‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు, వారే మన భవిష్యత్’, – ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్లో ధర్మేంద్ర ప్రధాన్ గురించి, నిరసన చేస్తోన్న విద్యార్థుల గురించి, ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసన గురించి మాట్లాడారు.
‘‘మన విద్యార్థులకు ఎందుకిలా జరుగుతోంది అనేదే ప్రశ్న? మన విద్యార్థులు చేసిన తప్పు ఏంటి? భద్రతా బలగాలు వారి ముందు ఆయుధాలు పట్టుకుని నిల్చున్నాయి. వాళ్లు చేసిన తప్పేంటి?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
‘‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ టెర్రరిస్టులు కాదు, వారే మన భవిష్యత్’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
దీనికి బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసం బయట జరిగిన నిరసన గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘భారత విద్యార్థులు వీధుల్లోకి వస్తే, ప్రతిపక్షం కూడా వీధుల్లోకి రావాలని మేం భావించాం. ఇదే ప్రధాన కారణం’’ అని అన్నారు.
ప్రధాని నివాసానికి వెళ్లే ముందు, తాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గరకు వెళ్లి, సభలో విద్యార్థుల సమస్యపై మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పుడు ఓం బిర్లా తాను ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారని పేర్కొన్నారు.
ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని, మొత్తం విషయాన్ని పక్కకు పెట్టేశారని రాహుల్ గాంధీ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఆయన, ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రతీక. విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థుల గౌరవం కోసం, ఆ 'ధర్మేంద్ర ప్రధాన్' అనే ప్రతీకను తొలగించాల్సిందే" అని డిమాండ్ చేశారు.