You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీపీ, డిప్రెషన్ కోసం వాడే మందులకు, ఎండ వేడిని తట్టుకోలేకపోవడానికి సంబంధం ఉందా?
- రచయిత, నవోమి మిహర
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఈ ఏడాది జూన్లో యూరప్ దేశాల్లో ఇతరుల కంటే తానెందుకు ఎక్కువగా వేడికి ఇబ్బంది పడుతున్నానో ఇలియానా ఒకుమస్కు అర్థం కాలేదు.
"అపార్ట్మెంట్ నుంచి బయటకు అడుగు పెట్టగానే నా ముఖానికి చెమటలు పట్టేవి" అని ఆమె చెప్పారు.
28 ఏళ్ల ఇలియానా బ్రస్సెల్స్లోని ఓ అపార్ట్మెంట్ పై అంతస్తులో ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఏసీ లేదు.
దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఆఫీసు లేదా దగ్గర్లోని కేఫ్కు వెళ్లడం లాంటి ప్రయత్నాలన్నీ చేశారు.
అయితే ఈ ప్రయత్నాలేవీ ఆమెకు పూర్తిగా ఉపశమనం అందించలేదు.
"నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రావడానికి గంట లేదా అరగంట పట్టేది. ఒక రోజు అపార్ట్మెంట్లోని ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఆ రోజు నేను సుమారు 18 గంటలు నిద్రపోయాననుకున్నా" అని ఆమె చెప్పారు.
ఆమె మేల్కొని ఉండటానికి ఇబ్బంది పడుతూ తన రక్తపోటు పడిపోయిందేమోనని ఆందోళన చెందేవారు.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 40 డిగ్రీల సెల్సియస్ వేడిని అనుభవించిన ఒకుమస్కు ఈ వేడి కొత్తేమీ కాదు.
అయినప్పటికీ ఈ ఏడాది వేసవి ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. తనలాగే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను ఆమె చదివారు.
ఆ తర్వాత ఆమెకు.. నిరాశ, ఆందోళన కోసం రెండేళ్ల క్రితం తను వాడటం మొదలుపెట్టిన మందులకూ వేడికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది.
పర్యావరణంలో మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతున్నాయి.
దీనివల్ల మానసిక అనారోగ్యం, రక్తపోటు, గుండె జబ్బుల కోసం వాడే మందుల సహా కొన్ని సాధారణ మందులు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసి, ఉష్ణ సంబంధిత అనారోగ్యానికి దారితీస్తాయని వైద్యులతోపాటు, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
వేడి, మానసిక అనారోగ్య మందులు
డిప్రెషన్, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్య చికిత్స కోసం అనేక మందులు వాడేవారు తీవ్రమైన ఎండ బారిన పడినప్పుడు ఆ మందుల వల్ల కలిగే ప్రమాదాలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ మందులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని హైపోథాలమస్ను ప్రభావితం చేస్తాయి.
రాబర్ట్ ఫెదర్ న్యూ హాంప్షైర్కు చెందిన రిటైర్డ్ సైక్రియాటిస్ట్.
"మెదడులోని హైపోథాలమస్ మన చురుకుదనాన్ని తగ్గించడానికి, ఎక్కువగా చెమట పట్టడానికి, జీవక్రియ తీరు నెమ్మదించేలా చేస్తుంది. వేడిని తట్టుకోవడానికి ఇవన్నీ ప్రయోజనకరమైన మార్పులు" అని ఆయన చెప్పారు.
ఈ మందులలో సాధారణంగా సూచించే యాంటీ డిప్రెసెంట్లు, సెలక్టివ్ సెరటోనిన్ రెప్యుటేక్, ఇన్హిబిటర్లు, సెరటోనిన్, నోర్ అడ్రినలిన్ రెప్యుటేక్ ఇన్హిబిటర్లు వంటివి ఉంటాయి.
మానసిక స్థితి, ఇతర శారీరక విధులను నియంత్రించే సహజ రసాయనమైన సెరోటోనిన్ను మెదడులో తిరిగి గ్రహించడాన్ని ఈ మందులు నిరోధిస్తాయి.
హైపోథాలమస్లో సెరోటోనిన్ ఎక్కువగా ఉంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు ఆటంకం ఏర్పడి ఎక్కువగా చెమట పడుతుంది. యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ తీసుకునే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య వస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ క్షీణతకు దారితీయవచ్చు.
"అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే ఎలక్ట్రోలైట్ లోపాలతో బాధపడేవారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది" అని ఫెదర్ చెప్పారు.
ట్రైసైక్లిక్ యాంటి డిప్రెసెంట్లు పాతరకానికి చెందిన యాంటీడిప్రెసెంట్లు. వాటి వల్ల శరీరం ఎక్కువ వేడెక్కినప్పుడు చెమట పట్టవచ్చు, లేదా అసలు చెమట పట్టకపోవచ్చు.
ఈ యాంటీ డిప్రెసెంట్లు "యాంటీకోలినెర్జిక్" ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే చెమట పట్టడంతో సహా అనేక శారీరక విధులలో పాలుపంచుకునే ఎసిటైల్కోలిన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ యాక్టివిటీని అడ్డుకుంటాయి.
