెట్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులే కారణమా?
వరద ప్రభావిత రసువా జిల్లా చైనా పరిధిలోని టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఇది చైనాకు అత్యంత సున్నితమైన ప్రాంతీయ సమస్య.
"ఈ ప్రాంత భౌగోళిక సున్నితత్వం వల్లే నేపాల్ మొదట విదేశీ నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడి ఉండవచ్చు" అని రాయిటర్స్తో ఐక్యరాజ్యసమితిలో నేపాల్ మాజీ రాయబారి దినేశ్ భట్టారాయ్ చెప్పారు. అయితే, విదేశాంగ శాఖ ప్రతినిధి ఛెత్రి మాత్రం చైనా కోణాన్ని కొట్టిపారేశారు. తమ సహాయ బృందాల సామర్థ్యంపై నమ్మకంతోనే విదేశీ సాయం అక్కర్లేదని భావించినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"నా ఊరు కళ్ల ముందే కొట్టుకుపోయింది"
వరదల తీవ్రత ఎంత భయానకంగా ఉందో ‘కాఠ్మాండూ పోస్ట్’ రిపోర్టర్ అర్జున్ పౌదెల్ తన వ్యక్తిగత కథనంలో వివరించారు.
"బుధవారం ఉదయం కాఠ్మాండూలోని కాంతిపూర్ పబ్లికేషన్స్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్నప్పుడు నా భార్య నాకు ఫోన్ చేసింది. 'త్రిశూలీ నది ఉప్పొంగుతోంది సోల్ బజార్ బెట్రావతి ధ్వంసమయ్యాయి' అని ఆమె చెప్పింది. ‘ప్రజలు వీధుల్లో పరుగులు తీస్తున్నారు. భయాందోళనకు గురైన ప్రజల వీడియోలు వైరల్ అవుతున్నాయి' అని ఆమె చెప్పిందంటూ అర్జున్ ఆ వరద తీవ్రత గురించి తన కథనంలో రాశారు.
"సోల్ నా గ్రామం. నదికి మా ఊరు చాలా దూరం. భారీగా వర్షం పడిందని కూడా నాకు తెలియదు. కానీ నా భార్య చెప్పింది నిజమో కాదో నిర్ధరించుకోవడానికి నేనొక న్యూస్ వెబ్సైట్ను చూశాను. ఏమీ జరగదని అనుకున్నాను. కానీ వెబ్సైట్ ఓపెన్ కాగానే "త్రిశూలీ నదిలో వరద" అనే హెడ్డింగ్ కనిపించింది" అని ఆయన తన కథనంలో వివరించారు.
"నా ఛాతీ బిగుసుకుపోతున్నట్లు అనిపించింది. సోల్ బజార్లో నివసించే జర్నలిస్టు నిరంజన్కు ఫోన్ చేశాను. అతను ‘నేను కూడా విన్నాను. ఎవరినీ సంప్రదించలేకపోతున్నా. నా తల్లి, అత్త, మామ పిన్ని.. ఎవరూ నాతో కనెక్ట్ కాలేకపోతున్నారు’ అని నిరంజన్ నాతో చెప్పారు"
"మేము ఒకరితో ఒకరం మాట్లాడుతూనే ఉన్నాం. తరువాత, గ్రామంలోని ఒక బంధువును సంప్రదించగలిగాం. ‘ఊళ్లో ఏం మిగల్లేదు. అనేక మంది చనిపోయారని ఆమె చెప్పారు’ అని అర్జున్ ఆ కథనంలో రాశారు.
"నేను నమ్మలేకపోయాను. సోల్, టుప్చే నదీగర్భానికి సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉన్నాయి. శతాబ్దాలుగా అక్కడ ఎప్పుడూ వరద రాలేదు. నీరు ఎప్పుడూ అంత ఎత్తుకు చేరలేదు. నా వయసు 44 సంవత్సరాలు, నా జీవితంలో నది ఇంత దగ్గరకు రావడం నేను ఎప్పుడూ చూడలేదు" అని అర్జున్ రాశారు.
