బంగ్లాదేశ్‌: విశ్రాంత హిందూ ఉపాధ్యాయుడు సహా నలుగురిని హత్య చేశారు, ఆపై ఇంట్లోనే స్నానం చేసి, ఖర్జూరాలు, కీరదోస తిన్నారు

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

(హెచ్చరిక: కలవపరిచే అంశాలు ఉన్నాయి)

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌ జిల్లాలో రిటైర్డ్ టీచర్‌ సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నిందితులు హత్య చేయడానికి ముందు ఆ ఇంటి మేడ మీద డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ హత్యల మిస్టరీని పోలీసులు చాలా తక్కువ సమయంలోనే ఛేదించారని రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అబ్దుల్ మాబూద్ చెప్పారు.

అయితే పోలీసులు దర్యాప్తు జరిపి అసలు నేరస్థులను పట్టుకోవాలని చనిపోయిన వ్యక్తి సోదరుడు డిమాండ్ చేశారు.

రిటైర్డ్ టీచర్, ఆయన ఆయన కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత 6-7 గంటల పాటు ఇంట్లోనే ఉన్నట్లు నిందితులు అంగీకరించారని వారిని విచారించిన రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్ సనాతన్ చక్రవర్తి తెలిపారు.

‘‘ఉదయం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్లను ప్రశ్నించాం. హత్య చేసినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. వారిని కలిపి, విడివిడిగా విచారించడం ద్వారా మేము దీనిని నిర్ధరించుకున్నాం" అని సనాతన్ చక్రవర్తి బీబీసీతో చెప్పారు.

రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఏకేఎం నజ్ముల్ ఖాదర్ మాట్లాడుతూ హత్యకు గురైన టీచర్‌కు సోదరుడైన గోపీనాథ్ చక్రవర్తి ఈ ఘటన గురించి గుర్తుతెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారని తెలిపారు.

‘‘ఈ విషయం తెలిశాక ఊరి నుంచి వచ్చాను. పోలీసులకు ఫిర్యాదు చేశా. వాళ్లు దర్యాప్తు చేసి ఏం జరిగిందో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను" అని గోపీనాథ్ చక్రవర్తి చెప్పారు.

హత్యల గురించి ఇంకా ఏం తెలుసు?

శనివారం రాత్రి 11.30 గంటలకు నగరంలోని దశపారా మాచువాపారా ప్రాంతం నుంచి రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి, ఆయన కుటుంబంలోని మొత్తం నలుగురు సభ్యుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టీచర్‌గా రిటైరైన తర్వాత ఆయన హోమియోపతి వైద్యుడిగా పని చేస్తున్నారు.

చక్రవర్తి రెండంతస్తుల ఇంట్లో రెండో అంతస్తులో ఉంటున్నారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో ఇల్లంతా దుర్వాసన వ్యాపించింది.

పోలీసులు ఆ ఇంట్లో నుంచి గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలతా చక్రవర్తి, కుమార్తె అగామి చక్రవర్తి, కుమారుడు ప్రియమ్ చక్రవర్తి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రీతిలతా చక్రవర్తి చివరిసారిగా గురువారం తనతో మాట్లాడారని ఆమె సోదరి పూజా చక్రవర్తి చెప్పారు.

శనివారం రాత్రి వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో, పూజా చక్రవర్తి వాళ్ల ఇంటికి వచ్చారు. అక్కడ మెయిన్ డోర్ మూసి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తర్వాత పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

"నా తమ్ముడు చాలా సాధారణ జీవితం గడిపేవాడు. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆయనను ఇలా ఎందుకు హత్య చేశారు? నిజం తెలుసుకోవడానికి పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేయాలి" అని రిటైర్డ్ టీచర్ సోదరుడు గోపీనాథ్ చక్రవర్తి బీబీసీతో అన్నారు.

అయితే హత్యల మిస్టరీని ఛేదించామని, ఇద్దరు నిందితులను ఆదివారం ఉదయం అరెస్ట్ చేశామని రంగ్‌పూర్ పోలీసులు చెప్పారు.

నిందితులు ఎవరు?

గణపతి చక్రవర్తి మంచి మనిషని, ఆయనకు ఎవరితోనూ గొడవల్లేవని పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అబ్దుల్ మాబూద్ చెప్పారు.

ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల హత్య కేసును పోలీసులు చాలా తక్కువ సమయంలో ఛేదించారని ఆయన చెప్పారు.

ముగ్ధా దాస్, సిద్ధార్థ దాస్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని వారిద్దరూ బంధువులని, అదే ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు.

వారిలో ఒకరు అక్కడి బంగారు దుకాణంలో పనిచేసేవారు.

"పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంటి గుండా ఇద్దరు వ్యక్తులు గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పు మీదకు చేరుకున్నారు. వాళ్లు ఆ సమయంలో అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు. గణపతి చక్రవర్తికి పైన శబ్ధాలు వినిపించడంతో మేడపైకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మెడలో తువాలు ఉంది. వాళ్లు ఆ తువాలుతోనే ఆయనను హత్య చేశారు. హత్య చేశాక పారిపోయేందుకు ప్రయత్నించడంతో ప్రీతిలతా చక్రవర్తి వారిని అడ్డుకున్నారు. దీంతో మెట్ల మీదనే వాళ్లు ఆమెను హత్య చేశారు" అని పోలీస్ కమిషనర్ వివరించారు.0

"ప్రీతిలతా చక్రవర్తి కేకలు వేయడంతో ఆమె కుమార్తె పైకి వచ్చారు. దీంతో వాళ్లు ఆమెను కూడా చంపేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ 12 ఏళ్ల ప్రియమ్‌ను కూడా హత్య చేశారు" అని మాబూద్ చెప్పారు.

'హత్య చేసి అక్కడే ఖర్జూరాలు తిన్నారు'

వరుసగా నాలుగు హత్యలు చేసినప్పటికీ హంతకులు సాధారణంగానే ప్రవర్తించారని, హత్య తర్వాత వారు ఇంట్లోని ఫ్రిజ్ నుంచి కీర దోసకాయలు తీసుకు తిన్నారని అబ్దుల్ మాబుద్ చెప్పారు.

"నలుగురిని హత్య చేశాక, వాళ్లు బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేశారు. తర్వాత డైనింగ్ టేబుల్‌పై ఖర్జూరాలు తిన్నారు. అక్కడ వారు యాబా(డ్రగ్) సేవించారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు మాకు లభించాయి. తెల్లవారిన తర్వాత బయటకు వెళ్లాలని అనుకున్నారు. ఇంట్లో సామాను దోచుకుని శుక్రవారం నమాజ్ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని రంగ్‌పూర్ పోలీస్ కమిషనర్ చెప్పారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో నిందితులిద్దరూ కావాలనే ఇంట్లోని మొత్తం సామానును చిందరవందరగా చేశారని ఆయన అన్నారు. వాళ్ల రెండు మొబైల్ ఫోన్లను నీళ్లున్న బకెట్‌లో వేశారు.

"వారు కొన్ని బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి ఆలయం వెనుక ఒక నిర్మానుష్య ప్రదేశంలో వాటిని పడేశారు" అని పోలీస్ కమిషనర్ తెలిపారు

పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ తర్వాత మృతుడు గణపతి చక్రవర్తి సోదరుడు గోపీనాథ్ చక్రవర్తి బీబీసీతో మాట్లాడారు.

పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేసి అసలు నేరస్థులను అరెస్టు చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)