అస్సాంలో భారీ వరదలు, 41కి చేరిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, NDRF
అస్సాంలో భారీ వరదల కారణంగా గత 24 గంటల్లో మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.
వరదల కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు వెయ్యి గ్రామాలు నీట మునిగాయని, 6.53 లక్షల మంది ప్రభావితులయ్యారని అస్సాం ప్రభుత్వ విపత్తు విభాగం ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సుమారు 25 వేల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందినట్లు విపత్తు నిర్వహణ శాఖ నివేదిక పేర్కొంది.
ఎగువ అస్సాంలో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లోని వరద బాధితులను గుర్తించేందుకు సైనిక హెలికాప్టర్లు గగనతల నిఘా నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వరద పరిస్థితి గురించి వివరించారు.







