పాకిస్తాన్‌ ప్రజలు భారత్ గురించి, భారతీయులు పాకిస్తాన్ గురించి ఏం చెబుతున్నారు?

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌరభ్ యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

"స్వతంత్ర భారత్, పాకిస్తాన్ ఏర్పడి దాదాపు 80 ఏళ్లు గడిచినప్పటికీ, ఇరు దేశాల సాధారణ ప్రజల్లో ఒకరిపై మరొకరికి ప్రతికూల భావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు. ఇరు దేశాలు ఒకదానిని మరొకటి అతిపెద్ద శత్రువుగా భావిస్తున్నాయి"

ఇటీవల అమెరికా థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన గ్లోబల్ యాటిట్యూడ్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను, నమ్మకాలను ఈ సర్వేలో అంచనా వేశారు.

సర్వేలో పాల్గొన్న పాకిస్తానీల్లో 91 శాతం మంది భారత్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 78 శాతం మందికి పాకిస్తాన్‌పై ప్రతికూల అభిప్రాయమే ఉంది.

దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ప్యూ రీసెర్చ్ తెలిపింది.

భారత్, పాకిస్తాన్ ప్రజల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు, అపనమ్మకాలు ఎందుకు తొలగిపోవడంలేదు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గ్లోబల్ సర్వే ఏం చెప్పింది?

భారత్, పాకిస్తాన్ ప్రజల్లో ఒకరిపై ఒకరికి ప్రతికూల భావాలే ఉన్నాయి.

భారత్‌ విషయంలో 73శాతం పాకిస్తానీలకు భారత్‌పై చాలా చెడ్డ అభిప్రాయం ఉంటే,

18 శాతంమందికి కొంతమేర ప్రతికూల అభిప్రాయం ఉంది.

ఇక పాకిస్తాన్‌ విషయంలో భారతీయులలో 65శాతం మందికి చాలా చెడ్డ అభిప్రాయం ఉంటే, 16శాతం భారతీయులకు కొంతవరకు ప్రతికూల అభిప్రాయం ఉంది.

నమ్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇరు దేశాల ప్రయత్నాలపై పరస్పర అవిశ్వాసం కనిపించింది.

ఈ విషయంలో 57శాతం భారతీయులు తమ ప్రభుత్వం మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కట్టుబడి ఉందని భావిస్తుంటే, 65శాతం పాకిస్తానీలు భారత్ మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కట్టుబడి లేదని భావిస్తున్నారు

అలాగే భారత్‌తో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి పాకిస్తాన్ కట్టుబడి లేదని 51శాతం భారతీయులు భావిస్తుంటే, 61శాతం పాకిస్తానీలు తమ ప్రభుత్వం పొరుగుదేశంతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కట్టుబడి ఉందని భావిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా, చైనా, రష్యా గురించి ఏం చెప్పారు?

అమెరికాపై..

45శాతం భారతీయులకు అమెరికాపై సానుకూల అభిప్రాయం ఉంది. పాకిస్తానీల్లో ఇది 15శాతం మాత్రమే.

భారతీయులలో 39 శాతం మందికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై నమ్మకం ఉంది. పాకిస్తానీ ప్రజల్లో ఈ సంఖ్య 12శాతం మాత్రమే.

చైనాపై..

కేవలం 23శాతం భారతీయులకే చైనాపై సానుకూల అభిప్రాయం ఉంది. అయితే 90శాతం పాకిస్తానీలు చైనాను సానుకూలంగా చూస్తున్నారు.

25 శాతం భారతీయులకు జిన్‌పింగ్‌పై నమ్మకం ఉంది. పాకిస్తాన్‌లో ఇది 83శాతం.

రష్యాపై ..

58శాతం భారతీయులకు రష్యాపై మంచి అభిప్రాయం ఉంది. పాకిస్తాన్‌లో ఇది 39శాతం మాత్రమే.

51శాతం భారతీయులకు అధ్యక్షుడు పుతిన్‌పై నమ్మకం ఉంది. పాకిస్తానీల్లో 32శాతమే పుతిన్ అంటే సానకులంగా ఉన్నారు.

ఈ సర్వేను ప్యూ రీసెర్చ్ సెంటర్ 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య 3,566 మంది భారతీయులతో ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించింది.

సర్వేను 13 భారతీయ భాషల్లో నిర్వహించారు. ఫలితాలు దేశ జనాభాకు అనుగుణంగా ఉండేలా గణాంకపరమైన సమతుల్య విధానాన్ని ఉపయోగించారు.

పాకిస్తాన్‌లో ఈ సర్వేను 2026 ఏప్రిల్ 8 నుంచి మే 7 వరకు 1,039 మందితో ఇదే విధానంలో నిర్వహించారు. అక్కడ సర్వేను ఐదు భాషల్లో చేశారు.

