పీఎం కేర్స్ ఫండ్: ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా, ఖర్చు మాత్రం కొన్ని లక్షలే... దీనిపై విమర్శలు, అభ్యంతరాలు ఏమిటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
కేవలం 2.25 లక్షల రూపాయలతో 2020లో ప్రారంభమైన పీఎం కేర్స్ ఫండ్లో, 2025 మార్చి 31 నాటికి 8,452 కోట్ల రూపాయలు జమయ్యాయి.
ఈ గణాంకాలను పీఎం కేర్స్ ఫండ్ అధికారిక వెబ్సైట్ విడుదల చేసింది.
అయితే రూ.8,452 కోట్లు డిపాజిట్ అయినప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ నుంచి కేవలం రూ.87.85 లక్షలే ఖర్చు చేశారు.
పీఎం కేర్స్ ఫండ్కు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరపు ఆడిట్ చేసిన ఖాతాలను ఆగస్టు 18న, మంగళవారం ప్రభుత్వం బహిర్గతం చేసింది. అయితే, ఆ గణాంకాలు పాతవాటితో పాటు కొత్త ప్రశ్నలనూ మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.
2020లో విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పీఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేశారు.

అయితే, గత కొన్ని సంవత్సరాల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపాన్లు తదితర పెద్ద ప్రకృతి విపత్తులు వచ్చినప్పటికీ, ఈ ఫండ్ నుంచి తగిన స్థాయిలో ఖర్చు చేయలేదని విమర్శకులు అంటున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫండ్కు వచ్చే ఆదాయం, అందులో పేరుకుపోయే మొత్తం నిధులు నిరంతరం పెరుగుతుండగా, ఖర్చు మాత్రం చాలా పరిమితంగానే ఉంది.
దీంతో, ప్రత్యేకంగా విపత్తు సహాయ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఈ నిధిని అవసరమైన సమయంలో పెద్ద స్థాయిలో ఎందుకు వినియోగించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, PM Cares Fund
తాజా ఆడిట్ ఏమి చెబుతోంది?
పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదిక ప్రకారం, 2024-25లో వచ్చిన మొత్తం విరాళాల్లో రూ.479.04 కోట్లు దేశీయంగా లభించగా, విదేశాల నుంచి దాదాపు రూ.92 లక్షల విరాళాలు వచ్చాయి.
విరాళాలతో పాటు, వడ్డీ రూపంలో ఫండ్కు మరో రూ.475.14 కోట్లు వచ్చాయి. అందులో రూ.469.37 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) నుంచి, రూ.5.76 కోట్లు బ్యాంకు ఖాతాల నుంచి వచ్చాయి.
అదేవిధంగా, గతంలో కొన్ని ప్రాజెక్టుల కోసం నిధులు అందుకున్న సంస్థల నుంచి రూ.324.65 కోట్లు రిఫండ్గా తిరిగి వచ్చాయి.
ఆ సంస్థలు ఏవి? డబ్బు ఎందుకు తిరిగి వచ్చింది? అనే వివరాలు వెల్లడించలేదు.
అదనంగా, టీడీఎస్ రిఫండ్ రూపంలో రూ.13.49 లక్షలు కూడా ఫండ్కు వచ్చాయి.
తాజా ఆడిట్ ప్రకారం, ఫండ్లోని మొత్తం నిధుల్లో 93 శాతం, అంటే రూ.7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచారు. అయితే ఖర్చు విషయానికి వస్తే, 2024-25లో కేవలం రూ.87.85 లక్షలే వినియోగించారు.
అందులో రూ.87.84 లక్షలు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకంపై ఖర్చు చేయగా, రూ.451 రూపాయలు 'బ్యాంకు చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు' కోసం ఖర్చు చేశారు.
అయితే, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఆ నిధులు ఏ పనుల కోసం వినియోగించారనే వివరాలు ఆడిట్ నివేదికలో లేవు.
కోవిడ్-19 మహమ్మారి, దేశవ్యాప్త లాక్డౌన్ అమలైన కొద్ది రోజుల తర్వాత, 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్ను ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా నమోదు చేశారు.
ఈ ఫండ్కు చైర్మన్ ప్రధానమంత్రి కాగా, రక్షణ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రి ట్రస్టీలుగా ఉన్నారు.
అయితే, ఇప్పటివరకు ఈ ఫండ్కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విరాళాలు ఇచ్చారు అనే సమాచారం ప్రజలకు వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పారదర్శకతపై ఆందోళనలు?
ప్రొఫెసర్ రీతికా ఖేరా ప్రముఖ ఆర్థికవేత్త. ప్రస్తుతం ఆమె దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పనిచేస్తున్నారు.