"నా గ్రామం మళ్లీ గతంలో మాదిరిగా మాములుగా అవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఎవరి దగ్గరా సమాధానం లేదు. నిమిషాల్లో ఒక గ్రామాన్ని తుడిచిపెట్టేసిన ఇలాంటి వరదను మనలో ఎవరూ ఎప్పుడూ చూడలేదు" అని అర్జున్ తన కథనంలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
నేపాల్ వరదలకు కారణమేంటి?
నేపాల్ను ముంచెత్తిన ఈ ఘోర విపత్తు వెనుక ఉన్న భౌగోళిక కారణాలను విశ్లేషించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు.
నేపాల్ భూభాగం, అక్కడి సున్నితమైన భౌగోళిక పరిస్థితులే ఈ వినాశనానికి కారణమని వారు భావిస్తున్నారు.
ఆర్కిటిక్, అంటార్కిటిక్ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా మంచు నిల్వలు ఉన్న 'హిందూకుష్ హిమాలయాల' ప్రాంతాన్ని 'థర్డ్ పోల్' అని పిలుస్తారు.
"ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ మంచు ప్రాంతం చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ అనేది ఒక సిద్ధాంతం కావచ్చు, కానీ ఈ వారం నేపాల్లో జరిగిన విపత్తు మాత్రం కంటికి కనిపిస్తున్న నిజం" అని కాఠ్మాండూకు చెందిన పాలసీ అనలిస్ట్ జాకీర్ కిబ్రియా 'నేపాలీ టైమ్స్'లో రాశారు.
నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వరదలకు ప్రధాన కారణాలు:
హిమానీనద సరస్సులు బద్దలవ్వడం: ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కొండల్లోని సరస్సులు ఒక్కసారిగా బద్దలై దిగువ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. నేపాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పుడు మరింత తరచుగా జరుగుతున్నాయి.
వాతావరణ మార్పుల తీవ్రత: రసువా జిల్లాలో జరిగిన ఈ విపత్తు హిమాలయ ప్రాంతాలపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. తీవ్రమైన వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, మంచు తుఫానుల వల్ల నదుల ప్రవాహం ఒక్కసారిగా ఉప్పెనలా దూసుకురావడం ఇందుకు కారణం అవుతోంది.
హెచ్చరిక వ్యవస్థల వైఫల్యం: సంప్రదాయ విపత్తు నివారణ పద్ధతులు ఇకపై సరిపోవని, అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు లేకపోవడం వల్లే నష్టం తీవ్రత పెరిగిందని 'మై రిపబ్లికా' పత్రికలో రామ్ సుబేది పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఎంత మంది చిక్కుకుపోయారో ఇప్పటికీ స్పష్టత లేదు
వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత అంతర్జాతీయ సహాయక సిబ్బంది నేపాల్ చేరుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి.
రహదారులు, వంతెనలు పూర్తిగా కొట్టుకుపోవడంతో వరద ప్రభావిత రసువా, నువాకోట్ జిల్లాల్లో ఎంతమంది చిక్కుకుపోయారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
భోటెకోశి వరదల వల్ల రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్లు, 41 వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయాయని నేపాలీ పత్రిక 'కాంతిపూర్' కథనం వెల్లడించింది.
త్రిశూలి బజార్లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో చిక్కుకుపోయిన 40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను శుక్రవారం హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది నేపాల్ ఆర్మీ. అయితే, మరికొందరు ఇప్పటికీ రెస్క్యూ కోసం వేచి చూస్తున్నారు.
"త్రిశూలి నుంచి బెట్రావతి వరకు ఉన్న అన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీనివల్ల క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది" అని ఉత్తరగయ రూరల్ మునిసిపాలిటీకి చెందిన ఉపాధ్యాయుడు మాధవ్ లామిచ్చానే తెలిపారు.
బెట్రావటిలోని క్షతగాత్రులను ధుంచె మీదుగా కాఠ్మాండూ తరలిస్తున్నారు.
ప్రస్తుతానికి రసువాగఢి సరిహద్దు పోస్ట్ ద్వారా బాధితులను తిరిగి నేపాల్కు తీసుకురావడం సాధ్యం కావడం లేదని, కేరంగ్లో ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఖచ్చితమైన లెక్కలు తెలియడం లేదని రసువా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నరేంద్ర పరియార్ వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























