పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్య: నెలకిందటే ఏఈ నూకరాజు అల్లుడి మృతి, ఈ మరణాలపై షూటింగ్ కోచ్ మీద వచ్చిన ఆరోపణలేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(హెచ్చరిక: కలచివేసే అంశాలు)
పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్గా పని చేసిన తిల్లపూడి నూకరాజు తన ముగ్గురు కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటున్న ఘటనలో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి ఈనెల 16వ తేదీ రాత్రి ఆత్యహత్యకు యత్నించారని పోలీసులు తెలిపారు.
పదేళ్ల వయసున్న నూకరాజు మనవడిని సమీపంలోని మత్స్యకారులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
నూకరాజు మృతదేహం తర్వాత లభ్యం కాగా మిగతా ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రాజమండ్రి టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేశ్ తెలిపారు.

‘కొవ్వూరులో టిఫిన్ చేసి రాజమండ్రి వైపు... ’
ఈ కేసు పూర్వాపరాలను రాజమండ్రి టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేశ్ బీబీసీకి వెల్లడించారు.
‘‘ఈ ఆదివారం (ఆగస్టు 16) రాత్రి 11:30 గంటల సమయంలో నూకరాజు కుటుంబం గోదావరి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. కారును బ్రిడ్జిపై పార్కింగ్ చేసి కుటుంబ సభ్యులు నలుగురూ ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కారులో వచ్చిన నూకరాజు కుటుంబసభ్యులు కొవ్వూరులో టిఫిన్ చేసిన తర్వాత రాజమండ్రి వైపు వచ్చారు. 80వ హోల్ దగ్గర కారు ఆపి బయటకు వచ్చి ముందుగా నూకరాజు, ఆయన భార్య, తర్వాత సౌజన్య, ఆమె కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు.
అయితే బాలుడికి ఈత రావడం, సమీపంలో ఉన్న మత్స్యకారులు రక్షించడంతో అతనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు'' అని సీఐ గణేశ్ వివరించారు.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
లభ్యమైన సూసైడ్ లెటర్
పిఠాపురం పంచాయతీరాజ్ అధికారుల వాట్సాప్ గ్రూపులో నూకరాజు పోస్ట్ చేసిన ఓ లెటర్ వెలుగులోకి వచ్చిందని సీఐ గణేశ్ తెలిపారు.
''నూకరాజు రాత్రి 11.30 సమయంలో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ముందు 11.27 నిమిషాలకు ఆయన రాసిన సూసైడ్ లెటర్ను తన తోటి అధికారులు ఉన్న వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు.
కాకినాడ జిల్లా కలెక్టర్కు విన్నవిస్తూ రాసిన ఆ లేఖలో.. కాకినాడ షూటింగ్ స్పోర్ట్ అకాడమీ ఫౌండర్, కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు పేర్కొన్నారు. ఈ ఏడాది జులై 2న తన అల్లుడు మరణించినప్పటి నుంచి తన కుమార్తెను సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని, అతని కారణంగా తన కుమార్తెకు, మనవడికి ప్రాణహాని ఉందనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఏఈ నూకరాజు లెటర్లో పేర్కొన్నారు'' అని సీఐ గణేశ్ వెల్లడించారు.
సాదిక్ ఖాన్ కారణంగానే తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో నూకరాజు కోరారని చెప్పారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బీబీసీకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిశోర్ వెల్లడించారు. గోదావరి నదిలో గాలింపులో మత్స్యకారుల సాయం తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు.

ఫొటో సోర్స్, UGC
పరారీలో సాదిక్..
ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నారని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ బీబీసీకి తెలిపారు.
కాగా, ఈ ఏడాది డిసెంబర్లో నూకరాజు రిటైర్ కానున్నారని ఇంతలోనే ఈ విషాద ఘటన జరిగిందని బీబీసీతో కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్ చెప్పారు.
మరోవైపు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు.
ఈ మేరకు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్ కల్యాణ్ మాట్లాడారని, ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
సౌజన్య భర్త మరణంలోనూ సాదిక్ హస్తముందంటూ ఓ ఫిర్యాదు
నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి ఈ ఏడాది జులై 2న మరణించారు.
జగదీశ్వర్ రెడ్డి కూడా సాదిక్ వేధింపులతోనే చనిపోయారంటూ తాజాగా సౌజన్య రాసిన లేఖ దొరికిందని సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఈనెల 18న (మంగళవారం) సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"నా కుమారుడు చనిపోయినప్పుడు అది సహజ మరణమే అనుకున్నాం. కానీ ఇప్పుడు నా కోడలు, మనవడు, వియ్యంకుడు, ఆయనన భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు నా మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని నా కోడలిని సాదిక్ బ్లాక్ మెయిల్ చేసినట్లు, బెదిరించినట్లు ఆమె బండిలో ఉన్న లెటర్లో ఉంది'' అని బీబీసీకి భాస్కర్ రెడ్డి తెలిపారు.
భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని, సాదిక్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని బీబీసీకి సర్పవరం సీఐ ప్రకాశ్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
'సౌజన్యపై ఒత్తిడి చేశారన్న భాస్కర్ రెడ్డి'
తన కోడలు సౌజన్యను ముస్లిం మత ఆచారాలు పాటించాలని, ఇస్లాం బుక్ చదివి ఇస్లాంలోకి మారాలని సాదిక్ ఒత్తిడి చేసేవాడంటూ సర్పవరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే ఈ వాదనలపై పోలీసులు బహిరంగంగా మాట్లాడటం లేదు. అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని సమగ్ర విచారణ తర్వాతే ఏదైనా మాట్లాడగలమని సీఐ ప్రకాశ్ బీబీసీతో అన్నారు.
ఎవరీ సాదిక్ ఖాన్?
కాకినాడ కేంద్రంగా 'కాకినాడ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ' నిర్వహిస్తుంటారు సాదిక్. రైఫిల్ షూటింగ్లో ఆయన శిక్షణ ఇస్తుంటారు.
సౌజన్య కుమారుడు గత కొంతకాలంగా సాదిక్ వద్ద రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందుతున్నాడు.
ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నాడని ఇంతకు మించిన వివరాలు లేవని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, సర్పవరం సీఐ ప్రకాశ్లు బీబీసీకి తెలిపారు.
అయితే సాదిక్కు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. వాటిల్లో ఆయన ప్రముఖులతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.
సాదిక్ తన సోదరి, తల్లితో కలిసి కాకినాడలో ఉంటున్నారు. అయితే ఆయన కుటుంబాన్ని కలిసేందుకు, సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.
సాదిక్ మొబైల్కు ఫోన్ చేయగా ఆయన నుంచి స్పందన రాలేదు. సాదిక్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు స్పందిస్తే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

































