You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది
- రచయిత, హర్ప్రీత్ కౌర్ లాంబా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
బర్మింగ్హామ్లో 2001లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో సాధించిన విజయం పుల్లెల గోపీచంద్ క్రీడా జీవితంలో మర్చిపోలేని క్షణాలలో ఒకటి.
అయితే ఆయన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవలేకపోయారు.
ప్రపంచ వేదికపై భారత బ్యాడ్మింటన్ తన ఉనికిని చాటుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రకాశ్ పదుకొనే బాటలో నడిచి గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రంగా గుర్తింపు పొందారు.
ప్రకాశ్ పదుకొనే 1980లోనే ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలిచారు.
ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ ప్రయాణం చాంపియన్ ఆటగాడి నుండి కోచ్గా మారింది.
ఆయన సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్.. మరెందరో భారతదేశపు బ్యాడ్మింటన్ స్టార్లను తీర్చిదిద్దారు.
తన 30 ఏళ్ల క్రీడా జీవితంలో 52 ఏళ్ల పుల్లెల గోపీచంద్కు గత వారాంతం అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది.
తన శిష్యులు ప్రపంచ ఛాంపియన్షిప్ పోడియంపై నిలబడటం ఆయన గతంలో ఎన్నోసార్లు చూశారు.
కానీ ఈసారి, ఆయన సొంత కుమార్తె గాయత్రి ఆ పోడియంపై సగర్వంగా నిలిచారు.
దిల్లీలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో గాయత్రి, త్రిషా జాలీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళల డబుల్స్ జోడీగా వీరు చరిత్ర సృష్టించారు.
గతంలో2011 లండన్ ఒలింపిక్స్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీ కాంస్య పతకం గెలుచుకుంది.
టోర్నమెంట్లో ఎలాంటి సీడింగ్ లేకుండా బరిలోకి దిగిన గాయత్రి-త్రిషా జోడీ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఈ ఘనత సాధించింది.
సెమీఫైనల్కు చేరుకునే క్రమంలో వీరిద్దరూ దిగ్గజ క్రీడాకారిణులను ఓడించారు. ముఖ్యంగా బలమైన చైనా జోడీలపై రెండుసార్లు విజయం సాధించారు.
సెమీఫైనల్ మ్యాచ్లో ఒలింపిక్ పతక విజేతలు లియు షెంగ్ షూ, టాన్ నింగ్ జోడీతో తలపడిన గాయత్రి-త్రిషా.. తొలి గేమ్ను సొంతం చేసుకుని ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన గేముల్లో 18-21, 21-13, 21-8 తేడాతో ఓడిపోయారు.
ఈ కాంస్య పతకంతో కలిపి ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 16కు చేరింది.
ఈ అద్భుత విజయంతో గాయత్రి, త్రిషా ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన అగ్రశ్రేణి భారతీయ అథ్లెట్ల క్లబ్లో చేరారు.
నాన్నే.. కోచ్ కూడా
ఈ టోర్నమెంట్ మొత్తం గోపీచంద్ జట్టుతోనే ఉంటూ ఒకే సమయంలో రెండు కీలక పాత్రలు పోషించారు.
ఒకవైపు కోచ్గా ఆ ఇద్దరినీ వారి కెరీర్లోనే అతిపెద్ద టోర్నమెంట్ కోసం సిద్ధం చేయగా.. మరోవైపు ఒక తండ్రిగా తన కుమార్తె ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై ఆడటాన్ని నేరుగా చూశారు.
"తండ్రిగానా లేక కోచ్గానా మీకు ఏది ఎక్కువ గర్వకారణంగా అనిపించింది?" అని అడిగినప్పుడు ఆయన దేన్నీ ఎంచుకోలేదు.
"నేను ఈ రెండింటి గురించి ఆలోచిస్తాను. కోర్టులో ఉన్నప్పుడు నేను కోచ్ని మాత్రమే. కానీ త్రిషా, గాయత్రి మనందరూ గర్వపడేలా చేశారని నేను నమ్ముతున్నాను" అని ఆయన అన్నారు.
గోపీచంద్ మార్కు ప్రశాంతత, నిబ్బరానికి అద్దం పడుతోంది సమాధానం.
బ్యాడ్మింటన్ కోర్టు చుట్టూ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడాన్ని ఆయన దశాబ్దాలుగా అలవర్చుకున్నారు.
ఆయన ముఖంలోని చిరునవ్వు, ప్రశాంతత ఈ క్షణం మిగతా వాటికంటే చాలా భిన్నమైనదని స్పష్టం చేశాయి.
గాయత్రి ఆట తీరు ఎలా అనిపించిందన్న ప్రశ్నకు ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడానికి ఆయన కాస్త తడబడ్డారు.
