ఆపరేషన్ కోసం వచ్చిన వారిని కులం అడుగుతారు... ఎందుకో తెలుసా?

    • రచయిత, శారద. వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

శస్త్రచికిత్సకు ముందు వైద్యులు సాధారణంగా రోగి ఆరోగ్య పరిస్థితి, మందుల అలర్జీల గురించి అడుగుతారు. అయితే కొన్నిసార్లు రోగి ఏ సామాజిక వర్గానికి చెందినవారో తెలుసుకోవడం కూడా అనస్థీషియాలజిస్ట్‌లకు ఒక కీలకమైన విషయం.

దీనికి కారణం శరీరంలో సూడోకోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ లోపించడం. తమిళనాడులోని తెలుగు మాట్లాడే ఆర్య వైశ్య, కోమటి చెట్టియార్, వైశ్య చెట్టి వర్గాల్లోని కొందరిలో ఈ ఎంజైమ్ లోపం ప్రధానంగా కనిపిస్తుంది.

తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఉన్నారు. ఈ లోపం ఉన్నవారిలో శస్త్రచికిత్స సమయంలో సాధారణంగా ఉపయోగించే సుక్సినైల్‌కోలిన్ అనే కండరాల మందు ప్రభావం సాధారణంగా ఊహించిన దానికంటే కొన్ని గంటలు ఎక్కువసేపు ఉండచ్చు.

బెంగళూరులోని హోస్మాట్ ఆసుపత్రిలో అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సంతోష్ చిబ్రే "శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే మత్తుమందుల్లో ఒకటైన స్కోలిన్ వల్ల రోగి కొంతసేపు శ్వాస తీసుకోడం ఆపేస్తారు.

ఆ సమయంలో శ్వాసనాళంలో ఒక ట్యూబ్‌ను ప్రవేశపెడతారు. సాధారణంగా పది నిమిషాల్లోనే రోగి స్వయంగా మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ సూడోకోలినెస్టరేజ్ లోపం ఉన్నవారిలో ఇది జరగడానికి కొన్ని గంటలు పట్టచ్చు" అని చెప్పారు.

"స్కోలిన్ ఇవ్వడం నేరుగా ప్రాణాపాయానికి దారితీయదు. అయితే రోగి స్వయంగా మళ్లీ శ్వాస తీసుకునే వరకు వెంటిలేటర్‌పై ఉంచాల్సి ఉంటుంది. వెంటనే శ్వాస తీసుకునేలా చేసే మందేదీ లేదు. వారే స్వయంగా శ్వాస తీసుకుంటారు" అని ఆయన తెలిపారు.

డాక్టర్ సంతోష్ చిబ్రే ప్రకారం, తెలుగు మాట్లాడే వైశ్య చెట్టి వర్గానికి చెందిన కొందరిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండటంతో, మత్తుమందు ఇచ్చే ముందు వైద్యులు రోగి కుటుంబ నేపథ్యం గురించి కూడా ఆరా తీస్తారు.

అయితే ఆ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ ఈ లోపం ఉంటుందని భావించడం తప్పని చిబ్రే స్పష్టం చేస్తున్నారు.

సూడోకోలినెస్టరేజ్ అంటే ఏంటి?

సూడోకోలినెస్టరేజ్ కాలేయంలో ఉత్పత్తయ్యే ఎంజైమ్. ఇది రక్తంలో తిరుగుతూ కండరాలను సడలించే మందులను, ముఖ్యంగా సుక్సినైల్‌కోలిన్, మివాక్యూరియంలను విచ్ఛిన్నం చేసి వాటి ప్రభావాన్ని నిలిపివేస్తుంది. ఈ ఎంజైమ్ తగినంత పరిమాణంలో లేకపోయినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా, ఈ మందులు శరీరంలో ఎక్కువసేపు ఉండిపోవచ్చు. దాంతో కండరాలు పక్షవాతానికి గురికావడం, శ్వాస సాధారణ స్థితికి రావడంలో ఆలస్యం కావడం జరుగుతుంది.

సాధారణ రోజువారీ జీవితంలో ఈ రుగ్మత వల్ల ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒక వ్యక్తికి మొదటిసారి మత్తుమందు ఇచ్చినప్పుడు లేదా కొన్ని ప్రత్యేక మందులు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితి బయటపడుతుంది.