ఆమె మాట్లాడుతూ.. "పీఎం కేర్స్ ఫండ్ అనేది ఒక రకంగా 'ముసుగు పారదర్శకత' లాంటిది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలను విడుదల చేస్తుంది. అవి ఆలస్యంగా వచ్చినా వస్తాయి. కానీ, ఆ వెల్లడింపు మాత్రం వెలితిగానే ఉంటుంది. అందులో వాస్తవంగా తెలుసుకోవాల్సిన సమాచారం ఉండదు" అని అన్నారు.
అంజలి భరద్వాజ్ సమాచార హక్కు, పారదర్శకత, జవాబుదారీతనం అంశాలపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్త.
ఆమె అభిప్రాయం కూడా ఇదే. పీఎం కేర్స్ విషయంలో అత్యంత పెద్ద ఆందోళన పారదర్శకత లోపమే అని ఆమె చెబుతున్నారు.
"ప్రజలకు విపత్తు సమయంలో సహాయం చేయడానికి ఈ ఫండ్ను ఏర్పాటు చేశారు. కానీ దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడ ఖర్చు జరుగుతోంది? అనే సమాచారం ప్రజలకు ఇవ్వడం లేదు. మన దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ చట్టం) ఉంది. భారీ స్థాయిలో ప్రజా నిధులతో ఆర్థిక సహాయం పొందుతున్న అనేక సంస్థల నుంచి ప్రజలు సమాచారం పొందవచ్చు. కానీ, పీఎం కేర్స్ ఫండ్ను ఆర్టీఐ చట్టం పరిధి వెలుపల ఉంచారు" అని ఆమె అన్నారు.
ఈ ఫండ్ ఏర్పడినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫండ్ అని చెప్పడంతో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను ఇందులో సమీకరించారని అంజలి భరద్వాజ్ చెప్పారు.
"మొదటి కొన్ని రోజుల్లోనే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 3,000 కోట్ల రూపాయలకు పైగా సీఎస్ఆర్ నిధులు ఈ ఫండ్లోకి వచ్చాయి. చట్ట ప్రకారం, కంపెనీస్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫండ్ అని చెప్పి ఆ నిధులను తీసుకున్నారు" అని అన్నారు.
"కానీ, తర్వాత ప్రజలు డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది, ఎక్కడి నుంచి వస్తోంది అనే సమాచారం అడగడం మొదలుపెట్టినప్పుడు, ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్గా కంపెనీస్ యాక్ట్ నిబంధనలను సవరించింది. ఆ తర్వాత ఈ ఫండ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఇది ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ కాదని చెప్పింది. అందువల్ల ఆర్టీఐ చట్టం కింద ఎలాంటి సమాచారం ఇవ్వలేమని వాదించింది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
తగ్గుతున్న ఖర్చుపై ప్రశ్నలు
2024-25లో పీఎం కేర్స్ ఫండ్లో రూ.8,452 కోట్లు ఉన్నప్పటికీ, ఖర్చు కేవలం రూ.87.85 లక్షలే జరిగింది.
గత సంవత్సరాలతో పోలిస్తే, 2023-24లో రూ.15.59 కోట్లు, 2022-23లో రూ.437.87 కోట్లు, 2021-22లో రూ.3,716.29 కోట్లు, 2020-21లో రూ.3,976.17 కోట్లు ఖర్చు చేశారు.
ఈ గణాంకాలు పరిశీలిస్తే, ఫండ్ నుంచి ఖర్చు అవుతున్న మొత్తం ఏడాదికేడాదికి తగ్గుతూ వస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు దానిపై ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
"ఫండ్ నిధుల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏదైనా వ్యవస్థ లేదా కమిటీ ఉందా? ఉంటే అందులో ఎవరు ఉన్నారు? ఏ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారు? అనే విషయాలు ప్రజలకు తెలియాలి. అలాగే విరాళాలు ఎవరు ఇస్తున్నారు, ఆ ఫండ్ డబ్బు ఎలాంటి వ్యక్తులు లేదా సంస్థలకు అందుతోంది అనే సమాచారం కూడా క్రమం తప్పకుండా ప్రజలకు తెలియజేయాలి" అని ప్రొఫెసర్ రీతికా ఖేరా అన్నారు.
"ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి వాటిని వినియోగించకుండా ఎందుకు ఉంచుతున్నారో అర్థం కావడం లేదు. దేశంలో విపత్తులు రావడం లేదా? ఎక్కడో ఒకచోట వరదలు వస్తుంటాయి, ఇంకెక్కడో ఇతర సమస్యలు ఉంటాయి. ఖర్చు చేయకపోతే అసలు ఈ ఫండ్ను ఎందుకు సేకరిస్తున్నారు? ఇదొక పెద్ద ప్రశ్న" అని అంజలి భరద్వాజ్ అన్నారు.
2024-25లో పీఎం కేర్స్ ఫండ్కు తిరిగి వచ్చిన దాదాపు రూ.325 కోట్ల రిఫండ్పై కూడా అంజలి భరద్వాజ్ ప్రశ్నలు లేవనెత్తారు.
