You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిహార్: ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురి మృతి
బిహార్లోని లఖీసరాయ్లో ఉన్న అశోక్ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం ఉదయం ఆలయంలో ఓ అనుకోని సంఘటన జరిగిందని లఖీసరాయ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శివమ్ కుమార్ బీబీసీకి ఫోన్లో చెప్పారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారని శివమ్ కుమార్ తెలిపారు.
ఆరుగురు గాయపడగా వారిని సదర్ ఆసుపత్రిలో చేర్చారు.
లఖీసరాయ్ కలెక్టర్ శైలేంద్ర కుమార్ గాయపడిన వారిని పరామర్శించడానికి సదర్ ఆసుపత్రిని సందర్శించారు.
మరణించిన ఏడుగురూ మహిళలేనని ఆయన చెప్పారు.
"అశోక్ ధామ్ హాల్ట్ రైల్వే స్టేషన్ ముందు నుంచి గుడి వరకు ఒక పెద్ద క్యూ ఉంది. ఆ సమయంలో స్టేషన్కు రెండు రైళ్లు కూడా వచ్చాయి. ఇంతలో, ఒక విద్యుత్ స్తంభం కూలిపోయిందనే వదంతి వ్యాపించింది. వాస్తవానికి విద్యుత్ తీగ పడింది. దీంతో ఎడమ వైపున ఉన్న మహిళల క్యూపై ఒత్తిడి పెరిగి మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు" అని శైలేంద్ర కుమార్ వివరించారు.
సంఘటన జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
"మేం మహిళలం క్యూలో నిలబడి ఉన్నాం. సుమారు 20-25 మంది మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. జనసమూహం కింద నలిగి చాలా మంది మహిళలు స్పృహ కోల్పోయారు. నేను కూడా స్పృహ తప్పి పడిపోయాను. భారీ జనసమూహం కారణంగానే ఇదంతా జరిగింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)