జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి.. పోలీసులు ఏం చెప్పారు? ఎంపీ కొడుకు ఏమంటున్నారు

లింగమనేని సంజుష్, కారు ప్రమాదం, హైదరాబాద్​

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, లింగమనేని సంజుష్(నిందితుడు), భారతి ముఖి (మృతురాలు)

జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజుష్‌పై కేసు నమోదైంది.

నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక యువతి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారంటూ మాదాపూర్ పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు పెట్టారు.

''ఇది హిట్ అండ్ రన్ కేసు కాదు, రోడ్డు ప్రమాదం. దానికి తగ్గట్టుగా కేసు పెట్టాం'' అని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ బీబీసీతో చెప్పారు.

ఈ ప్రమాదం ఆగస్టు 16నే జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం విమర్శలకు దారితీసింది. రాజకీయ పలుకుబడి వల్లే ఇన్నాళ్లూ ఈ వివరాలు బయటకు రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విమర్శలను అటు లింగమనేని సంజుష్, మాదాపూర్ పోలీసులు ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లింగమనేని సంజుష్, కారు ప్రమాదం, హైదరాబాద్​

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతురాలు భారతి ముఖి (ఫైల్​ ఫోటో)

అసలేం జరిగింది?

ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని 26 ఏళ్ల భారతి ముఖిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఆమెది ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని దాముడిగోడ్ ప్రాంతం. భారతి కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

లైఫ్‌స్టైల్ షోరూం మేనేజర్ అశ్విన్ కుమార్ ఫిర్యాదు మేరకు, మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీబీసీ పరిశీలించింది.

''16వ తేదీ మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో భారతి మరొక యువతి పూజ అశోక్‌తో కలిసి భోజనం చేసేందుకు ఐటీసీ కోహినూర్ సమీపంలోని ఫుడ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ భోజనం చేసి తిరిగి ఇనార్బిట్ మాల్‌ వైపు వస్తుండగా, రోడ్డు దాటుతుండగా ఐకియా వైపు నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వస్తున్న కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది'' అని ఫిర్యాదులో తెలిపారు.

భారతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులకు అందిన ఫిర్యాదులో ఉంది.

''కారు నడిపిన వ్యక్తి సంజుష్ అని తెలిసింది. భారతి ముఖి మరణానికి కారణమైన అతనిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి'' అని అశ్విన్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అశ్విన్ కుమార్‌ను సంప్రదించేందుకు బీబీసీ మూడుసార్లు ఫోన్ కాల్ ద్వారా ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.

లింగమనేని సంజుష్, కారు ప్రమాదం, హైదరాబాద్​

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, భారతిని టీజీ09 జీ 0666 నంబరు గల కారు ఢీకొనడంతో ఆమె మరణించారు.

నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా లేదా అతివేగంగా వాహనాన్ని నడిపి మరణానికి కారణమైనప్పుడు పోలీసులు ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు.

ఈ సెక్షన్‌ కింద నేరం రుజువైతే గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

కేసులో పోలీసుల తరఫున ఎలాంటి నిర్లక్ష్యం లేదని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ బీబీసీతో చెప్పారు.

''ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అమ్మాయి వివరాలు తెలుసుకున్నాం. ఆమెది ఒడిశా కావడంతో అక్కడి నుంచి బంధువులు వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి ఆలస్యమవుతుందని, స్టోర్ మేనేజర్ ద్వారా ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేశాం'' అని చెప్పారు.

''ఆమె తరఫున బంధువు ఒకరు రావడంతో మృతదేహాన్ని అప్పగించాం'' అని రితిరాజ్ చెప్పారు.

భారతి ముఖి కుటుంబీకులు, బంధువులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారు అందుబాటులోకి రాగానే ఆ వివరాలను అప్‌డేట్ చేస్తాం.

''పోలీసుల నిర్లక్ష్యం లేదు''

ఈ నెల 16వ తేదీన ఘటన జరిగి, కేసు నమోదైనప్పటికీ, నాలుగు రోజుల వరకు వార్త బయటకు రాకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని డీసీపీ రితిరాజ్ అన్నారు.

''మాకు ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు పెట్టాం. కేసు తీవ్రత దృష్ట్యా స్టేషన్ బెయిల్ ఇచ్చాం. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం గానీ, దాపరికాలు గానీ లేవు'' అని చెప్పారు.

లింగమనేని సంజుష్, కారు ప్రమాదం, హైదరాబాద్​

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిందితుడు లింగమనేని సంజుష్

పారిపోలేదు, ఆస్పత్రికి తీసుకెళ్లా: సంజుష్

రోడ్డు ప్రమాద ఘటనపై లింగమనేని సంజుష్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు లింగమనేని రమేశ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

"ప్రమాదం జరిగిన వెంటనే నేనెక్కడికీ పారిపోలేదు. గాయపడిన భారతి ముఖికి సాయం అందించేందుకు నా వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లా. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు'' అని చెప్పారు.

అలాగే ప్రమాదం జరిగిన అనంతరం తాను ఎక్కడికీ వెళ్లిపోకుండా పోలీస్ స్టేషన్‌కే వెళ్లానని సంజుష్ చెప్పారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానని చెప్పారు.

ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించి, ప్రమాదానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకొని నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు.

"పోలీసులు నాకు బ్రీత్‌ ఎనలైజర్, యూరిన్, బ్లడ్ టెస్ట్ చేశారు. ఈ మూడు పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ కేసు విషయంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా. అవసరమైన ప్రతి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా'' అని సంజుష్ తన ప్రకటనలో చెప్పారు.

మరోవైపు, సంజుష్‌కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్, ఇతర టెస్టుల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)