"ఈ రిఫండ్ ఎందుకు వచ్చింది? ఏ పనికి ఖర్చు చేసిన డబ్బు తిరిగి వచ్చింది?" అని ఆమె ప్రశ్నించారు.
అంజలి భరద్వాజ్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సమయంలో పీఎం కేర్స్ ఫండ్ ద్వారా ఆస్పత్రులకు అందించిన కొన్ని వెంటిలేటర్లలో లోపాలు ఉండటంతో పలువురు మరణించారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు.
ఈ వ్యవహారాన్ని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్వయంగా పరిశీలించిందని ఆమె తెలిపారు.
కొంతకాలం తర్వాత, పీఎం కేర్స్ ఫండ్ ద్వారా అందించినట్లు చెప్పిన లోపభూయిష్ట వెంటిలేటర్లకు సంబంధించిన డబ్బును తిరిగి తీసుకున్నట్లు తెలిసిందని, అలాగే కోర్టులో ఆ రిఫండ్ తీసుకున్నామని, ఆ వెంటిలేటర్లు పీఎం కేర్స్ కింద ఇచ్చినవే కావని చెప్పారని ఆమె పేర్కొన్నారు.
"ఇప్పుడు మళ్లీ దాదాపు రూ.325 కోట్ల రిఫండ్ కనిపిస్తోంది. దీంతో, పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఎక్కడికి డబ్బు ఇచ్చారు? ఎందుకు ఆ డబ్బు తిరిగి తీసుకోవాల్సి వచ్చింది? అనే ప్రశ్న తలెత్తుతోంది" అని అన్నారు.
అలాగే 2024-25లో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కోసం ఖర్చు చేసిన రూ.87.84 లక్షల గురించి కూడా అదనపు వివరాలు ఆడిట్ నివేదికలో లేవు.
"ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయా, పిల్లల కోసం నిజంగా ఏవైనా కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ఎవరైనా పరిశీలించాలనుకుంటే, ఆ సమాచారాన్ని ప్రజల నుంచి దాచాల్సిన అవసరం ఏముంది? ఆ వివరాలు బహిరంగంగా ఉండాలి. ప్రజలు వాటిని పరిశీలించగలగాలి. ఎక్కడైనా ఆందోళన కలిగించే విషయం ఉంటే దాన్ని గుర్తించగలగాలి. ఆడిట్ చేయగలగాలి. అందుకోసం ఈ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా అవసరం. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు" అని అంజలి భరద్వాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఎలక్టోరల్ బాండ్ల లాగా లోపించిన పారదర్శకత
పీఎం కేర్స్ ఫండ్లో పారదర్శకత లోపాన్ని ఎలక్టోరల్ బాండ్ల వివాదంతో కూడా కొందరు పోలుస్తున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా ప్రధాన విమర్శ పారదర్శకత లోపమే. ఈ పథకం ద్వారా ఏ వ్యక్తి లేదా సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చిందో ప్రజలకు తెలియదు. దీంతో, రాజకీయ విరాళాల మూలాన్ని అర్థం చేసుకోవడం కష్టమయ్యేది.
"ఒకప్పుడు పూర్తిగా గోప్యమైన ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చింది. ఇప్పుడు పీఎం కేర్స్ అనే రహస్య ఫండ్ ఉంది. పీఎం కేర్స్లో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తమ హోదా ప్రకారం అందులో ఉన్నారు. కానీ, అదే సమయంలో ఇది ప్రైవేట్ ఫండ్ అని, పబ్లిక్ అథారిటీ కాదని చెబుతున్నారు. దీంతో 'క్విడ్ ప్రో కో' అంటే ఏదైనా పొందాలనే ఉద్దేశంతో ఏదైనా ఇవ్వడం వంటి పరిస్థితులకు అవకాశం ఏర్పడుతుంది" అని అంజలి భరద్వాజ్ అన్నారు.
"ఇక్కడ కాన్ఫ్లిట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే విరాళాలు ఎవరు ఇచ్చారనే సమాచారం బహిర్గతం కావాలి. అప్పుడే దాన్ని పరిశీలించవచ్చు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఒక ఫండ్కు డబ్బు వెళ్తున్నప్పుడు, దానిలో పారదర్శకత ఉంటుందని ప్రజలు ఆశిస్తారు. కానీ ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తోంది" అని ప్రొఫెసర్ రీతికా ఖేరా అన్నారు.
"అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయనీ, ఎలాంటి అక్రమాలు లేవనీ అయితే, విరాళాలు ఎవరు ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి వెళ్లింది? దాన్ని ఖర్చు చేయాలన్న నిర్ణయాలు ఎలా తీసుకున్నారనే వివరాలను వెల్లడించడంలో ప్రభుత్వానికి సంకోచం ఉండకూడదు" అని అన్నారు.
"పారదర్శకత కోసం పీఎం కేర్స్ను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకురావాలి" అని అంజలి భరద్వాజ్ కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

































