ముస్లింలను దేశం నుంచి తరిమేయాలని కోరుకునే హిందువుల గురించి ఆరెస్సెస్ చీఫ్ ఏం చెప్పారు? కాంగ్రెస్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమని స్పందించాయి?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మోహన్ భాగవత్, న్యూయార్క్, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ముస్లింలను భారతదేశం నుంచి ‘తరిమివేయాలి’ అని నమ్మే హిందువు, హిందువుగా కొనసాగలేడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో అన్నారు.

హిందూ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ఆఫ్ హ్యూమానిటిలో ఎవరినీ బహిష్కరించడానికి తావులేదని చెప్పారు.

న్యూయార్క్‌లో అహెడ్ ఫోరమ్ నిర్వహించిన ఫెయిత్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

సామాజిక, మత సంస్థలు ప్రజా విధానాలను, రాజకీయాలను ప్రభావితం చేయాలని కోరుకుంటాయని, అయితే వారు సమాజం నుంచే ప్రారంభించాలని, ఎందుకంటే "రాజకీయం ఇప్పుడు స్వప్రయోజనాల ఆటగా మారింది" అని భాగవత్ అన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ బహిరంగంగా వ్యతిరేకించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని బహిష్కరించాలని ఇది న్యూయార్క్ నగర వైవిధ్యానికి వ్యతిరేకమని మమ్దానీ అన్నారు.

యూఎస్ కమిషన్ ఆన్ రిలిజియస్ ఫ్రీడమ్ కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించింది.

ఈ కార్యక్రమాన్ని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ సంస్థ నిర్వహించింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మోహన్ భాగవత్, న్యూయార్క్, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత్‌లో అన్ని మతాల మధ్య సద్భావన ఉండాలని కోరుకుంటున్నట్లు మోహన్ భాగవత్ న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.

'వైవిధ్య భావనను వ్యాపింప చేయాలి'

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ డీఎన్ఏలో ఉందని న్యూయార్క్ ప్రసంగంలో మోహన్ భాగవత్ అన్నారు.

"కొంతమంది ముస్లింలు నాతో మాట్లాడుతూ ఆరెస్సెస్ అంటున్న హిందూ దేశం అంటే ఏంటి? ముస్లింలను దేశం నుంచి తరిమేయడమేనా అని అడిగారు. దానికి నేను 'అలా చేయడం హిందూత్వ కాదు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఎవరైనా హిందువు భావిస్తే అతను హిందువు కాదని చెప్పాను" అని ఆయన వివరించారు.

"మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పినప్పుడు అందరికీ బహుళత్వం గుర్తుకొస్తుంది. అలాగే భారత్ అని చెప్పినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం గుర్తుకొస్తుంది" అని భాగవత్ తన ప్రసంగంలో చెప్పారు.

అన్ని మతాలు అంతిమంగా దైవాన్వేషణకే దారితీస్తాయని హిందూ సంప్రదాయం చెబుతోందని భాగవత్ అన్నారు. ఇతరచోట్ల రక్షణ లభించని వివిధ మతాల ప్రజలకు భారతదేశం ఎప్పటి నుంచో ఆశ్రయం కల్పిస్తోందని ఆయన చెప్పారు.

అయితే, వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటంలో గతం'వారసత్వం' పాత్ర పోషించిందని ఆయన అన్నారు.

భిన్నత్వం ఉన్నప్పటికీ అందరిలో ఒక మౌలికమైన ఐక్యత ఉందనే భావనను సమాజానికి తెలియజేయడం ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత అని ఆయన అన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మోహన్ భాగవత్, న్యూయార్క్, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కార్యక్రమానికి ముందు న్యూయార్క్‌లో భారతీయులు మోహన్ భాగవత్‌కు స్వాగతం పలికారు.

'స్వార్థ రాజకీయాలే సమస్య'

"మనం విధానాలను ప్రభావితం చేయాలనుకుంటున్నాం. యుద్ధాలను ఆపాలనుకుంటున్నాం. అందుకే మనం రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటున్నాం. కానీ మనం రాజకీయాలు చేయలేం. రాజకీయాలు స్వార్థపు ఆటగా మారాయి. 'నేను నాది' ఉన్నచోట పరిష్కారం లేదు. 'మనం మనది' అనుకుంటేనే పరిష్కారం సాధ్యం" అని భాగవత్ చెప్పారు.

హరియాణా గగనతలంపై 1996లో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొన్న ఘటనను భాగవత్ గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాద స్థలానికి మొదటగా చేరుకున్న వారిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారని, గాయపడిన వారికి వారు సాయం చేశారని చెప్పారు.

"అతను ముస్లిం అని మేం అనుకోలేదు. మేం రాజకీయాల్లో ఉండిఉంటే, బహుశా ఇది చేయలేకపోయేవాళ్లం" అని ఆయన అన్నారు.

"తప్పుడు కథనాల వల్ల అపోహలు ఏర్పడతాయి. కానీ మీరు మా మధ్యకు వచ్చి మమ్మల్ని దగ్గరగా చూస్తే, ఈ అపోహలన్నీ ఒక్క రోజులోనే తొలగిపోతాయి" అని భాగవత్ చెప్పారు.