"నిజం చెప్పాలంటే, దాన్ని సరిగ్గా ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. నా ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు నాకు ఎప్పుడూ ఒకేలా అనిపిస్తుంది. మిగతా ఆటగాళ్ల విషయంలో నాకు ఎలాంటి భావన ఉంటుందో గాయత్రి విషయంలోనూ అంతే. అంతకుమించి ఏమీ లేదు" అని ఆయన చెప్పారు.
భావోద్వేగాలను పక్కన పెట్టి ఆ జోడీకి విజయాన్ని తెచ్చిపెట్టిన ఆటలోని సాంకేతిక అంశాల గురించి కోచ్ గోపీచంద్ మాట్లాడారు.
"నెట్ వద్ద త్రిషా ఎంత దూకుడుగా ఉంటూ మ్యాచ్ను తన అదుపులోకి తెచ్చుకుందో చూడ ముచ్చటగా అనిపించింది. అలాగే గాయత్రి బ్యాక్కోర్ట్ ఆట తీరు ఆమె సర్వ్ రిథమ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు అంశాలే కీలక క్షణాల్లో వారిని విజయతీరాలకు చేర్చాయి" అని ఆయన విశ్లేషించారు.
ఈ పతకం గోపీచంద్ కష్టానికి దక్కిన బహుమతి లాంటిది. ఈ జోడీ ఒకానొక సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో 9వ స్థానానికి చేరుకుంది, కానీ త్రిషాకు చీలమండ గాయం కావడంతో వారి పురోగతి కాస్త నెమ్మదించింది.
"ఆమెకు ఇది సవాళ్లతో కూడిన సంవత్సరం. పునరాగమనం తర్వాత ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా పెద్ద విషయం. ఇది ఆమె ప్రతిభకు నిదర్శనం. కెరీర్లో ఈ దశలో ఇలాంటి ఘనత సాధించడం విశేషం" అని ప్రశంసించారు.
ఈ విజయానికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, గాయత్రి, త్రిషాలు 'అర్జున అవార్డు 2025'కు కూడా ఎంపికయ్యారు.
"దేవుడి దయ వల్ల ఇప్పుడు మా కుటుంబంలో ఇద్దరు అర్జున అవార్డు విజేతలు ఉన్నారు. ఇలా జరగడం చాలా అరుదు. ఆమెకు ఈ అవకాశం కల్పించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. టోర్నమెంట్ అంతటా ఆమె ప్రదర్శన, ప్రవర్తన పట్ల గర్వపడుతున్నాను" అని గోపీచంద్ అన్నారు.
గోపీచంద్ కూతురిగా పెరగడం
గాయత్రి జీవితంలో బ్యాడ్మింటన్ ఎప్పుడూ ఒక భాగంగానే ఉంది.
ఐదేళ్ల వయసు నుంచే ఆమె అప్పుడప్పుడు తండ్రితో కలిసి శిక్షణా శిబిరాలకు వెళ్లేవారు. అలా కోర్టులు, క్రీడాకారులు, కోచ్ల మధ్యే పెరిగారు.
గోపీచంద్ కుమార్తె కావడంతో గోపీచంద్ అకాడమీలో సహజంగానే ఆమెపై అందరి దృష్టి కాస్త ఎక్కువగా ఉండేది.
అయితే తన గుర్తింపు కుమార్తెకు భారం కాకూడదని గోపీచంద్ జాగ్రత్తలు తీసుకున్నారు. 'గోపీచంద్' అనే పేరుకున్న వారసత్వాన్ని మోయడం అంత తేలిక్కాదని ఆయనకు బాగా తెలుసు.
"నాన్న నన్నెప్పుడూ ఒత్తిడి చేయలేదు. తండ్రిగా నేను సంతోషంగా ఉండాలనే కోరుకున్నారు. కోర్టులో ఉన్నా, బయట ఉన్నా ఆయన మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది" అని గాయత్రి చెప్పారు.
క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీ జియా యిఫాన్, జాంగ్ క్సుక్సియాన్పై గెలిచాక కుమార్తె విషయంలో గోపీచంద్ వైఖరి ఎలా సరైందో ప్రపంచానికి తెలిసింది.
ఆ గెలుపుతో గాయత్రి, త్రిషాలకు పతకం ఖాయమైంది. విజయం లభించిన వెంటనే త్రిషా పరుగున వెళ్లి గోపీచంచ్ను హత్తుకున్నారు. అయితే గాయత్రి మాత్రం మొదట ప్రత్యర్థి క్రీడాకారిణుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ తర్వాతే తన తండ్రి వద్దకు వెళ్లారు.
అప్పుడు గోపీచంద్ ప్రేమతో కుమార్తె నుదుటిపై ముద్దుపెట్టారు. ఈ భావోద్వేగ సన్నివేశం ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లోనే అత్యంత గుర్తుండిపోయే, మధురమైన దృశ్యాలలో ఒకటిగా నిలిచింది.
