‘ఫెర్నాండో ఏమన్నాడో తెలుసుకోండి, లేదంటే నన్ను జడ్జ్ చేయకండి’ - యశస్వి జైస్వాల్

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఆదివారం కొలంబోలో జరిగిన రెండో టెస్ట్ తొలి రోజున 45 పరుగులు చేసిన జైస్వాల్... ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మళ్లీ రెండో టెస్ట్‌లో కూడా వారిమధ్య గొడవ జరిగింది. దీంతో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిథా ఫెర్నాండోలకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ తెలిపింది.

జరిమానాతోపాటుగా చెరొక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది ఐసీసీ.

దీనిపై స్పందించిన జైస్వాల్ ఎవరైనా తనను జడ్జ్ చేేసేముందు ఫెర్నాండో తనతో ఏమన్నాడో తెలుసుకోవాలని అన్నాడు.

తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన భారత్, రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

ఐసీసీ ఏం చెప్పింది?

కొలంబోలో జరుగుతున్న రెండో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మొదటి రోజున జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో, భారత బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిథా ఫెర్నాండోలకు జరిమానా విధించినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగేటప్పుడు సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులతో సహా ఎవరినైనా ఒక ప్లేయర్ శారీరకంగా తాకి అనుచితంగా ప్రవర్తిస్తే ఉల్లంఘన కిందికే వస్తుంది.

ఐసీసీ ప్లేయర్స్, వారి సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినందుకు వీరిద్దరినీ దోషులుగా తేల్చింది ఐసీసీ.

దీంతో జైస్వాల్, ఫెర్నాండోలకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, చెరొక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు.

అలాగే గత 24 నెలల్లో ఇద్దరు ఆటగాళ్లు ఎటువంటి తప్పు చేయలేదని కూడా ఐసీసీ పేర్కొంది.

అసలు గొడవేంటి ?

భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లోని 17వ ఓవర్‌లో ఫెర్నాండో జైస్వాల్‌ను అవుట్ చేసినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జైస్వాల్.. ఫెర్నాండో వైపు వెళ్లడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఫెర్నాండో.. జైస్వాల్ వైపు తల చాచాడు. దానికి ప్రతిస్పందనగా, జైస్వాల్ కూడా కిందకు వంగడంతో వారి తలలు ఢీకొన్నాయని ఐసీసీ తెలిపింది.

ఇద్దరు ప్లేయర్లు తప్పు ఒప్పుకుని ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌కు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ విధించిన శిక్షను అంగీకరించారు. అందువల్ల అధికారిక విచారణ అవసరం రాలేదు.

అసిథా ఫెర్నాండోతో జరిగిన వాగ్వాదంపై వచ్చిన విమర్శలకు యశస్వి జైస్వాల్ స్పందించాడు.

ఈ ఘటనపై తీర్పు చెప్పే ముందు ఫెర్నాండో తనతో ఏమన్నాడో అందరికీ తెలియాలని అన్నాడు.

'అతను ఏమన్నాడో తెలియకపోతే దయచేసి జడ్జ్ చెయ్యకండి. ఎవరైనా హద్దు దాటితే భారత్ పోరాడుతుందని, ప్రతిస్పందిస్తుందని మనం వారికి చెప్పాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన క్రిక్ బజ్ వీడీయోపై జైస్వాల్ స్పందించాడు.

ఏం మాట్లాడకుండా జైస్వాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందని ఈ వీడియోలో కామెంటేటర్ హర్షా భోగ్లే అనడం గమనార్హం.

ఇలాంటివి జరగడం సహజం. ఇవి ముఖ్యం కాదు, ముందుకు సాగుతూనే ఉండాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.

'ఇందులో సానుకూల కోణాన్ని చూడాలి. నేను ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తా. కొన్ని ప్రతికూల విషయాలు జరుగుతుంటాయి. పర్లేదు. ప్రతి ఆటగాడికి తనదైన స్వభావం ఉంటుంది. అతను ఇలాగే ఆడాలనుకుంటే, గుడ్ లక్. అయితే క్రికెట్ బోర్డు ఒక రూల్ పెడితే, ఆటగాళ్లు అది మీరకూడదు. క్రికెట్‌కు చెడ్డ పేరు రానంతవరకు ప్లేయర్లు మిగతా విషయాల్లో తమకు నచ్చినట్లు ఉండొచ్చు' అని కపిల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)