You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్: ‘వరద ప్రమాదం చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదా’ అంతర్జాతీయ మీడియాలో చర్చ...
నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 600 దాటింది. నేపాల్ సైన్యం ఇప్పటివరకు 800 మందికి పైగా రక్షించిందని ఆ దేశ ప్రధాని కార్యాలయం తెలిపింది.
దాదాపు 2వేల మంది జాడ తెలియడం లేదని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. వీరిలో 517 మంది విదేశీయులు ఉన్నారు.
కనిపించని వారి కోసం గాలింపు, సహాయ చర్యల కోసం 13 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతుండగా, ఇదే సమయంలో వరద సమాచారం విషయంలో చైనా వ్యవహార శైలిపై అంతర్జాతీయ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
నేపాలీ న్యూస్ అవుట్లెట్ల నుంచి చైనా మీడియా అవుట్లెట్ల వరకు ఈ అంశాన్ని రిపోర్ట్ చేశాయి.
విపత్తుకు ముందు నేపాల్కు చైనా సకాలంలో హెచ్చరిక ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి.
అలా ఇచ్చి ఉంటే, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని చెబుతున్నారు.
అయితే, నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండించింది.
ఆరోపణలేంటి?
వైరల్ అవుతున్న వార్తల్లో, నేపాల్కు ప్రమాదం గురించి చైనా ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదని, అందువల్లే నేపాల్లో ఇంతటి విధ్వంసం జరిగిందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వార్తలను చైనా రాయబార కార్యాలయం ఖండిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. సమాచారాన్ని షేర్ చేసుకోలేదన్న ఆరోపణలను ఖండించింది.
"రసువా-గ్యిరోంగ్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదల పట్ల చైనా విచారం వ్యక్తం చేస్తోంది. నేపాల్కు సాధ్యమైనంత సాయం అందిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేపాల్ వైపు వచ్చిన భూకంపం వల్ల హిమపాతం, వరద సంభవించింది. దీనివల్ల సరిహద్దుకు ఇరువైపులా ప్రజలు మరణించారు. అనేకమంది గల్లంతయ్యారు" అని చైనా రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.
"భవిష్యత్తులో వాతావరణ, జలవిజ్ఞాన, భౌగోళిక ప్రమాదాలకు సంబంధించిన సమాచార మార్పిడిని మెరుగుపరుస్తాం. నేపాల్, చైనా పొరుగు దేశాలు. ఈ విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుంటూ, సరిహద్దుకు ఇరువైపులా ప్రజల ప్రాణాలు ఆస్తులకు మెరుగైన రక్షణ కల్పించేలా రెండు దేశాలు తమ సన్నద్ధతను బలోపేతం చేసుకోవాలి" అని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.
నేపాల్ మీడియా సంస్థలు ఏం చెప్పాయి?
నేపాల్- చైనా రెండు దేశాల అధికారులు సరిహద్దులో మోహరించిన భద్రతా సిబ్బందితో సంప్రదింపులు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారని లాసాలోని నేపాల్ కాన్సుల్ జనరల్ లక్ష్మీ ప్రసాద్ నిరౌలా తమకు చెప్పినట్లు కాఠ్మాండూ పోస్ట్ తెలిపింది.
సంప్రదింపులు జరగకపోవడంతో వరద ఎక్కడ ప్రారంభమైంది? దాని వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై అధికారిక, విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదని నిరౌలా అన్నట్లు కాఠ్మాండూ పోస్ట్ వెల్లడించింది.
వరద మూలాలు ఏంటనే దాని గురించి చైనా అధికారులు ఇప్పటి వరకు ఏమీ నిర్థరించలేకపోయారని నిరౌలా వ్యాఖ్యానించినట్లు వార్తా పత్రికలు రిపోర్ట్ చేశాయి.
చైనాతో విపత్తుకు సంబంధించిన సమాచారాన్ని రియల్-టైమ్లో పంచుకునే వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఈ వరదల తర్వాత వచ్చినట్లు నేపాల్కు చెందిన న్యూస్ అవుట్లెట్ 'ఆన్లైన్ ఖబర్' పేర్కొంది.
రసువాలో వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చైనాతో సమాచారాన్ని పంచుకునే వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' అన్నారు.
చైనా అలర్ట్ సిస్టమ్పై సందేహాలు
టిబెట్లోని కెరుంగ్ కౌంటీలో బుధవారం ఉదయం సుమారు 10:30 గంటలకు ఆకస్మిక వరద వచ్చిందని కాఠ్మాండూ డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్ ఉకేరా కథనం చెబుతోంది. నేపాల్ స్థానిక సమయం ప్రకారం అది ఉదయం 8:15 గంటలు.
సుమారు 45 నిమిషాల తర్వాత వరద ఉధృతి నేపాల్లోని భోటేకోశి నదికి చేరుకుందని ఈ కథనంలో పేర్కొన్నారు.
నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధి శాంతి మహత్ తమకు ఈ సమాచారం చెప్పారని ఉకేరా వెల్లడించింది.
