కొడుకును అవయవ దానానికి ఇచ్చేసి మళ్లీ చూసుకోకుండానే వెళ్లిపోయిన తల్లిదండ్రులు

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

కొడుకు అవయవాలు దానం చేయడానికి అంగీకరించిన తర్వాత, ఆ తల్లి తన 19 నెలల బిడ్డను కడసారి చూశారు. తర్వాత వైద్యులు ఆ చిన్నారిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.

ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్న తర్వాత, ఆ తల్లి వెనక్కి తిరిగి చూడలేదు.

కొడుకు ప్రాణంతో తిరిగిరాడన్న విషయం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే భర్తతో కలిసి ఆసుపత్రి నుంచి ఆమె వెళ్లిపోయారు.

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

ఆ దంపతుల బిడ్డకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల అంగీకారంతో, ఆ బిడ్డ అవయవాలను ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. ఈ బాలుడు తమిళనాడులో ఇప్పటివరకు అవయవ దానం చేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు.

అంతకు కొద్దిరోజుల ముందు బాబు నీరసంగా కనిపిస్తుంటే అన్నం సరిగా తినక అలా అవుతున్నాడేమోనని ఆ దంపతులు భావించారు. ఆ చిన్నారి వయసు 19 నెలలే కావడంతో తన ఇబ్బంది ఏంటో తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారు.

పిల్లాడు నలతగా అనిపించడంతో వాళ్లు మొదట స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించారు.

అయితే, ఆ బిడ్డకు అరుదైనది కాకపోయినా, ప్రమాదకరమైన హైడ్రోసెఫాలస్ అనే వ్యాధి ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్థరించారు.

హైడ్రోసెఫాలస్ అంటే ఏమిటి?

సాధారణంగా మెదడు, వెన్నెముకను రక్షించే సెరెబ్రోస్పైనల్ ద్రవం మెదడులోని వెంట్రికల్స్‌లో అధిక మొత్తంలో పేరుకుపోతుంది.

ఇది మెదడుపై అధిక ఒత్తిడిని కలిగించి, దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. అదే హైడ్రోసెఫాలస్ సమస్య.

పిల్లాడి తల్లిదండ్రులకు ఈ వ్యాధి తీవ్రత గురించి అవగాహన లేదు.

‘‘చాలా తక్కువ సమయంలో చిన్నారి మెదడులో ద్రవం వేగంగా పేరుకుపోయింది’’ అని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌లో న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఆర్.రాఘవేంద్రన్ అన్నారు.

డాక్టర్లు చెప్పినదాని ప్రకారం ఆ చిన్నారి ఆసుపత్రికి చేరుకునేసరికే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కూడా ఏమీ మెరుగుపడలేదు.

పుట్టుకతో వచ్చే లోపాల వల్ల హైడ్రోసెఫాలస్ వచ్చే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో, దీని లక్షణాలు పుట్టిన వెంటనే కనిపించవు. తరువాత బయటపడొచ్చు.

బ్రెయిన్ డెడ్ అయ్యాక కూడా చికిత్స

వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో ఆరు రోజులపాటు ఆ చిన్నారి ఐసీయూలో ఉన్నాడు. సర్జరీ చేసినా అతని ఆరోగ్యంలో మార్పేమీ రాకపోగా, మరింత క్షీణించింది.

చివరికి, వైద్యులు ఆ బిడ్డకు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీని అర్థం, వైద్య సహాయంతో శరీరాన్ని కొంతకాలంపాటు పనిచేసేలా చేయవచ్చు, కానీ మెదడు కార్యకలాపాలు శాశ్వతంగా ఆగిపోతాయి.

ఈ పరిస్థితి రావడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా తమ పిల్లాలడు ఇతర పిల్లల్లాగే చక్కగా ఆడుకున్నాడని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు, ఐసీయూ నుంచి ఇక ఎప్పటికీ బయటకు రాలేడనే విషాదవార్తను తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది.

అవయవ దానం గురించి ఆ దంపతులకు వైద్య బృందం వివరించింది. తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆ వారు తమ బిడ్డ అవయవాలను దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

అలా ఈ 19 నెలల చిన్నారి తమిళనాడు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అవయవ దాతగా నిలిచిపోయాడు.