లాస్ ఏంజిల్స్కు చెందిన 36 ఏళ్ల కెరీర్ కోచ్ కరోలిన్ ఫ్రైసినెట్ ఈ వేసవిలో 3 వేర్వేరు మానసిక అనారోగ్య ఔషధాల మిశ్రమ ప్రభావాన్ని ఎదుర్కొన్నారు.
ఆమె యాంటీ డిప్రెసెంట్లు, మూడ్ స్టెబిలైజర్లు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్( ఏడీహెచ్డీ) మందులు తీసుకున్నారు.
జూలైలో ఉక్కపోత ఎక్కువ కాలం కొనసాగడంతో ఆమె దేనిపైనా మనసు లగ్నం చేయలేకపోయారు. ఆమెలో చిరాకు మరింత పెరిగింది. ఎక్కువగా చెమట పట్టేది.
తగినంత ఆహారం తినకపోవడం, నీరు తాగకపోవడం వల్ల తనకు ఈ సమస్యలు వచ్చినట్లు మొదట్లో ఆమె భావించారు. మెంటల్ హెల్త్ సపోర్ట్ గ్రూప్లో ఉన్న ఆమె ఫ్రెండ్ ఒకరు వేడికి, మందులకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే వ్యాసాలను ఆమెకు పంపించారు.
ఆ గ్రూపులో ఉన్న ఇతరులు కూడా తాము ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
"నా మానసిక అనారోగ్య పరిస్థితులు, మందుల దుష్ప్రభావాల గురించి నాకు సమాచారం ఇచ్చినప్పటికీ, నాకసలేమీ తెలియదు" అని ఆమె చెప్పారు.
మానసిక అనారోగ్యానికి సంబంధించిన ఇతర మందుల వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్కు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీసైకోటిక్స్.. హైపోథాలమస్లోని డోపమైన్ను నిరోధించి శరీరం సహజంగా చల్లబడటాన్ని నిరోధిస్తుంది.
వేసవి ఎండల తీవ్రత గురించి గతంలో జరిగిన అధ్యయనాల్లోనూ యాంటీసైకోటిక్ మందుల వాడకం వల్ల మరణాల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఏడీహెచ్డీ చికిత్సకు ఉపయోగించే రిటాలిన్ వంటి ఉత్ప్రేరకాలు శరీర వేడిని పెంచి, రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తాయి.
ఇది శరీరం సహజంగా చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ మందులు అలసటను లేదా అధిక శ్రమను కప్పిపుచ్చుతాయని, దీనివల్ల తమ శరీరాలు వేడెక్కుతున్నాయని ప్రజలు గ్రహించలేకపోవచ్చని ఫెదర్ చెప్పారు.
బీటా బ్లాకర్ల నుంచి మూత్ర విసర్జన పెంచే మందుల వరకు..
వేసవిలో శరీర సున్నితత్వాన్ని ప్రభావితం చేసేవి మెంటల్ హెల్త్కు సంబంధించిన మందులు మాత్రమే కాదు. బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బుల ఔషధాలు కూడా వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి.
బీపికి ఉపయోగించే యాంజియోటెన్సివ్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు (ఏసీఈ), యాంజియోటెన్సివ్ 2 రిసెప్టర్ బ్లాకర్లు (ఏఆర్బీ), డైయూరెటిక్స్ లాంటివి ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను దెబ్బ తీయగలవు.
ఏసీఈ, ఏఆర్బీ దాహాన్ని పుట్టించే హార్మోన్ను కూడా ప్రభావితం చేయగలవు.
లోగాన్ హార్పర్ కొలరాడో ఆన్షుట్జ్ విశ్వవిద్యాలయంలోని వాతావరణ, ఆరోగ్య కార్యక్రమంలో సహాయక ఫెలోషిప్ డైరెక్టర్గా ఉన్నారు.
"ఈ మందుల వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు, శరీరంలోని ఇతర కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పెరుగుతుంది" అని హార్పర్ చెప్పారు.
గుండె జబ్బుల చికిత్సలో ఉపయోగించే బీటా బ్లాకర్ అనే మందుల వల్ల చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల శరీరం వేడిని బయటకు పంపలేదు.
ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్తో పాటు, పార్కిన్సన్స్, ఓవరాక్టివ్ బ్లాడర్, శ్వాసకోశ వ్యాధులు అలెర్జీల సహా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఇతర రకాల యాంటీకోలినెర్జిక్ మందులు కూడా శరీరాన్ని చల్ల బరిచే వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.
"ప్రజలు అనేక మందులను ఒకేసారి తీసుకుంటారు. దీని వల్ల వారి శరీరం చల్లబడే సామర్ధ్యం తగ్గి అవయవాలు దెబ్బ తినే ప్రమాదం పెరుగుతుంది" అని హార్పర్ చెప్పారు.
