You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఫైనల్ మ్యాచ్కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
లైవ్ కవరేజీ
కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రభుత్వంతో చర్చలు - సౌరవ్ దాస్
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
"తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.
"వారు జంతర్ మంతర్కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.
అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.
సోనమ్ సర్ దీక్షను విరమించడం సంతోషంగా ఉంది - అభిజిత్ దీప్కే
సోనమ్ వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.
"సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్కు మద్దతుగా సోనమ్ వాంగ్చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం ఎట్టకేలకు తీస్ జనవరి మార్గ్లోని గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు.
అక్కడ, నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
"మహాత్మా గాంధీ ఇక్కడే హత్యకు గురయ్యారు. ఈరోజు మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని ప్రతిపక్షం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదు" అని రాహుల్ గాంధీ అన్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను క్యాబినెట్ నుంచి ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?
జంతర్ మంతర్: వాష్రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.
"కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."
చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.
ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు
జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?
ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్కు ఇచ్చిన అధికారం ఏంటి?
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.
దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.
దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.
సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?
మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు
‘యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదు’
యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన, కఠిన శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు మోదీ చెప్పారు.
ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, అథారిటీలను ఆదేశించినట్లు తెలిపారు.
విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చేపడుతున్న చర్యలలో ఇది కూడా ఒకటని అన్నారు.
యువత భవిష్యత్కు నష్టం చేకూర్చాలని ప్రయత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లో తాము వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు.
దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు బంద్
దిల్లీలో నిరసనల నేపథ్యంలో గురువారం (23.07.2026) కూడా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7.30 నుంచి మూసివేస్తున్నామని, తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలకు వీలుండదని ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
మూసివేసిన స్టేషన్లు ఇవే..
1) లోక్ కల్యాణ్ మార్గ్
2) రాజీవ్ చౌక్
3) పటేల్ చౌక్
4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్
5) బారాఖంభా రోడ్
6) సుప్రీంకోర్ట్
7) సేవా తీర్థ్
8) జన్పథ్
9) మండీహౌస్
10) సెంట్రల్ సెక్రటేరియట్
11) ఐటీఓ
12) దిల్లీ గేట్
13) ఇంద్రప్రస్థ
14) ఖాన్ మార్కెట్
15) జోర్ బాగ్
16) శివాజీ స్టేడియం
అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్కు మారే సౌకర్యం ఎప్పటిలా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
కాక్రోచ్ ఉద్యమం: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు అస్త్రంగా మారనుందా?
‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు, వారే మన భవిష్యత్’, – ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్లో ధర్మేంద్ర ప్రధాన్ గురించి, నిరసన చేస్తోన్న విద్యార్థుల గురించి, ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసన గురించి మాట్లాడారు.
‘‘మన విద్యార్థులకు ఎందుకిలా జరుగుతోంది అనేదే ప్రశ్న? మన విద్యార్థులు చేసిన తప్పు ఏంటి? భద్రతా బలగాలు వారి ముందు ఆయుధాలు పట్టుకుని నిల్చున్నాయి. వాళ్లు చేసిన తప్పేంటి?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
‘‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ టెర్రరిస్టులు కాదు, వారే మన భవిష్యత్’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
దీనికి బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసం బయట జరిగిన నిరసన గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘భారత విద్యార్థులు వీధుల్లోకి వస్తే, ప్రతిపక్షం కూడా వీధుల్లోకి రావాలని మేం భావించాం. ఇదే ప్రధాన కారణం’’ అని అన్నారు.
ప్రధాని నివాసానికి వెళ్లే ముందు, తాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గరకు వెళ్లి, సభలో విద్యార్థుల సమస్యపై మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పుడు ఓం బిర్లా తాను ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారని పేర్కొన్నారు.
ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని, మొత్తం విషయాన్ని పక్కకు పెట్టేశారని రాహుల్ గాంధీ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఆయన, ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రతీక. విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థుల గౌరవం కోసం, ఆ 'ధర్మేంద్ర ప్రధాన్' అనే ప్రతీకను తొలగించాల్సిందే" అని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే మోదీ ప్రభుత్వంలో మంత్రులు చర్చల కోసం ఎందుకు వచ్చారు?
ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు
షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు
కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’
ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.
తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.