You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'అమ్మా.. నన్ను వదిలిపెట్టకు’ అని నా కూతురు అరుస్తూనే ఉంది, కానీ నా చేతుల్లోంచి జారిపోయింది'- ఓ తల్లి ఆవేదన
- రచయిత, జేమ్స్ గ్రెగొరీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఉత్తర సైప్రస్లోని తీరప్రాంతంలో ఆదివారం పడవ బోల్తాపడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తన 12 ఏళ్ల కూతురిని చేజేతులా జారవిడుచుకున్నట్లు అయిటెన్ బైచెర్ అనే ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
గల్లంతైన 20 మందిలో బైచెర్ కూతురు మిరాయ్, 6 ఏళ్ల కొడుకు మెమెత్ అసఫ్ ఉన్నారు.
సైప్రస్లోని స్వయంప్రకటిత తుర్కిష్ రిపబ్లిక్ నగరం కనేరియా నుంచి తుర్కియేకి ఈ పడవ బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించింది.
ఓ వైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగా, గల్లంతైనవారి కోసం మిగిలిన కుటుంబాల లాగే భర్త హేరీతో కలిసి అయిటెన్ ఎదురుచూస్తున్నారు.
'వదిలిపెట్టకు అని తను నాతో అంటోంది. నేను నా కూతురిని వదిలిపెట్టలేదు. ఒట్టేసి చెబుతున్నా, తనని వదిలిపెట్టలేదు' అని మీడియాతో మాట్లాడుతూ బైచెర్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఓ సూట్కేస్ తనపై పడటంతో పట్టు సడలిందని బైచెర్ తెలిపారు. అయినప్పటికీ తన కూతురి పాదాన్ని పట్టుకోగలిగానని, అయితే పడవ బోల్తా పడటంతో ఇంజన్ ఆయిన్ లీకై చిన్నారి షూలోకి వెళ్లి, తన చేతుల్లోంచి పాప జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"అక్కడ అంతటా జారుతోంది. ఆయిల్ పడినట్లుగా ఉంది. నా చేతుల్లోంచి నా కూతురు పట్టుతప్పి పడిపోయింది" అని బైచెర్ గుర్తుచేసుకున్నారు.
మధ్యధరాసముద్ర దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన యాత్రికులు తుర్కియేకి తిరిగివస్తుండగా పడవ బోల్తా పడింది.
"మేమేం చేయలేకపోయాం. మా చిన్నారుల్ని పోగొట్టుకున్నాం" అని హేరీ బైచెర్ అన్నారు. నా ముగ్గురి పిల్లల్లో ఇద్దర్ని కోల్పోయాం. వారిని ఇక్కడే.. ఈ దీవిలోనే వదిలి వెళ్తున్నాం." అని చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 259 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. 19 మంది ప్రయాణికులకు ఉత్తర సైప్రస్లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
నౌక కెప్టెన్ సహా 8 మంది సిబ్బందిని, మరో వ్యక్తిని అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వారిని 3 రోజుల పాటు అదుపులోకి తీసుకోనున్నారు. మరికొంతమందికి వారెంట్లు జారీ చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 12.30కి కరేనియాలోని ప్రముఖ హాలీడే రిసార్ట్ నుంచి తుర్కియే పట్టణం తసూజుకి ఈ ప్రైవేటు నౌక బయలుదేరింది.
శనివారమే ఈ నౌక బయలుదేరాల్సి ఉండగా, దీవిని తుపానులు తాకడంతో ప్రయాణం వాయిదా పడింది. ఆదివారం కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉంది.
సముద్ర ఉపరితలానికి బలంగా ఢీకొట్టడానికి ముందు పడవ భారీ కుదుపులకు గురైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పడవ ముందు భాగం ధ్వంసమైందని వెల్లడించారు.
పడవ బోల్తా పడటానికి ముందు రెండు అలలు దానిని ఢీకొట్టినట్లు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ (టీఆర్ఎన్సీ) ప్రధాని ఉనల్ ఉస్టెల్ స్థానిక మీడియాతో అన్నారు.
మొదటి అల ధాటి నుంచి కెప్టెన్లు పడవను రక్షించే క్రమంలోనే మరో అల ఢీకొని లోపలికి నీరు ప్రవేశించిందని ఉనల్ పేర్కొన్నారు.
బోటు పూర్తిగా నీటమునిగి, 514 మీటర్ల లోతులోకి పడిపోయిందని అధికారులు తెలిపారు.
నల్లటి చక్రాల సూట్కేసు, పడవ నుంచి ఊడిపోయిన ఉక్కు రేకు సహా శిథిలాలు సముద్ర ఉపరితలంపై తేలియాడుతూ కనిపించాయి.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పడవలోని బ్లాక్ బాక్స్ రికార్డర్ని వెలికితీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గాలింపు చర్యల్లో సహకారం కోసం తుర్కియే నుంచి ఓ పడవ మంగళవారం రానుందని టీఆర్ఎన్సీ ప్రెసిడెంట్ టూఫాన్ ఎర్హుర్మాన్ తెలిపారు.
మరోవైపు, సోమవారం నుంచి 3 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను అధికారికంగా నిర్వహించనున్నారు.
మెరైన్ ట్రాఫిక్ సంస్థ చెప్పినదాని ప్రకారం, 40 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉన్న ఈ హైస్పీడ్ ఫిలో జెట్ బోటు తుర్కియే జాతీయ జెండాతో ప్రయాణిస్తోంది.
ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందని పడవను నిర్వహిస్తున్న సంస్థ ఫిలో దెనిషిలిక్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)