వేసవిలో అనారోగ్యానికి గురయ్యే వృద్ధుల విషయంలో ఇది జరుగుతుందని ఆయన అన్నారు.
ఎండ స్వల్పంగా ఉన్నా కూడా కొన్ని ఔషధాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
వేసవిలో ఎండ తీవ్రత లేనప్పటికీ డైయూరెటిక్స్, యాంటీసైకోటిక్స్, బీటా బ్లాకర్స్, స్టిమ్యులెంట్స్, యాంటీహైపర్టెన్సివ్స్ వంటి మందులు తీసుకుంటున్న వృద్ధ రోగులు వేడి సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
"ఒక్కో మందును విడివిడిగా తీసుకోవడంతో పోలిస్తే ఈ మందులన్నింటిని కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదం పెరుగుతుందని అందరికీ తెలుసు" అని హార్పర్ చెప్పారు.
అయితే, ఏ ఔషధాల కాంబినేషన్ ప్రమాదకరమైనదో ఇంకా స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు.
కొన్ని సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయి.
"కొందరికి ఎక్కువ వేడిని తట్టుకోవలసిన శారీరక శ్రమతో కూడిన ఉద్యోగం ఉండవచ్చు. వాళ్లు పట్టణాల్లో వేడిగా ఉండే ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నవారు కావచ్చు. వారికి ఏసీ పెట్టుకునే స్థోమత ఉండకపోవచ్చు" అని హార్పర్ చెప్పారు.
దక్షిణ నెవాడాలోని టౌరో యూనివర్సిటీలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సిసిలియా అహోనోను దీనిని గుర్తించారు.
లాస్ వెగాస్లో సుమారు 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆమె ఒక సామాజిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడామె ఒక పార్కులో నిద్రిస్తున్న 60 ఏళ్ల వ్యక్తిని చూశారు.
"ఆయన పాలిపోయి కనిపించారు. విపరీతంగా చెమట పడుతోంది. ఆయన హార్ట్బీట్ వేగంగా ఉంది" అని ఆమె చెప్పారు.
మూత్రవిసర్జనను పెంచే మందులు, సెలక్టివ్ సెరిటోనిన్ రిఫ్టెక్ ఇన్హిబిటర్స్ (ఎస్ఎస్ఆర్ఐ) మందులు తీసుకుంటున్న ఆ వ్యక్తి తన శరీరం ఎంత వేడెక్కిందో గ్రహించలేకపోయారు.
"మనలో చాలామందిలానే తన లక్షణాలకు ఎండ తీవ్రత కారణం అని ఆయన అనుకున్నారు" అని అహోనో చెప్పారు.
అతనిని మరిన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, అతను తీసుకుంటున్న మందులకు సంబంధించి మరో కారణం వెలుగులోకి వచ్చింది.
పుష్కలంగా నీళ్లు తాగడం, ఎండ తగలకుండా చూసుకోవడం వంటి చిట్కాలు చెప్పిన అహోనో వారికి సమీపంలోని కూలింగ్ సెంటర్ల జాబితాను అందించారు.
తీవ్రమైన లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవి వడదెబ్బకు, హెల్త్ ఏమర్జెన్సీకి దారి తీయవచ్చని ఆమె వారిని హెచ్చరించారు.
"ఎవరికైనా మానసిక స్థితిలో మార్పు కనిపించినా, గందరగోళంగా ఉన్నా, ప్రవర్తనలో మార్పు కనిపించినా వాళ్లను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి" అని ఆమె సూచించారు.
'డాక్టర్లకూ అవగాహన అవసరం'
డాక్టర్లు తాము చెప్పేదాకా మందులు ఆపవద్దని రోగులకు తరచూ చెబుతుంటారు. ఎండలు, మందులకు మధ్య ఉన్న సంబంధం గురించి వైద్యులకు మరింత మెరుగైన అవగాహన అవసరమని హార్పర్ చెప్పారు.
"వైద్యులు కొత్త మందును సూచించినప్పుడల్లా, దాని వల్ల సంభవించే దుష్ప్రభావాల జాబితాను తయారు చేయడానికి ఒక్క నిమిషం కేటాయించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
వేసవిలో తీవ్ర స్థాయి అనారోగ్యం బారిన పడే వారికిచ్చే ఔషధాల గురించి చర్చ జరగాలని ఆయన కోరుతున్నారు.
ఈ వేసవిలో ఎదురైన అనుభవంతో ఒకుమస్ అసలు మందులు వాడాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు.
"ఈ వేసవిలో నేను పని చేయలేకపోతున్నాను. నా డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు పూర్తిగా మానేయడం గురించి అడగాలని ఆలోచించడం అనుకున్నా" అని ఆమె చెప్పారు.
అయితే తాను మందులు ఆపాలని ఫ్రాఫినెట్ భావించడం లేదు. "ఈ మందు నాకు చాలా బాగా పనిచేస్తోంది" అని ఆమె అన్నారు.
తన అనారోగ్య సమస్యలకు కారణం మందుల దుష్ప్రభావం అని మరో సమస్య కాదని తెలియడమే తనకు ఉపశమనం కలిగిస్తుందని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)