ఈ సమావేశానికి నైజీరియాలోని ప్రముఖ క్యాథలిక్ మతగురువు 1994 నుండి 2019 వరకు అబుజా ఆర్చ్‌బిషప్‌గా పనిచేసిన కార్డినల్ జాన్ ఒలోరున్‌ఫెమి ఒనైయెకాన్ కూడా హాజరయ్యారు.

గతపు 'వారసత్వం' గురించి ప్రస్తావించిన ఒనైయెకాన్, ఆఫ్రికాలో మతపరమైన సంఘర్షణలకు గల కారణాలలో ఒకటి మతమార్పిడి, ఆధిపత్యం కోసం ఇస్లాం - క్రైస్తవ మతాల మధ్య జరిగిన చారిత్రక పోటీ అని అన్నారు.

"మనం గత వారసత్వాన్ని మోస్తున్నాము. దానిని వదిలేయాలి" అని ఆయన చెప్పారు.

ఆఫ్రికాలో రెండు మతాలు విస్తరిస్తున్నప్పుడు తన కుటుంబంలో కొందరు క్రైస్తవులుగా మరికొందరు ముస్లింలుగా మారారని ఆయన గుర్తు చేశారు.

"మతమార్పిడి, ఆధిపత్యం కోసం ఇస్లాం, క్రైస్తవ మతాలు ఆఫ్రికాలోకి పోటీగా వచ్చాయి. ఆ వైరం ఇంకా ముగియలేదు" ఒనైయెకాన్ అన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మోహన్ భాగవత్, న్యూయార్క్, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆరెస్సెస్ అధినేత వ్యాఖ్యలు ఆచరణలో చూపాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యనిర్వహాక సభ్యుడు ఫిరంగి మహాలి కోరారు.

ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నాయకుడు ఏమన్నారు?

మోహన్ భాగవత్ ప్రసంగంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కార్యనిర్వాహక సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ మహాలి స్పందించారు.

"ఆయన చెప్పినదాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలి. అలాంటప్పుడే అది విశ్వసనీయమైనదిగా భావించవచ్చు" అని ఆయన అన్నారు.

భాగవత్ ప్రకటన కచ్చితంగా సానుకూల సందేశాన్ని పంపిందని చెప్పారు

"చాలా మంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారన్నది నిజమే. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తే, రాజకీయాలు సామాజిక సేవగా మారతాయి" అని ఖాలిద్ రషీద్ అన్నారు.

సామాన్య ప్రజల, దేశ ప్రయోజనాల కోసం పనిచేయడానికి బదులుగా చాలామంది నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వాస్తవమని ఆయన ఇంకా అన్నారు.

కాంగ్రెస్ ఏమన్నది?

‘‘భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య అలాంటి సమస్యేమీ లేనప్పుడు, హఠాత్తుగా అమెరికా వెళ్లి ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?’’ అని కాంగ్రెస్ ప్రశ్నించింది.

‘‘దీని అర్థం ఒక సమస్య ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి నాటకం ఆడుతున్నారు. ముస్లింల గురించి అస్సాం ముఖ్యమంత్రి ఏమంటారో ఆయనకు తెలియదా? ముస్లింల గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటారో ఆయనకు తెలియదా?’’ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.

"ఇది దేశ ప్రతిష్ఠనుమరింత దెబ్బతీస్తుంది. భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుసు" అని ఆయన అన్నారు.

బీజేపీ ఏమని స్పందించింది?

"సర్‌సంఘ్‌చాలక్ సరైన మాట చెప్పారు. ఈ దేశం ముస్లింలు లేకుండానే నడవగలదని నమ్మే సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తులు ఉన్నారు. అది సాధ్యం కాదు. హిందువులు ముస్లింలు కలిసి జీవిస్తున్నారు. అలాగే సంఘ్ గానీ భారతీయ జనతా పార్టీ గానీ ఎప్పుడూ భిన్నంగా ఊహించ లేదు. సర్‌సంఘ్‌చాలక్ సందేశం ప్రపంచవ్యాప్తంగా సానుకూలంగా ప్రతిధ్వనించింది" అని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మోహన్ భాగవత్, న్యూయార్క్, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరెస్సెస్ కార్యక్రమానికి ముందు కార్యక్రమ వ్యతిరేకులు, అనుకూలర మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనలు

ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పలు సంస్థలకు చెందిన వ్యక్తులు సభా ప్రాంగణం వెలుపల నిరసన తెలిపారు.

సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఇంకా అనేకం కనిపిస్తున్నాయి.

వాటిలో ప్రజలు నినాదాలు రాసిన ప్లకార్డులను పట్టుకుని కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కనిపించారు.

వారిలో కొంతమంది సిక్కు వేర్పాటువాద మద్దతుదారులు కూడా ఉన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం తాను పెరిగిన భారత దేశపు బహుళత్వ, లౌకిక భావనకు విరుద్ధమని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఈ వారం మొదట్లో వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)