‘అవును.. ఐదేళ్ల పాప హింద్ రజబ్ ఉన్న వాహనంపై కాల్పులు జరిపాం’ : ధృవీకరించిన ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Family/Reuters
- రచయిత, యొలండే నెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
గాజా యుద్ధ సమయంలో గాజా నగరంలో ఐదేళ్ల హింద్ రజబ్, ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ప్రయాణిస్తున్న వాహనంపై తమ సైన్యం కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తొలిసారి ధ్రువీకరించింది.
జనవరి 2024లో జరిగిన ఈ దాడిలో పలువురు కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ, పాలస్తీనా బాలిక హింద్ తొలుత ప్రాణాలతో బయటపడింది.
కానీ, కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు గుర్తించారు.
దాడి తర్వాత పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ నుంచి వచ్చిన ఫోన్ కాల్కు హింద్ సమాధానమిచ్చింది. ఆ ఫోన్ సంభాషణ గంటలపాటు కొనసాగింది.
పాపను చేరుకోవడానికి రెడ్ క్రెసెంట్ పంపిన అంబులెన్స్కు ఇజ్రాయెల్ సైన్యంతో సమన్వయ చేసుకుంది. కానీ, ఆ అంబులెన్స్పై కూడా కాల్పులు జరిగి, ఇద్దరు వైద్య సిబ్బంది మరణించారు.


ఫొటో సోర్స్, Altitude
‘రక్షించేందుకు రమ్మని పిలుస్తుండగానే కాల్పుల శబ్దం’
ఈ ఘటనపై సమీక్ష జరిపిన అనంతరం క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.
"పాలస్తీనా రెడ్ క్రెసెంట్ అంబులెన్స్తో సమన్వయం చేసుకోవడంలో లోపాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల కారణంగా , ఈ ఘటనపై మిలిటరీ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ ద్వారా దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించాం" అని పేర్కొంది.
హింద్ మరణించిన సమయంలో తమ సైనికులు ఆ ప్రాంతంలో ఎవరూ లేరని ఐడీఎఫ్ తొలుత ప్రకటించింది. కానీ దీనిపై వెంటనే ప్రశ్నలు తలెత్తాయి.
ఆ తర్వాత ఐడీఎఫ్ తన దళాలు గాజా నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ "ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేశాయని" తెలిపింది. హింద్ ఉన్న టెల్ అల్-హవా ప్రాంతం కూడా వాటిలో ఉందని పేర్కొంది.
హింద్ పారామెడిక్స్తో దీనంగా మాట్లాడిన మాట రికార్డింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కావడంతో ఆమె హత్యపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
గాజా నగరంలోని తమ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి నుంచి తప్పించుకునేందుకు హింద్, ఆమె కుటుంబ సభ్యులు వాహనంలో వెళ్తుండగా అది ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు గురైంది.
తనను రక్షించేందుకు ఎవరైనా రావాలంటూ హింద్ ప్రాధేయపడటం కొనసాగుతుండగానే, మరిన్ని కాల్పుల శబ్దాల మధ్య ఫోన్ సంబంధం తెగిపోయింది.

ఫొటో సోర్స్, Rajab Family
'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్'
ఈ ఘటన ఆధారంగా 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' పేరుతో ఓ చిత్రం రూపొందింది. అది ఆస్కార్కు నామినేట్ అయింది.
హింద్ ఘటనను ఐక్యరాజ్యసమితి ఒక దర్యాప్తు కమిషన్ నివేదికలో ప్రస్తావిస్తూ, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ ఆ ఆరోపణలను ఖండించింది.
హింద్, ఆమె కుటుంబ సభ్యుల హత్యపై దర్యాప్తుతో పాటు, గత ఏడాది దక్షిణ గాజాలోని రఫా సమీపంలో వైద్య సిబ్బంది, ఐక్యరాజ్యసమితి ఉద్యోగితో సహా 15 మంది పాలస్తీనియన్ల మరణంపై కూడా దర్యాప్తు చేస్తామని ఐడీఎఫ్ తెలిపింది.
అయితే మరో మూడు ఘటనల్లో క్రిమినల్ దర్యాప్తునకు కారణాలు కనిపించలేదని ఐడీఎఫ్ పేర్కొంది. వీటిలో రెండేళ్ల క్రితం దెయిర్ అల్-బలాహ్లో వరల్డ్ సెంట్రల్ కిచెన్కు చెందిన ఏడుగురు ఉద్యోగులు మరణించిన ఘటన ఒకటి. అలాగే రెండు వేర్వేరు ఘటనల్లో మరణించిన మెడెసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్ఎఫ్)కు చెందిన నలుగురు ఉద్యోగుల కేసులు కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ చట్టపరమైన చర్యలను, ముఖ్యంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) చర్యలను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, తన సొంత సైనికుల చర్యలపై తానే దర్యాప్తు చేస్తున్నట్లు చూపించాలన్న ఒత్తిడి ఐడీఎఫ్పై ఉంది.
తమ దళాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలను, అలాగే సైనికులకు శిక్ష పడటం లేదనే విమర్శలను తిప్పికొట్టడమే దీని ఉద్దేశం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
































