అన్నూరు: దోమల పొగకు ఇద్దరు మృతి చెందారంటూ ఆరోపణలు, నిజంకాదన్న అధికారులు

దోమల మందు పిచికారీ

ఫొటో సోర్స్, R. SATISH BABU/AFP via Getty Images

    • రచయిత, జేవియర్ సెల్వ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

కోయంబత్తూరు జిల్లా అన్నూరులో దోమల నివారణ మందు నుంచి వచ్చిన పొగ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

ఇద్దరూ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, వారు అకస్మాత్తుగా మృతి చెందడానికి ఇళ్లలోకి వచ్చిన దోమల నివారణ పొగే కారణమని పలువురు ఆరోపించారు. అయితే, ఈ మరణాలపై వారి కుటుంబ సభ్యులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

"ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు. పొగ కారణంగా వారు మృతి చెందలేదు" అని విచారణ చేపట్టిన పట్టణ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి, జిల్లా ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీబీసీకి తెలిపారు.

దోమల నివారణ మందులో కలిపే రసాయనం ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నందున, మందు పిచికారీ చేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కోయంబత్తూరు జిల్లా అన్నూరు పట్టణ పంచాయతీ పరిధిలోని సత్యమంగళం సాలై ఉప్పుతోటం ప్రాంతంలో గతవారం ముగ్గురు చిన్నారులకు డెంగ్యూ సోకినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో దోమల నిర్మూలన చర్యలను పట్టణ పంచాయతీ యంత్రాంగం చేపట్టింది. ఈ క్రమంలో 11వ తేదీన అన్నూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారి చేశారు.

దోమల నివారణ మందు పిచికారి చేస్తున్న సమయంలో, కొన్ని ప్రాంతాల్లో పొగ ఇళ్లలోకి వెళ్లేలా పిచికారీ చేయవద్దని కొందరు స్థానికులు కోరినప్పటికీ అధికారులు వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తలుపులు తెరిచి ఉన్న ఇళ్లలోకి సైతం వెళ్లి మందును వదిలారని వారు చెబుతున్నారు.

ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అదే ప్రాంతానికి చెందిన 65 ఏళ్ళ ఆటో డ్రైవర్ మోహన్, అదే వార్డులోని మరో ప్రాంతంలో నివసించే 75 ఏళ్ల ప్రేమ అలియాస్ రాణి, మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ వెంట వెంటనే మృతి చెందడంతో, అధిక మోతాదులో పురుగుమందు కలిపిన దోమల నివారణ మందు కారణంగా, దట్టమైన పొగ వెలువడటమే వారి మరణాలకు కారణమైందని పలువురు స్థానికులు మీడియాతో చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దోమల మందు పిచికారీ
ఫొటో క్యాప్షన్, ఆటో డ్రైవర్ మోహన్

మృతుడు మోహన్ కుటుంబ సభ్యుల్లో కొందరు తమ ఇంట్లో పురుగుమందు పిచికారీ చేయవద్దని చెప్పినప్పటికీ, దోమల మందును అధిక మోతాదులో పిచికారీ చేయడంతో ఊపిరాడక ఆయన మృతి చెందారని తొలుత తెలిపారు.

అయితే, ఈ సమాచారాన్ని పట్టణ పంచాయతీ, ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యులు కొన్ని మీడియా సంస్థలతో అనారోగ్య కారణాలతో సహజంగానే వారు మృతి చెందారని తెలిపారు. అధికారుల భయంతోనే వారు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారని మాజీ స్థానిక కౌన్సిలర్ శేఖర్ ఆరోపించారు. ఈ అంశంపై వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

"మా సోదరుడు మోహన్ అప్పటికే అనారోగ్యంతో ఉన్నది నిజమే. అయితే ఆసుపత్రిలో చికిత్స పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఒక రోగి ఉన్నారని చెప్పి, పొగ లోపలికి రాకుండా ముందు తలుపును మూసివేశారు. అయితే వెనుక వైపు తెరిచి ఉన్న తలుపు వద్దకు వచ్చి వారు పొగ పిచికారీ చేయడంతో అది ఇల్లంతా వ్యాపించింది" అని మరణించిన ఆటో డ్రైవర్ మోహన్ బంధువు మహేంద్రన్ తెలిపారు.

"ఒకవైపు తలుపు మూసి ఉండటంతో ఇంట్లోకి వచ్చిన పొగ బయటకు పోలేదు. దీంతో లోపల ఉన్నవారికి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యంగా ఉన్నవారికి ఈ పొగ స్వల్పంగా ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే, అదే కారణమని మాత్రం చెప్పలేం" అని మహేంద్రన్ అన్నారు.

దోమల మందు పిచికారీ
ఫొటో క్యాప్షన్, మృతి చెందిన రాణి

అదే రోజు అదే వార్డులో మృతి చెందిన ప్రేమ అలియాస్ రాణి ఇంటికి సమీపంలో నివసించే ప్రేమదేవ అనే మహిళతో బీబీసీ మాట్లాడింది. "ఆమెకు అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కొన్ని రోజుల తర్వాత మృతి చెందారు" అని తెలిపారు.