2013 నుంచి ఇప్పటివరకు ప్యూ నిర్వహించిన సర్వేల్లో 20 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు పాకిస్తాన్‌పై ఎప్పుడూ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

అలాగే పాకిస్తాన్‌లో కూడా భారత్‌పై సాధారణంగా ప్రతికూల అభిప్రాయమే ఉంది.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Philip Brown/Getty Images

ఫొటో క్యాప్షన్, రెండు దేశాల ప్రజలు బహిరంగంగా అభిప్రాయాన్ని చెప్పడం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇరుదేశాల్లో పరస్పర నమ్మకం ఎందుకు లేదు?

ఈ సర్వే ఫలితాలపై సీనియర్ రాజకీయ జర్నలిస్ట్ వినోద్ శర్మతో బీబీసీ మాట్లాడింది.

"ఒకప్పుడు పాకిస్తాన్‌లో భారత్ వ్యతిరేక భావాలు చాలా బలంగా ఉండేవి. భారత్‌లో మాత్రం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచాలనే ఆకాంక్ష ఉండేది. 'పాకిస్తాన్‌తో శాంతి' కోసం పని చేసిన ఒక బలమైన వర్గం ఒకప్పుడు ఉండేది" అన్నారు.

"ఇప్పుడు ఆ వర్గం బలహీనపడిపోయింది లేదా పూర్తిగా కనిపించకుండా పోయింది. ఎందుకంటే విభజన సమయంలో తమ స్వస్థలాలు వదిలి ఇక్కడకు వచ్చిన వారి తరం దాదాపు ముగిసిపోయింది. కొత్త తరానికి పాకిస్తాన్ గురించి వేరే విధంగా నేర్పించారు" అని ఆయన అన్నారు.

రెండు దేశాల ప్రజలు బహిరంగంగా తమ అసలైన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారని బీబీసీ ఉర్దూ మాజీ జర్నలిస్ట్ సక్లైన్ ఇమామ్ అభిప్రాయపడ్డారు.

ఆయన మాట్లాడుతూ, "మీరు ఏదైనా పాఠశాల, కాలేజీ, యువత లేదా ప్రొఫెషనల్ గ్రూప్ దగ్గరకు వెళ్తే అక్కడ ఎక్కువ మంది ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా మాట్లాడతారు లేదా అదే అభిప్రాయం వ్యక్తంచేస్తారు. స్వతంత్ర అభిప్రాయాన్ని బయటపెట్టరు. ఎందుకంటే ఎవరూ వివాదాల్లో చిక్కుకోవాలనుకోరు" అని ఆయన అన్నారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాతో తమకు ముప్పు ఉందని ఎక్కువమంది పాకిస్తాన్ ప్రజలు భావిస్తారు.

సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలు

ఈ సర్వేలో మరో ఆసక్తికర అంశం బయటపడింది. రెండు దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలు పొరుగు దేశంతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ప్రత్యర్థి దేశ ప్రభుత్వం అలాంటి ఆసక్తి చూపడం లేదని అనుకుంటున్నారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో మన రెండు దేశాల్లోనూ శాంతి, సామరస్యం గురించి మాట్లాడడం కంటే, యుద్ధం గురించి మాట్లాడడం తేలిగ్గా మారింది" అని వినోద్ శర్మ విశ్లేషించారు.

" సాధారణ ప్రజల మనసుల్లో ఒకరిపై మరొకరికి శత్రుత్వం పెంచారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంగా మనం కూడా పాకిస్తాన్‌ లాగే పరిణితి లేకుండా కనిపిస్తున్నాం" అన్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభించాలని కోరుకునేవారు పాకిస్తాన్‌లో ఉన్నారని జర్నలిస్ట్ సక్లైన్ ఇమామ్ అన్నారు.

"చిన్న వ్యాపారులు, వ్యాపార వర్గాలతో మాట్లాడితే వారు భారత్ మన మిత్రదేశమని చెప్పరు. కానీ పాకిస్తాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే భారత్‌తో చర్చలు జరగాలని, వాణిజ్యం పెరగాలని మాత్రం అంగీకరిస్తారు" అని ఆయన అన్నారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాను తమకు అత్యంత ముఖ్యమైన దేశంగా ఎక్కువమంది పాకిస్తానీలు భావిస్తున్నారు.

చైనా విషయంలో నెహ్రూపై జరిగే ప్రచారం నిజమేనా?

సర్వే ప్రకారం భారత్‌లో చైనాపై ప్రతికూల భావన ఎక్కువగా ఉంది. చైనాను ఒక ముప్పుగా భావించే ధోరణి కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 21శాతం మంది చైనాను తమ దేశానికి అతిపెద్ద ముప్పుగా భావిస్తున్నారు.

అదే సమయంలో సర్వేలో పాల్గొన్న పాకిస్తానీల్లో 75శాతం మంది చైనాను తమ అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా భావించారు.

"పాకిస్తాన్‌కు అత్యధిక మద్దతు చైనా నుంచే లభించింది. ఐక్యరాజ్యసమితిలో వీటో విషయంలో అయినా, ఆర్థిక సహాయం అయినా, సాంకేతిక మద్దతు అయినా చైనానే ముందుంది" అని సక్లైన్ అన్నారు.