"శస్త్రచికిత్స తర్వాత రోగి మేలుకోలేదు"

ఈ లోపం ఉన్నవారికి స్కోలిన్ ఇస్తే సాధారణ స్థితికి రావడానికి ఆరు నుంచి 24 గంటల సమయం పట్టచ్చని వైద్యులు చెబుతున్నారు.

చిదంబరం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అనస్థీషియాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం. మహేంద్రన్ ఈ పరిస్థితి ప్రభావాన్ని వివరించే ఒక ఘటనను బీబీసీతో పంచుకున్నారు.

"ఒకసారి పిత్తాశయంలోని రాయిని తొలగించేందుకు ఓ నౌకాదళ అధికారికి శస్త్రచికిత్స చేశాం. ఆ సమయంలో ఆయన ఆ ప్రత్యేక కమ్యూనిటీకి చెందినవారని మాకు తెలియదు. అరగంటలోనే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. కానీ ఆ తర్వాత రోగి అనుకున్న టైముకు మేలుకోలేదు" అని ఆయన చెప్పారు.

"అప్పుడే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, ఆయన సదరు కమ్యూనిటీకి చెందినవారని తెలిసింది. ఆయనకు సూడోకోలినెస్టరేజ్ లోపం ఉండచ్చని మేము అనుమానించాం. సుమారు ఆరు గంటలపాటు ఆయనకు వెంటిలేటర్ సహాయం అందించాం. ఆ తర్వాతే ఆయన సొంతంగా మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించారు" అని ఆయన తెలిపారు.

"రోగి ఏ వర్గానికి చెందినవారో అడగడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపించచ్చు. కానీ ఆ విషయం తెలియకుండా వారికి స్కోలిన్ ఇస్తే, చిన్న శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కూడా రోగిని ఎక్కువసేపు వెంటిలేటర్‌పై ఉంచాల్సి రావచ్చు. అప్పుడు అదనపు చికిత్స ఎందుకు అవసరమైందో కుటుంబ సభ్యులకు అర్థం కాకపోవచ్చు. అనవసరమైన అదనపు వైద్య ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే మత్తుమందును ఎంచుకునే ముందు ఈ సమాచారాన్ని కూడా నిర్ధరించుకుంటాం" అని డాక్టర్ రాజా మహేంద్రన్ చెప్పారు.

స్కోలిన్ ఎందుకు ఉపయోగిస్తారు?

రోక్యూరోనియం, వెక్యూరోనియం వంటి ప్రత్యామ్నాయ కండరాల మందులు ప్రస్తుతం వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో స్కోలిన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని డాక్టర్ ఎం. మహేంద్రన్ చెబుతున్నారు.

"మత్తుమందు ఇచ్చే సమయంలో కండరాలను సడలించేందుకు స్కోలిన్ ఇస్తారు. ఇది రోగి కదలకుండా ఉండటానికి సహాయపడుతుంది. నోటి క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స తీసుకున్నవారు, నోటిలో శస్త్రచికిత్స చేయించుకున్నవారు, లేదా శరీర నిర్మాణం కారణంగా శ్వాసనాళంలో ట్యూబ్‌ను ప్రవేశపెట్టడం కష్టంగా ఉండే పరిస్థితిలో పుట్టినవారికి స్కోలిన్ అవసరం ఉంటుంది" అని ఆయన చెప్పారు.

"ఇటీవలి కాలంలో స్కోలిన్ వినియోగం తగ్గింది, ప్రత్యామ్నాయ మందులను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అవి స్కోలిన్ మాదిరిగా వేగంగా, సమర్థంగా పని చేయవు" అని ఆయన తెలిపారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

2017లో జర్నల్ ఆఫ్ ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రచురితమైన 'ఇండియన్ కమ్యూనిటీలో సూడోకోలినెస్టరేజ్ లోపం' అనే అధ్యయనం ప్రకారం, భారతీయ ఆర్య వైశ్య వర్గంలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

ఆర్య వైశ్య వర్గంలో హోమోజైగస్ మ్యుటేషన్ సంభవించే అవకాశం 2 నుంచి 4 శాతం మధ్య ఉండవచ్చని ఈ అధ్యయనం సూచించింది. హోమోజైగస్ మ్యుటేషన్ అంటే తల్లి, తండ్రి ఇద్దరి నుంచి వచ్చే రెండు జన్యు కాపీల్లోనూ ఒకే రకమైన మ్యుటేషన్ ఉండటం. అంటే తల్లి, తండ్రి ఇద్దరూ ఒకే లోపభూయిష్ట జన్యువును బిడ్డకు అందిస్తే, ఆ వ్యక్తిలో హోమోజైగస్ మ్యుటేషన్ ఉంటుంది. అప్పుడు ఆ జన్యుపరమైన లోపం బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెటెరోజైగస్ మ్యుటేషన్ అంటే ఒక జన్యువులో రెండు వేర్వేరు మార్పులు ఉండటం.