"దోమల నివారణ మందుకు, ఆమె మరణానికి ఏమైనా సంబంధం ఉందో మాకు తెలియదు. మా ప్రాంతంలో చాలామంది వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. వారిలో ఎవరికీ ఎలాంటి సమస్యలు రాలేదు. అందుకే ఆమె మరణానికి దోమల నివారణ మందే కారణమని మేము భావించడం లేదు. ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు నిర్వహించారు" అని ప్రేమదేవ తెలిపారు.

అదేవిధంగా మోహన్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు కానీ, మరెక్కడైనా కానీ ఫిర్యాదు చేయకుండానే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఇద్దరి మరణాలకు సంబంధించి అన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

అన్నూరు 7వ వార్డు మాజీ కౌన్సిలర్ శేఖర్ "పట్టణ అధికారులు ప్రజలు చెప్పేది వినడం లేదు. మా వార్డులో చాలా ఇళ్లలోకి వెళ్లి పురుగుమందులు పిచికారీ చేశారు. అలా చేయవద్దని చెప్పినా పట్టించుకోలేదు. మృతి చెందిన ఇద్దరూ ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నప్పటికీ, అధిక మోతాదులో పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల వచ్చిన పొగ వారి ఆకస్మిక మరణాలకు కారణమైంది. వారి కుటుంబ సభ్యులు తొలుత మీడియాకు చెప్పింది ఇదే" అని అన్నారు.

"ఒక ప్రాంతంలో ఇళ్లలోకి దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నప్పుడు అక్కడి మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లి మరో ప్రాంతంలో అదే విధంగా పిచికారీ చేశారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న ప్రేమ, మందు పిచికారీ చేసిన అరగంటలోనే మృతి చెందారు. ఈ విషయాన్ని తొలుత మీడియాతో మాట్లాడిన ఆమె కుటుంబ సభ్యులు, ఆ తర్వాత ఫిర్యాదులు, న్యాయపరమైన సమస్యలు వస్తాయనే భయంతో తమ మాటలను వెనక్కి తీసుకున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం విచారణ జరిపి, పట్టణ పంచాయతీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి" అని మాజీ కౌన్సిలర్ శేఖర్ అన్నారు.

దోమల మందు పిచికారీ

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

అన్నూరు పట్టణ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి కార్తికేయన్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు.

"గత నెలలో ఆ ప్రాంతంలో ముగ్గురికి డెంగ్యూ సోకినట్లు మాకు సమాచారం అందింది. ఆ ప్రాంత ప్రజలు దోమల నివారణ మందు పిచికారీ చేయాలని మమ్మల్ని కోరారు. అందుకే వీధుల్లో మందును పిచికారీ చేశాం. ఏ ఇంట్లోనూ పొగ వదల్లేదు. అయితే తలుపులు, కిటికీలు తెరిచి ఉన్న ఇళ్లలోకి పొగ వెళ్లి ఉండవచ్చు" అని తెలిపారు.

"అదేవిధంగా అధిక మోతాదులో పురుగుమందు కలిపారన్న ఆరోపణలు, అది కాలం చెల్లిన పురుగుమందు అన్న సమాచారం కూడా నిజం కాదు. పట్టణ పంచాయతీల అసిస్టెంట్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ వచ్చి దీనిని పరిశీలించారు. ఈ పురుగుమందుకు 2027 ఆగస్టు వరకు గడువు ఉంది. క్రిమి సంహారకాలను కూడా సరైన మోతాదులోనే కలిపాం. అదే వీధిలో 200 ఇళ్ల ముందు పిచికారీ చేసినప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు" అని కార్యనిర్వహణ అధికారి తెలిపారు.

ఆటో డ్రైవర్ మోహన్, ప్రేమ ఇద్దరూ ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారని, మోహన్ గుండె వైఫల్యంతో, ప్రేమ ఊపిరితిత్తుల దెబ్బతినడం, ఆస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆయన తెలిపారు. పట్టణ పంచాయతీల అసిస్టెంట్ డైరెక్టర్ అబూబకర్ కూడా మీడియాతో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కోయంబత్తూరు జిల్లా ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలుసామి, జోనల్ కీటక శాస్త్రవేత్త ఇన్‌చార్జ్ శివకుమార్ సహా ఆరోగ్య శాఖ అధికారులు అన్నూరులో పరిశీలన జరిపి తిరిగి వచ్చారు.

డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై దోమలను నియంత్రించేందుకు పొగ మందు పిచికారీ చేయాలని భారత జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ సిఫార్సు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పిచికారీ చేసేందుకు స్థానిక ప్రభుత్వాలు మలాథియాన్ వంటి వివిధ పురుగుమందులను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మలాథియాన్ మానవ నిర్మిత ఆర్గానోఫాస్ఫేట్ పురుగుమందు అని అధ్యయనం పేర్కొంది.

దోమల నివారణ మందు కారణంగా మరణాలు సంభవించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, దానిని ఉపయోగించే సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు పాటించాలని జనరల్ ప్రాక్టీషనర్ ఆదిత్యన్ కుగన్ సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)