భారత్, చైనా మధ్య సంప్రదాయ సంబంధాలపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

"గత రెండు, మూడు దశాబ్దాల్లో చైనా ఒక పెద్ద శక్తిగా ఎదిగింది. చరిత్రను పరిశీలిస్తే 1962 యుద్ధానికి ముందు చైనా భారత్‌కు మిత్రదేశమే. భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య చైనా ఒక అంశం కాదు" అని సక్లైన్ వ్యాఖ్యానించారు.

వినోద్ శర్మ అభిప్రాయం వేరుగా ఉంది. నెహ్రూ కాలంలోనే చైనాను భారత్ పెద్ద సవాల్‌గా భావించిందని ఆయన చెప్పారు.

"పండిట్ నెహ్రూకు చైనా అంటే చాలా ఇష్టమని ప్రచారం జరుగుతుంటుంది. కానీ అది నిజం కాదు. భారత స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఇన్‌స్పెక్టర్ జనరల్స్ సమావేశంలోనే నెహ్రూ ఓ మాట చెప్పారు. మనకు పెద్ద సవాల్ పాకిస్తాన్ అనిపించొచ్చు కానీ వాస్తవానికి మరింత పెద్ద సవాల్ చైనా అని నెహ్రూ నాతో చెప్పారు అని'' రా మాజీ చీఫ్ రామనాథ్ కవ్(ఆర్ఎన్ కవ్)తనతో అన్నట్టు వినోద్ శర్మ గుర్తుచేసుకున్నారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యాపై భారతీయుల్లో సానుకూల అభిప్రాయం ఉంది.

భారత్ ఏ దేశాన్ని ఎక్కువగా నమ్ముతోంది?

ప్యూ సర్వే ప్రకారం భారత్ ఎక్కువగా రష్యాను, తరువాత అమెరికాను నమ్ముతోంది. పాకిస్తాన్ మాత్రం అత్యధికంగా చైనాను, ఆ తర్వాత రష్యాను విశ్వసిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్రను ప్రశంసిస్తుండడం, గత ఏడాదిలో భారత్‌పై పలుమార్లు టారిఫ్‌లు విధించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాలు వెలువడ్డాయి.

అయితే సాధారణ పాకిస్తానీలు అమెరికాను ముప్పుగా భావిస్తున్నారనే అభిప్రాయంతో వినోద్ శర్మ ఏకీభవించలేదు.

"యుద్ధంలో మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా తరఫున ఇరాన్‌తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది" అని ఆయన చెప్పారు.

అమెరికాకు పాకిస్తాన్ భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రాంతపు మ్యాప్‌ను పరిశీలిస్తే పాకిస్తాన్‌కు కీలక స్థానం ఉందని తెలుస్తుంది. అందుకే అమెరికా దానితో సంబంధాలు కొనసాగించాలని కోరుకుంది. పాకిస్తాన్ అమెరికాకు కీలుబొమ్మగా ఉండేది. కానీ భారత్ ఎప్పుడూ అలా లేదు" అన్నారు.

పాకిస్తానీలకు చైనా అంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పటికీ, వారి కల మాత్రం అమెరికాకు వెళ్లి డబ్బు సంపాదించడమేనని సక్లైన్ అన్నారు.

"అమెరికా ఎప్పుడూ, ఎవరికీ ఉచితంగా ఏమీ ఇవ్వదు. రష్యా మనకు చాలా ఇచ్చింది. భారత్ సమతుల్య విధానంతో ముందుకు వెళ్లాలి" అని వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, అమెరికా, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images

ఫొటో క్యాప్షన్, 2001లో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చర్చలు జరిపారు.

శాంతి ఆశలు చిగురించి.. క్షీణించి...

1999: ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్ పర్యటన, లాహోర్ డిక్లరేషన్‌తో రెండు దేశాల మధ్య శాంతి ఆశలు పెరిగాయి.

మే 1999: కార్గిల్ చొరబాట్ల తర్వాత రెండు దేశాల సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.

2001: ఆగ్రా శిఖరాగ్ర సమావేశం ఎలాంటి కీలక ఒప్పందం లేకుండానే ముగిసింది.

డిసెంబర్ 2001: భారత పార్లమెంట్‌పై దాడి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది.

2008: 26/11 ముంబై దాడుల తర్వాత పరస్పర అవిశ్వాసం మరింత పెరిగింది.

2015: ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనతో సంబంధాల మెరుగుదలపై ఆశలు చిగురించాయి.

జనవరి 2016: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడి శాంతి ప్రక్రియను దెబ్బతీసింది.

ఏప్రిల్ 2025: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

మే 2025: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్', దానికి ప్రతిగా పాకిస్తాన్ నిర్వహించిన 'ఆపరేషన్ బున్యాన్-ఉల్- మర్సూస్' తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగాయి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)