శుద్ధి వివాదం: రాహుల్ గాంధీపై కేసు, అసలేం జరిగింది? ఎవరేమన్నారు...

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన ర్యాలీ తర్వాత ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారన్న వివాదం ఇప్పుడు ప్రతిపక్ష నేత (లోక్‌సభ) రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే దాకా వెళ్లింది.

ఆగస్టు 30 రాత్రి హల్ద్వానీ సిటీ పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు.

వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. తాను శ్రీరామ్ సేన చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్నానని అమిత్ కుమార్ చెబుతున్నారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఈ కేసు దర్యాప్తును డీఎస్పీ అమిత్ కుమార్‌కు అప్పగించారు.

అయితే, శుద్ధీకరణ నిర్వహించిన వారిపై కాకుండా రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మతపరమైన ఆచారానికి కులం రంగు పులిమి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని బీజేపీ విమర్శించింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?

హల్ద్వానీలో జరిగిన శుద్ధీకరణ కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ అంటరానితనం, దళితులపై వివక్షకు ఉదాహరణగా చూపించారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. ఆగస్టు 29న దిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.

శుద్ధీకరణ, హవన్(హోమం) కార్యక్రమాల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు పాల్గొన్నారని, అందువల్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తమవర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఈ వ్యవహారం ఆగస్టు 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీకి సంబంధించినది.

ర్యాలీ అనంతరం అక్కడ చెత్త, మద్యం సీసాలు కనిపించాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆగస్టు 11న స్థానికులు, ఫిర్యాదుదారు అమిత్ కుమార్(వాల్మీకి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) కలిసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని, హవన్‌ను వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ ఆగస్టు 29న దిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అంటరానితనం, దళిత వ్యతిరేక నేరంగా అభివర్ణించారని ఫిర్యాదులో ఆరోపించారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా ఒక దళితుడిగా తాను, తన సహచరులు సమాజంలో అవమానానికి గురయ్యామని, దూషణలు ఎదుర్కొంటున్నారని, రెండువర్గాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ప్రస్తుతం పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం, బీఎన్‌ఎస్ 2023లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1), బీఎన్‌ఎస్ 2023లోని సెక్షన్లు 196, 299, 197(1)(సి), 353 కింద రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కాంగ్రెస్ స్పందన

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.

"హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగం అనంతరం సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని అంటరానితనం, వివక్షతో ముడిపెట్టి, ఇది దళిత సమాజాన్ని అవమానించడమేనని చెప్పిన వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది" అని సచిన్ పైలట్ ఎక్స్‌ వేదికగా అన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీని దళిత వ్యతిరేక పార్టీ అన్నారు.

‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పటికే 40 నుంచి 50 కేసులు నమోదు చేసిన వ్యక్తిపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైతే పెద్ద విషయం ఏముంది? అసలు సమస్య రాహుల్ జీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాదు. అసలు సమస్య 'శుద్ధీకరణ'. బీజేపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్దేశాలను చూడండి. శుద్ధీకరణపై గొంతెత్తిన వ్యక్తిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కానీ శుద్ధీకరణ చేసిన వారిపై, చేయించిన వారిపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.

అసలేం జరిగింది?

ఈ వివాదం ఆగస్టు 8న ప్రారంభమైంది.

ఆ రోజు ఉత్తరాఖండ్‌లో పార్టీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.

ఆ తర్వాత ఆగస్టు 11న శ్రీరామ్ సేన చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు అక్కడ శుద్ధీకరణ హవన్ (హోమం) నిర్వహించారు.

ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ శుద్ధీకరణ చేసారని కాంగ్రెస్ ఆరోపించింది. ఖర్గే ప్రసంగించాల్సిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం అంటరానితనం ఆచరించడాన్ని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది.

ఆగస్టు 29న దిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు.

ఖర్గేకు జరిగిన ఘటన అంటరానితనంతో సమానమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రధాని నరేంద్ర మోదీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఈ ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఆయన ముడిపెట్టారు. రాజ్యాంగం అంటరానితనాన్ని నేరంగా పరిగణిస్తుందని గుర్తుచేసారు. ఇంతటి సీనియర్ దళిత నేతకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సాధారణ దళితులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఆలోచించాలని రాహుల్ గాంధీ అన్నారు.

ఆగస్టు 29న ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన ఇదే వ్యవహారంలో, మరుసటి రోజే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఆగస్టు 13న మల్లికార్జున్ ఖర్గే స్వయంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

తన ప్రసంగం అనంతరం వేదికను శుద్ధి చేశారని ఖర్గే చెప్పారు. ఈ ఘటన తనకు అంటరానితనానికి గురైన భావన కలిగించిందని ఆయన అన్నారు.

ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, తన ప్రసంగంలో తాను కులమతాల అంశాలేవి ప్రస్తావించలేదని ఖర్గే చెప్పారు. అయినప్పటికీ, తాను వెళ్లిపోయిన తర్వాత వేదికపై హోమం నిర్వహించారని తెలిపారు.

దీనిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు.

ఇలాంటి కార్యక్రమాలను బీజేపీ సమర్థించదని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు. ఇలాంటి ఘటన నిజంగా జరిగి ఉంటే అది దురదృష్టకరమని అన్నారు.

బీజేపీ స్పందనేంటి

ఈ ఘటనకు కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగుతూ, దళితుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించింది.

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్పందించిన భారతీయ జనతా పార్టీ నేత, బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగీ "శుభ్రపరిచే కార్యక్రమాన్ని, మతపరమైన ఆచారాలను, అంటరానితనంగా దళిత వ్యతిరేక చర్యగా పేర్కొంటూ రాహుల్ గాంధీ అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఆయన తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. దీనివల్ల వాల్మీకి సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయి" అని అన్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ విషయంపై స్పందించారు.

"మల్లికార్జున ఖర్గే ఈ ఘటనను 15 నుంచి 20 రోజుల కిందటే ప్రస్తావించినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నారు. అదే రోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ ఘటనలో బీజేపీకి గానీ, సంఘ్ పరివార్‌కు గానీ చెందిన ఎవరూ పాల్గొనలేదని స్పష్టంగా చెప్పారు. రాజ్యసభలో సభా నాయకుడిగా నడ్డా ఈ ఆరోపణను పూర్తిగా ఖండించారు’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ ఘటనపై మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేసినప్పుడు రాహుల్ గాంధీ స్పందించలేదు. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంతో బీజేపీకి గానీ, బీజేపీ కార్యకర్తలకు గానీ ఎలాంటి సంబంధం లేదు. అక్కడ జరిగిన ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదా అనుబంధం లేదన్నది పూర్తిగా స్పష్టం. అయినప్పటికీ రాహుల్ గాంధీ ఇలాంటి నాటకాలను కొనసాగిస్తూనే ఉన్నారు" అని జోషి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)