సింగిల్స్ నుంచి డబుల్స్ వైపు
తండ్రి లాగే గాయత్రి కూడా మొదట సింగిల్స్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించారు.
ఆ తర్వాతే డబుల్స్ విభాగంలోకి మారారు.
త్రిషా సైతం తొలుత సింగిల్స్ ఆడినప్పటికీ, ఆ తర్వాతే డబుల్స్ మ్యాచ్లలో తన అసలైన ప్రతిభను గుర్తించారు.
వీరిద్దరూ 2021 నుండి కలిసి ఆడటం ప్రారంభించారు.
బ్యాక్ కోర్టులో త్రిషా దూకుడు, నెట్ వద్ద గాయత్రికున్న వ్యూహాత్మక అవగాహనతో ఈ జోడీని ఉత్తమంగా మార్చింది.
కాలక్రమంలో ఈ భాగస్వామ్యం బలపడి ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ జోడీల జాబితాలోకి దూసుకెళ్లేలా చేసింది.
గాయత్రి డబుల్స్ కేటగిరీని ఎంచుకోవడంపై గోపీచంద్ స్పందిస్తూ," ఆమె నిర్ణయం సరైనదేనని భావిస్తున్నాను" అని అన్నారు.
అయితే సుదీర్ఘ ప్రయాణంలో ఈ జోడీ పలు ఇబ్బందులను ఎదుర్కొంది.
ఈ ఏడాది త్రిషాకు ఎదురైన గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్షిప్ సన్నాహకాలకు తీవ్ర ఆటంకం కలిగింది.
దీనివల్ల పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడానికి ఈ జట్టుకు కేవలం 45 రోజులు మాత్రమే సమయం మిగిలింది.
"గడిచిన ఆరు వారాల్లో మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మైదానంలో మా కఠిన శిక్షణకు తగ్గ ఫలితాలు కనిపించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది" అని గోపీచంద్ చెప్పారు.
భారత్ భవిష్య జోడి
గాయత్రి, త్రిషా సాధించిన ఈ చారిత్రక కాంస్య పతకం కేవలం గోపీచంద్ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు.
జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప తర్వాత ప్రపంచ స్థాయిలో స్థిరంగా రాణించగల ఒక బలమైన జోడీ కోసం భారత మహిళల డబుల్స్ బ్యాడ్మింటన్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది.
ఇప్పుడు ఈ యువ జోడీ దేశంలో సరికొత్త ఆశలను రేకెత్తించింది.
అయితే, ఈ కాంస్య పతకం తమ చివరి గమ్యస్థానం కాదని ఈ జోడీ స్పష్టం చేసింది.
"ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం, అలాగే అర్జున అవార్డు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇది మా ప్రయాణానికి ఆరంభం మాత్రమే. మేము మరింత ముందుకు దూసుకెళ్తాం" అని త్రిషా ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు వీరి తదుపరి పెద్ద లక్ష్యం ఆసియా క్రీడలు.
అయితే, రాబోయే సవాళ్ల కోసం చేసే సన్నాహాలు ప్రస్తుత విజయానందాన్ని దూరం చేయకూడదని త్రిషా భావిస్తున్నారు.
"ఈ రోజు మేము సాధించిన ఈ ఘనతను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. జట్టు సభ్యులందరితో కలిసి వేడుక చేసుకుంటాం. అవును, మా సెలబ్రేషన్స్ మెనూలో ఐస్క్రీమ్ ఖచ్చితంగా ఉంటుంది" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
కోచ్ గోపీచంద్ మళ్లీ తన విధుల్లో బిజీ కానున్నారు.
టోర్నమెంట్లు, సరికొత్త ప్రత్యర్థులు, కొత్త సవాళ్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి.
అద్భుతమైన ఆతిధ్యం
ఈ టోర్నమెంట్ కేవలం క్రీడాకారుల ప్రదర్శన పరంగానే కాకుండా ఆతిథ్యం ఇచ్చిన దేశంగా కూడా భారతదేశానికి ఒక పెద్ద విజయంగా నిలిచింది.
సరికొత్తగా ముస్తాబైన ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిన గ్యాలరీలు, అంతర్జాతీయ స్థాయి వసతులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది.
చివరికి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా ఈ ఏర్పాట్లను కొనియాడింది.
"ఇక్కడ చేసిన ఏర్పాట్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన పనితీరు అభినందనీయం" అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ థామస్ ప్రశంసించారు.
"ఈ ఏడాది మొదట్లో ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన క్రీడాకారుల నుంచి ఇప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఈవెంట్ను విజయవంతం చేసిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వానికి , ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుత ఏర్పాట్ల పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నాం" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)