నేపాల్-టిబెట్ బోర్డర్‌లో ఆకస్మిక వరదలు: 95మంది మృతి, 133 మంది భారతీయుల సహా వందలాది మంది విదేశీ యాత్రికుల గల్లంతు... అసలు ఈ వరదలకు కారణమేంటి?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా కనీసం 403 మంది విదేశీ పర్యటకులు సహా వందలాది మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.

ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 95 మందికి చేరిందని నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. 93 మంది గాయపడినట్టు అధికారులు చెప్పారు. ఈ వరదల్లో సంభవించిన నష్టం "ఊహకందని స్థాయిలో" ఉందని ఒక అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

టిబెట్‌లో భారీ నష్టం వాటిల్లిందని చైనా ప్రభుత్వ మీడియా ఛానల్ సీసీటీవీ నివేదించింది. కాఠ్మండుకు ఉత్తరాన రసువా ప్రాంతంలో ఈ వరదలు సంభవించాయి. ఈ ప్రాంతం టిబెట్ సరిహద్దును పంచుకోవడంతో పాటు, చైనాతో నేపాల్‌ ప్రధాన వాణిజ్య మార్గంలో ఉంది.

అయితే, ఆకస్మికంగా నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన వరదలకు కారణమేంటి?

ఏయే నదులు ఉప్పొంగడంతో.. ఏయే ప్రాంతాల వారు ప్రభావితమయ్యారు? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?

మంచు చరియలు విరిగిపడటమేనా?

రసువా జిల్లాలో భోటేకోషి నది ఆకస్మికంగా పొంగిపొర్లడం వరదలు సంభవించడానికి కారణమైంది.

టిబెట్ వైపున హిమనీనదం నుంచి భారీ మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో వరద పోటెత్తిందని జాతీయ విపత్తు నియంత్రణ, నిర్వహణ సంస్థ తెలిపింది.

అయితే, భూకంపం వల్ల ఈ మంచు చరియలు విరిగిపడ్డాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రతినిధుల సభనుద్దేశించిన చేసిన ప్రసంగంలో చెప్పారు.ఉదయం 8.37కు ఈ భూకంపం సంభవించడం, వరదలకు కారణమైందని కూడా పేర్కొన్నారు. భోటేకోషి, త్రిశూలి నదులకు చెందిన తీరప్రాంతాలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు.

ఏయే నదులు ఉప్పొంగాయి?

నేపాల్-చైనా రసువగాధి సరిహద్దు వద్ద ఈశాన్యం వైపు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వరద ప్రారంభమైందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది.

భోటేకోషి నదిలో మంచు కరగడం వల్ల వరదలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నది టిబెట్ నుంచి నేపాల్‌కు ప్రవహిస్తోంది. దీంతో, త్రిశూలి నది కూడా ఉప్పొంగింది.

రసువా ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో.. భోటేకోషి, త్రిశూలి, నారాయణి నదుల తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు నేపాల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

ప్రభావితమైన పట్టణాలేంటి?

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఉదయం సుమారు 8:40 గంటలకు రసువాలోని భోటేకోషి నదిలో వచ్చిన వరద వల్ల రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపిందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.

ముఖ్యంగా తిమురే, స్యాబ్రుబెసి, బెత్రావతి, త్రిశూలి బత్తార్, దేవిఘాట్ వంటి ప్రాంతాలు 'తీవ్ర నష్టానికి' గురయ్యాయని ఆయన పేర్కొన్నారు.

భోటేకోషి, త్రిశూలి నదికి చెందిన తీరప్రాంతాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయని, నువాకోట్, ధడింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని తీర ప్రాంతాలు, నదివైపుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారతీయులు ఎంత మంది ఉన్నారు? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?

గల్లంతైన 403 మందిలో 200 మంది మహిళలు, 203 మంది పురుషులు ఉన్నారు. నేపాల్ పర్యటక శాఖ అందించిన సమాచారం మేరకు గల్లంతైన వారి ప్రాథమిక జాబితాలో భారత్‌కు చెందిన వారు 133 మందికి పైగా, అమెరికాకు చెందిన 47 మంది, యూకేకు చెందిన 33 మంది ఉన్నారు.

భారత్‌కు చెందిన వారిలో తమిళనాడుకు చెందిన వారు సుమారు 57 మంది పర్యటకులు వరదల్లో చిక్కుకున్నట్లు తంజావూర్‌కు చెందిన ఒక ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు.

కుంభకోణానికి చెందిన టూర్ ఆపరేటర్ ద్వారా వీరు నేపాల్ వెళ్లారు. వీరందరూ త్రిచీ, చెన్నై, చిదంబరం, మైలాదుతురై, తిరువరూర్, పుదుచ్చేరి, కుంభకోణం, తంజావూర్, హోసుర్, తిరువన్నమలై, కృష్ణగిరి, ధర్మపురికి చెందినవారు.

నేపాల్‌లో భారీ వరదల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో మాట్లాడారు.

"నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి బాలేంద్ర షాతో మాట్లాడి సంతాపం తెలియజేశాను. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని మన సోదర సోదరీమణులకు భారత ప్రజలు అండగా నిలుస్తారు. నేపాల్‌కు సాధ్యమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ల కోసం మా బృందాలు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి" అని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసింది.

ఈ నెంబర్లు –

+977 985 131 6807

+977 970 910 7500

ప్రస్తుత పరిస్థితేంటి?

పోలీసు, సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే, వరద నీరు తగ్గే వరకు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక హెలికాప్టర్లు దిగలేవని అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.

పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని, అలాగే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారని తెలిపింది.

ఇప్పటివరకు వరదల నుంచి 88 మందిని రక్షించినట్లు నేపాల్ సైన్యానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మైలుంగ్ గ్రామం నుంచి మరో 115 మందిని రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు.

గాలింపు, సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు రాజారామ్ బస్నెట్ బీబీసీకి తెలిపారు.

నేపాల్‌లోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తిమురే, స్యాబ్రుబెసి, బెత్రావతి ప్రాంతాలలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

ఈ వరదల వల్ల త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని, అలాగే వివిధ ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయని ఆ శాఖ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)