‘ స్వచ్ఛంద సంస్థ సాయంతో మృతదేహం ఖననం’

అవయవాలను దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ బిడ్డను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. కానీ తల్లిదండ్రులు ఇక అక్కడ ఉండలేకపోయారు.

‘‘మా బిడ్డ బతకలేదు. ఇది (అవయవ దానం) మా పిల్లాడిలాంటి పిల్లల కోసం చేశాం’’ అని ఆసుపత్రి దగ్గర ఆ చిన్నారి తండ్రి అన్నారు.

‘‘శస్త్రచికిత్స అనంతరం, ఒక సామాజిక సంస్థ సహాయంతో ఆ చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు’’ అని బీబీసీతో డాక్టర్ రాఘవేంద్రన్ చెప్పారు.

రెండు సంవత్సరాల కిందట, ఇదే ఆసుపత్రిలో 20 నెలల పసికందు అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు.

‘‘అవయవ దానాన్ని నేను గొప్ప దానంగా భావిస్తా. ఆ తల్లిదండ్రులు తమ జీవితంలో అత్యంత బాధాకర క్షణాల్లో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక డాక్టర్‌గా ఇది నాకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది’’ అని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డీన్ డాక్టర్ శాంతారామన్ అన్నారు.

"చాలా సందర్భాల్లో అవయవ దానం చేయాలనే తుది నిర్ణయం తీసుకునేది తల్లే. బిడ్డ వయసు ఎంత ఉన్నా, ఆ బిడ్డ తల్లికి ఎల్లప్పుడూ ప్రత్యేకమే’’ అన్నారు శాంతారామన్.

బిడ్డ అవయవాలు వేరొకరి శరీరంలో పనిచేస్తున్నాయని తెలుసుకోవడం తల్లికి కొంత ఉపశమనం కలిగించవచ్చని, అయితే, అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదనీ, చాలా ధైర్యం కావాలని శాంతారామన్ అభిప్రాయపడ్డారు.

పిల్లల అవయవాలు పెద్దలకు సరిపోతాయా?

బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఆ బాలుడి రెండు కిడ్నీలను చెన్నైకి చెందిన 20 ఏళ్ల యువతికి అమర్చారు. కాలేయాన్ని చెన్నైలోని ఒక చిన్నారికి దానం చేయగా, గుండెను కోయంబత్తూరులోని ఒక చిన్నారికి అమర్చారు.

చిన్న పిల్లల అవయవాలను పెద్దవారికి మార్పిడి చేయవచ్చని డాక్టర్ శాంతరామన్ అన్నారు.

‘‘చాలా అవయవాలు పుట్టినప్పటి నుండి పెద్దవారిలో పనిచేసినట్లే పనిచేస్తాయి. ఒకటిన్నర సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, చాలా అవయవాలు దాదాపు పెద్దవారి అవయవాల పరిమాణానికి చేరుకుంటాయి’’ అని ఆయన అన్నారు.

మూత్రపిండ మార్పిడిలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి గ్లోమెరలర్ ఫిల్ట్రేషన్ రేట్ (జీఎఫ్ఆర్) అని డాక్టర్ రాఘవేంద్రన్ వివరించారు. ఇది మూత్రపిండాలు రక్తాన్ని ఎంత బాగా వడపోస్తున్నాయో కొలుస్తుంది.

"దాత,గ్రహీత ఇద్దరికీ జీఎఫ్ఆర్ తగిన విధంగా ఉండాలి. వయోజనుడి మూత్రపిండాన్ని దానం చేసినప్పుడు, మార్పిడికి తరచుగా ఒక మూత్రపిండం సరిపోతుంది. కానీ దాత చాలా చిన్న పిల్లాడు అయినప్పుడు, సాధారణంగా రెండు మూత్రపిండాలను కలిపి మార్పిడి చేస్తారు" అని ఆయన అన్నారు.

గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలను మార్పిడి చేసేటప్పుడు శరీర బరువు, ఇతర అంశాలు ముఖ్యమైనవని ఆయన వివరించారు. అవయవ మార్పిడి కోసం ఇంకా చాలా మంది పిల్లలు ఎదురు చూస్తున్నారని, అందువల్ల ఈ రకమైన అవయవ దానం చాలా కీలకమైనదని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)