నేపాల్కు చైనావైపు నుంచి వరద సమాచారం అందలేదు. రసువా ప్రధాన జిల్లా అధికారి స్థానిక సమయం ప్రకారం సుమారు 9 గంటలకు ఫోన్ చేసి ఎన్డీఆర్ఆర్ఎంఏకు వరద సమాచారం ఇచ్చారు.
నేపాల్- చైనా మధ్య సరిహద్దులు దాటి జరిగే విపత్తులకు సంబంధించిన రియల్-టైమ్ సమాచారాన్ని పంచుకునే వ్యవస్థపై ఈ ఘటన తర్వాత మరోసారి ప్రశ్నలు తలెత్తాయని ఈ కథనంలో రాశారు.
హిమానీ సరస్సులు ఉప్పొంగడం, ఆకస్మిక వరదల వంటి ఘటనల సమయంలో చైనా నుంచి సకాలంలో సమాచారం అందాల్సిన అవసరాన్ని నేపాల్ చాలా రోజులుగా నొక్కి చెబుతూ వస్తోంది.
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పని చేసిందా, లేదా?
చైనా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పని చేసిందా లేదా? ఈ దుర్ఘటనలో అతిపెద్ద ప్రశ్న ఇదే.
చైనా-నేపాల్ సరిహద్దులో పనిచేస్తున్న ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ విపత్తుకు ముందు ఏదైనా అసాధారణ కార్యకలాపాన్ని గుర్తించిందా లేదా అనేది ఇప్పటివరకు నిర్ధరించలేదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా హెచ్చరిక జారీ చేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇప్పటివరకు ఏడుసార్లు సకాలంలో హెచ్చరికలు జారీ చేసిందని, వీటిలో గత సంవత్సరం చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో జారీ చేసిన ఒక హెచ్చరిక కూడా ఉందని ఈ వ్యవస్థతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే తాజా విపత్తు విషయంలో ఈ వ్యవస్థ ఏదైనా హెచ్చరిక జారీ చేసిందా లేదా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేయలేదు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన నిపుణుడు కాంగ్ షిచాంగ్తో చైనా డిజిటల్ న్యూస్పేపర్ 'ది పేపర్' ఈ విషయంపై మాట్లాడిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది.
"పర్వతం పైభాగంలో మంచు, రాళ్లు జారిపడటాన్ని ముందుగా గుర్తిస్తే, సుమారు 20 నిమిషాల ముందే హెచ్చరించవచ్చు" అని కాంగ్ షిచాంగ్ ‘ది పేపర్’తో చెప్పారు.
ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం తగిన పరికరాలు లేవని ఆయన అన్నారు. ఈసారి వరదకు కారణం నేపాల్వైపు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రమాద సంకేతాలను సెన్సర్లు గుర్తించే సమయానికి శిథిలాలు, బురదల ఉధృతి దిగువకు చేరుకుని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"సమాచారంపై చైనా ప్రభుత్వ నియంత్రణ"
టిబెట్ నుంచి వచ్చే సమాచారంపై చైనా కఠిన నియంత్రణ అమలు చేస్తోందని అమెరికన్ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో తెలిపింది.
టిబెట్లో సమాచారం దాదాపు పూర్తిగా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రయాన్ ఫియోరెసీ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
‘‘ప్రకృతి విపత్తు సమయంలో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చు. చైనా ప్రభుత్వం అంటే ఉన్న భయం వల్ల ఎవరు ఎక్కడ చిక్కుకుపోయారు? ఏ ప్రాంతాల్లో అత్యధిక నష్టం జరిగింది అనే సమాచారాన్ని పంచుకోవడానికి స్థానిక ప్రజలు భయంతో వెనుకాడవచ్చు’’ అని ఫియారెసీ చెప్పారు.
ప్రజలు అలాంటి సమాచారాన్ని పంచుకోవడానికి భయపడినా, వారి సోషల్ మీడియా పోస్టులు తొలగించినా కీలక సమాచారం ప్రభావిత కుటుంబాలు, సహాయక రక్షణ బృందాలు సాధారణ ప్రజలకు అందదని ఆయన అన్నారు.
అయితే, ఇప్పటివరకు ఈ విపత్తుకు ముందు చైనావైపు నుంచి ఏదైనా హెచ్చరిక అందుబాటులో ఉండి, దానిని నేపాల్కు అందించారా లేదా అనే విషయం స్వతంత్రంగా ఎవరూ నిర్ధరించలేక పోతున్నారు.
రెండు దేశాల (నేపాల్. చైనా) మధ్య సమన్వయం ఉండాలని న్యూస్లెటర్ నేచర్ పత్రిక రాసింది.
"అనేక హిమానీనదాలు వాటికి అనుసంధానమైన ఎగువ ప్రాంతాల్లో పర్యవేక్షణకు సంబంధించిన విభాగాలు చైనా భూభాగంలో ఉన్నాయి. అలాంటప్పుడు అలర్ట్ సిస్టమ్ కోసం రెండు దేశాల మధ్య డేటా పంచుకోవడం సమన్వయం అవసరం" అని నేచర్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)