"శస్త్రచికిత్స చేయించుకున్న నౌకాదళ అధికారి బహుశా హెటెరోజైగస్ మ్యుటేషన్ కలిగి ఉండవచ్చు. అందువల్ల ఎంజైమ్ లోపం ప్రభావం ఆయనలో పూర్తిగా కనిపించకుండా, పాక్షికంగా మాత్రమే కనిపించి ఉండచ్చు. అందుకే ఎక్కువ సమయం కాకుండా సుమారు ఆరు గంటల తర్వాత ఆయన సొంతంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించారు" అని డాక్టర్ ఎం. మహేంద్రన్ తెలిపారు.

2017లో జర్నల్ ఆఫ్ ఫార్మకాలాజికల్ ప్రాక్టీస్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, కోయంబత్తూరులో అధ్యయనం చేసిన 22 మందిలో తొమ్మిది మందికి సూడోకోలినెస్టరేజ్ లోపం ఉన్నట్లు నిర్ధరించారు. అమెరికా జనాభాలో చాలా అరుదుగా కనిపించే సైలెంట్ ఫినోటైప్, అంటే సూడోకోలినెస్టరేజ్ లోపం, వైశ్య కమ్యునిటీలో ప్రతి 24 మందిలో ఒకరికి ఉండవచ్చని ఆ అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనంలో, గతంలో జరిగిన జన్యుపరమైన అధ్యయనాలు, తరతరాలుగా ఈ కమ్యూనిటీ వారు తమ కులానికి చెందిన వారినే వివాహాం చేసుకోవడం వల్ల బ్యూటిరిల్‌కోలినెస్టరేజ్ (బీసీహెచ్ఈ) జన్యు మ్యుటేషన్లు వైశ్య వర్గంలో కొనసాగే అవకాశం ఎక్కువగా ఉందని సూచించాయి.

అయితే, "ప్రస్తుతం కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ సూడోకోలినెస్టరేజ్ లోపం ప్రాబల్యం క్రమంగా తగ్గడం ప్రారంభించింది" అని డాక్టర్ మహేంద్రన్ చెప్పారు.

ప్రపంచంలోని ఇతర కమ్యూనిటీలోనూ ఈ సమస్య ఉంటుందా?

తమిళనాడులోని తెలుగు మాట్లాడే ఆర్య వైశ్య కోమటి చెట్టియార్, వైశ్య చెట్టి వర్గాలకు మాత్రమే ఈ పరిస్థితి పరిమితం కాదు. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన మెడ్‌లైన్‌ప్లస్ డేటాబేస్ ప్రకారం, ఆర్య వైశ్య వర్గంతో పాటు పర్షియన్ యూదులు, అలాస్కా స్థానిక జనాభాలోని కొన్ని వర్గాలు, యూరోపియన్ సంతతికి చెందిన కొందరిలో కూడా సూడోకోలినెస్టరేజ్ లోపం కనిపిస్తుంది. దీన్ని ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి 3,200 నుంచి 5,000 మందిలో ఒకరికి ఇది ఉంటుంది.

సాధారణ రక్త పరీక్ష ద్వారా ఈ ఎంజైమ్ ఉనికిని గుర్తించచ్చు. అయితే శస్త్రచికిత్సకు ముందు ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షను నిర్వహించరు. కుటుంబంలో ఈ పరిస్థితి ఉన్న చరిత్ర ఉన్నప్పుడు లేదా వైద్యపరమైన అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ పరీక్షను చేయాలని సూచిస్తారు.

"పురుగుమందుల విషప్రభావానికి గురైన రోగుల్లో కండరాల పక్షవాతం ఏర్పడుతుంది. సూడోకోలినెస్టరేజ్ లోపం ఉన్నవారిలో కొన్ని మత్తుమందులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. అందువల్ల పురుగుమందుల పురుగుమందుల విషప్రభావానికి గురైన రోగులకు చికిత్స చేసేటప్పుడు, ప్రత్యామ్నాయ మందులు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయో అంచనా వేయడానికి ఈ ఎంజైమ్ స్థాయులను కూడా పరీక్షిస్తాం" అని డాక్టర్ ఎం. మహేంద్రన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)