అరుదైన పెళ్లి: పెళ్లి చేసుకున్నవారు, చేసిన వారు, సాయపడిన వారు అందరూ కవలలే

    • రచయిత, సిరాజ్ హుస్సేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

కేరళలో నాలుగు జంటల కవలలు ఉన్న ఒక పెళ్లి ఫోటో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో కవల సోదరులు కవల సోదరీమణులను పెళ్లి చేసుకుంటుంటే, కవలలైన ఫాదర్లు పెళ్లి వేడుక నిర్వహించారు.

ఫాదర్లకు సాయపడిన పిల్లలు (అల్టర్ బాయ్స్) కూడా కవలలే.

"ఒక పెళ్లిలో నాలుగు జంటల కవలలు ఉండటం కేవలం యాదృచ్ఛికం కాదు" అని పెళ్లి కుమారుల్లో ఒకరైన అఖిల్ థామస్ చెప్పారు.

"మేం కవలలను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. కవలలైన అమ్మాయిల కోసం మా కుటుంబం దాదాపు మూడేళ్లు వెతికింది" అని నిఖిల్ థామస్ వివరించారు.

అఖిల్, నిఖిల్ థామస్ వయసు32 ఏళ్లు. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన వయసుగా భావిస్తారు.

"మేము 30ల్లో పడటంతో కవలల కోసం వేచి చూడకుండా పెళ్లి చేసుకోవాలని మా బంధువులు పదే పదే ఒత్తిడి చేసేవారు. కవలలు కాని ఇతర మహిళలను మేంపెళ్లి చేసుకోకుంటే అసలు ఎప్పటికీ పెళ్లి కాకపోవచ్చని వాళ్లు హెచ్చరించారు" అని అఖిల్ చెప్పారు.

తమ కుమారులకు తగిన వధువుల కోసం ఆ కుటుంబం ప్రత్యేకంగా కవలల కోసం సేవలందించే వివాహ పరిచయ సంస్థను సంప్రదించింది.

కొన్నేళ్లుగా తాము ఏకంగా 40 జతల కవల సోదరీమణులను కలిశామని, ఆ తర్వాత మేగీ, మారియా మేరీతో పరిచయం ఏర్పడిందని అఖిల్ చెప్పారు.

31 ఏళ్ల వయసున్న ఆ ట్విన్ సిస్టర్స్.. ట్విన్ బ్రదర్స్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

"మాకు పెళ్లయితే అది కవలలతోనే కావాలని చిన్నప్పుడే మేం నిర్ణయించుకున్నాం" అని మేగీ చెప్పారు.

"అఖిల్, నిఖిల్‌ను కలిసినప్పుడు వాళ్లు మాకు వెంటనే నచ్చారు. వాళ్లే మా జీవిత భాగస్వాములని నిర్ణయించుకున్నాం" అని మరియా చెప్పారు.

తమ వివాహ వేడుకను కవలలు నిర్వహించాలని ఆ కవల సోదరీమణులు తమ కోరికను వ్యక్తం చేశారు.

గతేడాది ట్విన్ సిస్టర్స్ చర్చ్‌కు వెళ్లినప్పుడు పాస్టర్లకు సాయంగా ఉన్న జెరాన్, జోహాన్ జేమ్స్‌ను చూసిన తర్వాత వాళ్లకు ఆ ఆలోచన వచ్చింది. మేరి, మరియా వాళ్లను కలిసి తమ వివాహ వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.

అఖిల్ తల్లి కొన్ని నెలల క్రితం ఒక చర్చి ప్రార్థనా సమావేశంలో కవల పాస్టర్లు ఆంథో, అజో పెరుమ్కట్టిల్‌ను కలిశారు. తమ పిల్లల వివాహాన్ని జరిపించాలని ఆమె ఆ కవల పాస్టర్లను కోరారు.

'పాస్టర్లను సంప్రదించి వివరాలు చెప్పగానే వాళ్లు ఉత్సాహంగా స్పందించారు" అని అఖిల్ చెప్పారు.

పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయినప్పటి నుంచి ఆ కవల పాస్టర్లు అందరి దృష్టిని ఆకర్షించారు.

"ఇది నిజంగా మాకు మర్చిపోలేని పెళ్లిగా మారింది" అని అజో చెప్పారు.

ఈ పెళ్లి ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం ప్రారంభించినప్పటి నుంచి మరో రెండు కుటుంబాలు తమ కవల కుమారులు, కుమార్తెల పెళ్లిళ్లు చేసేందుకు తమను సంప్రదించాయని ఆయన తెలిపారు.

"మాది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్" అని నిఖిల్ థామస్ చెప్పారు.

ఇది సాంప్రదాయ భారతీయ పద్దతిలో పెద్దలు కుదిర్చిన వివాహం.

వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ కాావడంతో ఈ జంటలకు ఆన్‌లైన్‌లో ఆశీర్వాదాల వెల్లువెత్తాయి.

అనేక మంది నెటిజన్లు ఈ ట్విన్స్ జంటలకు అభినందలు తెలిపారు.

కొంతమంది దీనిని కవలల కలల వివాహంగా అభివర్ణించారు.

"మా పెళ్లి ఫోటోలు ఇంత వైరల్ అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు" అని మరియా చెప్పారు

"మేమిది పేరు ప్రఖ్యాతుల కోసం లేదా ఆన్‌‍లైన్‌లో లైకుల కోసం చేయలేదు. మేమిలాగే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాం. అనుకోకుండా వైరల్ అయింది" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)