You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇమ్రాన్ ఖాన్: సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
- రచయిత, క్యారీ డేవిస్, ఒలివియా ఐర్లాండ్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆరోగ్యం క్షీణించిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను చికిత్స కోసం రాజధాని ఇస్లామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.
అదియాలా జైలు నుంచి భారీ భద్రత నడుమ ఖాన్ను 'షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్'కు తరలించినట్లు ఆయన పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, హాస్పిటల్కు ఆయన తరలింపుపై అధికారిక ధ్రువీకరణ ఇంకా రావాల్సి ఉంది.
ఇమ్రాన్ ఖాన్కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు 48 గంటల్లోగా ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన తరలింపు జరిగినట్లుగా భావిస్తున్నారు.
అవినీతి సంబంధిత కేసుల్లో 2023లో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలైన తర్వాత.. న్యాయస్థానాల నుంచి ఆయనకు లభించిన అతిపెద్ద ఊరట ఇదే. తనపై నమోదైన ఈ అవినీతి కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన మొదటి నుంచి అంటున్నారు.
ఆసుపత్రికి తరలించడమే కాకుండా, కుటుంబీకులకు కూడా ఇమ్రాన్ ఖాన్ కలిసేలా అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మంగళవారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆయనను జైలులో కలిశారు.
పోలీసుల ఆధీనంలో ఆసుపత్రి ప్రాంగణం
సాధారణంగా ఖాన్కు వ్యతిరేకంగా వచ్చే కోర్టు తీర్పులను రాజకీయ కక్ష సాధింపులుగా ఆయన పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పేర్కొంటుంది. అయితే, సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెనుక తెరవెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ఊహాగానాలపై ఆ పార్టీ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పోలీసులు బారికేడ్లు, పోలీసు వ్యాన్లు, బలగాలతో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసుపత్రి బయట ఉన్న రహదారిని క్లియర్ చేయడానికి ట్రక్కుతో కార్లను తరలించడాన్ని, సాయుధ వాహనాలు, పోలీసు కార్లతో గస్తీ కాయడాన్ని బీబీసీ బృందం స్వయంగా గమనించింది.
ఆసుపత్రి ప్రాంగణంలో ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించవద్దని ఇమ్రాన్ ఖాన్ పార్టీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ సమయాన్ని రాజకీయం చేయకూడదని హెచ్చరించింది.
73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు మందగించడం సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, స్పెషలిస్ట్ వైద్య సేవలు ఆయనకు అందడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
జైలు అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే తన క్లయింట్ కుడి కంటి చూపు చాలావరకు మందగించిందని, కేవలం15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉందని ఫిబ్రవరిలో ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
''ఖైదీ ప్రాణం, ఆరోగ్యం, గౌరవం, భద్రతను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన బాధ్యతను మేం దృష్టిలో ఉంచుకున్నాం'' అని మంగళవారం నాటి ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆసుపత్రిలో ఖాన్కు అందించే చికిత్సలో కంటి వైద్య నిపుణుడు కూడా భాగస్వామ్యం కావాలని జడ్జిలు స్పష్టం చేశారు.
ఇమ్రాన్ ఖాన్పై 100కు పైగా కేసులు
ఆసుపత్రి వెలుపల అభిమానులు ఎవరూ గుమిగూడవద్దని, అలా చేస్తే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని న్యాయమూర్తులు, పీటీఐ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఇమ్రాన్ ఖాన్.. 2018 నుంచి 2022 వరకు పాక్ దేశ ప్రధానిగా పనిచేశారు.
ఆయన 2023 ఆగస్టులో జైలు పాలయ్యారు. అధికారిక రహస్యాల లీకేజీ నుంచి ప్రభుత్వ కానుకల విక్రయం వరకు 100కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే, వీటన్నింటిని రాజకీయ కుట్రలుగా ఆయన ఖండించారు.
గతేడాది చివర్లో ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఆయన జైలు శిక్ష అనంతరం మద్దతుదారులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టగా, అధికారులు వాటిపై ఉక్కుపాదం మోపారు.
జైలులో ఉన్నప్పటికీ, భారీ సంఖ్యలో మద్దతుదారులతో పాకిస్తాన్ రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)